Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 29—పాపం పూర్వాపరాలు

    పాపం ఆరంభం, ఉనికి అనేకుల మనసుల్ని గజిబిజి పరుస్తున్నవి. దుఃఖం వినాశం వంటి పాప పర్యవసానాల్ని చూసి అనంత జ్ఞానం, శక్తి, ప్రేమ గల సర్వాధికారి అయిన దేవుని పరిపాలన కింద ఇవి కొనసాగటాన్ని అనేకులు ప్రశ్నిస్తున్నారు. ఇది సమాధానం దొరకని మర్మంగా పరిణమించింది. దైవవాక్యంలో స్పష్టంగా ప్రకటితమైన, రక్షణకు అవసరమైన సత్యాలను వారు అనిశ్చితి, సందేహాల నడుమ విస్మరిస్తున్నారు. పాపం ఉనికిని గురించి విచారణ చేస్తూ దేవుడు బయలుపర్చని అంశాలను పరిశోధించటానికి పూనుకొంటున్న వారు కొందరున్నారు. ఫలితంగా వారి సమస్యలకు పరిష్కారం దొరకటం లేదు. ఊహాపోహలు, రంధ్రాన్వేషణ ప్రవృత్తి గలవారు దీన్ని ఆసరా చేసుకొని పరిశుద్ధ లేఖనాలను విసర్జిస్తున్నారు. దేవుని ప్రవర్తనను గురించి, ఆయన ప్రభుత్వ స్వభావం గురించి, పాప పరిష్కార నియమాలగురించి బైబిలు బోధనలను సంప్రదాయం, తప్పుడు వ్యాఖ్యానం మసకబార్చినందున, ఇతరులు పాపసమస్యను తృప్తికరంగా అవగాహన చేసుకోలేక పోతున్నారు.GCTel 463.1

    పాపం ఉనికికి కారణం కారణం కనుగోటానికి దాని ఆరంభాన్ని విశదీకరించటం అసాధ్యం. అయినప్పటికి పాపాన్ని చివరగా పరిష్కరించే విషయంలో దేవుడు వ్యవహరిస్తున్న రీతి న్యాయమైందని సూచించటానికి దాని ఆరంభాన్ని, పరిష్కారాన్ని గూర్చి చాలినంత అవగాహన పొందవచ్చు. పాపం ఆరంభానికి దేవుడు ఏవిధంగాను బాధ్యుడుకాడని, దైవకృపను నిరంకుశంగా ఉపసంహరించుకోటం జరగలేదని, తిరుగుబాటుకు హేతువయిన ఎలాంటి లోపమూ దైవ పరిపాలనలో లేదని లేఖనం స్పష్టంగా బోధిస్తున్నది. పాపం దానంతట అదే చొరబడింది. దాని ఉనికికి కారణం ఇది అని చెప్పటం సాధ్యపడదు. అది మర్మభరితం, కారణరహితం. దాన్ని ఉపేక్షించటం సమర్ధించట మవుతుంది. దాని ఉనికికి సాకు లేదా కారణం చూపగలిగితే అది ఇక పాపమనిపించుకోదు. దైవ వాక్యంలో ఉన్నదే పాపానికి మనకున్న ఒకే ఒక నిర్వచనం“ఆజ్ఞాతిక్రమము”. దైవ ప్రభుత్వానికి పునాది అయిన ప్రేమా నిబంధనకు విరుద్ధంగా పనిచేసే సూత్రం అది.GCTel 463.2

    పాపం ప్రవేశించక ముందు విశ్వంలో సంతోష సమాధానాలుండేవి. విశ్వమంతా సామరస్యంతో నిండి సృష్టికర్త చిత్తాన్ననుసరించి సాగేది. దేవుని పట్ల అత్యున్నత ప్రేమ ఉండేది. మనుషులు ఒకరినొకరు నిష్పక్షపాతంగా ప్రేమించుకునే వారు. వాక్యమూ దేవుని అద్వితీయ కుమారుడూ అయిన క్రీస్తు నిత్యుడైన తండ్రితో ఏకమై ఉన్నాడు. స్వభావపరంగాను, ప్రవర్తన పరంగాను, ఉద్దేశం విషయంలోను క్రీస్తు తండ్రితో ఏకమై ఉన్నాడు. విశ్వమంతటిలోనూ తండ్రి ఆలోచనలలోను ఉద్దేశాలలోను పాలు పంచుకోగలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. క్రీస్తు ద్వారా తండ్రి పరలోక వాసుల సృష్టిని నిర్వహించాడు. “ఆకాశమందున్నవియు... అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయనయందు సృజింపబడెను” కొలస్సీ 1:16. పరలోకమంతా తండ్రిని ఆయనతోపాటు క్రీస్తును భక్తి విశ్వాసాలతో కొలుస్తుంది.GCTel 464.1

    ప్రేమ నియమం దేవుని ప్రభుత్వానికి పునాది. అందుచేత ఆ రాజ్య నీతి సూత్రాల కనుగుణంగా నివసించటం మీదే అందరి ఆనందం ఆధారపడి ఉంటుంది. తాను సృజించిన మానవుల నుంచి దేవుడు ప్రేమపూర్వక పరిచర్య అభిలషిస్తున్నాడు. ఆయన శీలాన్ని విజ్ఞతతో అభినందించటం నుంచి పుట్టే శ్రద్ధాంజలిని ఆయన కోరుతున్నాడు. ఒత్తిడి మూలంగా కలిగే భక్తిశ్రద్ధలు ఆయన అభినందించడు. తనకు ఇష్టపూర్వక సేవ చేసేందుకుగాను అందరికి ఆయన ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇస్తాడు.GCTel 464.2

    అయితే ఈ స్వేచ్ఛను వక్రమార్గం పట్టించటానికి ఎంపిక చేసుకొన్న వ్యక్తి ఒకడున్నాడు. క్రీస్తు తర్వాత దేవుడు ఎక్కువ అభిమానించిన వాడు, పరలోక వాసుల్లో ఉన్నత స్థానాన్ని అధికారాన్ని మహిమను కలిగి ఉన్న వాడు అయిన ఆ వ్యక్తితోనే పాపం ఆరంభమయ్యింది. తన పతనానికి ముందు లూసీఫర్ ఆశ్రయంగా ఉన్న కెరూబు. అతడు పరిశుద్దుడు, అనింద్యుడు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా - పూర్ణజ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సులిమానురాయి, మకరతము, నీలము, పద్మరాగము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడియున్నావు... అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యధార్ధవంతుడవుగా ఉంటివి” యెహేజ్కేలు 28:1215.GCTel 464.3

    దేవుని అనురాగంలో నిలిచి దూతగణాల ఆదరాభిమానాల్ని చూరగొంటూ తన శక్తి సామర్థ్యాలను పరుల ఉపకారానికి తన సృష్టికర్తను మహిమపర్చటానికి ఉపయోగిస్తూ జీవించేవాడే. కాని ప్రవక్త ఇలా అంటున్నాడు, “నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించినవాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి” వచనం 17. తన్నుతాను హెచ్చించుకోవాలన్న కోరిక లూసీఫర్ లో రానురాను బలపడింది. “దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు. నేను ఆకాశమున కెక్కిపోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును... మేఘమండలము మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి” వచనం 6. యెషయా 14:13, 14. మానవుల అనురాగం భక్తి విశ్వాసాల విషయంలో దేవునికి అగ్రస్థానం ఇవ్వటానికి పూనుకొనే బదులు వారి సేవలు శ్రద్ధాంజలుల్ని తానే పొందటానికి లూసిఫర్ ప్రయత్నించాడు. నిత్యుడైన తండ్రి తన కుమారునికి అంకితం చేసిన గౌరవాన్ని ఆశించిన లూసీఫర్ క్రీస్తుకు మాత్రమే సంక్రమించిన ఆధిపత్యాన్ని, ఆధిక్యాన్ని సొంతం చేసుకోటానికి ప్రయత్నించాడు.GCTel 465.1

    సృష్టికర్త మహిమను ప్రతిబింబించటానికి, ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయటానికి పరలోకవాసులందరూ ఉత్సహించారు. ఈ రీతిగా దేవున్ని సన్మానించినప్పుడు సంతోష సమాధానాలు వెల్లివిరిశాయి. అయితే ఇప్పుడు పరలోకంలోని సామరస్యానికి అంతరాయం ఏర్పడింది. సృష్టికర్త ప్రణాళికకు విరుద్ధమైన ఆత్మస్తుతి సంబంధిత పరిచర్య దేవుని మహిమను అత్యున్నతంగా పరిగణించే దూతగణాలలో భయాందోళనలు పుట్టించాయి. పరలోకంలో జరిగిన సభలు లూసీఫర్ కి విజ్ఞప్తులు చేశాయి. దేవుని ఔన్నత్యం, మంచితనం, న్యాయశీలత, పవిత్రమైన, మార్పులేని దైవ ధర్మశాస్త్రం గురించి దైవ కుమారుడు అతనికి వివరించాడు. పరలోకంలోని క్రమపద్ధతిని దేవుడే స్థాపించాడు. దాన్ని అనుసరించకపోవటంవల్ల లూసీఫర్ తన సృష్టిరక్తను కించపర్చుతున్నాడు. తనకే ముప్పు తెచ్చుకొంటున్నాడు. ప్రేమతో కనికరముతో చేసిన హెచ్చరికలు ప్రతిఘటన ప్రవృత్తిని సృష్టించాయి. లూసీఫర్ లో క్రీస్తుపట్ల ద్వేష భావం పెచ్చరిల్లింది. అతనిలో పట్టుదల ఇంతలంతలయ్యింది.GCTel 465.2

    స్వీయ మహిమను గూర్చిన దర్పం ఆధిపత్య కాంక్షకు పదును పెట్టింది. దేవుడు తనకు ప్రదానం చేసిన గౌరవాన్ని ఆయన ఇచ్చిన ఈ విగా లూసీఫర్ అభినందించలేదు. అందుకు కృతజ్ఞతలు తెలుపుకోలేదు. సొంత ప్రతిభను గురించి ఔన్నత్యాన్ని గురించి గర్వాంధుడై దేవునితో సమానుడు కావాలని ప్రయత్నించాడు. పరలోకవాసుల ప్రేమాభిమానాలు అతనికి ఉండేవి. అతని ఆజ్ఞ శిరసావహించటానికి దూతగణాలు ముచ్చట పడేవారు. దూతలందరికన్నా లూసీఫర్ జ్ఞానవంతుడు, మహిమాన్వితుడు. అయితే దైవ కుమారుడు పరలోక సార్వభౌముడన్నది అందరూ అంగీకరించిన విషయం. ఆధిపత్యంలోను అధికారంలోను ఆయన తండ్రితో సమానుడు. దేవుని సంప్రదింపు లన్నింటిలోను క్రీస్తు భాగస్వామి కాగా లూసీఫర్ కి వాటిలో ప్రవేశమేలేదు. “క్రీస్తుకు ఎందుకు సర్వాధికారం? ఆయనకు లూసీఫర్ కన్నా ఎక్కువ గౌరవం దేనికి?” ప్రశ్నించాడు లూసీఫర్.GCTel 466.1

    దేవుని పక్కనే ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి అసంతృప్తి బీజాన్ని వెదజల్లటానికి లూసీఫర్ దేవదూతల మధ్యకు వెళ్లాడు. దేవునిపట్ల ప్రగాఢ భక్తి వున్నట్లు నటిస్తూ కొంతకాలం తన వాస్తవిక ఉద్దేశాన్ని దాచిపుంచి ఎంతో గోప్యంగా వ్యవహరిస్తూ, పరలోక పాలన నిబంధనలు చాలా కఠినమైనవని చెబుతూ, అసంతృప్తి సృష్టించడానికి ప్రయత్నించాడు. తమ స్వభావాలు పరిశుద్ధమైనవి గనుక వారు తమ చిత్రాలు ప్రబోధించే దాన్ని బట్టి వ్యవహరించాలని దూతలకు నూరిపోశాడు. క్రీస్తుకు సర్వాధికారాన్ని గౌరవాన్ని ఇవ్వటం ద్వారా దేవుడు తమకు అన్యాయం చేశాడని ప్రచారం చేస్తూ వారి సానుభూతి పొందటానికి ప్రయత్నించాడు. ఉన్నత అధికారాన్ని గౌరవాన్ని కోరటం ద్వారా తన్నుతాను అధికుణ్ణి చేసుకోచూడటం లేదుగాని పరలోక వాసులందరికి స్వాతంత్ర్యం సంపాదించ గోర్తున్నానని అలా జరిగిననాడు వారికి ఉన్నత జీవిత ప్రతిపత్తి లభిస్తుందంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు.GCTel 466.2

    కృపగల దేవుడు లూసీఫర్ విషయంలో ఎంతో సహనం చూపించాడు. లూసీఫర్ అసంతృప్తికి గురి అయిన వెంటనేగాని, నమ్మకంగా ఉన్న దూతల ముందు తన అబద్ధ వాక్కుల్ని ఏకరువు పెట్టినప్పుడుగాని, లూసీఫర్ ని తన ఉన్నత స్థానం నుంచి దేవుడు తొలగించలేదు. అతణ్ణి పరలోకంలో చాలాకాలం ఉంచాడు. పశ్చాత్తాపపడి లొంగిపోతే క్షమిస్తానని పదేపదే చెప్పాడు. అనంత ప్రేమ వివేకాలుగల తండ్రి అతనిది తప్పుత్రోవ అని బోధపరచటానికి ప్రయత్నించాడు. అసంతృప్తి స్వభావం పరలోకంలో ముందెన్నడూ కనిపించలేదు. తాను ఎటు కొట్టుకుపోతున్నదీ తొలుత లూసీఫరే గ్రహించలేకపోయాడు. తన వాస్తవిక మనోభావాలేమిటో అతనికే అర్ధం కాలేదు. కాని తన అసంతృప్తి హేతుబద్ధం కాదని తేలినప్పుడు తాను పొరపాటులో ఉన్నట్లు దైవ విధులు న్యాయమైనవని అవి న్యాయమైనవన్నది పరలోక వాసులందరిముందు ఒప్పుకోటం యుక్తమని లూసీఫర్ నమ్మాడు. అలా చేసివుంటే అతను తన్ను తాను రక్షించుకోటమే గాక అనేకమంది దూతల్ని రక్షించగలిగేవాడు. అప్పటికింకా అతను దేవునికి పూర్తిగా అవిధేయుడు కాలేదు. ఆశ్రయంగా ఉన్న కెరూబు హోదాను విడిచిపెట్టినప్పటికీ సృష్టికర్త సర్వజ్ఞాని అని గుర్తించి ఆయన ప్రణాళికలో తనకు ఏర్పాటుచేసిన స్థానాన్ని ఆక్రమించటంతో తృప్తిపడివుంటే అతని హోదాను దేవుడు తీసివేసేవాడు కాదు. విధేయుడై ఉండటానికి గర్వం అడ్డువచ్చింది. తన మార్గం సరైనదేనని సమర్థించు కొన్నాడు. పశ్చాత్తాపపడాల్సిన అవసరం తనకు లేదన్నాడు. సృష్టికర్తకు ఎదురు తిరిగి మహా సంఘర్షణలో తల మునకలయ్యాడు.GCTel 466.3

    తన పలుకుబడి కింద వున్న దూతల సానుభూతిని పొందేందుకు వంచన కళలో కాకలు తీరిన తన శక్తియుక్తుల్ని ఇప్పుడు రంగంలోకి దించాడు. క్రీస్తు తనకు చేసిన హెచ్చరికలు సూచనలను కూడా తన దుస్తంత్రాలకు అనుకూలంగా మలుచుకొన్నాడు. తనకు న్యాయం జరగలేదని తన హోదాను గౌరవించలేదని, తన స్వాతంత్ర్యాన్ని హరించటం జరగబోతున్నదని తనకు నమ్మకంగా నిలిచిన దూతలకు చెప్పాడు. క్రీస్తు మాటల్ని వక్రీకరించటం నుంచి అబద్దాలు చెప్పటం అబద్దాలు కల్పించటం వరకు వెళ్లాడు. పరలోకవాసుల ముందు తనను కించపరచటానికి దైవ కుమారుడు కుతంత్రం పన్నాడని నిందించాడు. దేవునికి, దేవునికి నమ్మకంగా ఉన్న దూతలకు మధ్య సమస్యలు సృష్టించడానికి కూడా పూనుకొన్నాడు. తాను ఎవరినైతే మోసగించి తన పక్కకు తిప్పుకోటంలో విఫలమయ్యాడో ఆ దూతలందరూ పరలోక వాసుల ఆసక్తుల విషయంలో నిర్లిప్తంగా ఉన్నారని విమర్శించాడు. తాను ఏ అకృత్యాలు చేస్తున్నాడో అవి దేవునికి నమ్మకంగా ఉన్న దూతలే చేస్తున్నారని నిందించాడు. తన పట్ల దేవుడు అన్యాయంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణను సవర్ధించుకోటానికి సృష్టి కర్త మాటల్ని కార్యాల్ని వక్రీకరించటానికి పూనుకొన్నాడు. దేవుని ఉద్దేశాలపై కుటిలమైన వాదనలతో దూతల్ని తబ్బిబ్బు చేయటం అతని విధానం. ప్రతీ సామాన్య విషయాన్ని ఒక మర్మంగా రూపు దిద్దటం స్పష్టమైన దైవ వాక్కుల్ని వక్రీకరించి తద్వారా సందేహాలు పుట్టించటం అతని ఉద్దేశం. దేవుని ప్రభుత్వంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నత స్థానాన్ని ఆక్రమించటం లూసీఫర్ చెప్పేదానికి మరింత బలం చేకూర్చింది. దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయటానికి అనేక మంది దూతలు అతనితో చేయి కలిపారు.GCTel 467.1

    అసంతృప్తి స్వభావం పరిపక్వమై తిరుగుబాటుగా పరిణమించే వరకు సర్వజ్ఞాని అయిన దేవుడు సాతాను చేస్తున్న పనిని కొనసాగింప నిచ్చాడు. అతని ప్రణాళికల స్వరూప స్వభావాలు అందరికీ తెలిసివచ్చేందుకుగాను అవి పూర్తిగా ఆచరణలోకి రావటం అవసరం. అభిషేకం పొందిన కెరూబుగా లూసీఫర్ గొప్ప గౌరవాన్ని పొందాడు. పరలోక వాసులంతా అతన్ని ఎంతో ప్రేమించారు. వారిపై అతని ప్రభావం ప్రబలంగా వుంది. దైవప్రభుత్వం కింద పరలోక నివాసులేకాక ఆయన సృజించిన లోకాల ప్రజలు ఉన్నారు. తాను పరలోక దూతలను తన పక్కకు తిప్పుకొంటే తక్కిన లోకాల ప్రజల్ని కూడా తన పక్కకు తిప్పుకోవచ్చునన్నది లూసీఫర్ ఆలోచన. తన కార్యం సాధించటానికి తత్వం, మోసం ఉపయోగించి ఆ సమస్యపై తన అభిప్రాయాలు నిపుణతతో వక్రీకరించాడు. మోసగించటంలో అతను దిట్ట. అబద్దాల ముసుగులో వేషం మార్చి కార్యం సాధించాడు. దేవునికి నమ్మకంగా ఉన్న దూతలు సైతం అతని ప్రవర్తనను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయారు. అతని పని ఫలితంగా ఏం జరుగుతుందో ఊహించలేక పోయారు.GCTel 468.1

    సాతాను ఎంతో గౌరవం పొందాడు. అతని కార్యాలన్నీ మర్మంతో నిండి ఉన్నాయి. అందుచేత అతని పని నిజ స్వరూపం ఇది అని దూతలకు చెప్పటం కష్టం. దాని స్వరూపం పూర్తిగా బయలుపడేవరకు పాపం ఎంత దుష్టమైందో బోధపడదు. దేవుడు పాలించే విశ్వంలో అప్పటివరకు పాపమన్నది కనిపించలేదు. దాని స్వభావం గురించి అది తెచ్చిపెట్టే ప్రమాదం గురించి పరిశుదులకు తెలియదు. దైవ ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చటం వలన కలిగే దుష్ఫలితాలను వారు గ్రహించలేక పోయారు. సాతాను తొలుత దైవభక్తి నటించి దాని వెనుక తన పనిని మరుగుపర్చాడు. దైవారాధన ప్రోత్సాహం, దైవ ప్రభుత్వ సుస్థిరత, పరలోక నివాసుల శ్రేయస్సు తన ధ్యేయాలను అతను నొక్కిపలికాడు. తన ఆధీనంలో ఉన్న దేవదూతలకు అసంతృప్తి నూరిపోస్తూ అసంతృప్తి తొలగించటానికి పాటుపడున్నట్లు పైకి కనిపించాడు. దేవుని పరిపాలనా విధానంలో కొన్ని మార్పులు అవసరమని ప్రచారం చేసినప్పుడు పరలోక సామరస్య పరిరక్షణకు ఆ మార్పులు అగత్యమన్న సాకు చూపించాడు.GCTel 468.2

    పాపం విషయంలో వ్యవహరించేటప్పుడు దేవుడు నీతిని సత్యాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు. పొగడ్తను వంచనను ఉపయోగించడు. సాతాను వీటిని వినియో గించుకొంటాడు. దైవ వాక్యాన్ని అబద్ధం చేయటానికి ప్రయత్నించాడు. పరలోక వాసులను నియమ నిబంధనలతో కట్టడి చేయటానికి సమకట్టటం ద్వారా ఆయన అన్యాయం చేస్తున్నాడని తాను సృష్టించిన వారి నుంచి సమర్పణ విధేయతలు కోరటంలో తన్నుతాను హెచ్చించుకోజూస్తున్నాడని ప్రచారం చేస్తూ ఆయన పరిపాలనా ప్రణాళికను గురించి తప్పుడు అభిప్రాయాలు పుట్టించాడు. అందుచేత దేవుని ప్రభుత్వం న్యాయానికి కట్టుబడిన ప్రభుత్వం అని పరలోకవాసులకు, తక్కిన లోకాల్లోని ప్రజలకు అది ప్రదర్శితం కావలసి ఉన్నది. తానే విశ్వకళ్యాణానికి పాటుపడున్న వాడిగా కనిపించటానికి సాతాను కృషిచేశాడు. అపహర్త యధార్ధ ప్రవర్తన, అతడి యధార్ధలక్ష్యం అందరికీ వెల్లడి కావాలి. తన దుష్కృతాల ద్వారా వెల్లడి కావటానికి అతనికి సమయం కావాలి.GCTel 468.3

    తన ప్రవర్తన మూలంగా పరలోకంలో తలెత్తిన దుస్థితికి దేవుని ప్రభుత్వమూ ఆయన ధర్మశాస్త్రమూ కారణాల సాతాను నిందమోపాడు. దుర్మారత అంతా దైవ పరిపాలన ఫలితంగా వచ్చిందే అని ఉద్ఘాటించాడు. దేవుని నిబంధనల్ని మెరుగుపర్చటమే తన పరమోద్దేశమని చెప్పుకొచ్చాడు. అందుకే తాను చెబుతున్న విషయాల స్వభావ స్వరూపాలను గురించి వివరించి దేవుని ధర్మశాస్త్రంలో తాను ప్రవేశపెట్టగోరుతున్న మార్పుల పని తీరును ప్రదర్శించటం అవసరమని చెప్పాడు. తన క్రియలే అతన్ని దోషిగా నిర్ధారించాలి. తాను తిరుగుబాటు చేయటం లేదని సాతాను ఆది నుంచి చెబుతున్నాడు. ముసుగు మోసగాడి ముసుగు తొలగించాలి. విశ్వమంతా ఆ మోసగాణ్ణి వీక్షించాలి.GCTel 469.1

    సాతాసు పరలోకంలో ఉండటానికి వీల్లేదని తీర్మానం జరిగినప్పుడు సైతం సర్వజ్ఞాని అయిన దేవుడు అతణ్ణి నాశనం చేయలేదు. ప్రేమపూర్వక సేవ మాత్రమే దేవునికి అంగీకృతం కనుక ఆయన సృజించిన ప్రజలు ఆయన న్యాయవంతుడు, ఔదార్యం గలవాడు అని నమ్మి ఆయనకు నమ్మకంగా ఉండాలి. పరలోక వాసులకు ఇతర లోకాల్లో ఉన్నవారికి పాపాన్ని గురించి దాని పర్యవసానాల్ని గురించి అవగాహన లేదు. కనుక అప్పుడు సాతానుని నాశనం చేసి ఉంటే దేవుని న్యాయశీలతను కృపకనికరాల్ని వీక్షించి ఉండేవారు కాదు. అతన్ని తక్షణమే నిర్మూలించి ఉన్నట్లయితే వారు ప్రేమ వలన గాక భయం వలన దేవుని సేవించే వారు. వంచకుడైన సాతాను ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యపడేదికాదు. తిరుగుబాటు స్వభావాన్ని మట్టుపెట్టటమూ జరిగేదికాదు. దుర్మారతను పరిపక్వమయ్యే వరకు పెరగనివ్వాలి. ఈ విశ్వంలో యుగయుగాల ప్రజల హితం దృష్ట్యా, దైవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాతాను అభియోగాల అవాస్తవికతను సర్వశరీరులు గ్రహించేందుకు, దేవుని న్యాయశీలత, కృప, మార్పులేని ధర్మశాస్త్రం- వీటిపై ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకుగాను సాతాను తన సిద్ధాంతాలకు తుదిరూపం ఇవ్వటం మంచిది.GCTel 469.2

    ముందు యుగాల్లోని ప్రజలకు సాతాను తిరుగుబాటు మంచి గుణపాఠం. పాప స్వభావం గురించి దాని ఫలితాలను గురించి నిత్యసాక్షిగా నిలుస్తుంది. సాతాను నియమం క్రియాత్మకమై దాని పర్యవసానాలకు మానవులు, దూతలు గురి అయినప్పుడు దైవాధికారాన్ని తోసిపుచ్చటం ద్వారా ఎలాంటి ప్రతిఫలం ఎదుర్కోవాల్సి ఉంటుందో బోధపడుంది. దేవుని ప్రభుత్వం, ధర్మశాస్త్రలతోనే సమస్త మానవుల సంక్షేమం ముడిపడి ఉన్నదని అది సాక్ష్యమిస్తుంది. ఈ భయంకర తిరుగుబాటు చరిత్ర పరలోక వాసులందరికీ నిత్యం కాపుదలగా ఉంటుంది. అతిక్రమ స్వభావం విషయంలో మోసపోకుండా కాపాడటానికి, పాపం నుంచి, దానికి కలిగే శిక్ష నుంచి కాపాడటానికి దోహదపడుంది.GCTel 470.1

    పరలోకంలోని పోరాటం చివరివరకూ సాతాను తన్నుతాను సమర్ధించు కొన్నాడు. తాను తన సానుభూతి పరులు పరలోకం నుంచి బహిష్కృతులవుతారని ప్రకటించినప్పుడు తిరుగుబాటు నాయకుడు దైవ ధర్మశాస్త్రం పట్ల తన ద్వేషాన్ని ధైర్యంగా వెలిబుచ్చాడు. దేవదూతలకు నియంత్రణ అవసరం లేదని, వారిని తమ ఇష్టానుసారంగా వ్యవహరించనీయటమే ఉత్తమ మార్గమని అతను పునరుద్ఘాటించాడు. దైవ విధులు తమ స్వతంత్రతకు అవరోధాలని ఖండించి వాటి రద్దును సాధించటం తన లక్ష్యమని ఈ ఆంక్షనుంచి స్వేచ్ఛ పొందినప్పుడు పరలోక వాసులు మరింత ఉన్నత, మహిమాన్విత జీవన స్థాయికి చేరారని ప్రకటించాడు.GCTel 470.2

    సాతాను అతని సహచరులు తిరుగుబాటంతటికి కారకుడు క్రీస్తేనని నిందిస్తూ తమను గద్దింపులతో వేధించివుండకపోతే తాము తిరుగుబాటుకు పూనుకొని ఉండేవారం కాముని గళమెత్తారు. విద్రోహ కార్యకలాపాలు కొనసాగిస్తూ దేవుని ప్రభుత్వాన్ని కూలదోయటానికి విఫలయత్నాలు చేస్తూ, నిరంకుశ పరిపాలనలో తాము బాధితులమని దేవదూషణకరంగా మాట్లాడూ తిరిగిన సాతాను అతని అనుచర గణం తుదకు పరలోకం నుంచి బహిష్కృతులయ్యారు.GCTel 470.3

    పరలోకంలో తిరుగుబాటును పురికొల్పిన స్వభావమే లోకంలో ఇంకా తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నది. సాతాను దేవదూతల విషయంలో అనుసరించిన విధానాన్నే మానవుల విషయంలోనూ అనుసరిస్తున్నాడు. మాట వినని పిల్లల్లో సాతాను స్వభావమే రాజ్యమేలుతుంది. సాతాను మాదిరిగానే వారు దైవ ధర్మశాస్త్రపు కట్టుబాట్లను మీరుతూ ధర్మశాస్త్ర నిబంధనలను మీరటం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ వాగ్దానం చేస్తున్నారు. పాప ఖండన ద్వేషాన్ని, ప్రతిఘటనను ఇంకా పుట్టిస్తూనే ఉంది. దేవుని హెచ్చరికలను మనస్సాక్షి అందుకున్నప్పుడు మనుషులు తమ్ముని తాము సమర్ధించుకోటానికి, తమ పాపం విషయంలో ఇతరుల సానుభూతి పొందటానికి వారిని సాతాను నడిపిస్తున్నాడు. పొరపాట్లు సవరించుకొనే బదులు తప్పు దిద్దే వ్యక్తి మీద వారు విరుచుకుపడ్డారు. ఆ సమస్యకు అతనే కారణమన్నట్లు వ్యవహరిస్తారు. నీతిమంతుడైన హేబెలు నాటినుంచి నేటి వరకు పాపాల్ని ఖండించే వారి పట్ల ప్రదర్శితమౌతూ వచ్చిన స్వభావం అలాంటిది.GCTel 470.4

    దేవుని ప్రవర్తన విషయంలో అబద్దాలు చెప్పి ఆయనను కర్కోటకుడుగాను నిరంకుశ పరిపాలకుడుగాను పరిగణించేటట్లు పరలోకంలో కొందరిని మోసగించినట్లే పాపం చేయటానికి మానవుణ్ణి సాతాను ప్రేరేపించాడు. అక్కడ వరకు విజయం సాధించాడు గనుక దేవుని అన్యాయపు ఆంక్షలు మానవుడి పతనానికేకాక తన తిరుగుబాటుకు కూడా కారణమయ్యాయని ప్రకటించాడు.GCTel 471.1

    కాగా తన ప్రవర్తనను గూర్చి దేవుడే ఈ ప్రకటన చేస్తున్నాడు: “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు.” నిరమకాండము 34:6,7.GCTel 471.2

    సాతానును పరలోకం నుంచి బహిష్కరించటంలో దేవుడు తన న్యాయశీలతను ప్రకటించుకొన్నాడు. తన సింహాసనం గౌరవాన్ని కాపాడుకొన్నాడు. కాని ఈ భ్రష్టదూత మోసాలకు పడిపోయి మానవుడు పాపం చేసినప్పుడు, పడిపోయిన మానవజాతికోసం దేవుడు తన అద్వితీయ కుమారుని అర్పించటం ద్వారా తన ప్రేమకు నిదర్శనాన్నిచ్చాడు. కుమారుని ప్రాయశ్చిత్తార బలి ద్వారా దేవుని ప్రవర్తన వెల్లడయ్యింది. లూసీఫర్ ఎంపిక చేసుకొన్న పాపమార్గానికి దేవుడు బాధ్యుడు కాడన్నది విశ్వానికి సిలువ వినిపిస్తున్న బలమైన వాదన.GCTel 471.3

    రక్షకుని ఇహలోక పరిచర్య కాలంలో క్రీస్తుకు సాతానుకు మధ్య జరిగిన పోటీలో అపూర్వ వంచకుడైన సాతాను ప్రవర్తన వెల్లడయ్యింది. క్రీస్తుకు వ్యతిరేకంగా సాతాను సల్పిన పోరాటం పరలోక దూతల అభిమానానికి సకల విశ్వం అభిమానానికి అతన్ని దూరం చేసినంతగా మరేదీ చేయగలిగి ఉండేది కాదు. క్రీస్తు తనకు శ్రద్ధాంజలి ఘటించాలన్న దేవదూషణ పూర్వక డిమాండు, కొండ శిఖరానికి గుడి శిఖరానికి తీసుకొని వెళ్లటంలోని అతని దురహంకారం, అక్కడ నుంచి దూకుమని కోరటంలో అతడు ప్రదర్శించిన దురుద్దేశం, ఆయన ప్రేమను తిరస్కరించేటట్లు యాజకులు ప్రజలను నడిపించిన అతడి ద్వేషం, చివరగా సిలువ వేయండి, సిలుప వేయండి అన్న ప్రజల కేకలు - ఇవన్నీ విశ్వాన్ని విస్మయంతోను ఆక్రోషంతోను నింపాయి.GCTel 471.4

    క్రీస్తును తిరస్కరించటానికి సాతానే లోకాన్ని పురికొల్పాడు. యేసును లేకుండా చేయటానికి అతను తన శక్తియుక్తులన్నిటినీ ధారపోసి కృషి చేశాడు. ఎందుకంటే రక్షకుని కృపా వాత్సల్యాలు, ఆయన కరుణాకటాక్షాలు దేవుని ప్రవర్తనను ప్రపంచానికి చాటిచెబుతాయని అతనికి బాగా తెలుసు. దైవకుమారుని ప్రతీ హక్కును సవాలు చేశాడు. రక్షకుని జీవితం దుఃఖాలు బాధలమయం చేసేందుకు మనుషుల్ని నియమించాడు. యేసు పరిచర్యకు ప్రతిబంధకాలు కల్పించటానికి అతను ఉపయోగించిన తప్పుడు వాదనలు, అసత్యాలు, భక్తిహీనుల ద్వారా ప్రదర్శించిన ద్వేషం, మచ్చలేని మంచితనానికి నిధి అయిన ఆ ప్రభువుపై నిందలు మోపటం. తీవ్రమైన ప్రతీకార కాంక్ష నుంచి పుట్టినవే. అసూయ, పగ, ద్వేషం, ప్రతీకారం కల్వరిలో క్రీస్తుపై విరుచుకు పడ్డాయి. ఆ దృశ్యాన్ని పరలోకమంతా నిశ్శబ్దంగా తేరి చూసింది.GCTel 472.1

    తన అపూర్వ త్యాగం పూర్తి అయిన తర్వాత క్రీస్తు పరలోకానికి వెళ్లాడు. ఈ మనవిని తండ్రిముందు పెట్టేంతవరకు దేవదూతల ఆరాధనను స్వీకరించలేదు; ” నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను.” యోహాను 17:24. అంతట తండ్రి సింహాసనం నుంచి గొప్ప శక్తితోను ప్రేమతోను ఈ జవాబు వచ్చింది, “దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెను” హెబ్రీ 1:6. అలసిపోయిన సూచన ఆయనలో కనిపించలేదు. అవమానానికి తెరపడింది. త్యాగం పూర్తి అయింది. అన్ని నామములకన్నా ఉన్నతమైన నామం ఆయనకు ఇవ్వబడింది.GCTel 472.2

    ఇప్పుడు సాతాను అపరాధం క్షమాపణలేకుండా నిలిచిపోయింది. అబద్ధికుడుగాను హంతకుడుగాను అతని అసలు సిసలు ప్రవర్తన వెల్లడయ్యింది. తన వశంలో ఉన్న మనుషుల్ని ఏ మనస్తత్వంతో పరిపాలించాడో అదే మనస్తత్వం పరలోక వాసులపట్ల చూపించి ఉండేవాడు. వారిని అదుపుచేయటానికి అనుమతి లభించివుంటే ధర్మశాస్త్ర అతిక్రమం స్వేచ్ఛను ఔన్నత్యాన్ని ఇస్తుందని అతను వాదించాడు. కాని దాని పర్యవసానంగా లభించింది దాస్యం, అవమానం అని తేలింది.GCTel 472.3

    దేవుని ప్రవర్తనను గురించి, ఆయన ప్రభుత్వం గురించి సాతాను అసత్య అభియోగాల నిజానిజాలు తేలిపోయాయి. ఆయన తాను సృజించిన ప్రజల నుంచి ఆజ్ఞపాలన విధేయతలను కోరుతున్నాడని ఇతరుల నుంచి స్వాపేక్ష కోరుతూ తానే స్వారోపేక్షసుగాని త్యాగాన్నిగాని ఆచరించటం లేదని దేవున్ని విమర్శించాడు. పతనమైన పాపమానవ జాతికోసం విశ్వపరిపాలకుడు తన ప్రేమ కారణంగా గొప్ప త్యాగం చేశాడని ఇప్పుడు వెల్లడయ్యింది. ఎందుకంటే “దేవుడు... క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు” కొంటున్నాడు. 2 కొరింథి 5:19. గౌరవం, ఆధిపత్యం నిమిత్తం లూసీఫర్ పాపానికి నాంది పలుకగా పాపాన్ని నిర్మూలించే నిమిత్తం క్రీస్తు తన్నుతాను రిక్తుణ్ని చేసుకొని మరణం పొందేంతగా విధేయత చూపాడు.GCTel 472.4

    తిరుగుబాటు సూత్రాలపై దేవుడు తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేశాడు. సాతానుని దోషిగా నిలబెట్టటంలోను, మానవుణ్ని విమోచించటంలోను దేవుని న్యాయశీలతను పరలోకమంతా గ్రహించింది. దైవధర్మశాస్త్రం మార్పులేనిది, అది ప్రతిపాదించే శిక్ష రద్దుచేయలేనిది అయితే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే ప్రతివాడు దేవుని ప్రసన్నతను నిరంతరం కోల్పోవాలని లూసీఫర్ వాదించాడు. పాపంలో పడ్డ మానవకోటి విమోచనకు దూరమయ్యారు గనుక వారు న్యాయంగా తన సొత్తు అని అతని వాదన. అయితే క్రీస్తు మరణం మానవుని పక్షంగా వెలసిన వాదన. దాన్ని సులభంగా కొట్టిపారెయ్యలేం. ధర్మశాస్త్రం విధించే శిక్ష దేవునితో సమాస ప్రతిపత్తిగల క్రీస్తు మీద పడింది. క్రీస్తు నీతిని అంగీకరించటానికి మానవునికి స్వేచ్ఛ ఉన్నది. దైవకుమారుడు జయించిన రీతిగా పశ్చాత్తాపంతో అవమానంతో కూడిన జీవితం ద్వారా మనం సాతానుపై విజయం సాధించవచ్చు. ఈ విధంగా దేవుడు న్యాయవంతుడు, యేసును విశ్వసించిన వారందరు నీతిమంతులని తీర్చేవాడు అయి ఉన్నాడు.GCTel 473.1

    కాగా మానవుడి రక్షణ ప్రణాళికను పూర్తిచేయటానికి మాత్రమే యేసు ఈ లోకానికి వచ్చి బాధలనుభవించి మరణించలేదు. “ఉపదేశక్రమమొకటి ఘనపర”చటానికి “ గొప్పచేయ”టానికి ఆయన వచ్చాడు. ఈ లోక ప్రజలు ధర్మశాస్త్రాన్ని పరిగణించాల్సిన రీతిగా పరిగణించేందుకే కాదు. దైవధర్మశాస్త్రం మార్పులేనిదని విశ్వంలోని లోకాలన్నింటినీ పరిగణింపజేసేందుకు ఆయన వచ్చాడు. ధర్మశాస్త్ర విధులను రద్దుచేయటం సాధ్యమై ఉంటే అతిక్రమానికి ప్రాయశ్చిత్తంగా దేవుని కుమారుడు ప్రాణత్యాగం చేయటం అగత్యమయ్యేది కాదు. ధర్మశాస్త్రం మార్పులేనిదని క్రీస్తు మరణమే నిరూపిస్తున్నది. పాపులకు రక్షణ కల్పించేందుకుగాను తమ అనంత ప్రేమ వాత్సల్యాల కారణంగా తండ్రి కుమారులు చేసిన త్యాగం కృప న్యాయాలు దేవుని ధర్మశాస్త్రానికి, ప్రభుత్వానికి పునాది అని అది ఈ ప్రాయశ్చిత్త ప్రణాళిక ద్వారానే తప్ప మరోవిధంగా చేయటం సాధ్యం కాదని విశ్వమంతటికీ సూచిస్తున్నది. చివరి తీర్పు అమలు జరిగినప్పుడు పాపం తలెత్తటానికి హేతువు లేదన్నది స్పష్టమౌతుంది. అప్పుడు విశ్వన్యాయాధికారి అయిన దేవుడు “నా మీద తిరుగుబాటు చేసి నారాజ్య ప్రజల్ని ఎందుకు అపహరించావు?” అని సాతానును ప్రశ్నిస్తాడు. పాపానికి జనకుడైన సాతాను చెప్పటానికి ఎలాంటి సాకూ ఉండదు. ప్రతీ నోటికి మూతపడుంది. తిరుగుబాటు ప్రజలు అవాక్కవుతారు. GCTel 473.2

    ధర్మశాస్త్రం మార్పులేనిదని కల్వరి సిలువ తెలుపుతూ పాపానికి జీతం మరణమని విశ్వాసికి ప్రకటిస్తుంది. రక్షకుడు మరణిస్తూ “సమాప్తమాయెను” అన్న మాటల్లో సాతాను మరణ ఘంటిక వినిపించింది. ఎంతో కాలంగా సాగుతున్న అపూర్వ సంఘర్షణకు అంతం కనిపించింది. పాపం పూర్తి నిర్మూలన నిశ్చయమయ్యింది. ““మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు” దైవకుమారుడు సమాధిని అనుభవించాడు. హెబ్రీ 2:14. లూసీఫర్ స్వీయ ప్రశంసాపేక్ష అతనిలో ఈ ఆలోచనలు పుట్టించింది. “దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును... మహాన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును” దేవుడిలా అంటున్నాడు, “దేశముమీద నిన్ను బూడిదగా చేసెదను...నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు” యెషయా 14:13,14; యెహేజ్కేలు 28:18, 19. “నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్టులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ రాబోవు దినమున అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ” మలాకీ 4:1.GCTel 474.1

    పాప స్వభావానికి పాప పర్యవసానాలకు విశ్వమంతా సాక్ష్యం కాబోతున్నది. పాపం ఆరంభంలో దాని సమూల నాశనం దూతలలో భయాందోళనలు పుట్టించి ఉండేది. దేవునికి అపఖ్యాతి తెచ్చి ఉండేది. ఇప్పుడైతే దాని నిర్మూలన దేవుని చిత్తాన్ని ఆనందంగా నెరవేర్చుతూ ఆయన ధర్మశాస్త్రాన్ని మనసుల్లో ఉంచుకొనే విశ్వప్రజల ముందు దేవుని ప్రేమను రుజువు చేస్తున్నది. పాపం మరెన్నడూ తలెత్తదు. “బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును” (నహూము 1:9) అంటున్నది. దేవుని వాక్యం భారమైన దాస్యపు కాడిగా సాతాసు విమర్శించిన దైవధర్మశాస్త్రం స్వాతంత్ర్య దైవధర్మశాస్త్రంగా మన్నన పొందబోతున్నది. ప్రభుభక్తి విషయంలో పరీక్షకు నిల్చి గెల్చిన నూతన సృష్టి ఎన్నడు ఆయనకు నమ్మకద్రోహం చేయదు. ఎందుకంటే ఆయన గుణశీలం వారికి సంపూర్తిగా వెల్లడయ్యింది. విస్తారమైన ప్రేమానురాగాలకు అనంత జ్ఞానానికి నిధిగా అది వారికి ప్రదర్శితమయ్యింది.GCTel 474.2