Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
మహా సంఘర్షణ - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 40—విడుదల పొందిన దైవ ప్రజలు

    దెవ ధర్మశాస్త్రాన్ని గౌరవించే వారి నుంచి ప్రభుత్వ శాసనాల పరిరక్షణను ఉపసంహరించటం జరిగినప్పుడు వారిని నాశనం చేయాలంటూ వివిధ దేశాల్లో ఏక సమయంలో ఉద్యమాలు లేస్తాయి. శాసనం నిర్దేశించిన సమయం దగ్గరపడే కొద్దీ ద్వేషానికి గురి అవుతున్న ఆ వర్గం ప్రజల్ని మట్టుపెట్టటానికి ప్రజలు కుట్ర చేస్తారు. ఒకరాత్రి దాడి జరిపి చావుదెబ్బ కొట్టి తద్వారా అసమ్మతి గళాన్ని శాశ్వతంగా నొక్కేయాలన్న తీర్మానం తీసుకొంటారు.GCTel 600.1

    ఖైదుల్లో మగుతూ అరణ్యాలు కొండల్లో తలదాచుకొంటూ వున్న దైవ ప్రజలు దేవుని కాపుదల కోసం విజ్ఞాపన చేస్తూ ఉండగా దుష్టదూతల ప్రోత్సాహంతో ప్రతీ చోటా సాయుధులైన మనుషులు సంహరణ కార్యానికి సన్నద్ధమౌతారు. అతితీవ్రమైన ఈ దశలో తాను ఎంపిక చేసుకొన్న ప్రజల విడుదలకు ఇశ్రాయేలు దేవుడు కలుగజేసు కొంటాడు. ప్రభువిలా అంటున్నాడు, “రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాస పడగండ్లతోను తన బాహువు వాలుట జసులకు చూపించును” యెషయా 30:29,30.GCTel 600.2

    జయ నినాదాలు, ఎగతాళి కేకలు, శాపనార్ధాలతో దుష్ట ప్రజల సమూహాలు బాధిత ప్రజల మీదికి తోసుకురావటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో రాత్రి చీకటిని మించిన దట్టమైన చీకటి భూమండలాన్ని ఆవరిస్తుంది. అంతట దైవ సింహాసనం నుంచి లేచే మహిమతో ప్రకాశిస్తూ ఆకాశం ఈ కొస నుంచి ఆ కొన వరకు విస్తరించిన ఇంద్ర ధనుస్సు ప్రార్ధిస్తున్న దైవజనుల సమూహం చుట్టూ చక్రంలా ఏర్పడుతుంది. దుష్టజన సమూహాలు అర్ధాంతరంగా ఆగిపోతాయి. వారి ఎగతాళి కేకలు ఆగిపోతాయి. తమ ఆగ్రహానికి కారాణాన్ని మర్చిపోతారు. ముప్పిరిగొన్న భయాందోళనలతో దేవుని నిబంధనకు గుర్తుగా ఉన్న ఆ ఇంద్రధనుస్సు వంక తేరి చూస్తారు. దాని ప్రచండమైన ప్రకాశత నుంచి కాపుదల కోసం ఆకాంక్షిస్తారు.GCTel 600.3

    “పైకి చూడండి” అంటున్న ఓ మధుర స్వరం దైవ ప్రజలకు వినిపిస్తుంది. కన్నులు పైకెత్తి చూసినప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సు వాగ్దానం కనిపిస్తుంది. అంతరిక్షాన్ని అలముకొన్న నల్లని మేఘాలు విడిపోతాయి. సైఫనులా వారు ఆకాశంలోకి ఆశగా చూస్తారు. దేవుని మహిమను సింహాసనాసీనుడైన మనుష కుమారుణ్ని వారు వీక్షిస్తారు. దైవ స్వరూపంలో ఉన్న ఆయన మీది అవమాన చిహ్నాల్ని గుర్తిస్తారు. తండ్రి ముందు పరిశుద్ధ దూతల ముందు ఆయన చేసే ఈ వినతిని ఆయన పెదవుల నుంచి వారు వింటారు. “తండ్రీ, నే నెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అసుప్రించిన వారును నాతో కూడ ఉండవలెనని కోరుచున్నాను” యోహాను 17:24. మళ్లీ ఓ మధురమైన విజయోత్సాహంతో నిండిన స్వరం ఇలా చెప్పటం వినిపిస్తుంది, “వారు వస్తారు, వారు వస్తారు. వారు పరిశుదులు, ప్రమాదరహితులు, పవిత్రులు. నా ఓర్పును వారు చాటిస్తున్నారు. వారు దేవదూతల నడుమ నడవటానికి అర్హులు”. తమ విశ్వాసాన్ని కాపాడుకొని స్థిరంగా నిలిచేవారు వణుకుతున్న పెదవులతో విజయధ్వానాలు చేస్తారు.GCTel 601.1

    తన ప్రజల విడుదల విషయంలో దేవుడు తన శక్తిని మధ్యరాత్రిలో ప్రదర్శిస్తాడు. సూర్యుడు తన శక్తి మేరకు ప్రకాశిస్తూ కనిపిస్తాడు. సూచనలు అద్భుతాలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోతాయి. నీతిమంతులు తమ విడుదలను సూచించే గుర్తుల్ని చూసి సంతోషిస్తుండగా ఆ దృశ్యాన్ని చూసి దుష్టులు భయకంపితులవుతారు. ప్రకృ తిలో సమస్తం విధి తప్పి నడుస్తున్నట్లు కనిపిస్తాది. ఏరులు ప్రవహించకుండా ఆగిపోతాయి. నల్లటి మేఘాలువచ్చి ఒక దానితో ఒకటి ఢీకొంటాయి. కల్లోలమైన అంతరిక్షంలో స్పష్టంగా నిర్మలంగా కనిపించే ఒక స్థలం ఉంటుంది. అది వర్ణించలేని మహిమతోనిండి ఉంటుంది. అక్కడ నుంచి విస్తార జలాల ధ్వని వంటి దైవస్వరం “సమాప్తమైనది” (ప్రకటన 16:17.) అని చెప్పటం వినిపిస్తుంది.GCTel 601.2

    ఆ స్వరం శబ్దానికి భూమ్యాకాశాలు కంపిస్తాయి. గొప్ప భూకంపం సంభవిస్తుంది. “మనుషులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగలేదు” 18 వ వచనం. అంతరిక్షం తెరుచుకొన్నట్లు మూసుకొన్నట్లు కనిపిస్తుంది. దైవ సింహాసనం నుంచి ప్రకాశించే మహిమ వాటిలో నుంచి మెరుపులా ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తుంది. పర్వతాలు గాలికి రెల్లు ఊగినట్లు ఊగుతాయి. బండలు అన్ని పక్కలా చెదిరి పడి ఉంటాయి. తుఫాను వస్తున్నట్లు ఘోష వినిపిస్తుంది. సముద్రం ఉగ్రరూపం ధరిస్తుంది. విధ్వంసానికి తెగబడిన దయ్యాల స్వరాల్లాంటి ఘోషతో తుఫాను విజృంభిస్తుంది. సముద్ర తరంగాలు లేచిపడేటట్లు భూమియావత్తు లేచిపడుంది. భూమి ఉపరితలం బద్దలవుతుంది. భూమి పునాదులే కూలిపోతున్నట్లు కనిపిస్తుంది. పర్వత శ్రేణులు దిగబడిపోతాయి. జనులు నివసిస్తున్న ద్వీపాలు మాయమవుతాయి. దుర్మార్గతలో సొదొమలా ఉన్న ఓడరేవులు జలసమాధులవుతాయి. “తన ఉగ్రత పాత్రలోని మద్యాన్ని దానికివ్వటానికి ” మహాబబులోన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొంటాడు. “అయిదేసి మణుగుల బరువుగల ” పెద్ద వడగండ్లు గొప్ప విధ్వంసం కలిగిస్తాయి. 19,21 వచనాలు. లోకంలోని ప్రఖ్యాత నగరాలు కుప్పకూలిపోతాయి. తమ వ్యక్తిగత ప్రాభవాన్ని చాటుకోవటానికి ప్రఖ్యాత ప్రజాపాలకులు నిర్మించుకొన్న రాజభవనాలు వారి కళ్లముందే కూలిపోతాయి. ఖైదు గోడలు బద్దలవుతాయి. తమ విశ్వాసం నిమిత్తం ఖైదు పాలైన దైవ ప్రజలు విడుదల పొందుతారు.GCTel 602.1

    సమాధులు తెరుచుకొంటాయి. ఈ సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయమగుటకును మేలుకొందురు” దానియేలు 12:2. మూడోదూత వర్తమానాన్ని విశ్వసించి మరణించిన వారందరూ దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఆచరించిన వారితో చేసే సమాధాన నిబంధనను వినటానికిగాను మహిమా శరీరులై సమాధుల్లో నుంచి బైటికి వస్తారు. “ఆయనను పొడిచినవారు” (ప్రకటన 1:7.) మరణవేదనలో ఉన్నప్పుడు ఆయనను ఎగతాళి చేసి కించపర్చినవారు, ఆయన సత్యాన్ని అనుసరించినవారిని తీవ్రంగా వ్యతిరేకించినవారు, ఆయన ప్రభావాన్ని చూడటానికీ, ఆయనకు విధేయులై నడుచుకొన్న జనులకు ఆయన చూపే గౌరవాన్ని చూడటానికి పునరుత్థానులవుతారు. ప్రకాశిస్తున్న ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. అయినా అప్పుడప్పుడు ప్రకాశిస్తున్న సూర్యకాంతి పగ తీర్చుకొనే యెహోవా కన్నులాగ కనిపిస్తుంది.GCTel 602.2

    తీక్షణమైన మెరుపులు ఆకాశం నుంచి విరుచుకు పడ్డాయి. ఫలితంగా భూగోళమంతా అగ్ని గోళమౌతుంది. భయంకరమైన ఉరుము శబ్దానికి పై నుంచి విచిత్రమైన భయానకమైన స్వరాలు దుష్టుల నాశనాన్ని ప్రకటిస్తూ వినిపిస్తాయి. ఆ మాటలు అందరికీ అర్థంకావు. కాని అవి అబద్ధబోధకుడికి స్పష్టంగా అర్థమవుతాయి. కొద్దిసేపటి క్రితం దురుసుగా, డంబంగా, లెక్కలేనట్లుగా వ్యవహరిస్తూ, దేవుని ఆజ్ఞలు ఆచరిస్తున్న ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సంతోషిస్తూ ఉన్న వారు ఇప్పుడు భయం గుప్పిట్లో బితుకు బితుకుమంటూ ఉంటారు. వారి ఏడ్పు ఎంతో గట్టిగా వినిపిస్తుంది. దయ్యాలు క్రీస్తు దేవత్వాన్ని గుర్తించి ఆయన ముందు వణుకుతాయి. కృపను ఆర్ధిస్తూ మనుషులు భయంతో కిందపడి దొర్లుతారు.GCTel 603.1

    ప్రభువు దినాన్ని పరిశుద్ధ దర్శనంలో వీక్షిస్తూ పూర్వం ప్రవక్తలు ఇలా పలికారు, ““యెహావా దినము వచ్చుచున్నది ఘోషించుడి. అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును” యెషయా 13:6. “యెహోవా భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు బండ బీటలోనికి దూరుము, మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. మనుష్యుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయముగల ప్రతి దానికిని, ఔన్నత్యముగల ప్రతి దానికిని, విమర్శించు దినమొకటి సైన్యముల కధిపతియగు యెహోవా నియమించియున్నాడు. ” ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావము మహాత్మ్యము నుండియు కొండ గుహలలోను బండబీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయు దురు.” యెషయా 2:1012; 20, 21. మార్టిన్.GCTel 603.2

    మేఘాల సందులో నుంచి ఓ నక్షత్రం ప్రకాశిస్తుంది. ఆ చీకటివల్ల దాని కాంతి నాలుగంతలు ప్రకాశమానమవుతుంది. విశ్వాసులలో అది నిరీక్షణను ఆనందాన్ని నింపుతుంది. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వారిలో అది కాఠిన్యాన్ని దురాగ్రహాన్ని రేకెత్తిస్తుంది. క్రీస్తు నిమిత్తం తమ సర్వస్వాన్ని త్యాగం చేసినవారు ఇప్పుడు భద్రత కలిగి ఉండగలరు. వారు యెహోవా పర్ణశాలలోని రహస్య మందిరంలో దాగి వుంటారు. వారు పరీక్షకు గురి అవుతారు. ప్రపంచం ముందు, సత్యాన్ని తృణీకరించిన ప్రజల ముందు వారు తమకోసం మరణించిన ప్రభువు పట్ల తమ అచంచల భక్తి విశ్వాసాల్ని ప్రచుర పర్చుకొంటారు. తమ విశ్వాసం నిమిత్తం మరణించటానికైనా వెనుకాడని వారి విషయంలో పెద్ద మార్పు చోటుచేసుకొంటుంది. రాక్షసులుగా మారిన దుష్టుల నిరంకుశత్వం నుంచి వారికి ఆకస్మికంగా విడుదల లభిస్తుంది. అప్పటి వరకూ భయాందోళనలతో నిండి చింతాక్రాంతులైన భక్తుల ముఖాలు ఇప్పుడు విస్మయంతో, విశ్వాసంతో, ప్రేమతో ప్రకాశిస్తాయి. గళాలు కలిపి వారు ఈ విజయ గీతం పాడారు, “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ” కీర్తనలు 46:13.GCTel 603.3

    నమ్మకాన్ని వెలిబుచ్చే ఈ మాటలు దేవునికి చేరుతున్న సమయంలో మేఘాలు తొలగుతాయి. ఆకాశ నక్షత్రాలు కనిపిస్తాయి. రెండు పక్కల మేఘావృతమై ప్రకోపిస్తున్న అంతరిక్షంతో పోల్చినప్పుడు ఈ నక్షత్రాలు ఎంతో తేజోవంతంగా ఉంటాయి. పరలోక యెరూషలేము మహిమ తెరచిన గుమ్మాల్లోనుంచి ప్రవహిస్తుంది. అప్పుడు మడచి ఉన్న రెండు రాతిపలకల్ని పట్టుకొన్న హస్తం ఆకాశంలో కనిపిస్తుంది. ప్రవక్త ఇలా అంటున్నాడు, “దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.” కీర్తనలు 50:6. ఉరుములు అగ్నిమధ్య సీనాయి పర్వత శిఖరం నుంచి జీవితానికి మార్గదర్శిగా ప్రకటితమైన దేవుని నీతి అయిన పరిశుద్ధ దర్మశాస్త్రం తీర్పుకు ముఖ్య శాసనమౌతుందని దేవుడు మనుషులకు ఇప్పుడు బయలుపర్చుతాడు. ఆ హస్తం రాతి పలకల్ని తెరుస్తుంది. వాటిమీద పది ఆజ్ఞలుంటాయి. అవి అగ్ని కలంతో దిద్దినట్లు ఉంటాయి. ఆ మాటలు అందరూ చదవగలిగినంత స్పష్టంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి మేల్కొంటుంది. మూఢనమ్మకాలు తప్పుడు సిద్ధాంతాల చీకట్లు విడిపోతాయి. దేవుని పది మాటలు క్లుప్తంగా, వివరంగా, అధికారికంగా భూనివాసులందరి దృష్టికి వస్తాయి.GCTel 604.1

    దేవుని పరిశుద్ధ శాసనాల్ని కాలరాసిన వారి భీతి నిస్పృహల్ని వర్ణించటం సాధ్యపడదు. ప్రభువు తన ధర్మశాస్త్రాన్ని వారికిచ్చాడు. పశ్చాత్తాపానికి దిద్దుబాటుకు అవకాశం ఉండగా వారు తమ ప్రవర్తనలను ఆ నియమాల ప్రకారం దిద్దుకోగలిగేవారే. కాని లోకం మెప్పుకోసం ఆ ధర్మసూత్రాల్ని తోసిపుచ్చి వాటిని అతిక్రమించేటట్లు ఇతరుల్ని నడిపించారు. దేవుని సబ్బాతును అపవిత్రం చేయటానికి దైవ ప్రజల్ని ఒత్తిడి చేశారు. తాము ఏ ధర్మ శాసనాల్ని తృణీకరించారో వాటినిబట్టే ఇప్పుడు శిక్ష పొందుతారు. తమకు ఎలాంటి సాకూ లేదని వారు స్పష్టంగా గ్రహిస్తారు. తాము ఎవరిని సేవించి పూజించారో వారినే ఎంపిక చేసుకొన్నారు. అప్పుడు నీతి గలవారెవరో దుర్మారు లెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు” మలాకీ 3:18.GCTel 604.2

    బోధకుల నుంచి ఆ వర్గంలోని అత్యల్పుల వరకూ ఉన్న ధర్మశాస్త్ర శత్రువులకు సత్యాన్ని గురించి మానవ విధుల గురించి నూతన అవగాహన కలుగుతుంది. నాలో ఆజ్ఞలోని సబ్బాతు సజీవ దేవుని ముద్ర అని వారు చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. తమ నకిలీ సబ్బాతు నిజ స్వరూపం తాము ఇసుక పునాదిపై నిర్మించుకొన్నదని వారు ఎంతో ఆలస్యంగా గుర్తిస్తారు. తాము దేవునికి వ్యతిరేకంగా పోరాడున్నామని తెలుసు కొంటారు. పరదైసు గుమ్మాల్లోకి నడిపిస్తామని చెబుతూ మత ప్రబోధకులు ఆత్మలను నాశనానికి నడుపుతారు. పరిశుద్ధ హోదాల్లో ఉన్న వ్యక్తుల బాధ్యత ఎంత గొప్పదో వారి అపనమ్మకం పర్యవసానాలు ఎంత భయంకరమైనవో అంతిమ తీర్పు దినం వరకూ తెలియదు. ఒక ఆత్మ తప్పి పోవటం ఎంత దుఃఖకరమో నిత్యత్వమే సరిగా అంచనా వేయగలుగుతుంది. చెడ్డ సేవకుడా పొమ్మని దేవుడు ఎవరితో చెబుతాడో అతనిది భయంకరమైన నాశనం.GCTel 605.1

    యేసు రాకకు నిత్యనిబంధన విడుదలకు ఏర్పాటైన దినాన్ని ఘడియను పరలోకం నుంచి దేవుడు తన ప్రజలకు ప్రకటించటం వినిపిస్తుంది. గొప్ప శబ్దంతో వినిపించే ఉరుములా ఆయన మాటలు భూమికి దిగుతాయి. దేవుని ఇశ్రాయేలు ప్రజలు కన్నులు పైకెత్తి ఆ మాటలు వింటూ నిలబడ్డారు. సీనాయి పర్వతం నుంచి దిగి వచ్చినప్పుడు మోషే ముఖం ప్రకాశించినట్లు వారి ముఖాలు ఆయన మహిమతో ప్రకాశిస్తాయి. దుష్టులు వారిని చూడలేరు. ఆయన పరిశుద్ధ సబ్బాతును ఆచరించటం ద్వారా దేవున్ని గౌరవించే వారిపై దీవెన కుమ్మరించే సమయంలో బ్రహ్మాండమైన విజయనినాదం లేస్తుంది.GCTel 605.2

    కొద్ది సేపటిలో తూర్పున మనిషి చేతిలో సగం పరిమాణం గల నల్లని మేఘం కనిపిస్తుంది. అది రక్షకుని ఆవరించి దూరానికి చీకటితో నిండినట్లు కనిపించే మేఘం. అది దైవ కుమారుని సూచనగా దైవ ప్రజలకు తెలుసు. అది భూమిని సమీపిస్తుండగా వారు నిశ్శబ్దంగా దాని వంక చూస్తూ వుంటారు. దగ్గరకు వచ్చే కొద్దీ ఆ మేఘం తేజోవంతమౌతూ చివరికి బ్రహ్మాండమైన తెల్లని మేఘమౌతుంది. దాని పైని నిబంధన సంకేతమైన ఇంద్రధనుస్సు ఉంటుంది. దానిపై ఆసీనుడై యేసు సర్వశక్తిగల విజేతగా వస్తాడు. ఇప్పుడు “వ్యసనాక్రాంతుడుగా” అవమాన పాత్రలోనిది దుఃఖ పాత్రలోనిది తాగటానికి రావటం లేదు. పరలోకంలోను భూమిమీదను విజయుడుగా, జీవిస్తున్న వారికి మరణించినవారికి తీర్పరిగా వస్తున్నాడు. “నమ్మకమైన వాడును సత్యవంతుడును అయిన” ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.” “పరలోకమందున్న సేనలు... ఆయనను వెంబడించుచుండిరి.” ప్రకటన 19:11, 14. అసంఖ్యాకమైన పరిశుద్ధ దూతల సమూహం పరలోక మధుర గీతాలాపనతో ఆయనకు సేవలు చేస్తూ ఆయన వెంట వస్తారు. వేవేలకొలది... కోట్లకొలది దూతలతో అంతరిక్షం నిండినట్లు కనిపిస్తుంది. ఆ సన్నివేశాన్ని ఏ మానవుడూ వర్ణించలేడు. ఆ వైభవాన్ని ఏ మానవుడూ అవగాహన చేసుకోలేడు. “ఆయన మహిమ ఆకాశమండల మంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ” హబక్కూకు 3:3,4. ఆ మేఘం ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతీ నేత్రమూ జీవనాధుడు యేసుని చూస్తుంది. ఆ పవిత్ర శిరం ఇప్పుడు ముళ్ల కిరీటం ధరించదు. అది ఇప్పుడు మహిమా కిరీటం ధరిస్తుంది. ఆయన ముఖకాంతి మధ్యాహ్న సూర్యుడి కాంతికన్నా ప్రచండంగా ఉంటుంది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది. ” ప్రకటన 19:16.GCTel 605.3

    ఆయన ముందు వారి ముఖములు తెల్లబారుట... కనబడుచున్నది.” దైవ కృపను తృణీకరించిన వారిని భీతి నిస్పృహలు అలముకొంటాయి. ‘జనుల హృదయము కరిగిపోవుచున్నది. మోకాళ్ళు వణకుచున్నవి... అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.” యిర్మీయా 30:6; నహూము 2:10. నీతిమంతులు వణకుతూ ““తాళగలిగిన వాడెవడు” అంటూ కేకలు వేస్తారు. దూతలు తమ పాటలు ఆపుతారు. కొంతసేపు నిశబ్దం చోటుచేసుకొంటుంది. అప్పుడు నా కృప నీకు చాలును” అని యేసు చెప్పటం వినిపిస్తుంది. నీతిమంతుల ముఖాలు ప్రకాశిస్తాయి. మారిన హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి. భూమిని సమీపించే కొద్దీ దూతలు తమ పాటను కొంచెం హెచ్చుస్థాయిలో అందుకొంటారు.GCTel 606.1

    అగ్ని జ్వాలలు ఆవరించి ఉన్న మేఘం మీద రారాజు క్రీస్తు దిగివస్తాడు. ఆకాశం కాగితం చుట్టలా ముడుచుకుపోతుంది. భూమి ఆయన ముందర వణుకుతుంది. పర్వతాలు ద్వీపాలు తమతమ స్థానాలు తప్పుతాయి. మన దేవుడు వేం చేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టు ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై- బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు” కీర్తనలు 50:3,4.GCTel 607.1

    “భూరాజులును, ఘనులును, సహస్రాధి పతులును, ధనికులును, బలిష్టులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని - సింహాసనాసీనుడైయున్న వానియొక్కయు గొట్టె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మామీదపడి ఆయన సన్నిధికిని గొట్టె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.” ప్రకటన 6:1517. ఎగతాళి ఆగిపోతుంది. అబద్దమాడే పెదవులు మూసుకొంటాయి. “యుద్ధపు సందడి... రక్తములో పొరలింపబడిన వస్త్రములు (యెషయా 9:5.) ఆయుధాల మోత, యుద్ధం- ఇది అంతా ఆగిపోతుంది. ప్రార్థన స్వరం ఏడ్పు తప్ప ఇంకేమీ వినిపించదు. అప్పటిదాకా ఎగతాళి చేస్తున్న పెదవుల నుంచి సింహాసనాసీనుడైయున్న వానియొక్కయు గొట్టె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను.” దానికి తాళజాలినవాడెవడు?” అన్న మాటలు వినిపిస్తాయి. తాము ద్వేషించి నిరాకరించిన ఆయన సముఖం నుంచి తమను కప్పండంటూ పర్వతాల్ని బండల్ని దుష్టులు ఆర్ధిస్తారు.GCTel 607.2

    ఆ స్వరం మృతుల చెవుల్లోకి చొచ్చుకుపోతుంది. అది వారు ఎరిగిన స్వరమే. పశ్చాతాపం పొందుమంటూ ఆ మృదుమధుర స్వరం ఎంత తరచుగా బతిమాలింది! స్నేహితుడు, సోదరుడు, రక్షకుడి రూపంలో విజ్ఞాపన చేస్తూ ఆ స్వరం ఎంత తరచుగా వినిపించింది? “మి దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీ రెందుకు మరణము నొందెదరు.?” (యెహేజ్కేలు 33:11) అంటూ ఎంతో కాలంగా ఈ స్వరం విజ్ఞప్తి చేస్తున్నది. దేవుని కృపను నిరాకరించే వారికి ఇంతకన్నా బలమైన ఖండన మరొకటి ఉండదు. ఇది వేరే వ్యక్తి స్వరం అయితే ఎంత బాగుండును! యేసు ఇలా అంటున్నాడు, “నేను పిలువగా మీరు వినక పోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక తోసివేసితిరి” సామెతలు 1:24, 25. ఆ స్వరం వారిలో జ్ఞాపకాలు రేపుతుంది. అవి తుడుపు పడి వుంటే బాగుండునని వారి ఊహ. అవి తోసిపుచ్చిన హెచ్చరికలు, నిరాకరించిన ఆహ్వానాలు, దుర్వినియోగం చేసిన అవకాశాల స్మృతులు!GCTel 607.3

    క్రీస్తు అవమానానికి అమర్యాదకు గురి అయినప్పుడు ఆయనను అపహసించి నప్పుడు, ప్రధాన యాజకుడు క్రీస్తును ప్రమాణం చేసి చెప్పుచున్నప్పుడు బాధితుడైన ప్రభువు పలికిన ఈ మాటలు అతిస్పష్టంగా వారికి జ్ఞాపకం వస్తాయి, “ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు” మత్తయి 26:64. ఇప్పుడు వారు ఆయనను తన మహిమలో చూస్తారు. ఆయన అధికారంతో తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండటం చూడవలసి ఉంది.GCTel 608.1

    తాసు దేవుని కుమారుణ్ణి అన్నప్పుడు పరిహసించినవారు ఇప్పుడు అవాక్కవుతారు. ఆయన రాచబిరుదును గేలిచేస్తూ అక్కడున్న సైనికుల్ని పిలిచి ఆయన తలపై కిరీటం పెట్టుండని ఆదేశించిన అహంకారి హేరోదు అక్కడుంటాడు. తమ పాపిష్టి చేతులతో ఆయనకు ఊదారంగు అంగీతొడిగి తలపై ముళ్లకిరీటం పెట్టి ప్రతి ఘటనలేని ఆయన చేతిలో ఉత్తుత్తి రాజదండం ఉంచి దేవదూషణ కరంగా ఎగతాళి చేస్తూ ఆయన ముందర వంగి నమస్కరించిన ఆ వ్యక్తులే అక్కడుంటారు. జీవానికి కర్త అయిన ఆ ప్రభువు తలమీద కొట్టి ఆయనపై ఉమ్మివేసిన దుష్టులు ఆయన వాడి చూపునుంచి తప్పించుకొని బీభత్సకరమైన ఆయన సన్నిధి నుంచి పారిపోవటానికి ప్రయ త్నిస్తారు. ఆయన కాళ్లలోను చేతుల్లోను మేకులు కొట్టినవారు, ఆయన పక్కలో బళ్లెం దించిన సైనికులు భయంతోను, పశ్చాత్తాపంతోను ఆ గుర్తుల్ని వీక్షిస్తారు.GCTel 608.2

    యాజకులు ప్రజాపాలకులు కల్వరి ఘటనల్ని విస్పష్టంగా గుర్తు తెచ్చుకొంటారు. పిచ్చి ఉద్రేకంతో తలలు ఊపుతూ, “వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును” అంటూ తాము ఎగతాళి చేయటం గుర్తుకు తెచ్చుకొంటూ భయకంపితులవుతారు. మత్తయి 27:42,43.GCTel 608.3

    ద్రాక్షతోటను గుత్తకు తీసుకొన్న కాపులు పండ్లలో యజమానికి తన భాగాన్ని ఇవ్వకుండా అతని సేవకుల్ని కొట్టి అతని కుమారుణ్ణి చంపటం గురించి రక్షకుడు చెప్పిన ఉపమానాన్ని వారు జాపకం చేసుకొంటారు. ” ఆ దుర్మార్గులను కఠినముగా సంహరిస్తాడు” అని తామే చెప్పిన తీర్పును కూడా వారు గుర్తు చేసుకొంటారు. అపనమ్మకస్తులైన ఈ వ్యక్తుల నేరంలోను శిక్షలోను ఈ యాజకులు పెద్దలు తమ క్రియల్ని బట్టి తమ కఠిన తీర్పు తమ నాశనం న్యాయమైనవని గుర్తిస్తారు. ఇప్పుడు వారు బాధతో నిండిన పెద్ద కేక వేస్తారు. యెరూషలేము వీధుల్లో వీనిని సిలువ వేయుము సిలువ వేయుము” అన్న కేకలకన్నా భయంకరంగా వినిపిస్తుంది. “ఆయన దేవుని కుమారుడు. ఆయనే నిజమైన మెస్సీయ” అన్నకేక అది. రారాజు క్రీస్తు సముఖము నుంచి పారిపోవటానికి వారు ప్రయత్నిస్తారు. ప్రకోపించిన ప్రకృతి చర్యల ఫలితంగా ఏర్పడ్డ లోతైన గుహల్లో దాగి ఉండటానికి విఫల యత్నాలు చేస్తారు.GCTel 609.1

    సత్యాన్ని నిరాకరించే వారందరి జీవితాల్లోనూ మనస్సాక్షి మేల్కొని కపట నాటకంతో జీవించిన జీవితం అప్పుడప్పుడు గుర్తుకువచ్చి ఆత్మ వృధాక్షోభకు గురి అయ్యే తరుణాలుంటాయి. “భయము... తుఫానువలె” “సుడిగాలి వచ్చునట్లు... అపాయము” రావటంతో పోల్చితే ఇవి ఏపాటివి? సామెతలు 1:27. క్రీస్తును ఆయనకు నమ్మకంగా నిలిచిన అనుచరులను నిర్మూలించటానికి చూసిన వారు ఇప్పుడు వారిని ఆవరించిన మహిమను చూస్తారు. తమను వేధిస్తున్న భయంతోపాటు, “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము” (యెషయా 25:9.) అంటూ భక్తులు పలికే మాటలు వారికి వినిపిస్తాయి.GCTel 609.2

    భూమి మత్తుని వలె తూలుతుండగా మెరుపులు ఉరుముల మధ్య దైవ కుమారుని స్వరం సమాధుల్లో నిద్రిస్తున్న భక్తుల్ని పిలుస్తుంది. నీతిమంతల సమాధుల వంక చూస్తూ ఆకాశం వైపు చేతులెత్తి “మంటిలో నిద్రిస్తున్న వారలారా మేల్కొండి, లేవండి” అని ఆయన కేకవేస్తాడు. భూమండలం అంతటా చెదరి ఉన్న మృతులు ఆ స్వరం వింటారు. విన్న వారందరూ బతుకుతారు. ప్రతీ జనం నుంచి, ప్రతీ వంశం నుంచి, ఆయాభాషలు మాట్లాడే వారి నుంచి ప్రతీ ప్రజనుంచి గొప్ప జనసమూహాలు బయలుదేరగా వారి పద ఘటనతో భూమి దద్దరిల్లుతుంది. వారు అమరత్వ మహిమ ధరించి మరణ బందీగృహం నుంచి బైటికి వస్తూ ఇలా కేకలు వేస్తారు, “మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?” 1 కొరింథి 15:53. జీవించి ఉన్న నీతి మంతులు సమాధులనుంచి లేచిన భ క్తులు గళం కలిపి ఆనందంతో విజయగీతం పాడారు.GCTel 609.3

    ఎలాంటి శరీరాలతో పుట్టిపెరిగారో అలాంటి శరీరాల్లోనే అందరూ సమాధుల్లోనుంచి బైటికి వస్తారు. పునరుత్థాన మయ్యేవారిలో ఆదాము ఉంటాడు. అతను పొడవుగాను హుందాగాను కనపడ్డాడు. కాని ఆదాము దైవ కుమారుడి కన్న కొంచెం కురుచగా ఉంటాడు. ఆదాముకి అనంతర తరాలవారికి మధ్య ఎంతో వ్యత్యాసముంటుంది. మానవ జాతిలో చోటు చేసుకొన్న గొప్ప క్షీణత ఈ ఒక్క విషయంలోనే కళ్లకు కడుతుంది. కాకపోతే, అందరూ నిత్యయౌవనపు జవసత్వాలు కలిగిలేస్తారు. ఆదిలో మానవుడు దేవుని స్వరూపంలో సృష్టి అవటం ప్రవర్తనలోనే కాదు, శరీర తత్వంలోనూ ఆకృతిలోనూ కూడా. పాపం వల్ల దైవస్వరూపం వికృత మయ్యింది. అది దాదాపు మాయమయ్యింది. అయితే నశించినదాన్ని పునరుద్ధరించటానికి క్రీస్తు వచ్చాడు. ఆయన మన పాప శరీరాన్ని మార్చుతాడు. తన మహిమా శరీరంలాగ మన శరీరాన్ని తీర్చి దిద్దుతాడు. మర్త్యమైన, క్షయమైన, సురూపంలేని, ఒకప్పుడు పాపం పంకిలమైన శరీరం సంపూర్ణత్వాన్ని, సురూపాన్ని, అమర్త్యతను ధరిస్తుంది. కళంకం లోపాలు సమస్తం సమాధిలోనే మిగిలిపోతాయి. ఎన్నడో కోల్పోయిన ఏదెనులోని జీవవృక్ష ఫలాలు రక్షణపొందిన వారు భుజిస్తారు. భుజించి ఆదిలో మానవుడి పెరుగుదలకు ఉద్దేశించిన పూర్తి స్థాయికి పెరుగుతారు. పాపం వలన వచ్చిన శాపం ఫలితాలు నిర్మూలమవుతాయి. క్రీస్తు భక్తులు “దేవుడైన యెహోవా ప్రసన్నత” కలిగి ప్రభువు స్వరూపాన్ని మనసులో, ఆత్మలో, శరీరంలో ప్రతిబింబిస్తారు. ఎంత చక్కని రక్షణ! దీన్ని గురించి ఎంతో కాలం ప్రస్తావించాం, ఎంతో కాలం నిరీక్షించాం. ఆతృతగా ఎంతో కాలం ఎదురు చూశాం. కాని ఎన్నడూ దీన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయాం .GCTel 610.1

    జీవించి ఉన్న నీతిమంతులు “నిముషంలో ఒక రెప్పపాటున” మార్పు పొందుతారు. దేవుని మాటతో వారు మహిమ పొందుతారు. ఇప్పుడు వారు పునరుత్థానులైన భక్తులతో కలసి ప్రభువును మధ్యాకాశంలో కలుసుకోటానికి అమర్త్యులుగా మార్పుపొందుతారు. దేవదూతలు “ఆకాశము యొక్క ఈ చివరినుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచు కొనిన వారిని పోగుచేతురు” దేవదూతలు చిన్న పిల్లల్ని తమ తల్లుల వద్దకు ఎత్తుకొని వెళ్లి వాళ్ల చేతుల్లో పెడతారు. మరణం చాలాకాలం విడదీసిన మిత్రులు ఏకమవుతారు. వారు ఇక ఎన్నడూ విడిపోరు. ఆనంద గీతాలు పాడుకొంటూ వారు కలసి దేవుని పరిశుద్ద పట్టణానికి ఎగసిపోతారు.GCTel 610.2

    మేఘరథానికి రెండు పక్కల రెక్కల కింద సజీవ చక్రాలు ఉంటాయి. రథం పైకి వెళ్లేకొద్దీ చక్రాలు “పరిశుద్ధుడు” అని కేకలు వేస్తాయి. రెక్కలు కదలుతున్నప్పుడు “పరిశుద్ధుడు” అని కేకలు వేస్తాయి. పరిశుద్ధదూత గణాలు “సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని కేకలు వేస్తారు. రథం నూతన యెరూషలేము వైపుకు కదులు తున్నప్పుడు రక్షణ పొందిన ప్రజలు ” “హల్లెలూయ” నినాదాలు చేస్తారు.GCTel 611.1

    పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించక ముందు రక్షకుడు తన అనుచరులకు విజయ చిహ్నాల్నీ తమకు కలిగిన రాజహోదాకు అధికార లాంఛనాల్ని అందజేస్తాడు. తళతళ మెరిసే హోదా చిహ్నాలు రాజైన యేసు చుట్టూ చతురస్రాకారంలో ఏర్పాటై ఉంటాయి. భక్తులకన్నా, దూతలకన్నా యేసురాజు ఉన్నతస్థాయి కలిగి ఉంటాడు. ప్రేమతో ప్రసన్నమై ఉండే ఆయన ముఖం వారివంక సాదరంగా చూస్తుంది. ” ఏ మనిషి రూపం కంటె అతని ముఖమును నరరూపముకంటె అతని ముఖమును చాల వికారమని” ఎవరి గురించి ఉన్నదో ఆయనపైనే రక్షణ పొందే అసంఖ్యాక ప్రజానీకం చూపు కేంద్రీకృ తమవుతుంది. ప్రతీ నేత్రం ఆయన మహిమను వీక్షిస్తుంది. జయించేవారి శిరసులమీద క్రీస్తు తన కుడిచేతితో మహిమా కిరీటాలు పెడ్తాడు. ప్రతీ వ్యక్తికి తన “క్రొత్తపేరు” (ప్రకటన 2:17) “యెహోవా పరిశుద్ధుడు” అని చెక్కిన మాటలు గల కిరీటం ఉంటాయి. ప్రతీవారి చేతిలోను విజయ సూచకమైన ఖర్జూరపుమట్టలు, వీణె ఉంటాయి. నాయక దూతలు వీణె మీటటంతో ప్రతీ హస్తం సున్నితంగా తంత్రులు మీటుతూ మధుర మనోహర సంగీతం అందిస్తుంది. ప్రతీ హృదయంలోను ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రతీ స్వరం ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది, “మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక” ప్రకటన 1:6.GCTel 611.2

    రక్షణ పొందిన జనుల ముందున్న పరిశుద్ధ పట్టణ ద్వారాలు యేసు తెరుస్తాడు. సత్యాన్ని ఆచరించిన వారందరూ అందులో ప్రవేశిస్తారు. అక్కడ దేవుని పరదైసును వారు చూస్తారు. పాపరహిత స్థితిలో ఆదాము గృహం అదే. అంతట మధుర సంగీత స్వరంతో ప్రభువిలా అంటాడు, “మీ పోరాటం ముగిసింది” “నా తండ్రిచేత ఆశీర్వదించబడినవారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి ”GCTel 612.1

    తన శిష్యుల కోసం రక్షకుడు చేసిన ప్రార్థన ఇప్పుడు నెరవేరుతుంది: “తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెనని... కోరుచున్నాను.” (తన మహిమ యెదుట ఆనందముతో... నిర్దోషులుగా నిలువ బెట్టుటకు” (యూదా 24.) తన రక్తం పెట్టి కొన్న ప్రజలను క్రీస్తు ఈ మాటలతో తండ్రికి సమర్పిస్తాడు: “ఇదిగో నేనూ నీవు నాకిచ్చిన బిడ్డలూ ) “నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని” విమోచనకూర్చే దైవ ప్రేమ ఎంత అద్భుతం! అనంత శక్తి సంపూర్ణుడైన తండ్రి విమోచన పొందిన జనుల్ని చూసినప్పుడు వారిలో తన స్వరూపం చూడటం, పాపం కలిగించిన సంక్షోభం దాని ఫలితాలు తొలగిపోయి మానవాళి మళ్లీ తనతో సామరస్యంతో మనగలిగే సమయం రావటం-- ఆ ఘడియ ఆయనకు ఎంత ఆనందదాయకం!GCTel 612.2

    ప్రభువు సంతోషంలో పాలు పొందటానికిగాను తనకు నమ్మకంగా నిలిచిన భక్తుల్ని యేసు ప్రేమతో స్వాగతిస్తాడు. బాధలు వేదన అనుభవించి అవమానం భరించి తాను రక్షించిన ఆత్మల్ని మహిమా రాజ్యంలో చూడటం రక్షకునికి అమితానందం కూర్చుతుంది. రక్షణ అందుకొన్న వారు తమ ప్రార్ధనలు సేవలు త్యాగాల ద్వారా క్రీస్తుకు తాము పరిచయం చేసినవారు రక్షణ పొందిన వారిలో ఉండటం చూసి ప్రభువుతోపాటు ఆనందిస్తారు. వారు ఆ తెల్లని సింహాసనం చుట్టూ సమావేశం అవుతున్నప్పుడు తాము క్రీస్తు వద్దకు చేర్చిన వారిని వీక్షిస్తూ ఒకరు ఇతరుల్ని తేవటం వారు మరి కొందరిని తేవటం అలా అందరూ పరలోక విశ్రాంతిలోకి వచ్చి అక్కడ తమ కిరీటాలు యేసుప్రభువు పాదాల వద్ద పెట్టి అనంతయుగాలు ఆయనను స్తోత్రించే ఆధిక్యత కలిగినందుకు ఆనందిస్తారు.GCTel 612.3

    విమోచన పొందిన వారు దేవుని పట్టణానికి స్వాగత ఆరాధన వాతావరణం ఏర్పడి ఆరాధనకు పిలుపు వినబడుంది. ఇద్దరు ఆదాములు కలుసుకోటానికి సిద్ధంగా ఉంటారు. ఏ మనిషిని తాను సృజించాడో, ఏ మనిషి తన సృష్టికర్తకు ఎదురుతిరిగి పాపం చేశాడో, ఏ మనిషి పాపం నిమిత్తం రక్షకుని శరీరం పై చెరగని సిలువ గుర్తులున్నాయో మానవజాతి పితరుడు అయిన ఆ ఆదామును కలుసుకొనేందు కోసం దైవ కుమారుడు చేతులు చాపి నిలబడి ఉంటాడు.GCTel 612.4

    ఏదెను నుంచి బహిస్కృతి అనంతరం ఆదాము జీవితం దుఃఖంతో నిండింది. ఎండిపడుతున్న ప్రతీ ఆకు, బలి అవుతున్న ప్రతీ పశువు, ప్రకృతికి జరుగుతున్న ప్రతీ హాని, మనిషి పవిత్రతను చెరుపుతున్న ప్రతీ కీడు అతని పాపానికి తాజా జ్ఞాపక మయ్యింది. పెచ్చరిల్లుతున్న దుర్మారతను చూసినప్పుడు ఆదాము తీవ్ర ఆవేదనకు గురి అయ్యాడు. దుర్మారతను ఖండిస్తూ ఆదాము చేసిన హెచ్చరికలకు జవాబుగా ప్రజలు తననే పాపానికి కారకుడిగా నిందించారు. తన అతిక్రమానికి శిక్షను సహనంతోను సాత్వికంతోను దాదాపు వెయ్యి సంవత్సరాలు ఆదాము అనుభవించాడు. తన పాపం గురించి అతను చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడ్డాడు. వాగ్రత్త రక్షకుడు ఆయన నీతి ద్వారా తనకు రక్షణ నిస్తాడని నమ్మాడు. పునరుత్థానమున్నదన్న నిరీక్షణ కలిగి మరణించాడు. పరాజయం పొంది పాపంలోపడిన మానవుణ్ణి దేవుని కుమారుడు విమోచించాడు. ఇప్పుడు క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం వలన ఆదాము తన పూర్వ పరిశుద్ధ స్థితిలో పునరుద్దరణ పొందుతాడు.GCTel 613.1

    పొంగి పొరలుతున్న ఆనందంతో ఆదాము ఒకప్పుడు తన నెంతో ఆకట్టుకొన్న వృక్షాలను మళ్లీ చూస్తాడు. ఆ చెట్ల ఫలాల్ని ఆదాము తానే తన పాపరహిత దినాల్లో పోగుచేసేవాడు. తన సొంత చేతులతో పెంచిన పూల అంటుల్ని చూస్తాడు. తాను ఎంతో ప్రేమించి పెంచిన పువ్వుల్ని చూస్తాడు. అతని మనసు ఆ వాస్తవాన్ని గ్రహిస్తుంది. ఇది నిజంగా పునరుద్ధరణ పొందిన ఏదెను అని ఆదాము అవగాహన చేసుకొంటాడు. తాను అక్కడ నుంచి బహిష్కృతుడైన నాటికంటే ఇప్పుడది ఎంతో మనోహరంగా ఉన్నట్లు గుర్తిస్తాడు. రక్షకుడు ఆదామును జీవవృక్షం వద్దకు తీసుకువెళ్లి ఒక పండు కోసి తినుమని ఇస్తాడు. చుట్టూ పరికిస్తూ రక్షణ పొందిన తన కుటుంబికులు వేలాది మందిని దేవుని పరదైసులో ఆదాము చూస్తాడు. అప్పుడు తన తలమీది కిరీటం తీసి యేసు పాదాలవద్ద ఉంచి కౌగిలించుకుంటాడు. ప్రభువు బంగారు వీణ మీటగా “వధింపబడి మళ్లీ జీవిస్తున్న గొర్రెపిల్ల అర్హుడు, అర్హుడు” అన్న విజయగీతంతో పరలోకమంతా ప్రతిధ్వనిస్తుంది. ఆదాము కుటుంబం పల్లవి అందుకొని ఆరాధన పూర్వకంగా రక్షకునికి సమస్కరిస్తూ తమ కిరీటాల్ని ఆయన పాదాల వద్ద పెడతారు.GCTel 613.2

    దేవుని సింహాసనానికి ముందున్న స్పటిక సముద్రం మీద ” ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారి” సమూహం సమావేశమవుతుంది. మనుషులలో నుంచి విమోచింపబడ్డ 144 వేలమంది “దేవుని వీణెలు గల వారై ” సీయోను కొండపై గొర్రెపిల్లతో కలిసి నిలబడ్డారు. విస్తారమైన జలముల ధ్వని పంటి గొప్ప ఉరుము ధ్వని పంటి, స్వరం వినిపిస్తుంది. అది “వీశాలు వాయించుచున్న వైణికుల నాదమును పోలియున్నది. ” వారు సింహాసనం ముందు ఒక “క్రొత్త కీర్తన” పాడారు. ఆ కీర్తనను 144 వేలమంది తప్ప ఇంకెవరూ నేర్చుకోలేరు. ఎందుకంటే అది వారి అనుభవాల్ని గూర్చిన కీర్తన. అది దేవుని మహిపుతో ప్రకాశమానమై అగ్నితో కలిసి ఉన్నట్లు కనిపించే స్ఫటిక సముద్రం. అదే మోషే యొక్కయు, గొట్రిపిల్ల యొక్కయు కీర్తన. వారి విమోచన కీర్తన. వారికి కలిగిన అనుభవం ఇంకే జనాంగానికి ఎన్నడూ కలుగలేదు.” వీరు... గొఱ్ఱపిల్ల ఎక్కడికిపోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు” వీరు జీవిస్తున్న వారి మధ్య నుంచి సజీవంగా కొనిపోబడ్డవారు. వీరు “దేవుని కొరకును గొఱ్ఱపిల్ల కొరకును ప్రథమ ఫలముగా” పరిగణింపబడ్డారు. ప్రకటన 15:2,3; 14:1-5. “వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు” జనులు రాజ్యంగా కూడిన కాలం నుంచి నేటి వరకు ఎన్నడూ కలుగనంత శ్రమను అనుభవించి ఉన్నవారు. యాకోబు సంతతి వారికి వాటిల్లే ఆపదకాలంలో వీరు కఠోర శ్రమల్ని అనుభవిస్తారు. చివరగా దేవుని తీర్పులు లోకం మీద పడేటప్పుడు ఉత్తరవాది లేకుండా శ్రమలు భరించి వీరు స్థిరంగా నిలిచి ఉంటారు. వీరు విడుదల పొందుతారు. ఎందుకంటే వీరు “గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసుకొనిరి”. “వీరి నోట ఏ అబద్దమును కనబడలేదు.” దేవుని యందు “వీరు అనింద్యులు”. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడై యున్నవాడు తానే వారిమీద తన గుడారమును కప్పును. ” కరవు కాటకాలతో లోకం అతలాకుతలం మవ్వటం వారు చూస్తారు. సూర్యుని వేడి అధికమై మనుషుల్ని శ్రమలు పాయేయటం చూస్తారు. శ్రమలు ఆకల బాధ దాహార్తి వారికి అనుభవ పూర్వకంగా తెలుస్తాయి. అయినా వారికి ఇక మీదట ఆకలియైనను దాహమైనసు ఉండదు. సూర్యుని ఎండయైనను ఏ వడగాలి యైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొట్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును” ప్రకటన 14:14-17.GCTel 614.1

    అన్ని యుగాల్లోనూ దేవుడు ఎంపిక చేసుకొన్న ప్రజలు కష్టాల బడిలో విద్యనభ్యసించి శిక్షణ పొందుతుంటారు. వారు భూమిపై ఇరుకు మార్గాల్లో నడిచారు. శ్రమలకొలిమిలో శుద్ధి పొందారు. క్రీస్తు నిమిత్తం వ్యతిరేకత, ద్వేషం, అపనింద భరించారు. భయంకర సంఘర్షణల మధ్య యేసుని వెంబడించారు. సుఖసౌక్యాల్ని ఉపేక్షించారు. తీవ్ర నిరాశ నిస్పృహలను అనుభవించారు. స్వీయానుభవం ద్వారా పాపం చెడుతనాన్ని దానికున్న శక్తిని దాని దోష గుణాన్ని అది కలిగించే దుఃఖాన్ని వారు అవగాహన చేసుకొన్నారు. అందుకు వారు పాపాల్ని ద్వేషిస్తారు. పాప రోగ నివారణకు చేసిన అసమాన త్యాగం వారిని సాత్వికుల్ని చేసి వారి హృదయాల్ని కృతజ్ఞతతోను స్తుతి వందనంతోను నింపుతుంది. పాపం చేయని ఇతర లోకాల్లోని వారు దీన్ని అభినందించలేరు. తాము అమితంగా క్షమాపణ పొందారు గనుక ప్రభువుని అమితంగా ప్రేమిస్తారు. క్రీస్తుతో పాటు బాధలనుభవించిన వారు ఆయన మహిమలో పాలివారవటానికి అరులవుతారు.GCTel 615.1

    దేవుని వారసులు పందుళ్లలోనుంచి, మురికి ఇళ్ల పంచల్నుంచి, చీకటి కొట్లనుంచి, ఉరికంబాల నుంచి, పర్వతాల నుంచి, అడవుల నుంచి, గుహల నుంచి, సముద్రపు సొరంగాల నుంచి వస్తారు. వారు లోకంలో “దరిద్రులైయుండి శ్రమలుపడి హింస పొందుతారు. సాతాను మోసాలకు లొంగనందున లక్షలాది మంది అపవాదులపాలై అపకీర్తి భారంతో సమాధులోకి వెళ్తారు. మానవ న్యాయ స్థానాలు వారిని నికృష్ణ నేరస్తులుగా తీర్పు నిస్తాయి. ఇప్పుడు “దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు.” కీర్తనలు 50:6. లోకం తీర్పులు తారుమారవుతాయి. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును.” యెషయా 25:8 “పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించినవారనియు వారికి పేరు పెట్టబడును” “వారికి ఉల్లాసవస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును” ఆయన ఏర్పాటు చేస్తాడు. యెషయా 62:12; 61:3. ఇక వారు దుర్భల, బాధిత, పీడిత జనులై చెల్లాచెదురవ్వరు. ఇక నుంచి వారు నిత్యం ప్రభువుతో ఉంటారు. భూమిపై ఎంతో గొప్ప వారు ధరించిన దుస్తులకన్నా ఎంతో విలువైన దుస్తులు ధరించి వారు సింహాసనం ముందు నిలబడ్డారు. లోక రాజులు ధరించిన కిరీటాలకన్నా ఎంతో ప్రకాశవంతమైన మహిమకరమైన కిరీటాలు వారి శిరసుల్ని అలంకరిస్తాయి. బాధ, దుఃఖం గతకాల మాట అవుతుంది. మహిమరాజు అందరి ముఖాలమీది కన్నీటినీ తుడిచివేస్తాడు. దుఃఖ కారణాలు తొలగిపోతాయి. ఖర్జూరపు మట్టలు ఊపుతూ స్వరాల మేళవింపుతో వారు మధురాతి మధురమైన స్తుతిగీతం పాడారు. ప్రతీ వారు గొంతు కలిపి “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొట్టె పిల్లకును మా రక్షణకై స్తోత్రము” అంటూ సుమధురంగా పాడే పాటతో పరలోకం మారుమోగుతుంది. ఆమెన్, యుగ యుగముల వరకు మాదేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు శక్తియు బలమును కలుగును గాక” అంటూ ప్రత్యుత్తరమిస్తూ పరలోక నివాసులు దేవునికి నమస్కరిస్తారు. ప్రకటన 7:10-12.GCTel 615.2

    విమోచన ఇతివృత్తాన్ని అవగాహన చేసుకోటానికి ఈ జీవితంలోనే మొదలు పెట్టగలం. పరిమితమైన మన గ్రహింపుశక్తితో క్రీస్తు అవమాసం మహిమ, జీవితం, మరణం, సిలువలో ఏకమైన న్యాయం కృప- వీటిని మనం పరిగణించ వచ్చు. అయినా మన ప్రతిభా పాటవాలన్నింటిని వినియోగించినా విమోచన ఇతివృత్త ప్రాముఖ్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేం. విమోచక ప్రేమ పొడవును, వెడల్పును, లోతును, ఎత్తును అంతంత మాత్రంగానే అవగాహన చేసుకోగలుగుతాం. విమోచన పొందిన వారు సయితం రక్షణ ప్రణాళికను పూర్తిగా అవగాహన చేసుకోటం సాధ్యం కాదు. కాగా నిత్యత్వపు యుగాలన్నింటిలోను మనసుకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే నూతన సత్యం ఎప్పుడూ ఆవిష్కృతమౌతూనే ఉంటుంది. లోక సంబంధమైన దుఃఖాలు బాధలు, శోధనలు అంతమొంది వాటికి కారకుడు బాధ్యుడు తొలగిపోయినప్పటికీ తమ రక్షణకు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో అన్న విషయమై దైవ ప్రజలకు ఖచ్చితమైన జ్ఞానం కలుగుతుంది.GCTel 616.1

    విమోచన పొందిన వారు నిత్య కాలమంతా నేర్చుకొనే శాస్త్రం పాడేపాట క్రీస్తు సిలువను గురించే మహిమలో ప్రవేశించిన క్రీస్తులో సిలువను పొందిన క్రీస్తును వారు చూస్తారు. అంతరిక్షంలో ఉన్న అసంఖ్యాకమైన లోకాల్ని ఎవరిశక్తి సృజించి వాటిని ఉనికిలో ఉంచుతున్నదో, ఎవరు పరలోక ప్రభువైన దేవునికి అతిప్రియుడో, ఎవరిని సేవించటానికి కెరూబులు సెరూపులు ఆనందిస్తారో, ఆ ప్రభువైన యేసు పతనమైన మానవుణ్ణి ఉదరించటానికి తన్నుతాను తగ్గించుకొన్నాడు. పాపం తాలూకు దోషాన్ని సిగ్గును భరించాడు. సశించిన లోకాన్ని గురించిన దుఃఖం కల్వరిసిలువపై తన హృదయాన్ని బద్దలు చేసి తన ప్రాణాలు తీసేవరకూ తండ్రి తన ముఖం చాటేసుకోటాన్ని భరించాడు. ఇది ఎన్నటికీ మరపుపడని సత్యం. సర్వజగాల సృష్టికర్త, భవితవ్యాల నిర్ణేత అయిన క్రీస్తు తన మహిమను పక్కన పెట్టి మానవులపై ప్రేమ కారణంగా తన్నుతాను తగ్గించుకొని రిక్తుని చేసుకోవటం విశ్వం విస్మయానికి ఆరాధనకు హేతువుకావాలి. రక్షణ పొందిన వివిధ జాతుల ప్రజలు రక్షకుని వీక్షించి ఆయన ముఖంపై తండ్రి మహిమ ప్రకాశించటం చూసినప్పుడు, అనంత కాలం నుంచి అనంత కాలం వరకూ ఉండే ఆయన సింహాసనాన్ని చూసి ఆయన రాజ్యం అనంతమైనదని తెలుసుకొన్నప్పుడు, సంతోషంతో వారిలా పాడారు, “వధించబడ్డ గొర్రెపిల్ల అర్హుడు. అర్హుడు తన ప్రశస్త రక్తంచేత ఆయన మమ్మల్ని విమోచించాడు.”GCTel 616.2

    సిలువ మర్మం తక్కిన మర్మాలన్నిటినీ విశదం చేస్తుంది. మనలో భయాందోళనలు పుట్టించే దేవుని గుణలక్షణాలు, కల్వరి నుంచి సెలయేరులా ప్రవహించే వెలుగులో ఎంతో రమ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కృప, కనికరం, మాతాపితల వాత్సల్యం, పరిశుద్ధత, న్యాయం, శక్తితో సమ్మిళితమవ్వటం కనిపిస్తుంది. ఉన్నతమైన ఆయన సింహాసన ప్రభావాన్ని వీక్షిస్తుండగా ఆయన కారుణ్య గుణశీలం మనం అవగాహన చేసుకొంటాం. ‘’మాతండ్రి” అన్న పదబంధానికున్న ప్రాధాన్యం క్రితంకన్నా మరెక్కువగా గ్రాహ్యమౌతుంది.GCTel 617.1

    అనంత జ్ఞాని అయిన దేవుడు మన రక్షణార్ధం తన కుమారున్ని త్యాగం చేయటం మినహా వేరే ప్రణాళికను యోచించలేక పోయాడన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతిగా దేవుడు కోరుతున్నది ఈ లోకాన్ని పరిశుద్ధులు అమర్త్యులు అయిన ప్రజలతో నింపటం ద్వారా కలిగే ఆనందం. చీకటి శక్తులతో రక్షకుని సంఘర్షణ విమోచన పొందిన ప్రజలకు ఆనంద హేతువవుతుంది. అనంత కాలంలో యుగయుగాలుగా అది దేవునికి మహిమకరంగా వుంటుంది. ఆత్మకు తండ్రి ఇస్తున్న విలువ అటువంటిది. దానికి చెల్లించిన మూల్యం ఆయనకు తృప్తికరంగా ఉంటుంది. తన త్యాగం ఫలితాన్ని చూసి స్వయాన క్రీస్తే సంతృప్తి చెందుతాడు.GCTel 617.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents