Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    22—యోహాను కారాగార వాసం, మరణం

    క్రీస్తు రాజ్యాన్ని ప్రచురించడంలో మొదటివాడు బాప్తిస్మమిచ్చే యోహాను, బాధలనుభవించిన వారిలో కూడా యోహాను మొదటి వాడు. అరణ్యంలో దివ్యంగా వీచే గాలి నుంచి, తన బోధ వినడానికి తండోపతండాలుగా వచ్చే జనసమూహాల నుంచి దూరమై, ఇప్పుడు ఆ బోధకుడు చీకటి కొట్టులో మగ్గుతోన్నడు. అతడు హేరోదు ఏంటిపస్ కోటలో బందీగా ఉన్నాడు. యోర్దానుకు తూర్పున ఉన్న భూభాగం ఏంటిపస్ పరిపాలనకింద ఉన్న రాజ్యం. యోహాను పరిచర్య చాలా కాలం ఇక్కడే గడిచింది. స్వయాన హేరోదే యోహాను బోధ విన్నాడు. పశ్చాత్తాప పడాల్సిందంటూ వచ్చిన పిలుపు విన్నప్పుడు భోగలాలసుడైన రాజు భయంతో వణికాడు. “యోహాను నీతిమంతుడును పరిశుద్దుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి.... మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను” యోహాను హేరోదుతో ముక్కుసూటిగా వ్వవహరించాడు. అతడి సహోదరుడి భార్య హేరోదియతో అతడి అక్రమ సంబంధాన్ని ఖండించాడు. తనను బంధించిన కామబంధాన్ని తెంచుకోడానికి హేరోదు కొంతకాలం ప్రయత్నించాడు. కాని హేరోదియ హేరోదును మరింత గట్టిగా బంధించి, లాలించి, స్నానికుణ్ని చెరసాలలో వేయించి పగతీర్చుకుంది.DATel 220.1

    యోహానుది చురుకైన సేవలో గడిచిన జీవితం. చెరసాల చీకటి గదిలో నిష్క్రియా జీవనం అతడికి పెను భారమయ్యింది. మార్పేమీ లేకుండా వారానికి వారం జరిగిపోవడంతో నిస్పృహ పెరిగింది. సందేహం పుట్టుకొచ్చింది. తన శిష్యులు అతణ్ని విడిచి పెట్టలేదు. చెరసాలకు వచ్చిపోవడానికి వారికి అనుమతి లభించింది. వారు యేసు చేస్తున్న సేవను గురించి వార్తలు తేవడం ఆయన వద్దకు జనులు తండోపతండాలుగా రావడాన్ని నివేదించడం జరిగేది. ఈ నూతన బోధకుడు మెస్సీయా అయి ఉంటే ఆయన యోహానుని విడిపించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు అని వారు ప్రశ్నించారు. తన నమ్మకమైన దూత చెరలో మగ్గడం, బహుశ ప్రాణాలు కోల్పోడం ఆయన ఎలా అనుమతించగలడు? అని ప్రశ్నించారు.DATel 220.2

    ఈ ప్రశ్నలు ఊరకే పోలేదు. ఇవి తనకు ఎన్నడూ కలిగి ఉండని సందేహాలు యోహానుకి సూచించాయి. ఈ శిష్యుల మాటలు వినడం అవి ఆ ప్రభువు దూత ఆత్మను ఎంతగా గాయపర్చాయో చూడడం సాతానుకి అమితానందంగా ఉంది. ఓ మంచి మనిషికి మిత్రులమని తలంచి అతడికి తమ విశ్వసనీయతను చూపించుకోవాలని ఆత్రపడేవారు అతడిపట్ల అతి ప్రమాదకరమైన శత్రువులుగా పరిణమించడం ఎంత తరచుగా జరుగుతుంటుంది.!DATel 221.1

    రక్షకుని శిష్యులమల్లే బాప్తిస్మమిచ్చే యోహాను కూడా క్రీస్తు రాజ్య స్వభావాన్ని అవగాహన చేసుకోలేదు. యేసు దావీదు సింహాసనాన్ని అలంకరిస్తాడని యోహాను కనిపెట్టాడు. కాలం గతించే కొద్దీ రక్షకుడు రాజ్యాధికారాన్ని కోరకపోవడంతో యోహాను ఆందోళనకు అలజడికి గురి అయ్యాడు. ప్రభువు ముందు మార్గం సరాళమవ్వడానికిగాను యెషయా ప్రవచనం నెరవేరాలని యోహాను ప్రజలకు ప్రకటించాడు. పర్వతాలు కొండలు అణగాలి. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండాలి, మానవ దురహంకారమనే ఉన్నత స్థలాలు నేలమట్టమవ్వాలని అతడు కనిపెట్టాడు. చేతిలో చేటపట్టుకుని ఉన్నవానిలా కళ్ళాన్ని బాగా శుభ్రం చేసే వానిలా గోధుమల్ని కొట్లలో పోసి పొల్లును ఆరని ఆగ్నిలో కాల్చివేసే వానిలా మెస్సీయాను యోహాను సూచించాడు. ఎవరి ఆత్మతోను శక్తితోను తాను ఇశ్రాయేలుకు వచ్చాడో ఆ ఏలీయా ప్రవక్తలాగ అగ్ని ద్వారా తన్నుతాను ప్రత్యక్షపర్చుకునే దేవుడు తనకు ప్రత్యక్షమవ్యాలని యోహాను ఎదురుచూశాడు.DATel 221.2

    స్నానికుడు ఉన్నత స్థలాల్లోను సామాన్య స్థలాల్లోను ఉన్న దుర్మార్గతను మందలించడమే తన కర్తవ్యంగా ఎంచుకుని నిర్భయంగా నిలబడ్డాడు. హేరోదు రాజు పాపాన్ని మందలించడానికి సాహసించాడు. తనకు నియుక్తమైన పనిని చేయడంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. హింసకుడి దురహంకారాన్ని అణగదొక్కి పేదలను దుఃఖితులను యూదా గోత్రపు సింహం విడిపించడానికి ఇప్పుడు యోహాను తన చీకటి కొట్టులో నుంచి ఎదురు చూస్తోన్నాడు. కాని యేసు శిష్యుల్ని తన చుట్టూ పోగు చేసుకోడంతో స్వస్తత కూర్చడంతో ప్రజలకు బోధించడంతో తృప్తి చెంది ఉన్నట్లు కనిపించింది. ఒక పక్క రోమియుల కాడి రోజుకు రోజు భారమౌతుండగా, హేరోదురాజు అతడి ప్రియురాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుండగా పేదలు పీడిత ప్రజల ఆక్రందన ఆకాశానికి ఎగస్తుండగా యేసు సుంకరులతో కలిసి భోజనాలు చేస్తోన్నాడు.DATel 221.3

    ఈ ఎడారి ప్రవక్తకు ఇదంతా అంతు పట్టని ఆంతర్యంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు దయ్యాల గుసగుసలు ప్రవక్త ఆత్మను హింసించాయి. తీవ్ర భయం పడగ నీడ అతణ్ని ఆవరించింది. ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదురుచూసిన విమోచకుడు ఇంకా రాలేదా? అదే నిజమైతే తాను ప్రవచించాల్సిన వర్తమానం అర్ధం ఏమిటి? తన పరిచర్య సాధించిన ఫలితం విషయంలో యోహాను తీవ్ర నిరాశకు గురి అయ్యాడు. యోషీయా ఎజ్రా దినాల్లో (2 దిన 34; నెహెమ్యా 8, 9) ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ఎలాంటి ఫలితం కనిపించిందో అలాంటి ఫలితమే దేవుని వద్ద నుంచి వచ్చిన వర్తమానానికీ కలుగుతుందని దాని మూలంగా అంతరంగంలో పశ్చాత్తాపం చోటుచేసుకుని ప్రజలు ప్రభువు వద్దకు తిరిగి వస్తారని అతడు నిరీక్షించాడు. తన ఈ కర్తవ్య సాఫల్యానికి తన యావజ్జీవితాన్ని త్యాగం చేశాడు. అదంతా వ్యర్ధమేనా?DATel 222.1

    తనపట్ల తన శిష్యులకున్న ప్రేమ చొప్పున క్రీస్తు విషయంలో తన సొంత శిష్యులే అపనమ్మకం కలిగి ఉండడం చూసి యోహాను ఆందోళన చెందాడు. వారి విషయంలో తన సేవ నిష్పలమయ్యిందా? ఇప్పుడు తన పరిచర్యను విరమించాల్సిరావడం తన కర్తవ్య నిర్వహణలో తాను అపనమ్మకంగా ఉన్నందుకా? వాగ్రత్త విమోచకుడు వచ్చి ఉంటే యోహాను తన పిలుపుకు నమ్మకంగా నిలిచి ఉన్నట్లు తేలితే యేసు ఇప్పుడు హింసించే రోమా ప్రభుత్వాధికారాన్ని కూలదోసి తన దూతకు విముక్తి కలిగించడా?DATel 222.2

    తన సందేహాల్ని ఆందోళనల్ని యోహాను తన అనుచరులతో చర్చించలేదు. యేసు వద్దకు దూతను పంపి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కార్యాన్ని ఇద్దరు శిష్యులకి అప్పగించి, రక్షకునితో సమావేశం వారి విశ్వాసాన్ని పటిష్ఠపర్చి వారి సహోదరుల్ని. బలోపేతం చేస్తుందని భావించాడు. ప్రత్యక్షంగా క్రీస్తు నోటి నుంచి వచ్చిన వర్తమానం వినాలని ఆశించాడు.DATel 222.3

    యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి “రాబోవువాడవు నీవేనా, మేము మరియెకని కొరకు కనిపెట్టవలెనా? అని ప్రశ్నించారు.DATel 223.1

    స్నానికుడు యేసువంక చూపిస్తూ “ఇదిగో లోకపాపములు మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల” అని “ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను” అని ఎంతో కాలం గడవలేదు. యోహాను 1:29,27; ఇప్పుడు “రాబోవు వాడవు నీవేనా?” అన్న ప్రశ్న లేచింది. మానవ స్వభావానికి అది చేదయిన తీవ్రమైన నిరాశ. క్రీస్తు పురోగామి అయిన యోహను క్రీస్తు కర్తవ్యాన్ని అవగతం చేసుకోడంలో విఫలుడైతే స్వార్థ జనసమూహాల గురించి ఏం చెప్పగలం?DATel 223.2

    ఆ శిష్యుల ప్రశ్నకు యేసు వెంటనే సమాధానం చెప్పలేదు. ఆయన మౌనం దాల్చాడు. వారికి ఆశ్చర్యం వేసింది. అంతలో వ్యాధిగ్రస్తులు బాధితులు ఆయన వద్దకు వస్తోన్నారు. స్వస్తత కోసం గుడ్డివారు తడుముకుంటూ జనులమధ్య నుంచి దారి చేసుకుంటూ వస్తోన్నారు. వ్యాధి గ్రస్తులు రకరకాలుగా ఉన్నారు. కొందరు తమంతట తామే వస్తుండగా మరికొందర్ని మిత్రులు మోసుకువస్తోన్నారు. వారంతా యేసు సముఖంలోకి రావడానికి తోసుకుంటూ వస్తోన్నారు. మహావైద్యుని స్వరం చెవిటి వాని చెవిలోకి చొచ్చుకుంటూ పోయింది. వెలుగును ప్రకృతి దృశ్యాల్ని మిత్రుల ముఖాల్ని రక్షకుని ముఖాన్ని చూచేందుకు ఆయన ఒక్క మాట, ఒక్క స్పర్శ గుడ్డికళ్లను తెరిచింది. యేసు వ్యాధిని మందలించాడు. జ్వరాన్ని బహిష్కరించాడు. ఆయన స్వరం మరణిస్తోన్న వారి చెవుల్లో పడగా వారు ఆరోగ్యంతో బలంతో లేచారు. దయ్యాలు పట్టి పిచ్చెక్కిన వాళ్లు ఆయన మాట పలుకగా విధేయులయ్యారు. వారి పిచ్చి పోయింది. వారు ఆయన్ని సేవించారు. ఆయన వ్యాధిగ్రస్తుల్ని బాగుచేస్తున్న సమయంలో ప్రజలకు బోధించాడు. రబ్బీలు అపవిత్రులగా పరిగణించిన తృణీకరించిన పేద శ్రామిక ప్రజల్ని సన్నిహితులుగా చేర్చుకున్నాడు. వారికి నిత్య జీవ వాక్యం బోధించాడు.DATel 223.3

    దినమంతా ఇలా గడిచింది. యోహాను శిష్యులు ఇవన్నీ చూశారు విన్నారు. చివరగా యేసు వారిని తన దగ్గరకు పిలిచి తాము చూసినవన్నీ యోహానుకి చెప్పాల్సిందిగా ఆదేశించి ఇంకా ఇలా అన్నాడు, “నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు” లూకా 7:23; బాధపడుతున్న మానవుల అవసరాలకు అనుకూల రీతిలో ప్రదర్శతమైన ఆయన దేవత్వానికి నిదర్శనాన్ని వారు చూశారు. మన దీన స్థితికి తన్ను తాను తగ్గించుకోడంలో ఆయన మహిమ ప్రదర్శితమయ్యింది.DATel 224.1

    శిష్యులు వర్తమానం చేరవేశారు. యోహానుకి అది చాలనిపించింది. మెస్సీయాను గూర్చి ఈ ప్రవచనం యోహాను గుర్తు చేసుకున్నాడు. “దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యోహోవా నన్ను అభిషేంకించెను. నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యోహోవా హితవత్సరమును దేవుని మన ప్రతిదండన దినమును ప్రకటించుటకును... ఆయన నన్ను పంపియున్నాడు.” యెషయా 61:1,2. క్రీస్తు పనులు ఆయన మెస్సీయా అని చాటి చెప్పడమే కాక ఆయన రాజ్యం ఏవిధంగా స్థాపితం కావాల్సి ఉందో సూచించాయి. అప్పుడు “బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. శిలలు ఛిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపము నందు యెహోవా ప్రత్యక్షముకాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ మెరుపు తర్వాత “నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము” ద్వారా దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. 1రాజులు 19:11, 12. ఎడారిలో ఏలీయాకు వచ్చిన సత్యమే యోహానుకు వచ్చింది. అలాగే ఆస్త్రశస్త్రాల పెళ పెళ శబ్దంతోను సింహాసనాలు రాజ్యాల్ని కూలదొయ్యడం ద్వారాను గాక కరుణ కటాక్షలతో త్యాగశీలతతో నిండిన జీవితం ద్వారా మనుషుల హృదయాలతో మాట్లాడూ యేసు తన పరిచర్యను చేయాల్సి ఉంది.DATel 224.2

    స్నానికుడి జీవిత నియమం ఆత్మత్యాగం. అదే మెస్సీయా రాజ్య నియమం. ఇది ఇశ్రాయేలు నేతల సిద్ధాంతాలకు నిరీక్షణలకు చుక్కెదురని యోహనుకి బాగా తెలుసు. క్రీస్తు దేవత్వానికి తిరుగులేని నిదర్శనంగా తనకు కనిపించింది వారికి నిదర్శనం కానేకాదు. వారు ఎదురుచూస్తోన్న మెస్సీయా దేవుడు వాగ్దానం చేయని మెస్సీయా. రక్షకుడు తన పరిచర్య ద్వారా సాధించబోయేది వారి ద్వేషం ఖండన మాత్రమే అని యోహనుకు తోచింది. అగ్రగామి అయిన అతడు క్రీస్తు ఓ బొట్టు కూడా మిగల్చకుండా తాగనున్న శ్రమలు హింసపాత్రలోని పానీయాన్ని తాగుతున్నాడు.DATel 224.3

    “నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని రక్షకుడన్న మాటలు యోహానుకి సున్నితమైన మందలింపు. ఆ మందలింపు నిరర్ధకం కాలేదు. క్రీస్తు కర్తవ్య స్వభావాన్ని ఇప్పుడు అవగతం చేసుకుని జీవించడమో మరణించడమో తాను ఎంతగానో ప్రేమించిన పరిచర్యకు అది దోహదపడితే - దేనికైనా తన్నుతాను దేవునికి అప్పగించుకున్నాడు.DATel 225.1

    యోహాను పరిచర్యను విమర్శించి దానిపై తీర్పు చెప్పడానికి నిలిచి ఉన్న రబ్బీలు యోర్దాను తీరం వెంబడి ఎత్తుగా ఎదిగి ప్రతీ గాలి ముందు వంగిపోయే రెల్లుకి దీటైన ప్రతినిధులు, ప్రజాభిప్రాయం గాలికి వారు ఇటూ అటూ ఒంగిపోయేవారు. వారు దీనమనస్కులై యోహాను వర్తమానాన్ని స్వీకరించలేదు. అయినా ప్రజల ఆగ్రహానికి జడిసి అతడి పరిచర్యను బాహటంగా వ్యతిరేకించలేదు. కాని దైవ సేవకుడైన యోహాను స్వభావం అలాంటి పిరికి స్వభావం కాదు. క్రీస్తు చూట్టూ మూగిన జనసమూహాలు యోహను చేసిన సేవకు సాక్షులు. అతడు పాపాన్ని నిర్భయంగా మందలించడం వారు విన్నారు. స్వనీతిపరులైన పరిసయ్యులతో యాజక సద్దూకయ్యులతో హేరోదు రాజు అతని ఆస్థానికులతో ప్రధానులు సైనికులతో సుంకరులు కర్షకులతో యోహాను స్పష్టంగా మాట్లాడాడు. మనుషుల పొగడ్తలు విమర్శల గాలులకు అతడు అటూ ఇటూ వంగే రెల్లు కాదు. అరణ్యంలో దైవ వర్తమానం ప్రకటించినప్పుడు దేవుని పట్ల ఎంత నమ్మకంగాను నీతివిషయంలో ఎంత ఉద్రేకంగాను ఉన్నాడో నియమాల విషయంలో బండవలె దృఢంగా నిలిచాడు.DATel 225.2

    యేసు ఇంకా ఇలా అన్నాడు. “మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజ గృహములో ఉందురు. “తన కాలంలో పాపాల్ని అన్యాయాల్ని మందలించడానికి యోహాను పిలుపుపొందాడు. కనుక అతడి సామాన్య వస్త్రధారణ, ఆత్మ ఉపేక్షతో కూడిన జీవనం అతని కర్తవ్య స్వభావానికి అనుగుణంగా ఉన్నాయి. విలువైన వస్త్రాలు ఈ జీవితానికి సంబంధించిన విలాసాలు దైవసేవకులకు కావు. అవి “రాజగృహములలో” నివసించే లోకపరిపాలకులకు. అధికారం దాని వైబోగం వారికే చెందుతాయి. యోహాను వస్త్రాలకు యాజకులు ప్రధానులు ధరించిన వస్త్రాలకు మధ్యగల భేదానికి యేసు ప్రజల గమనాన్ని తిప్పుతోన్నాడు. ఈ అధికారులు విలువైన వస్త్రాలు ప్రశస్తమైన ఆభరణాలు ధరించారు. తమ తళుకు బెళుకులతో ప్రజల్ని ఆకర్షించి వారి అభిమానాన్ని పొందాలని చూశారు. చిత్తశుద్ధి ద్వారా దేవుని ప్రసన్నతను పొందేకన్నా మనుషుల మెప్పును అభిమానాన్ని సంపాదించడానికి వారు ఎక్కువ ఆత్రుతగా ఉన్నారు. దేవునిపట్ల తమకు భక్తి విశ్వాసాలు లేవని ఈలోక రాజ్యం పైనే తమకు శ్రద్ధాసక్తులు మెండని ఇలా వారు బయలుపర్చుకున్నారు.DATel 225.3

    “అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తవా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. - ఇదిగో నేను నాదూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని యెవని గూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను” అని యేసు అన్నాడు. యోహాను జననానికి ముందు జెకర్యాకు చేసిన ప్రకటనలో దూత ఇలా అన్నాడు, “అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు” అవుతాడు. లూకా 1:15. దేవుని దృష్టిలో గొప్పతనంగా పరిగణన పొందేది ఏంటి? లోకం గొప్ప అని పరిగణించేది కాదు. భాగ్యం లేక హోదా కాదు లేక ఉదాత్త కుటుంబంలో పుట్టడం కాదు లేక ప్రతిభ పాటవాలు కాదు... వీటినే పరిగణనలోకి తీసుకుంటే ఏదో ఉన్నతాంశం పరిగణన లేకుండా ప్రతిభ ఒక్కటే గౌరవ పాత్రమైతే ఎవరి మేధాశక్తికి ఏ మానవుడు ఎన్నడూ సాటిరాడో ఆ సాతానుని మనం గౌరవించాల్సిందే. అయితే దాన్ని వక్రీకరించి స్వార్ధప్రయోజనానికి వాడుకుంటే ఆ ప్రతిభ ఎంత గొప్పదైతే అది అంత గొప్ప శాపంగా పరిణమిస్తుంది. నైతిక యోగ్యతకు మాత్రమే దేవుడు విలువనిస్తాడు. ప్రేమ పవిత్రతల్ని ప్రశస్తమైన లక్షణాలుగా ఆయన పరిగణిస్తాడు. సహెడ్రిన్ నుంచి వచ్చిన దూతల ముందు, ప్రజలు ముందు, తన శిష్యుల ముందు తానే గౌరవం పొందడానికి ప్రయత్నించకుండా వెనక్కి తప్పుకుని, యేసును వాగ్దాత్త విమోచకుడుగా అందరికి చూపించినప్పుడు యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. క్రీస్తు చేస్తున్న పరిచర్య విషయంలో యోహాను పొందిన నిస్వార్థమైన ఆనందం, మానవుడిలో వెల్లడైన అత్యున్నత శ్రేణి సౌమ్యతను మనముందుంచుతోంది. యోహాను యేసుని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని విన్నవారు అతణ్ని గూర్చి అతని మరణానంతరం ఇలా సాక్ష్యమిచ్చారు, “యోహాను ఏ సూచకక్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియి సత్యమైనవి” యోహాను 10:41. ఏలీయామల్లే ఆకాశం నుంచి అగ్ని రప్పించడం లేక మరణించిన వారిని లేపడం లేక మోషేమల్లే దేవుని నామంలో కర్రను శక్తి సాధనంగా ఉపయోగించడం యోహానుకి నియమితం కాలేదు. రక్షకుని రాకను ప్రచురపర్చడానికి ఆయన రాకకు ప్రజల్ని సన్నద్ధం చెయ్యడానికి అతణ్ని పంపడం జరిగింది. అతడు తన కర్తవ్యాన్ని ఎంత నమ్మకంగా నెరవేర్చాడంటే యేసుని గూర్చి తమకు అతడు ఏమి నేర్పాడో ప్రజలు గుర్తు చేసుకున్నప్పుడు వారు ఇలా చెప్పగలిగారు “ఈ యౌవనుని గూర్చి యోహను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవి.” అలాంటి సాక్ష్యం క్రీస్తును గూర్చి ప్రతీ శిష్యుడు ఇవ్వాలి.DATel 226.1

    మెస్సీయా దూతగా యోహాను “ప్రవక్త కన్నా అధికుడు.” ఎందుకంటే ప్రవక్తలు క్రీస్తు రాకను దూరం నుంచి చూడగా ఆయన్ని వీక్షించి మెస్సీయా ఆయనే అంటూ పరలోకం నుంచి వచ్చిన సాక్ష్యం విని ఆయన్ని దైవకుమారునిగా ఇశ్రాయేలుకు సమర్పించే భాగ్యం అతనికే కలిగింది. అయినా “దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతని కంటే గొప్పవాడు” అని యేసు అన్నాడు.DATel 227.1

    ప్రవక్త అయిన యోహాను రెండు శాసనాల్ని లేక విధుల్ని అనుసంధానపర్చే మెలికి లేక లింకు. దేవుని ప్రతినిధిగా క్రైస్తవమతంతో ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ఉన్న సంబంధాన్ని చూపించడానికి అతడున్నాడు. అతడు అంతంత మాత్రపు వెలుగు. దాని వెనుక ప్రకాశవంతమైన వెలుగు రానున్నది. యెహాను మనసును పరిశుద్ధాత్మ వెలుగుతో నింపి ప్రకాశవంతం చేశాడు. ప్రజలకు అతడు వెలుగు చూపించాల్సి ఉన్నాడు. అయితే ఏ వెలుగూ -గతంలో ప్రకాశించింది గాని ముందు ప్రకాశించినంత గాని -యేసు బోధనల నుంచి ఆదర్శం నుంచి పాపమానవులపై ప్రకాశించన్నంత స్పష్టంగా ప్రకాశించలేదు, ప్రకాశించబోదు. ఛాయారూపక బలులు సూచించినట్లు క్రీస్తును గూర్చిన, ఆయన కర్తవ్యాన్ని గూర్చిన అవగాహన అంతంత మాత్రంగానే ఉండేది. రక్షకుని ద్వారా భవిష్యత్తులో నిత్య జీవముందని యోహానుకు కూడా పూర్తి అవగాహన లేదు.DATel 227.2

    తన కర్తవ్య సాధన కృషిలో పొందిన ఆనందం మినహా యోహాను జీవితమంతా దుఃఖంతో నిండింది. అతని స్వరం అరణ్యంలో తప్ప తక్కినచోట్ల వినిపించడం అరుదు. అతడిది ఒంటరి జీవితం. తన కృషి ఫలితాన్ని చూసే తరుణం అతడికి లేదు. క్రీస్తుతో ఉండే అవకాశం, అధిక వెలుగైన క్రీస్తు శక్తి ప్రదర్శనను తిలకించే ప్రత్యేకావకాశం అతడికి లేదు. గుడ్డివారు దృష్టిని పొందడం రోగులు స్వస్తత పొందడం. మృతులు లేపబడడం చూసే ఆధిక్యత అతడికి లేదు. ప్రవచనంలోని వాగ్దానాలపై మహిమ విరజిమ్ముతూ క్రీస్తు మహత్కార్యాల్ని చూసిన, ఆయన మాటలువిన్న మిక్కిలి అల్పుడైన శిష్యుడు ఈ విషయంలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటె ఎక్కువ ఆధిక్యత కలవాడని ఆ కారణంగా మరింత గొప్పవాడని చెప్పవచ్చు.DATel 228.1

    యోహాను బోధ విన్న విస్తారమైన జనసమూహాల ద్వారా అతడి ఖ్యాతి దేశమంతా వ్యాపించింది. అతడి చెర పర్యవసానం గురించి అంతటా ఆసక్తి రేకెత్తింది. ఏమైనా అతడి నిందారహిత జీవితం అతడికి అనుకూలమైన బలీయమైన ప్రజాభిప్రాయం దృష్ట్యా అతడికి ఏ అఘాయిత్యమూ జరుగదన్న నమ్మకం ఏర్పడింది.DATel 228.2

    యోహాను దేవుని ప్రవక్త అని హేరోదు నమ్మాడు. చెరనుంచి విడుదల చెయ్యాలని కూడా భావించాడు. కాని హేరోదియకు జడిసి విడుదలలో జాప్యం చేశాడు.DATel 228.3

    ప్రత్యక్ష చర్యల ద్వారా యోహను మరణానికి హేరోదు అనుమతి పొందలేనని హేరోదియ గ్రహించి ఆ కార్యాన్ని కపటోపాయం ద్వారా సాధించాలని నిర్ధారించుకుంది. రాజు పుట్టిన రోజున దేశాధికారులకు ఆస్థాన ప్రధానులకు వినోద కార్యక్రమం ఏర్పాటయ్యింది. అందులో తినడం తాగడం కూడా ఏర్పాటయ్యింది. హేరోదును ఇలా మత్తులో ముంచి అతణ్ని తనకు అనుకూలంగా ప్రభావితం చెయ్యడం ‘హేరోదియ ఎత్తుగడ.DATel 228.4

    ఆ రోజు వచ్చినప్పుడు రాజు తన ప్రధానులతో కలసి తింటూ తాగుతూ ఉన్నాడు. అతిథుల వినోదార్ధం నృత్యం చెయ్యడానికి హేరోదియ తన కుమార్తెను విందుశాలలోకి పంపింది. సలో మే నవయౌవనంతో మిలమిలలాడుతున్న యువతి.. ఆమె అపురూప సౌందర్యం ప్రధానులను అధికారులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ వేడుకలు ఉత్సవాల్లో అంతః పురకాంతలు కనిపించడం ఆచారం కాదు. అతిథుల వినోదార్ధం ఈ ఇశ్రాయేలు యాజకులు ప్రధానుల ఆడపడుచు చేసిన నృత్యానికి హేరోదును ప్రశంసించారు.DATel 229.1

    రాజు మద్యంతో మత్తిల్లాడు. ఉద్రేకం ఉరకలు వేస్తోంది. విచక్షణ హద్దులు రద్దయ్యాయి. విందు వినోదాలు జరుగుతున్న శాల, వినోదాల్లో తేలిఆడుతున్న అతిధులు, విందుబల్ల, తళతళ మెరుస్తోన్నా మద్యం, కళ్లు మిరిమిట్లు గొలిపే దీపాలు, తనముందు నృత్యం చేస్తున్న యువతి మాత్రమే రాజు కంటి ముందున్న దృశ్యం. విచక్షణ రహితమైన ఆగడియలో తన రాజ్యంలోని అ ప్రముఖుల ముందు తనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చే ఏదో ప్రదర్శన చెయ్యాలని రాజు ఉద్దేశించాడు. హేరోదియ కుమార్తె ఏది అడిగినా తన రాజ్యలో సగం మట్టుకు ఇస్తానని ఒట్టు పెట్టి వాగ్దానం చేశాడు.DATel 229.2

    ఏంచెయ్యాలో తెలుసుకోడానికి సలోమే హుటాహుటీని తల్లి వద్దకు వెళ్లింది. జవాబు సిద్ధంగా ఉంది. -స్నానికుడైన యోహాను శిరసు. తల్లి గుండెల్లో మండుతున్న ప్రతీకార దాహం సలోమేకి తెలియలేదు. ఆ మనవిని రాజు ముందు పెట్టడానికి వెనకాడింది. చివరికి హేరోదియ తీర్మానమే నిలిచింది. ఆ యువతి ఈ భయంకర వినతితో రాజు వద్దకు తిరిగి వెళ్లింది. “బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పించగోరు చున్నాను.” (మార్కు 6:25) అన్నది.DATel 229.3

    హేరోదు దిగ్ర్భాంతి చెందాడు. తికమకపడ్డాడు. సందడంతా ఆగిపోయింది. తాగితుళ్లే దృశ్యం మారింది. భయంకర నిశ్శబ్దం రాజ్యమేలింది. యోహాను ప్రాణం తియ్యడనున్న తలంపు రాజుకు వణకు పుట్టించింది. అయినా తాను మాట ఇచ్చాడు. చపలచిత్తుడు దుందుడుకు మనిషిగా కనిపించడం అతడికి ఇష్టం లేదు. ఆ వాగ్దానం తన అతిథుల గౌరవార్ధం చేశాడు. వారిలో ఒక్కరైన ఆ వాగ్దాన నెరవేర్పును వ్యతిరేకించి ఉంటే రాజు ప్రవక్తను చంపకపోయేవాడు. ఖైదీ పక్షంగా నూట్లాడడానికి వారికి తరుణం ఇచ్చాడు. యోహను బోధ వినడానికి వారు దూరప్రాంతాల నుంచి వచ్చారు. యోహాను నేరస్తుడు కాదని దేవుని సేవకుడని వారికి తెలుసు. ఆ యువతి కోరికవిని విభ్రాంతి చెందినప్పటికీ తాగిన మైకంలో వారు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. దైవసేవకుడి ప్రాణం కాపాడడానికి ఎవరూ ఒక్కమాట కూడా పలకలేదు. ఈ వ్యక్తులు ఆ దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. గొప్ప బాధ్యతలు గలవారు అయినా తమ మానసిక శక్తులు స్తబ్దమయ్యేంతవరకూ తినడం తాగడంలో మునిగిపోయారు. మత్తుగొలిపే సంగీతంలో వారి తలలు దిమ్మెత్తాయి. మనస్సాక్షి అచేతనమయ్యింది. ఒక క్షుద్ర స్త్రీ పగ చల్లార్చడానికి వారందరూ తమ మౌనం ద్వారా దేవుని ప్రవక్తపై మరణతీర్పు వెలువరించారు.DATel 229.4

    తాను చేసిన ప్రమాణం అమలు నుంచి తప్పించుకోడానికి హేరోదు చాలా సేపు కనిపెట్టాడు. కాని ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ప్రవక్త శిరచ్ఛేదనానికి ఉత్తరువిచ్చాడు. కాసేపటి లో యోహను శిరసు రాజు అతడి అతిథుల సమక్షంలోనికి తెచ్చారు. తన పాపజీవితం నుంచి మరలమని హేరోదుకు నమ్మకంగా హెచ్చరిక చేసిన ఆ పెదవులు నిరంతరం మూతపడ్డాయి. మారుమనసు పొందాల్సిందిగా మనుషులకు పిలుపునిచ్చిన ఆ స్వరం ఇక ఎన్నడూ వినిపించలేదు. ఒక్క రాత్రి విందు వినోదాలు ఒక ఉత్తమ ప్రవక్త ప్రాణాలు బలిగొన్నాయి.DATel 230.1

    న్యాయాన్ని పరిరక్షించాల్సిన వారు మితిమీరి తిని తాగినందువల్ల అమాయకుల జీవితాలు బలికావడం ఎంత తరుచుగా జరగడం లేదు! మత్తు పానీయాన్ని ఎవడు తన పెదవుల వద్దకు రానిస్తాడో అతడు దాని ప్రభావం కింద చోటుచేసుకునే అన్యాయానికి అక్రమానికి బాధ్యుడవుతాడు. తన ఇంద్రియాల్ని మొద్దుబార్చుకోడం ద్వారా సవ్యంగా ఆలోచించే శక్తిని కోల్పోతాడు. తప్పొప్పుల్ని గుర్తించలేడు. అమాయకుల్ని హింసించి నాశనం చెయ్యడానికి తన ద్వారా పనిచెయ్యడానికి సాతానుకి మార్గం సుగమం చేస్తాడు. “ద్రాక్షరసము వెక్కిరింతలపాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరు జ్ఞానము లేనివారు” సామెతలు 20:1. ఈ రకంగా “న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది... చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు” యెషయా 59:14, 15. తోటి మానవుల జీవితాలపై అధికారం గలవారు మద్యానికి బానిసలైనప్పుడు వారిని నేరస్తులుగా పరిగణించాలి. చట్టాలు అమలుపర్చేవారు చట్టవిధేయులు కావాలి. వారు ఆత్మనిగ్రహం కలిగి నివసించాలి. బుద్ధిబలం న్యాయదృష్టి కలిగి ఉండేందుకుగాను వారికి తమ భౌతిక మానసిక నైతిక శక్తులపై సంపూర్ణమైన అధికారం అవసరం.DATel 230.2

    యోహను తల హేరోదియ వద్దకు తీసుకువెళ్లారు. ఆమె దాన్ని పైశాచిక తృప్తితో అందుకుంది. పగతీర్చుకోడంలో ఎంతో ఆనందాన్ని పొందింది. హేరోదు మనస్సాక్షి అతణ్ని ఇక బాధించదని ఊహించుకుని తృప్తిపడింది. అయితే ఆ పాపం ఆమెకు సంతోషాన్నివ్యలేదు. ఆమెకు అపఖ్యాతి ద్వేషం మాత్రమే మిగిల్చింది. హేరోదయితే ప్రవక్త హెచ్చరికల మూలంగా కన్నా పశ్చాత్తాపం మూలంగా ఎక్కువ క్షోభను ఆందోళనను అనుభవించాడు. యోహాను బోధనల ప్రభావాన్ని అంతం చేయ్యలేకపోయారు. అది చాపకింద నీరులా ప్రతీ తరానికి విస్తరిస్తూ కాలం తుది గడియవరకు కొనసాగుతుంది.DATel 231.1

    హేరోదు పాపం నిత్యం అతడి ముందు నిలిచింది. చేసిన నేరానికి నిందిస్తోన్న మనస్సాక్షి నుంచి శాంత్వన పొందడానికి అతడు సర్వదా ప్రయత్నించాడు. యోహాను పై అతడి నమ్మకం అచంచలమైంది. ఆత్మత్యాగంతో విలసిల్లిన అతడి జీవితాన్ని, యధార్ధమైన అతడి విజ్ఞాపనల్ని, జ్ఞానంతో నిండిన అతడి హితవును జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత అతడు ఎలా మరణించడం జరిగిందో గుర్తు చేసుకున్నప్పుడు, మనుషుల మన్ననల్ని ప్రశంసల్ని అందుకున్నప్పుడు ఉత్సాహంగా హుందాగా ఉన్నట్లు కనిపించినా వాటి వెనక ఆందోళనతో నిండిన హృదయం దాగి ఉండేది. తన మిద శాపం ఉన్నదన్న భయం నిత్యం అతన్ని వేధించేది.DATel 231.2

    దేవునికి కనిపించకుండా ఏదీ దాచడం సాధ్యం కాదన్న యోహాను మాటలు హేరోదు మనసులో నాటుకుపోయాయి. దేవుని సముఖం అన్నిచోట్లా ఉంటుందని విందుశాలలో చోటుచేసుకున్న ధూర్త వినోదాల్ని ఆయన చూశాడని యోహాను శిరచ్ఛేదనానికి తానిచ్చిన ఆజ్ఞ విన్నాడని హేరోదియ ఆనందంతో తుళ్లిపడడం ఆమెను మందలించిన యోహాను శిరసును ఆమె కించపరచడం ఆయన వీక్షించాడని హేరోదు గట్టిగా నమ్మాడు. ప్రవక్త నోటినుంచి హేరోదు విన్న అనేక విషయాలు ఇప్పుడు అతడి మనస్సాక్షితో మాట్లాడి వాటిని అరణ్యంలోని బోధకన్నా మరింత స్పష్టంగా సుబోధకం చేశాయి.DATel 231.3

    హేరోదు యేసు చేస్తున్న కార్యాల్ని గురించి విన్నప్పుడు తీవ్ర ఆందోళకు గురి అయ్యాడు. యోహనుని దేవుడు మృతుల్లోనుంచి లేపి పాపాన్ని ఖండించడానికి మరింత శక్తినిచ్చి పంపాడని తలంచాడు. యోహాను తన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడని తనపై తనగృహంపై తీర్పు విధిస్తాడని అతడు నిత్యం భయపడూ ఉండేవాడు.DATel 232.1

    పాపమార్గం అవలంబించడం వల్ల కలుగుతుందని దేవుడు హెచ్చరించిన ఫలాన్ని హేరోదు అనుభవిస్తోన్నాడు. “హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగియుండును. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను నీ కన్ను చూచువాటి చేతను ఉదయమున - అయ్యోయెప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమున - అయ్యోయెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.” ద్వితి 28: 65-67. పాపి ఆలోచనలే అతడిపై నేరారోపకులు. అపరాధి మనసాక్షి కలిగించే బాధ హింస బాధకన్నా తీవ్రమైనది. అది అతడికి పగలు రాత్రి విశ్రాంతి లేకుండా చేస్తుంది.DATel 232.2

    బాప్తిస్మమిచ్చే యోహాను మరణం అనేకులకు అంతుచిక్కని మర్మంగా మిగిలింది. అతడు ఎందుకు చెరసాలలో మగ్గి మరణించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తోన్నారు. విషాదభరితమైన దైవ సంకల్పం తాలూకు మర్మాన్ని మానవులమైన మనం ఛేదించలేం. కాని యోహను క్రీస్తు శ్రమల్లో పాలుపంచుకుంటున్నాడన్న విషయం గుర్తుంచుకున్నప్పుడు దేవుని పై మనకున్న విశ్వాసాన్ని ఈ ఘటన సడలించలేదు. క్రీస్తును వెంబడించే వారందరు త్యాగమనే కిరీటాన్ని ధరిస్తారు. స్వార్ధపరులు వారిని అపార్ధం చేసుకుంటారు. వారు సాతాను భీకరదాడికి గురి అవుతారు. ఈ ఆత్మ త్యాగ సూత్రాన్ని రూపుమాపడానికే అతడి రాజ్యం స్థాపితమయ్యింది. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ దానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాడు.DATel 232.3

    బాల్యం, కౌమార్యం, యౌవనంలో దృఢత్వం నైతిక బలం ప్రదర్శించాడు. “ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి” (మత్త 3:3) అంటూ అరణ్యంలో అతని స్వరం వినిపించినప్పుడు తన రాజ్యం ఏమైపోతుందోనని సాతాను భయపడ్డాడు. పాపం తాలూకు పాపత్వం వెల్లడైన తీరును బట్టి మనుషులు భయపడ్డారు. తన అదుపు కింద ఉన్న అనేకులపై సాతాను ప్రాబల్యం అంతమొందింది. యోహాను తన్నుతాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకోకుండా అతణ్ని పెడదారి పట్టించడానికి అతడు అవిశ్రాంతంగా కృషి చేశాడు. కాని అతడి కృషి ఫలించలేదు. యేసుని పడగొట్టడంలో కూడా విఫలుడయ్యాడు. అరణ్యంలో క్రీస్తును శోధించడం విషయంలోనూ పరాజయం పాలయ్యాడు. అతడు ఉగ్రుడయ్యాడు. ఇప్పుడు యోహాను పై వేటు వెయ్యడం ద్వారా క్రీస్తును దుః ఖంలో ముంచాలని తీర్మానించుకున్నాడు. పాపం చెయ్యడానికి శోధించలేకపోయిన అతణ్ని కష్టాలు శ్రమల పాలుచేశాడు.DATel 233.1

    తన సేవకుణ్ని విడిపించడానికి యేసు కలుగజేసుకోలేదు. యోహాను ఆ పరీక్షకు నిలువగలడని ఆయనకు తెలుసు. యేసు యోహానున్న చీకటి కొట్టుకువచ్చి తన సన్నిధి కాంతితో ఆచీకటిని ఆనందంగా పారదోలేవాడు. కాని ఆయన తన శత్రువులికి చిక్కి తన కర్తవ్యానికి విఘాతం కలిగించకూడదు. ఆయన తన సేవకుణ్ని సంతోషంగా విడిపించేవాడే. అయినా అనంతర సంవత్సరాల్లో చెరసాల నుంచి మరణానికి వెళ్లవలసి ఉన్న వేల మంది నిమిత్తం యోహాను హతసాక్షి పాత్రలోని పానాన్ని తాగాల్సి ఉంది. యేసు అనుచరులు ఖైదుల్లో ఒంటరిగా కృషించాలి గనుక లేక ఖడ్గానికి చిత్రహింసాయంత్రానికి లేక సజీవ దహనానికి - దేవుడు, మనుషులు విసర్జించినట్లు కనిపిస్తుండగా-యోహాను కూడా అలాంటి శ్రమలనే అనుభవించాడన్న ఆలోచన వారికి ఎంత గొప్ప ఆదరణ నిస్తుంది! యోహాను భక్తి తత్పరత విశ్వసనీయతల్ని గురించి స్వయంగా క్రీస్తే సాక్ష్యమిచ్చాడు.DATel 233.2

    దైవ సేవకుడి లోకసంబంధమైన జీవితం నిడివిని సాతాను తగ్గించగలిగాడు. కాని “క్రీస్తుతో కూడ దేవుని యందు దాచబడియున్న” (కొలొస్స3:3) ఆ జీవాన్ని వినాశకుడు చేరలేకపోయాడు. క్రీస్తుకి దుఃఖం కలిగించగలిగానని అతడు సంతోషించాడు. కాని యోహాన్ని జయించడం అతడికి సాధ్యపడలేదు. మరణమే అతణ్ని శోధన శక్తికి అతీతంగా ఉంచింది. ఈ పోరాటంలో సాతాను తన ప్రవర్తన ఎలాంటిదో బయలుపర్చుకున్నాడు. పరిశీలిస్తున్న విశ్వం ముందు అతడు దేవునిపట్ల మానవుడిపట్ల తన శత్రుత్వాన్ని ప్రదర్శించుకున్నాడు.DATel 234.1

    దేవుడు అద్భుతంచేసి యోహానుని విడిపించకపోయినా అతణ్ని విడిచిపెట్టలేదు. అతడికి దేవదూతల సాహచర్యం సర్వదా ఉండేది. ఆ దూతలు అతడికి క్రీస్తును గూర్చిన ప్రవచనాల్ని ప్రశస్తమైన లేఖన వాగ్దానాల్ని వివరించేవారు. ఇవే అతడికి ఆదరణనిచ్చాయి. ఇవే రానున్న యుగాల్లో దేవుని ప్రజలకు ఆదరణనివ్వాల్సి ఉంది. బాప్తిస్మమిచ్చే యోహానుకి, అతని తర్వాత వచ్చిన వారికి దేవుడు ఈ నిశ్చయతను ఇచ్చాడు, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము నాతో కూడా ఉన్నాను” మత్తయి 28:20. దేవుని బిడ్డలు ఆది నుంచి అంతం వరకూ చూడగలిగి ఆయనతో జతపనివారుగా తాము నెరవేర్చుతున్న దైవసంకల్పం తాలూకు మహిమను చూడగలిగితే, తాము ఎంచుకున్నట్లే తప్ప వేరేగా వారిని ఆయన నడిపించడు. సజీవంగా పరలోకానికి కొనిపోబడ్డ హనోకుగాని అగ్ని రథంలో ఆరోహణమైన ఏలీయాగాని చీకటి కొట్టులో ఏకాకిగా మరణించిన బాప్తిస్మమిచ్చే యోహానుకన్నా గొప్పవారు కారు. ఎక్కువ మన్నన పొందినవారూ కారు. “క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయనపక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడెను.” ఫిలిప్పి 1:29; మనుషులకు దేవుని వరాలన్నిటిలోను మిక్కిలి విలువైంది మిక్కిలి గౌరవప్రదమైంది క్రీస్తు శ్రమల్లో ఆయనతో సహవాసం.DATel 234.2