Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    65—మళ్లీ శుద్ది చేసిన ఆలయం

    తన పరిచర్య ఆరంభంలో ఆలయాన్ని క్రయ విక్రయాలతో అపవిత్ర పర్చుతున్న వారిని యేసు తరిమివేశాడు. కఠినమైన దైవం లాంటి ఆయన వర్తన జిత్తులమారి వ్యాపారుల గుండెల్లో కంపరం పుటించింది. తన సేవ చరమ దశలో ఆయన మళ్లీ దేవాలయానికి వచ్చి క్రింతంలోలాగే అది ఇంకా అపవిత్రతకు గురి అవుతూనే ఉన్నట్లు గమనించాడు. పరిస్థితులు క్రితంలో కంటే మరింత దిగజారాయి. ఆలయ ఆవరణం ఒక పెద్ద పశువులశాలలా ఉంది. జంతువుల అరుపులు, నాణేల మోతతో వ్యాపారుల వాదోఏపవాదాల రొద మిళితమై వినిపిస్తోంది. పరిశుద్ధ హోదాలో ఉన్నవారి స్వరాలు అందులో వినిపించాయి. ఆలయ ఉన్నతోధికారులే క్రయ విక్రయాలు, ద్రవ్యమారకం చేస్తున్నారు. వారు లాభాపేక్ష అదుపులో ఎంతగా ఉన్నారంటే దేవుని దృష్టికి వారు దొంగలకన్నా అధ్వానంగా ఉన్నారు.DATel 654.1

    తాము నిర్వహించాల్సిన కార్యం గంభీరతను యాజకులు నాయకులు గ్రహించలేదు. ప్రతీ పస్కాపండుగలోను పర్ణశాలల పండుగలోను వేలాది జంతువుల్ని వధించేవారు. యాజకులు, వాటి రక్తాన్ని పట్టి బలిపీఠం మీద పోసేవారు. రక్తం అర్పించడం యూదులికి బాగా తెలుసు. కాని పాపం వల్లనే జంతువుల రక్తం చిందించడం అవసరమయ్యిందన్న విషయాన్ని దాదాపు మర్చిపోయారు. అది దేవుని ప్రియకుమారుడి రక్తానికి ముంగుర్తు అని, అది మానవాళి జీవించే నిమిత్తం చిందించవలసి ఉందని, అర్పణలు బలులద్వారా మనుషులు తమ దృష్టి సిలువ పొందనున్న విమోచకుని మీద నిలపాల్సి ఉందని వారు గుర్తించలేదు.DATel 654.2

    బలికి ఏర్పాటైన అమాయక జంతువుల్ని యేసు చూశాడు. యూదులు ఆ గొప్ప సమావేశాల్ని రక్తపాతం క్రూరత్వంతో నిండిన సన్నివేశాలుగా ఎలా మార్చారో చూశాడు. పాపం నిమిత్తం సామాన్య పశ్చాత్తాపం స్థానంలో హృదయంలేని సేవను దేవుడు గౌరవిస్తాడన్నట్లు - జంతు బలుల్ని పెంచారు. యాజకులు అధికారులు స్వార్థం వల్ల దురాశ వల్ల తమ హృదయాల్ని కఠినపర్చుకున్నారు. దేవుని గొర్రెపిల్లను సూచించే చిహ్నాలనే సొమ్ము చేసుకునే సాధనాలుగా మార్చారు. బలి అర్పణ సేవ ప్రజల దృష్టిలో ఈ రకంగా తన పవిత్రతను చాలామట్టుకి కోల్పోయింది. క్రీస్తుకి కోపం వచ్చింది. లోక పాపానికి ప్రాయశ్చిత్తంగా త్వరలో తాను చిందించనున్న రక్తాన్ని యాజకులు పెద్దలు తాము రోజు రోజుకి అధికంగా చిందిస్తోన్న జంతువుల రక్తంకన్నా ఎక్కువ అభినందించరని ఆయన ఎరుగును.DATel 655.1

    ఈ ఆచారాల్ని ఖండిస్తూ క్రీస్తు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. సమూయేలు ప్రవక్త ఇలా అన్నాడు, “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుటవలన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్ఠము.” ప్రవచనిక దర్శనంలో యూదుల భ్రష్టతను చూసి వారిని సొదొమ గొమొట్టా అధికారులుగా సంబోధిస్తున్నాడు, “సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొట్టా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సేవలిచ్చిన మాట ఇదే -విస్తారమైన నిూ బలులు నాకేల? దహన బలులగు పొట్టేళ్లును బాగుగా వేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్కమందైనను గొట్టె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు. నా సన్నిధిని కనబడవలెనని వారు వచ్చుచున్నారే నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ” “మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి, నా దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడువారిని విడిపించుడి. తండ్రిలేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి” 1 సమూ. 15:22, యెష. 1::10-12, 16, 17.DATel 655.2

    ఈ ప్రవచనాల్ని ఇచ్చిన ప్రభువు ఇప్పుడు చివరిసారిగా ఆ హెచ్చరిక పునరుద్ఘాటించాడు. ప్రవచనం నెరవేర్చుననుసరించి ప్రజలు యేసుని ఇశ్రాయేలు రాజుగా ప్రకటించారు. ఆయన వారి నివాళులందుకుని రాజు హోదాను స్వీకరించాడు. ఈ హోదాలో ఆయన కార్యాచరణకు పూనుకోవాలి. భ్రష్టుపట్టిన యాజకత్వాన్ని సంస్కరించడానికి తన కృషి ఫలించదని ఆయకు విదితమే. అయినా ఆయన కార్యం నెరవేరాలి. ఆయన పరిచర్య దైవ సంబంధ మైందని విశ్వంచని ప్రజలు తెలుసుకునేందుకు అది నిదర్శనాన్నివ్వాలి.DATel 656.1

    గుచ్చుకుపోయే యేసు చూపు మళ్లీ అపవిత్ర వ్యాపారం సాగుతున్న దేవాలయ ఆవరణంపైకి వెళ్లింది. అందరి కళ్లూ ఆయన మీదే ఉన్నాయి. యాజకుడు, అధికారి పరిసయ్యడు అన్యుడు పరలోకరాజు ఠీవితో తమ ముందు నిలబడి ఉన్న ఆయన్ని దిగ్ర్భాంతితో భయంతో చూశారు. మానవ రూపంలో నుంచి దేవత్వం ప్రకాశించింది. ఆయన మును పెన్నడూ ప్రదర్శించని ఔన్నత్యం, మహిమ ఆయన్ని ఆవరించాయి. ఆయనకు అతి సమీపంగా ఉన్నవారు జనాన్ని నెట్టుకుంటూ వెనక్కి వెళ్లిపోయారు. కొంతమంది శిష్యులు మినహా రక్షకుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం భరించడం కష్టమనిపించింది. క్రీస్తు గొప్ప శక్తితో మాట్లాడాడు. ఆ శక్తి ప్రజల్ని గాలి వానలా కుదిపివేసింది. “నా మందిరము ప్రార్థన మందిరము అని పిలువబడియున్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి” ఆయన స్వరం ఆలయంలో నుంచి బూరధ్వనిలా వినిపించింది. ఆయన ముఖంలోని ఆగ్రహం దహించే అగ్నిలా కనిపించింది. “వీటిని ఇక్కడ నుండి తీసికొనిపోవుడి” అని అధికారంతో ఆజ్ఞాపించింది. (యోహా. 2:16)DATel 656.2

    మూడేళ్ల కిందట యేసు ఆజ్ఞమేరకు ఆలయ అధికారులు సిగ్గుతో పారిపోవాల్సి వచ్చింది. ఒంటరివాడైన ఒక్కమనిషికి తాము విధేయులవ్వడాన్ని ప్రశ్నించుకున్నారు. తమ అప్రతిష్ఠకరమైన లొంగుబాటు పునరావృత్తం కావడం అసాధ్యమని వారు భావించారు. అయినా వారు ఇప్పుడు క్రితంసారి కన్నా ఎక్కువ భయపడి అప్పటి కన్నా మరింత వేగంగా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. అయన అధికారాన్ని ప్రశ్నించడానికి ఎవరూ సాహసించలేదు. యాజకులు వ్యాపారులు పశువుల్ని తోలుకుంటూ ఆయన సముఖం నుంచి తమ పలాయనం చిత్తగించారు.DATel 656.3

    దేవాలయం నుంచి వెళ్లిపోతున్న వారిని రక్షకుని వద్దకు వ్యాధిగ్రస్తుల్ని తీసుకువస్తున్న పెద్ద ప్రజాసమూహం మార్గంలో కలిసింది. పారిపోతున్న నీరిచ్చిన సమాచారాన్ని బట్టి అందులో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. అంతశక్తి గల ఆయన్ని కలవడానికి వారు భయపడ్డారు. ఆయన చూపే యాజకుల్ని అధికారుల్ని ఆయన సముఖం నుంచి తరిమి వేసిందని ‘తెలుసుకున్నారు. కాని ఆ సమూహంలో ఎక్కువ మంది ఆయన వద్దకు వెళ్లాలన్న ఆశతో హడావుడిగా వెళ్లిపోతున్న జనాన్ని తప్పించుకుంటూ ముందుకి వెళ్లారు. ఆయనే వారి ఒకే ఒక ఆశ. ప్రజలు దేవాలయం నుంచి పారిపోయినప్పుడు చాలామంది అక్కడే ఉండిపోయారు. కొత్తగా వచ్చినవారు వీరిలో కలిసిపోయారు. దేవాలయ ఆవరణం మళ్లీ వ్యాధిగ్రస్తులతోను మరణిస్తున్న వారితోను నిండిపోయింది. యేసు మరోసారి వారికి పరిచర్య చేశాడు.DATel 657.1

    కొంత సేపు అయిన తర్వాత యాజకులు అధికారులు తిరిగి దేవాలయానికి వచ్చారు. వారి భయంపోయాక యేసు తర్వాత ఏంచేస్తాడన్న సమస్య వారిని ఆందోళన పర్చింది. ఆయన దావీదు సంహాసనాన్ని అధిష్టిస్తాడని భావించారు. చడీచప్పుడూ లేకుండా ఆలయంలోకి వచ్చి పురుషులు, స్త్రీలు, పిల్లలు దేవునికి స్తుతులు చెల్లించడం విన్నారు. ఆలయంలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైన దృశ్యం ముందు నిశ్చేష్టితులై చూస్తున్నారు. రోగులు బాగుపడడం చూశారు. గుడ్డివారు చూపు పొందడం, చెవిటివారు వినికిడి పొందడం, కుంటివారు ఆనందంతో గంతులు వెయ్యడం చూశారు. ఆనందించండంలో చిన్న పిల్లలు ముందున్నారు. యేసు వారి వ్యాధుల్ని స్వస్తపర్చాడు. వారిని తన కౌగిటిలోకి తీసుకని కృతజ్ఞతతో, ప్రేమానురాగాలతో నిండిన వారి ముద్దుల్ని స్వీకరించాడు. ఆయన ప్రజలికి బోధిస్తున్నప్పుడు చిన్న పిల్లలు కొందరు ఆయన రొమ్ముపై నిద్రపోయారు. ఇప్పుడు పిల్లలు ఉత్సాహ స్వరాలతో ఆయన్ని స్తుతించారు. ముందటి రోజు ప్రజలు చేసిన హోసన్న నినాదాల్ని మళ్లీ చేస్తూ రక్షకుని ముందు ఈతమట్టలు గొంజికొమ్మలు ఊపారు. “యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాద మొందునుగాక!” “నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడునై... నీ యొద్దకు వచ్చుచున్నాడు” కీర్త. 118:26, జెక. 9:9. “దావీదు కుమారునికి హోసన్నా” అంటూవారు వేస్తున్న కేకలతో దేవాలయం మారుమోగింది.DATel 657.2

    ఉల్లాసంగా స్వేచ్చగా ఉన్న ఈ చిన్నబిడ్డల స్వరాలు ఆలయ అధికారునికి అభ్యంతరంగా ఉన్నాయి. అలాంటి ప్రదర్శనల్ని ఆపుచెయ్యడానికి పూనుకున్నారు. దేవుని ఆలయాన్ని చిన్నపిల్లలు కాళ్లతో తొక్కి అందులో అల్లరిగా కేకలు వేసి అపవిత్ర పర్చుతున్నారని ప్రజలకి చెప్పారు. తమ మాటల్ని ప్రజలు పట్టించుకోడం లేదని గ్రహించి అధికారులు క్రీస్తుకి విజ్ఞప్తి చేశారు: “వీరు చెప్పుచున్నది వినుచున్నావా” అని ఆయనను అడిగిరి అందుకు యేసు- వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితిని అనుమాట మారెన్నడును చదువలేదా?” అని వారితో” చెప్పాడు. క్రీస్తు రాజుగా ప్రకటించబడాలని ప్రవచనం చెబుతోంది. ఆ మాట నెరవేరాలి. ఇశ్రాయేలు యాజకులు అధికారులు ఆయన మహిమను ప్రచురించడానికి నిరాకరించారు. అందుకు చిన్నపిల్లలు ఆయనకు సాక్షలుగా ఉండడానికి దేవుడు చిన్నపిల్లల హృదయాల్ని ప్రేరేపించాడు. చిన్న పిల్లలు మౌనం వహించి ఉంటే దేవాలయ స్తంభాలే రక్షకునికి స్తోత్రం పాడేవి.DATel 658.1

    పరిసయ్యులు తికమకపడ్డారు. ఇబ్బందిపడ్డారు కూడా. వారు బెదరించలేని ఆయన ఆదేశించే స్థితిలో ఉన్నాడు. యేసు దేవాలయ పరిరక్షకుడి హోదాలో ఉన్నాడు. కాని ఆపని ఇంత గంభీరమైన శక్తిమంతమైన రీతిలో చెయ్యలేదు. ఆయన అద్భుతకార్యాలు చూసిన ప్రజల సమక్షంలో యాజకులు అధికారులు ఆయనపట్ల ప్రతికూల్యం ప్రదర్శించడానికి సాహసించలేదు. ఆయన సమాధానాలకు ఉద్రిక్తులై గలిబిలి పడ్డప్పటికీ ఆ దినం ఇంకేమీ సాధించలేకపోయారు.DATel 658.2

    మరుసటి ఉదయం యేసు విషయంలో ఏ మార్గాన్ని అవలంబించాలన్న దాన్ని స హెడ్రిన్ పరిశీలించింది. మూడేళ్ల కిందట తాను మెస్సీయానని నిరూపించకోడానికి ఒక గుర్తు చూపించమని వారు డిమాండు చేశారు. అప్పటి నుంచి దేశమంతటా ఆయన అనేక అద్భుతకార్యాలు చేశాడు. వ్యాధి బాధితుల్ని స్వస్తపర్చాడు, అద్భుత రీతిగా వేలాదిమంది ప్రజలకి భోజనం పెట్టాడు, నీటి పై కెరటాల మిద నడిచాడు, కల్లోలిత సముద్రాన్ని మాటతో సద్దణిచాడు. తెరచిన పుస్తకాన్ని చదివినట్లు మనుషుల హృదయాల్ని ఎన్నోసార్లు చదివాడు. దయ్యాల్ని వెళ్లగొట్టాడు, మృతుల్ని లేపాడు. ఆయన మెస్సీయా అనడానికి తిరుగులేని నిదర్శనం అధికారుల ముందే ఉంది. అయన అధికారం గురించి ఇప్పుడు గుర్తును డిమాండు చెయ్యకూడదని తీర్మానించారు. కాని ఏదో ఒప్పుకునేటట్లో లేక ఏదో ప్రకటించేటట్లో చేసి దాని మూలంగా ఆయన్ని దోషిగా తీర్మానించి శిక్షించాలన్నది వారి ఎత్తుగడ.DATel 658.3

    ఆయన దేవాలయంలో బోధిస్తుండగా వెళ్లి ఆయన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు, “ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెను?” తన అధికారం దేవుని వద్ద నుంచి వచ్చిందని చెప్పుతాడని వారు ఎదురుచూశారు. అలా చెబితే దాన్ని తప్పుపట్టాలని ఉద్దేశించారు. కాని యేసు వారికి ఇంకో ప్రశ్న వెయ్యడం ద్వారా దాన్ని ఎదుర్కున్నాడు. అది వేరే విషయానికి సంబంధించిన ప్రశ్న. వారు తన ప్రశ్నకు సమాధానం చెప్పే షరతు మీదే వారి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నాడు. “యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా?” అన్నాడు.DATel 659.1

    తాము చిక్కులో ఇరుక్కున్నామని, దానిలో నుంచి ఏ కుతర్కమూ తమను బయటపడేయజాలదని వారు గ్రహించారు. యోహాను బాప్తిస్మము పరలోకం నుంచి కలిగిందని అంటే తమ మాటల్లో నిలకడ లేదన్నది తేటతెల్లమవుతుంది. అప్పుడు క్రీస్తు- అయితే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు? అని అడుగుతాడు. యోహాను క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చాడు, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల” యోహా. 1:29. యాజకులు యోహాను వర్తమానాన్ని విశ్వసించినట్లయితే క్రీస్తు మెస్సీయా కాడని ఎలాగనగలరు? ఒకవేళ వారు యోహాను పరిచర్య మానవుల నుంచి కలిగిందన్న తమ నిజమైన నమ్మకాన్ని వెలిబుచ్చితే తమ మీదికి తాము ఆగ్రహ తుపాను తెచ్చుకున్నవారవుతారు. ఎందుకంటే యోహాను ప్రవక్త అని ప్రజలు విశ్వసించారు.DATel 659.2

    ఈ విషయమై తీర్మానం కోసం ప్రజలు ఆసక్తిగా కనిపెట్టారు. యాజకులు యోహాను పరిచర్యను విశ్వసిస్తున్నట్లు చెప్పుకోడం వారికి తెలుసు. అతడు దేవుని వలన వచ్చిన వాడని ఎలాంటి సందేశం లేకుండా వారు ఒప్పుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. అయితే వారు రహస్యంగా మాటలాడుకున్న తర్వాత ఏదీ ప్రకటించకూడదని తీర్మానించుకున్నారు. అజ్ఞానం నటిస్తూ వారు “మాకు తెలియదు” అన్నారు. అందుకాయన- “ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మితో చెప్పను” అన్నాడు.DATel 659.3

    శాస్త్రులు, యాజకులు అధికారులు అవాక్కయ్యారు. నిరాశచెంది తికమక పడూ కిందకి చూస్తూ ఇక ప్రశ్నలు వేయడానికి ధైర్యం లేక నిలబడిపోయారు. తమ పిరికితనం వల్ల, అటూఇటూ చెప్పలేని సంకట పరిస్థితి వల్ల వారు ప్రజల గౌరవాన్ని పోగొట్టుకున్నారు. ప్రజలు పక్కనే ఉండి గర్విష్టులు స్వనీతిపరులు అయిన వీరి ఓటమి చూసి సంతోషించారు.DATel 660.1

    క్రీస్తు అన్న మాటలు చేసిన ఈ పనులు ప్రాముఖ్యమైనవి. ఆయన మరణం ఆరోహణం అనంతరం వాటి ప్రభావం నానాటికీ పెరగవలసి ఉంది. యేసుకు వేసిన ప్రశ్నకు సమాధానం కోసం కనిపెట్టిన వారిలో అనేకులు తుదకు ఆయన శిష్యులు కావాల్సి ఉన్నారు. ఆ దినాన ఆయన చెప్పిన మాటలు మొదటగా వారిని ఆయన చెంతకు ఆకర్షించాయి. ఆలయ ఆవరణంలోని సన్నివేశం వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. తాము మాట్లాడిన మాటల్లో క్రీస్తుకీ ప్రధాన యాజకుడికీ మధ్య ఎంతో వ్యత్యాసముంది. గర్విఅయిన ఆలయాధి కారి వెలగల దుస్తులు ధరించాడు. అతడి తల మీద వజ్రాలు పొదిగిన కిరీటం ఉంది. వేలాడుతున్న వెండిలా తెల్లని వెంట్రుకలు, తన వయసును సూచిస్తున్న గడ్డంతో అతడు ఠీవి వలకబోస్తున్నాడు. అతడి ఆకృతి చూపరులికి భయం పుట్టించింది. ఘనత వహించిన వ్యక్తి ముందు పరలోకరాజు అలంకరణలు ఏమీ లేకుండా నిరాడంబరంగా నిలబడి ఉన్నాడు. ఆయన దుస్తులు ప్రయాణం వల్ల మరకలుపడి ఉన్నాయి. ఆయన ముఖం పాలిపోయిఉంది. దాని మీద విచారం వ్యక్తమౌతోంది. అయినా ఆముఖం మీద ఔన్నత్యం, ఔదార్యం కొట్టొచ్చినట్లు కనబడ్తున్నాయి. అవి ఆహరంకారి అయిన ప్రధాన యాజకుడి ఆత్మ విశ్వాసానికి, రౌద్రాకారానికి భిన్నంగా ఉన్నాయి. ఆలయంలో యేసు మాటలు విని ఆయన చేసిన కార్యాలు చూసిన వారిలో అనేకమంది అప్పటి నుంచి ఆయన్ని దేవుని ప్రవక్తగా తమ హృదయ మందిరాల్లో నిలుపుకున్నారు. కాగా యేసు పట్ల ప్రజాదరణ పెరగడంతో ఆయనపై యాజకుల ఆగ్రహాం ద్వేషం మరింత పెరిగాయి. తన పాదాలకు అమర్చిన ఉచ్చుల నుంచి ఆయన ఏ వివేకం మూలంగా తప్పించుకున్నాడో అది ఆయన దేవత్వానికి మరో నిదర్శనం కావడం వారి ఆగ్రహాగ్నిపై ఆజ్యం పోసినట్లయ్యింది.DATel 660.2

    రబ్బీలతో తన పోటీలో తన ప్రత్యర్ధుల్ని సిగ్గుపర్చడం క్రీస్తు ఉద్దేశం కాదు. వారు ఇరకాటంలో పడడం చూడడం ఆయనకు సంతోషం కాదు. ఆయన బోధించాలని ఉద్దేశించిన పాఠం ఒకటుంది. తన ప్రత్యర్థులు తన కోసం విసిరిన వలలో వారే చిక్కుకునేటట్లు చేసి ఆయన వారిని సిగ్గుపర్చాడు. యోహాను బాప్తిస్మం స్వభావాన్ని గురించి వారు అంగీకరించిన తమ ఆజ్ఞానం ఆయన మాట్లాడడానికి అవకాశం కల్పించింది. ఆ తరుణాన్ని ఉపయోగించుకుని వారి ముందు తమ వాస్తవ పరిస్థితిని ఉంచాడు. ఇలా తానిచ్చిన అనేకమైన హెచ్చరికలకు ఇంకో హెచ్చరికను కలిపాడు.DATel 661.1

    ఆయన ఇలా అన్నాడు, “నాకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి - కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయుమని చెప్పగా వాడు - పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు -అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడు?”DATel 661.2

    ఈ ఆకస్మిక ప్రశ్న ఆయన శ్రోతల్ని గలిబిలిపర్చింది. వారు ఉపమానాన్ని జాగ్రత్తగా విన్నారు. వెంటనే మొదటివాడే అని బదులు పలికారు. తన దృష్టిని వారిపై నిలిపి యేసు కఠినమైన, గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, “సుంకరులును వేశ్యలును నా కంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతోనిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున నా యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులును వేశ్యలును అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపడడకపోతిరి.”DATel 661.3

    క్రీస్తు ప్రశ్నకు యాజకులు అధికారులు సరైన సమాధానం ఇవ్వక తప్పలేదు. ఇలా మొదటి కుమారుడి పక్షంగా వారి అభిప్రాయాన్ని రాబట్టాడు. ఈ కుమారుడు పరిసయ్యుల తృణీకారానికి ద్వేషానికి గురి అయిన సుంకరుల్ని సూచిస్తున్నాడు. ఈ సుంకరులు నీతి నియమాలు లేని వ్యక్తులు. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారు. దేవుని విధుల పట్ల తమ జీవితంలో తీవ్ర ప్రతిఘటన చూపించేవారు. వారు కృతజ్ఞతలేని వారు, పరిశుద్ధత ఏకోశానా లేనివారు. ప్రభువు ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పినప్పుడు ధిక్కార ధోరణిలో వెళ్లము అన్నారు. అయితే యోహాను వచ్చి పశ్చాత్తపం గురించి బాప్తిస్మం గురించి బోధించినప్పుడు సుంకరులు అతని వర్తమానాన్ని స్వీకరించి బాప్తిస్మం పొందారు.DATel 661.4

    రెండో కుమారుడు యూదు జాతి నాయకుల్ని సూచించాడు. పరిసయ్యుల్లో కొంతమంది పశ్చాత్తాపం పొంది యోహాను వలన బాప్తిస్మం పొందారు. అయితే నాయకులు అతణ్ని దేవుడు పంపినవాడిగా గుర్తించలేదు. అతడి హెచ్చరికలు, ఖండనలు వారిలో దిద్దుబాటుతేలేదు. వారు “అతనిచేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.” లూకా 7:30. అతని వర్తమానాన్ని చులకన చేశారు. రెండో కుమారుణ్ని పిలిచి వెళ్లమన్నప్పుడు “అయ్యా పోదును” అని పోకుండా ఉన్న మాదిరిగా యాజకులు అధికారులు అనుసరిస్తామన్నారు గాని అతిక్రమించారు. విధేయులమన్నారు గాని వారు అవిధేయులు. గొప్ప భక్తులమని చెప్పుకున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్లు బల్లగుద్ది చెప్పారు. వాస్తవంలో వారిది దొంగ విధేయత. పరిసయ్యులు సుంకరుల్ని అవిశ్వాసులని ముద్రవేసి ద్వేషించి శపించారు. కాని గొప్ప వెలుగును పొందినా తాము ప్రకటించుకుంటున్న భక్తికి దీటైన క్రియలు లేని ఈ స్వనీతిపరుకన్నా ముందు పరలోకానికి వెళ్తామని సుంకరులు తమ విశ్వాసం ద్వారా తమ క్రియల ద్వారా చూపించుకున్నారు.DATel 662.1

    యాజకులు అధి కారులు కాదనలేని ఈ వాస్తవాలను భరించలేకపోయారు. అయినా యేసు ఏమైనా అంటాడని దాన్ని తాము ఆయనకు వ్యతిరేకంగా తిప్పవచ్చునని నిరీక్షిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కాగా వారు భరించాల్సింది ఇంకా ఉంది.DATel 662.2

    “మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి మరియొకని మిద రాళ్లు రువ్విరి. మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు - నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపేను. అయినను ఆ కాపులు కుమారుని చూచి - ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమునుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును?” అని యేసు అడిగాడు.DATel 662.3

    యేసు అక్కడున్న వారందరికీ ఆ ప్రశ్మ వేశాడు, కాని యాజకులు ఇలా సమాధానం చెప్పారు, “ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటి వాటి కాలములయందు తమకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చును.” ఈ సమాధానం చెప్పిన వారు మొదట ఆ ఉపమాన వర్తింపును గ్రహించలేదు. కాని ఇప్పుడు తమ సొంత శిక్షను తామే విధించుకున్నామని వారు గుర్తించారు. ఉపమానంలో ఇంటి యాజమానుడు దేవున్ని సూచిస్తున్నాడు. ద్రాక్షతోట యూదు జాతిని కంచె వారిని పరిరక్షించే కంచెని సూచిస్తున్నాయి. గోపురం ఆలయానికి చిహ్నం. ద్రాక్షతోట యజమాని తోట క్షేమాభివృద్ధికి చేయగలిగిందంతా చేశాడు. “నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే మరేమి దానికి చేయగలను?” అని ఆయన అడుగుతున్నాడు. ఇశ్రాయేలు విషయంలో దేవుడు అలుపెరుగకుండా తీసుకుంటున్న శ్రద్ధను ఇలా సూచించడం జరిగింది. కాపులు ద్రాక్షతోట యజమానుడికి పండ్లలో తన భాగాన్ని ఇవ్వాల్సి ఉన్న మాదిరిగానే దేవుని ప్రజలు తమ పవిత్ర అధిక్యతలకు దీటైన జీవితం జీవించడం ద్వారా దేవున్ని ఘనపర్చాల్సి ఉన్నారు. తోట యజమానుడు పండ్లకోసం పంపిన సేవకుల్ని కాపులు చంపినట్లే పశ్చాత్తాపపడమంటూ విజ్ఞప్తి చెయ్యడానికి దేవుడు పంపిన ప్రవక్తల్ని యూదులు చంపారు. ఒకరి తర్వాత ఒకరిగా ప్రవక్తల్ని చంపారు. ఇక్కడ వరకూ ఉపమానం వర్తింపుపై సందేహం లేదు. దాని తర్వాత భాగం వర్తింపు విషయంలో సందేహానికి తావు ఉండదు. అవిధేయులైన కాపుల వద్దకు తోట యజమాని పంపిన తన ప్రియ కుమారుణ్ని వారు పట్టుకుని చంపడంలో యాజకులు అధికారులు యేసుకి రానున్న మరణాన్ని స్పష్టంగా చూశారు. చివరి విజ్ఞప్తి చెయ్యడానికి తమ వద్దకు తండ్రి పంపిన యేసును వారు చంపడానికి చూస్తున్నారు. కృతజ్ఞతలేని కాపులకు విధించిన శిక్షలో క్రీస్తును చంపనున్న వారి నాశనాన్ని సూచించడం జరిగింది.DATel 663.1

    వారి వంక దయగా చూస్తూ రక్షకుడు ఇలా కొనసాగించాడు, “ఇల్లు కట్టువారు నిషేధించినరాయి మూలకు తలరాయి అయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము నా యెద్ద నుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనుల కీయబడునని నాతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవునుగాని అది ఎవని మిద పడునో వానిని నలిచేయును.”DATel 664.1

    ఈ ప్రవచనాన్ని యూదులు సమాజమందిరాల్లో ఎన్నోసార్లు వల్లించేవారు. దీన్ని మెస్సీయా రాకకు వర్తింపజేసేవారు. యూదు వ్యవస్థకు, యావత్ రక్షణ ప్రణాళికకు క్రీస్తు మూలరాయి. ఈ పునాది రాయిని యూదు నిర్మాణకులు, యాజకులు ఇశ్రాయేలు అధికారులు ఇప్పుడు విసర్జిస్తోన్నారు. వారి అపాయాన్ని తెలిసే రక్షకుడు వారి గమనాన్ని ప్రవచనాలికి తిప్పాడు. తాము చేపట్టనున్న పని ఎలాంటిదో వారికి విశదం చెయ్యడానికి రక్షకుడు తన అందుబాటులో ఉన్న అన్ని సాధనాల్ని వినియోగించాడు.DATel 664.2

    ఆయన మాటల ఉద్దేశం మరొకటుంది. “ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయవలెను?” అని ప్రశ్నించడంలో పరిసయ్యుల జవాబు వారు చెప్పినట్లే ఉండాలని క్రీస్తు సంకల్పించాడు. వారు తమ తప్పును తామే ఖండించుకోవాలని ఆయన సంకల్పించాడు. ఆయన హెచ్చరికలు వారిలో పశ్చాత్తాపం కలిగించకపోడంతో వారి నాశనం నిశ్చయమయ్యింది. తమ మీదికి తామే నాశనాన్ని తెచ్చుకున్నామని వారు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశించాడు. తాము అనుభవించడానికి మొదలు పెట్టిన అధిక్యతల్ని ఉపసంహరించుకోడంలో - అవి అంత మొందుతాయి - దేవాలయం యెరుషలేము పట్టణం నాశనాన్నే గాక ఆ జాతి లోకమంతటా చెదిరిపోవడాన్ని అందులో దేవుని న్యాయాన్ని వారికి చూపించాలన్నది ఆయన ఉద్దేశం.DATel 664.3

    శ్రోతలు హెచ్చరికను గుర్తించారు. కాని తమ శిక్షను తామే ప్రకటించుకున్నప్పటికీ, “ఇతడు వారసుడు ఇతనిని” చంపుదాం అనడం ద్వారా యాజకులు అధికారులు ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. “ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి” ఎందుకంటే క్రీస్తుకి ప్రజాభిమానం మెండుగా ఉన్నది.DATel 665.1

    నిషేధించిన రాయిని గురించిన ప్రవచనాన్ని ఉటంకించడం ద్వారా ఇశ్రాయేలు చరిత్రలోని ఒక వాస్తవిక ఘటనను యేసు మనసులో ఉంచుకున్నాడు. ఆ ఘటన మొదటి దేవాలయ నిర్మాణానికి సంబంధించింది. ఇది క్రీస్తు మొదటి రాక సమయానికి వర్తించి యూదులికి ప్రత్యేకాసక్తి పుట్టించాల్సి ఉండగా, దానిలో మనకు కూడ ఒక పాఠం ఉంది. సొలొమోను దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు గోడలికి పునాదులికి అవసరమైన పెద్దరాళ్ళు రాళ్లగని వద్దే పూర్తిగా తయారై వచ్చాయి. వాటిని నిర్మాణ స్థలానికి తెచ్చాక వాటి పై ఏ పరికరాన్ని ఉపయోగించడానికి లేదు. పని వారు వాటిని వాటి స్థలంలో పెట్టడమే తరువాయి. పునాదిలో వినియోగించడానికి అసమాన్యపరిమాణంలోను వింత ఆకారంలోను.ఉన్న ఒక రాయిని తెచ్చారు. కాని పనివారు దాన్ని ఎక్కడా ఉపయోగించలేకపోయారు. అందుకు దాన్ని తీసుకోలేదు. అది వారికి చీకాకు పుట్టించింది. ఉపయోగించడానికి వీలు లేకుండా అడ్డంగా పడి ఉంది. విసర్జించిన రాయిగా చాలా కాలం పడిఉంది. అయితే కట్టడం పనివారు మూలరాయి పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, పనివారు చాలా సేపు ఆ స్థలానికి సరిపడ్డ పరిమాణం, బలం ఉండి పెద్ద బరువును ఆపగల రాయికోసం వెదికారు. ఈ విషయంలో అవివేక తీర్మానమేదైనా జరిగితే, మొత్తం కట్టడం క్షేమమే ప్రశ్నార్ధకమౌతుంది. సూర్యతాపాన్ని, మంచును, తుపానుల్ని తట్టుకోగల రాయిని వారు కనుగోవాలి. ఆయా సమయాల్లో అనేక రాళ్లని ఎంపిక చేశారు. కాని వాటి పై గొప్ప బరువు పెట్టగా అవి కూలి ముక్కలయ్యాయి. తక్కినవి అకస్మాత్తుగా కలిగే వాతావరణ మార్పుల్ని తట్టుకోలేకపోయాయి. చివరికి చాలాకాలంగా విసర్జించబడి పడిఉన్న రాయి పైకి పనివారి దృష్టి మళ్లింది. అది గాలికి, ఎండకు, తుపానుకి తట్టుకుని పడి ఉంది. దానిలో పగుళ్ళుగాని బీటలు గాని లేవు. పనివారు ఈ రాయిని పరీక్షించారు. ఒకటి తప్ప అది అన్ని పరీక్షలకీ తట్టుకుంది. అది తీవ్ర ఒత్తిడికి నిలబడగలిగితే దాన్ని మూలరాయిగా వినియోగించడానికి వారు తీర్మానించుకున్నారు. పరీక్ష జరిగింది. ఆ రాయిని పనివారు అంగీకరించారు. దానికి ఏర్పాటైన ఆ స్థలానికి ఆ రాయిని తెచ్చారు. అది స్థలానికి సరిగ్గా సరిపోయింది. ఈ రాయి క్రీస్తుకి చిహ్నమని యెషయా ప్రవక్తకి దర్శనంలో దేవుడు చూపించాడు.DATel 665.2

    “సైన్యముల కధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసినవాడు ఆయనే. ఆయనకోసరమే దిగులుపడవలెను. అప్పుడాయన నాకు పరిశుద్ధ స్థలముగానుండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరుషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగా నుండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుబడుదురు.” ప్రావచనిక దర్శనంలో ప్రవక్తను క్రీస్తు మొదటి రాకకు తీసుకువెళ్ళి, క్రీస్తు శ్రమలు, పరీక్షలు భరిస్తాడని, సొలొమోను దేవాలయంలోని మూలరాయికి కలిగిన పాట్లు ఆయన శ్రమలకు పరీక్షకు సంకేతమని ప్రవక్తకు చూపించాడు. “ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. - సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది యొక్క మూలరాయియైయున్నది. విశ్వసించువాడు కలవరపడడు.” యెష 8:13-15, 28:16DATel 666.1

    అనంత జ్ఞానంలో దేవుడు పునాది రాయి ఎన్నిక చేసి దాన్ని తానే పునాదిలో వేశాడు. దాన్ని ఆయన “స్థిరమైన పునాది” అంటోన్నాడు. లోక ప్రజలందరూ తమ భారాల్ని దుఃఖాల్ని దాని మీద వేయవచ్చు. అది వాటన్నిటిని భరించగలదు. వారు తమ కట్టడాలు క్షేమంగా దాని మీద కట్టుకోవచ్చు. క్రీస్తు “పరీక్షించబడ్డ రాయి” ఆయన్ని నమ్ముకున్నవారిని నిరాశపర్చడు. ప్రతీ పరీక్షనూ ఆయన భరించాడు. ఆదాము పాపం ఒత్తిడిని అతని సంతానం పాపం ఒత్తిడిని తట్టుకుని దుష్టశక్తులపై విజయుడై నిలిచాడు. పశ్చాత్తాపం పొందే ప్రతీ పాపి తన మిద మోపే భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఆపరాధికి క్రీస్తులో ఉపశమనం ఉంది. ఆయనే స్థిరమైన పునాది. ఆయనపై అనుకునే వారందరు సంపూర్ణ భద్రత కలిగి నివసిస్తారు.DATel 666.2

    యెషయా ప్రవచనంలో క్రీస్తు స్థిరమైన పునాదిగాను ఆటంక బండగాను ఉంటాడని ప్రకటించడం జరిగింది. అతడు పరిశుద్దాత్మ ఆవేశం వల్ల రాస్తూ క్రీస్తు ఎవరికి పునాదిరాయో ఎవరికి ఆటంక బండో స్పష్టంగా తెలుపుతున్నాడు.DATel 667.1

    “ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల... మనుష్యుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు నారును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు వ్రాయబడియున్నది. విశ్వసించుచున్న నాకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించని వారికైతే - ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను కట్టువారు వాక్యమునక విధేయులై తొట్రిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి.” 1 పేతురు 2:1-8.DATel 667.2

    విశ్వసించేవారికి క్రీస్తు స్థిరమైన పునాది. బండమీద పడి చిదుకగొట్టబడేవారు వీరే. క్రీస్తుకి అంకితం, ఆయనపై విశ్వాసం - వీటిని ఇక్కడ సూచించడం జరిగింది. బండమీద పడడం చిదుకగొట్టబడడం అంటే మనం మన స్వనీతిని విడిచిపెట్టి, మన అతిక్రమాల గురించి పశ్చాత్తాపపడి, క్షమించి ప్రేమించే క్రీస్తును విశ్వసించి ఆయన వద్దకు వెళ్లడం. అలాగే విశ్వాసం విధేయతల ద్వారా మన పునాది అయిన క్రీస్తుపై మన జీవితాల్ని నిర్మించుకుంటాం.DATel 667.3

    సజీవమైన ఈ రాతి మీద యూదులు అన్యజనులు ఏకరీతిగా నిర్మించుకోవచ్చు. ఈ పునాది మీదే మనం సురక్షితంగా నిర్మించుకోవచ్చు. ఇది అందరికి సరిపోయేంత విశాలమైంది. లోక భారం అంతటిని భరించగల శక్తిగలది. సజీవ రాయి అయిన క్రీస్తుతో సంబంధం ద్వారా ఈ పునాది మీద కట్టుకునే వారందరూ సజీవమైన రాళ్లవుతారు. అనేకమంది తమసొంత కృషి ద్వారా రాళ్లు చెక్కుకుని, వాటికి మెరుగులు దిద్ది వాటిని సుందరంగా తయారుచేసుకోడానికి ప్రయత్నిస్తారు. కాని వారు “సజీవమైన రాళ్లు” కాలేరు. ఎందుకంటే వారికి క్రీస్తుతో సంబంధం లేదు. క్రీస్తుతో అనుబంధం లేకుండా ఎవరూ రక్షణ పొందలేరు. క్రీస్తు జీవితం మనలో లేకుంటే శోధన తుపాన్ల తాకిడిని మనం తట్టుకోలేం. మన నిరంతర క్షేమం ఆ స్థిరమైన పునాదిపై మన కట్టడం మీద ఆధారపడి ఉంటుంది. నేడు వేలాదిమంది నిశ్చితం కాని పునాదుల మీద తమ జీవితాలు నిర్మించుకుంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు, తుపానులు రేగి వరదలు వచ్చినప్పుడు వారి ఇల్లు కూలిపోతుంది. ఎందుచేతనంటే వారి ఇల్లు యుగయుగాల బండ ప్రధాన మూలరాయి అయిన యేసు క్రీస్తు మీద నిర్మితికాలేదు.DATel 668.1

    “వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్న” వారికి క్రీస్తు ఆటంక బండగా ఉంటాడు. కాని “ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయెను.” నిషిద్ధమైన రాయిలా క్రీస్తు తన ఇహలోక పరిచర్యలో అనాదరణను అక్రమాలను భరించాడు. ఆయన “తృణీకరింపబడినవాడును ఆయెను. మనుష్యుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను... ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. ” యెష 53:3. అయితే ఆయన మహిమను పొందే సమయం దగ్గరలోనే ఉంది. మరణం నుంచి తన పునరుత్థానం వలన “దేవుని కుమారుడుగా” ఆయన ప్రకటితం కానున్నాడు. (రోమా 1:4) తన రెండో రాక సమయంలో ఆయన పరలోకానికి భూలోకానికి ప్రభువుగా వెల్లడికానున్నాడు. ఇప్పుడు ఆయన్ని సిలువవేయడానికి సన్నద్ధమౌతోన్నవారు ఆయన ఔనత్యాన్ని గుర్తిస్తారు. నిషిద్ధమైన రాయి యావత్ విశ్వం ముందు మూలకు తలరాయి కానున్నాడు.DATel 668.2

    అయితే “అది ఎవనిమిద పడునో వానిని నలిచేయును.” క్రీస్తును నిరాకరించిన ప్రజలు తమ పట్టణం, తమ జాతి నిర్మూలమవ్వడాన్ని త్వరలో చూడనైయున్నారు. వారి మహిమ మాయమవుతుంది. అది గాలిలో కలిసిపోతుంది. యూదుల్ని నాశనం చేసిందేంటి? ఆ బండే! వారు ఆ బండమీద నిర్మించుకుని ఉంటే అది వారికి భద్రతను సమాకూర్చేది. వారిని నాశనం చేసింది. వారు నిరాకరించిన దేవుని దయాళుత్వం, వారు తోసిపుచ్చిన ఆయన నీతి, వారు చిన్నచూపు చూసిన ఆయన కృప. మనుషులు దేవుని వ్యతిరేకించడానికి పూనుకున్నారు. కనుక తమరక్షణకు ఉద్దేశించిందంతా వారి నాశనానికి వినియోగమయ్యింది. దేవుడు దేన్ని జీవానికి సంకల్పించడో దాన్ని వారు తమ మరణానికి వినియోగించుకున్నారు. యూదులు క్రీస్తుని సిలువ వేయడంతో యెరుషలేము నాశనం ముడిపడి ఉంది. కల్వరి సిలువ పై చిందించిన రక్తం వారిని ఈ లోకానికి పరలోకానికి పనికి రాకుండా నాశనం చేసిన భారంగా పరిణమించింది. దైవ కృపను నిరాకరించే వారి మీద చివరి తీర్పుపడే ఆ మహ తీర్పుదినాన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. తమ ఆటంక బండగా ఉన్న క్రీస్తు ఆ దినాన పగతీర్చుకునే పర్వతంలా ఉంటాడు. నీతిమంతులకు జీవం అయిన సన్నిధి కాంతి దుష్టులికి దహించే అగ్నిలా ఉంటుంది. తాను నిరాకరించిన ప్రేమ, తృణీకరించిన కృప కారణంగా పాపి నాశనమౌతాడు.DATel 668.3

    దేవుని కుమారుణ్ని నిరాకరించడం వల్ల కలిగే ఫలితాల్ని అనేక సాదృశ్యాల ద్వారాను పదేపదే అందించిన హెచ్చరికల ద్వారాను యేసు యూదులికి వివరించాడు. అన్ని యుగాల్లోను తనను విమోచకుడుగా అంగీకరించని ప్రజలందరిని ఈ మాటలతో హెచ్చరిస్తుచ్చాడు. ప్రతీ హెచ్చరిక వారికి ఉద్దేశించింది. అపవిత్రపర్చబడ్డ ఆలయం, ఆవిధేయ కుమారుడు, ముష్కరులైన కాపులు, ధిక్కరించే నిర్మాణకుల ప్రతిబింబాలు ప్రతీ పాపిలోను కనిపిస్తాయి. పాపి పశ్చాత్తాపడితే తప్ప ఇక్కడ ఛాయరూపకంగా సూచించిన నాశనం అతడికి తప్పదు.DATel 669.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents