Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    24—“ఈయన యోసేపు కుమారుడు కాడా?”

    గలిలయలో క్రీస్తు పరిచర్య చేసిన ఆనందమయ దినాల్లో ఒక్క విషాదఛాయ కనిపించింది. నజరేతు ప్రజలు ఆయన్ని విసర్జించారు. “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అన్నారు.DATel 241.1

    తన బాల్యంలోను కౌమార్యంలోను యేసు తన సహోదరులతో పాటు నజరేతులోని సమాజ మందిరంలో ఆరాధనలకు హాజరయ్యేవాడు. తన సువార్త పరిచర్య ప్రారంభమైనప్పటి నుంచి ఆరాధనలకు అక్కడికి వెళ్ళడం లేదు. అయినా ఆయన రాకపోవడానికి కారణమేంటో వారికి తెలియనిది కాదు. తమ మధ్య ఆయన మళ్లీ కనిపించినప్పుడు వారి ఆసక్తి పరాకాష్ఠకు చేరుకుంది. చిన్ననాటి నుంచి ఆయనకు తెలిసిన ముఖాలు ఇక్కడ దర్శనమిచ్చాయి. ఆయన తల్లి, ఆయన సహోదరులు సహోదరీలు ఉన్నారు. సబ్బాతునాడు సమాజమందిరంలోకి వెళ్లి ఆరాధకుల నడుమ కూర్చున్నప్పుడు అందరి దృష్టి ఆయన మీదే నిలిచింది.DATel 241.2

    ఆనాటి ఆరాధన క్రమం మేరకు పెద్ద ఒకరు ప్రవక్తల గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చదివి, రానున్నవాని కోసం, తమను మహిమాన్వితంగా పరిపాలించి హింసను నిర్మూలించే వానికోసం తాము ఇంకా నిరీక్షించాల్సిందంటూ హితవచనాలు పలికాడు. మెస్సీయా రాక సమీపంలోనే ఉందని చాటే నిదర్శనాల్ని వల్లించడం ద్వారా శ్రోతల్ని ఉత్సాహపర్చడానికి ప్రయత్నించాడు. ఆయన రాక మహిమ ప్రభావాలతో నిండి ఉంటుందని వివరించాడు. ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి సైన్యాలతో వస్తాడన్న భావనను మనసులో ఉంచుకుని ఆయన రాకను వర్ణించాడు.DATel 241.3

    సమాజమందిరంలో రబ్బీ ఉన్నప్పుడు ప్రసంగం అతడు చెయ్యడం అనవాయితీ. ఏ ఇశ్రాయేలు పౌరుడైనా ప్రవక్తల గ్రంథం నుంచి వేదపఠనం చెయ్యవచ్చు. ఈ సబ్బాతునాడు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా యేసును కోరారు. ఆయన “చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను.” లూకా 4:16, 17. ఆయన చదివిన లేఖన భాగం మెస్సీయాకు సంబంధించిన లేఖనంగా పరిగణించబడేది.DATel 242.1

    “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది
    బీదలకు సువార్త ప్రకటించుటకై
    ఆయన నన్ను అభిషేకించెను
    చెరలో నున్న వారికి విడుదలను,
    గ్రుడ్డివారికి చూపును, కలుగునని ప్రకటించుటకును
    నలిగిన వారిని విడిపించుటకును
    ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును
    ఆయన నన్ను పంపియున్నాడు.
    DATel 242.2

    “ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరు ఆయనను తేరిచూడగా... ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు” ఆశ్చర్యపడ్డారు. లూకా 4:18-22.DATel 242.3

    తన్ను గూర్చిన ప్రవచనాలకు తానే వ్యాఖ్యానకర్తగా ప్రజలముందు ఆయన నిలబడ్డాడు. తాను చదివిన మాటలకు వివరణనిస్తూ బాధితుల్ని విడిపించేవానిగా చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చే వానిగా, వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చే వానిగా, గుడ్డివారికి చూపునిచ్చే వానిగా, లోకానికి వెలుగునిచ్చే వానిగా మెస్సీయాను వర్ణించాడు. ఆకట్టుకునే ఆయన తీరు అద్భుతమైన భావం గల ఆయన మాటలు అపురూపమైన శక్తి కలిగి వినేవారిని రంజింపచేశాయి. దైవప్రభావం వరదవలె ప్రవహించి ప్రతీ అడ్డంకినీ కూల్చివేసింది. వారు మోషే వలె కనిపించని దైవప్రభావాన్ని వీక్షించారు. పరిశుద్ధాత్మ వారి హృదయాల్ని కదిలించగా వారు ఆమెన్, ప్రభువుకి స్తోత్రం అంటూ ప్రతిస్పందించారు.DATel 242.4

    అయితే “నేడు నా వినికిడిలో ఈ లేఖనము నెరవేరెను” అని యేసు ప్రకటించినప్పుడు వారు ఆకస్మాత్తుగా తమ్మును గురించి తాము ఆలోచించడం మొదలుపెట్టారు. తమతో మాట్లాడుతున్న యేసు తన్ను గురించి చెప్పుకుంటున్న విషయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఇశ్రాయేలీయులు అబ్రహాము పిల్లలు అయిన వారు చెరలో ఉన్నట్లు చెప్పడం జరిగింది. వారిని చెరలో ఉన్న వారిగాను దుష్ట శక్తి నుంచి విముక్తి పొందాల్సిన వారిగాను, చీకటిలో ఉన్న వారిగాను సత్యకాంతి అవసరమున్న వారిగాను వర్ణించడం జరిగింది. వారి ప్రతిష్ఠకి భంగం కలిగింది. వారు అందోళన చెందారు. యేసు కర్తవ్యం తాము కోరుకుంటున్న దానికన్నా పూర్తిగా భిన్నమైందని ఆయన మాటలు సూచించాయి. వారి క్రియలు నిశిత పరిశీలనకు రావచ్చు. బాహ్య ఆచారాలు కర్మల విషయంలో నిక్కచ్చిగా నిష్ఠగా ఉన్నా వెదకి పట్టుకునే ఆ కళ్లు పరీక్ష చెయ్యడమంటే వారికి గుబులు పుట్టింది.DATel 242.5

    ఈ యేసు ఎవరు? అన్నదే వారి ప్రశ్న. మెస్సీయా మహిమ తన సొంతం అంటోన్న అతడు ఓ వండ్రంగి కొడుకు. తన వృత్తిని చేపట్టి తండ్రి యోసేపుతో పనిచేశాడు. యేసు కొండలు ఎక్కడం దిగడం వారు చూశారు. ఆయన సహోదరులు సహోదరీలు వారికి తెలిసిన వారే. ఆయన జీవితం ఆయన పనులు వారికి తెలుసు. బాల్యం నుంచి యౌవనం వరకు యౌవనం నుంచి పరిణతి చెందిన పురుషుడుగా పెరగడం వారికి తెలుసు. ఆయన జీవితం నిందారహితంగా ఉన్నప్పటికీ, ఆయననే వాగ్రత్త మెస్సీయా అని నమ్మడానికి వారు సిద్ధంగా లేరు.DATel 243.1

    నూతన రాజ్యం గురించి ఆయన బోధనకు తమ పెద్దల నుంచి వారు విన్న బోధనకు మధ్య ఎంత వ్యత్యాసం! రోమియుల నుంచి విడిపించడం గురించి యేసు ఏమి చెప్పలేదు. వారు ఆయన అద్భుతాల గురించి విన్నారు. ఆ శక్తిని ఆయన తమను విడిపించడం కోసం వినియోగిస్తాడని వారు నిరీక్షించారు. కాని ఆయనకు ఆ ఉద్దేశం ఉన్నట్లు ఏ సూచన వారికి కనిపించలేదు.DATel 243.2

    వారు సందేహానికి తలుపు తెరవడంతో ముందు కాస్త మెత్తబడ్డప్పటికీ తర్వాత వారి హృదయాలు కఠినమయ్యాయి. గుడ్డికళ్ళు చూపు బానిసత్వంలో మగ్గుతున్న ఆత్మలు విడుదల పొందకూడదని సాతాను నిర్ధారించుకున్నాడు. వారిని అవిశ్వాస శృంఖలాలో బంధించడానికి అతడు తన సర్వశక్తుల్ని కూడగట్టుకుని కృషిచేశాడు. ఆయన తమతో మాట్లాడినప్పుడు తమకు కలిగిన బలమైన విశ్వాసాన్ని బట్టి ఆయనే తమ విమోచకుని నమ్మినవారు ఆ గుర్తింపును సద్వినియోగం చేసుకోలేదు.DATel 243.3

    కాగా వారి రహస్యాలోచనల్ని బయటపెట్టడం ద్వారా యేసు తన దేవత్వానికి నిదర్శనం ఇచ్చాడు. “ఆయన వారిని చూచి వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెర్నహోములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన - ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలీయా దినములందు మూడేండ్ల ఆరునెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించి నప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలి యొద్దకేగాని మరి యెవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధినొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” లూకా 4:23-27.DATel 244.1

    ప్రవక్తల జీవితాల్లోని ఘటనల ప్రస్తావన ద్వారా యేసు తన శ్రోతల ప్రశ్నలకు సమాధానలిచ్చాడు. ఒక ప్రత్యేక పని నిమిత్తం దేవుడు ఎంపిక చేసుకున్న సేవకులు విశ్వాసం లేని కఠిన హృదయుల కోసం పని చెయ్యడం ఆయనకు సమ్మతం కాదు. కాని వినే మనసు గలవారు నమ్మి విశ్వసించేవారు దేవునికి ఇష్టులు. వారు దేవుని శక్తికి నిదర్శనాల్ని ప్రవక్తల ద్వారా పొందగలరు. ఏలీయా దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవున్ని విడిచి పెట్టారు. తమ పాపాల్ని విడిచిపెట్టకుండా వాటిని కొనసాగించి ప్రభువు సేవకుల ద్వారా తమకు వచ్చిన హెచ్చరికల్ని తోసిపుచ్చారు. తమకు దేవుని వద్దనుంచి వచ్చే దీవెన వనరును వారు ఈ రకంగా పొగోట్టుకున్నారు. ప్రభువు ఇశ్రాయేలీయుల యిళ్ళు దాటిపోయి ఒక అన్యదేశంలో ఎంపిక అయిన జనాంగంలో భాగం కాని ఒక స్త్రీ యింట తన సేవకుడికి ఆశ్రయం కనుగొన్నాడు. దేవుడు ఈ స్త్రీ పట్ల ఆదరణ చూపించాడు. ఎందుచేతనంటే ఆమె తనకు అందిన వెలుగు మేరకు నివసించింది. తన ప్రవక్త ద్వారా దేవుడు పంపిన ఉన్నతమైన వెలుగు ప్రవేశించడానికి ఆమె తన మనసును తెరచింది.DATel 244.2

    ఎలీషా కాలంలో ఇశ్రాయేలులోని కుష్ఠురోగుల్నీ ఇదే హేతువు చేత ప్రభువు దాటి వెళ్లాడు. అయితే అన్యుడైన అధికారి నయమాను తాను న్యాయమని నమ్మిన దానికి కట్టుబడి తనకు సహాయం అవసరమని గుర్తించిన వ్యక్తి. అతడు దేవుని కృపావరాన్ని స్వీకరించడానికి తగిన పరిస్థితిలో ఉన్నాడు. అతడు కుష్ఠువ్యాధి నుంచి శుద్ధి పొందడమే కాదు, నిజమైన దేవుణ్ని గురించి కూడా తెలుసుకున్నాడు.DATel 245.1

    దేవుని దృష్టిలో మన స్థితి మనం పొందిన వెలుగు మీద గాక మనకున్న దాన్ని మనం ఎలా వినియోగించాం అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇలా, తమకు తెలిసినంత మట్టుకు మంచిని ఎంచుకునే అన్యజనులు తమకన్నా ఎక్కువ వాక్య జ్ఞానముండి, దేవున్ని సేవిస్తున్నట్లు చెప్పుకుంటూనే వెలుగును కాలరాస్తూ, తమ దినదిన జీవితంలో తాము చెప్పుకుంటున్న దానికి విరుద్ధంగా నివసించే వారికన్నా మెరుగైన స్థితిలో ఉన్నారనవచ్చు.DATel 245.2

    సమాజమందిరంలోని తన శ్రోతలనుద్దేశించి యేసన్నమాటలు వారి స్వనీతికి గొడ్డలి పెట్టువంటివి. తాము దేవుని విడిచి దూరంగా వెళ్లిపోయారని అందుచేత దేవుని ప్రజలుగా ఉండే హక్కును కోల్పోయారని వారికి తెలియజేశాడు. తమ వాస్తవ పరిస్థితి వారి ముందున్నది. ప్రతి మాట కత్తిలా గాయం చేసింది. తమను ఆదిలో ఏ విశ్వాసంతో ఉత్తేజపర్చాడో ఆ విశ్వాసాన్ని ఇప్పుడు వారు ద్వేషించారు. పేదరికం నుంచి దీనస్థితి నుంచి లేచిన యేసు సామాన్యుడు గాని విమోచకుడు కానేరడని అన్నారు.DATel 245.3

    వారి అవిశ్వాసం ద్వేషం పుట్టించింది. వారు సాతాను నేతృత్వం కింద ఉన్నారు. పట్టజాలని ఉక్రోషంతో రక్షకునికి వ్యతిరేకంగా కేకలు వేశారు. ఎవరి జీవిత పరమావధి స్వస్థపర్చడం, పునరుద్ధరించడమో ఆ యేసు నుంచి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు విధ్వంసకుడి గుణ లక్షణాల్ని ప్రదర్శించారు.DATel 245.4

    అన్యజనులకు దేవుడిచ్చిన దీవెనల్ని గురించి యేసు ప్రస్తావించినప్పుడు తనశ్రోతలలో తీవ్ర జాతీయాభిమానం మేల్కొన్నది. అనంతరం చోటుచేసుకున్న గందరగోళంలో ఆయన మాటలు వినిపించలేదు. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నామన్న అతిశయం వారి గుండెల నిండా ఉంది. ఇప్పుడు తమ దురభిమానం దెబ్బతిన్నది గనుక వారు హత్య చెయ్యడానికి సిద్ధమయ్యారు. సమావేశం ముగిసింది. అంతట వారు యేసును పట్టుకుని సమాజం మందిరం నుంచి ఆ పట్టణం నుంచి బయటికి గెంటేశారు. ఆయన్ని నాశనం చెయ్యడానికి అందరూ ఆత్రుతగా ఉన్నట్లు కనిపించారు. ఓ కొండ శిఖరానికి తీసుకువెళ్లి అక్కడ నుంచి కిందకు నెట్టివేయాలని ఉద్దేశించారు. కేకలు దుర్భాషలతో ఆ ప్రాంతం మారుమోగింది. కొందరు ఆయన మీదకు రాళ్లు విసరుతున్నారు. అప్పుడు ఆయన వారి మధ్య నుంచి మాయమయ్యాడు. ఆయనతో సమాజ మందిరంలో ఉన్న పరలోక దూతలు పేట్రేగిపోయిన ఆ జనసమూహం మధ్య ఉన్నారు. వారు యేసుని ఆ దౌర్జన్య మూక నుంచి దాచి ఓ సురక్షిత స్థలానికి నడిపించారు.DATel 245.5

    అలాగే దూతలు లోతుని కాపాడి సొదొమ నుంచి క్షేమంగా బయటికి నడిపించారు. అలాగే దూతలు ఎలీషాని కొండల్లో ఉన్న చిన్న పట్టణంలో కాపాడారు. చుట్టూ ఉన్న కొండలు సిరియా రాజు గుర్రాలు రథాలతోను, ఆయుధాలు ధరించిన గొప్ప సేనతోను నిండి ఉన్నప్పుడు ఎలీషా దగ్గరలో ఉన్న కొండలు లోయలు దేవుని సైన్యంతో నిండి ఉండడం చూశాడు. అవి అగ్నితో మండుతున్న గుర్రాలు, రథాలు. అవి దైవసేవకుని చుట్టూ మోహరించి ఉన్నాయి.DATel 246.1

    అలాగే అన్ని యుగాల్లో నమ్మకమైన క్రీస్తు అనుచరులకు సమీపంగా దూతలు ఉన్నారు. జయం సాధించాలని కృషి చేసే వారికి వ్యతిరేకంగా విస్తారమైన దుష్టకూటమి మోహరించి ఉన్నది. అయితే మనం దృశ్యం కాని వాటిని అనగా దేవుని ప్రేమించే వారిని విడిపించడానికి వారి చుట్టూ మోహరించి ఉన్న పరలోక సైన్యాల్ని చూడాలని క్రీస్తు మనల్ని కోరుతున్నాడు. దూతల జోక్యం వల్ల మనం దృశ్యమైన, అదృశ్యమైన ఎన్నెన్ని ప్రమాదాల నుంచి రక్షించబడ్డామో దేవుని నిత్యరాజ్యపు వెలుగులో ఆయన సంకల్పాల్ని చూచే వరకు మనకు తెలియదు. పరలోక కుటుంబమంతా ఇక్కడ భూలోకంలో ఉన్న కుటుంబంపట్ల అమితాసక్తి కలిగి ఉందని, దినదినం మనల్ని దేవదూతలు కాపాడుంటారని అప్పుడు మనం తెలుసుకుంటాం.DATel 246.2

    యేసు సమాజ మందిరంలో ప్రవచనం నుంచి చదివినప్పుడు మెస్సీయా పరిచర్యను గూర్చిన చివర వివరాన్ని ఇవ్వకుండా ముగించాడు. “ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును” అన్న మాటలు చదివి, “మన దేవుని ప్రతిదండన దినమును” (యెషయా 61:2) అన్న పద బంధాన్ని విడిచి పెట్టాడు. మొదటి ప్రవచనం ఎంత సత్యమో ఇదీ అంతే సత్యం. తన మౌనం వల్ల యేసు సత్యాన్ని కాదనలేదు. అయితే ఈ చివరి పద బంధం పై మాట్లాడడం ఆయన శ్రోతలకు సంతోషం. దాని నెరవేర్పు వారి కోరిక. వారు అన్యజనుల్ని విమర్శించారు. తమ దోషాలు ఇతరుల దోషాల కన్నా తీవ్రమైనవని వారు గ్రహించలేదు. తమకే కృప అవసరమై ఉండగా అదే కృపను వారు ఇతరులకు నిరాకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు సమాజమందిరంలో యేసు వారి మధ్య ఉన్న సమయమే పరలోకం నుంచి వచ్చిన పిలుపును వారు అంగీకరించడానికి అనుకూలసమయం. “క్షమించు దేవుడు” అయిన ఆయన (మీకా 7:18) వారిని తమ పాపాలు కలుగజేసే నాశనం నుంచి రక్షించేవాడు.DATel 247.1

    మారుమనసుకి ఇంకొక్క పిలుపునివ్వకుండా వారిని విడిచిపెట్టలేడు. గలిలయలో తన పరిచర్య ముగుస్తున్న సమయంలో తన చిన్ననాటి పట్టణాన్ని మళ్లీ సందర్శించాడు. అక్కడి ప్రజలు ఆయన్ని విసర్జించినప్పటి నుంచి ఆయన బోధన ఆయన అద్భుతకార్యాల ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. ఆయనకు మానవాతీతశక్తి ఉందని నమ్మనివారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఆయన ప్రజలకు మేలు చేస్తూ సంచరిస్తోన్నాడని, సాతాను బాధితుల్ని బాగుచేస్తున్నాడని నజరేతు ప్రజలకు తెలుసు. వ్యాధి బాధితుల మూలుగు వినిపించే గృహం ఒక్కటీ లేని గ్రామాలు వారి చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఎందుచేతనంటే ఆయన వాటిలో సంచరించి వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చాడు. దయాకార్యాలతో నిండిన ఆయన జీవితమే ఆయన అభిషిక్త దైవమనడానికి నిలువెత్తు సాక్ష్యం .DATel 247.2

    మళ్లీ ఆయన మాటలు విన్న నజరేతు ప్రజలు దేవుని ఆత్మవలన ప్రభావితులయ్యారు. అయినా తమ మధ్య పెరిగి పెద్దవాడైన యేసు తమకన్నా వ్యత్యాసమైన వాడనిగాని గొప్పవాడని గాని వారు అంగీకరించలేదు. తానే వాగ్రత్త విమోచకుణ్ణని చెబుతూ, తమకు ఇశ్రాయేలులో స్థానం లేదని ఆయన చెప్పిన మాటలు వారిలో ఇంకా విద్వేషాన్ని రగిలిస్తోన్నాయి. ఎందుకంటే దేవుని ప్రసన్నతకు అన్యజనులకంటే వారిని తక్కువ అర్హులుగా వర్ణించాడు. కనుక “ఈ జ్ఞానము ఈ అద్భుతములును ఇతనికెక్కడనుండి వచ్చినవి?” అని ప్రశ్నించుకున్నా ఆయన్ని దేవుడు పంపిన క్రీస్తుగా వారు అంగీకరించలేదు. వారి అవిశ్వాసం కారణంగా రక్షకుడు వారి మధ్య అద్భుతాలు చేయలేకపోయాడు. ఆయనను అంగీకరించి దీవెనను పొందినారు బహుకొద్దిమంది మాత్రమే. ఆయన అయిష్టంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇక మళ్లీ అక్కడకు రాలేదు.DATel 247.3

    ఒక్కసారి నజరేతు ప్రజలు అపనమ్మకానికి చోటివ్వడంతో అది వారి మనసుల్ని అదుపు చెయ్యడం కొనసాగించింది. అలాగే అది సన్ హెడ్రిన్ని ఆ జాతి అదుపు చేసింది. యాజకులు ప్రజల విషయంలో పరిశుద్ధాత్మ శక్తి ప్రదర్శన మొట్టమొదటి తిరస్కారంతో వారి అంతం ప్రారంభమయ్యింది. తమ మొదటి ప్రతిఘటన సరైనదేనని నిరూపించడానికి గాను వారు క్రీస్తు మాటల్ని విమర్శించడం కొనసాగించారు. వారు పరిశుద్దాత్మను విసర్జించడం కల్వరి సిలువకు, పట్టణ విధ్వంసానికి, వారిజాతి చెల్లాచెదురైపోవడానికి దారి తీసింది.DATel 248.1

    ప్రశస్తమైన సత్యసంపదను ఇశ్రాయేలు ప్రజలకు అందించాలని క్రీస్తు ఎంత ప్రగాఢంగా వాంఛించాడు! అయితే వారి ఆధ్యాత్మిక అంధత్వం ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన తన రాజ్యానికి సంబంధించిన సత్యాల్ని వారికి వెల్లడి చెయ్యడం అసాధ్యమయింది. దేవుని సత్యం వారి అంగీకారానికి వేచి ఉండగా వారు తమ ఆచారాల్ని వ్యర్ధ కర్మకాండల్ని పట్టుకుని వేళాడారు. జీవాహారం అందుబాటులో ఉండగా వారు తమ ద్రవ్యాన్ని పొట్టుకు, ఊకకు వ్యయం చేశారు. తాము తప్పులో ఉన్నామేమో అని పరీక్షించుకోడానికి వారు దైవవాక్యాన్ని ఎందుకు అధ్యయనం చెయ్యలేదు? క్రీస్తు పరిచర్యకు సంబంధించిన ప్రతివివరం పాతనిబంధన లేఖనాలు స్పష్టంగా వివరించాయి. ఆయన పదేపదే ప్రవక్తల్ని ఉటంకిస్తూ ఇలా ప్రకటించేవాడు, “నేడు నా వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది.” వారు చిత్తశుద్ధితో లేఖనాలు పరిశోధించి తమ సిద్ధాంతాల్ని దైవవాక్యంతో పరీక్షించుకుని ఉంటే, మారుమనసులేని వారి హృదయ కాఠిన్యం గురించి యేసు దుఃఖించాల్సిన అవసరం ఉండేది కాదు. “ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది” (లూకా 13:35) అని ఆయన అనాల్సి అవసరం ఉండేదికాదు. ఆయనే మెస్సీయా అని సూచించే నిదర్శనాల్ని వారు గుర్తించేవారు. తమకు గర్వకారణమైన తమ పట్టణాన్ని శిధిలాలుగా మిగిల్చిన విధ్వంసం సంభవించేది కాదు. అయితే యూదుల మనసులు హేతువులేని దురభిమానంతో సంకుచితమయ్యాయి. క్రీస్తు బోధించిన పాఠాలు వారి ప్రవర్తన లోపాల్ని బయలుపర్చి పశ్చాత్తాపం పొందాల్సిందిగా విజ్ఞాపన చేశాయి. ఆయన బోధనల్ని వారు అంగీకరిస్తే వారి ఆచారాలు ఆచరణలు మారాలి. వారి ఆశలు ఆశయాల దిశ మారాలి. దేవుని సన్మానాన్ని పొందడానికి వారు మానవుడి సన్మానాన్ని త్యాగం చెయ్యాలి. ఈ నూతన రబ్బీ మాటల్ని వారు ఆచరణలో పెడితే వారు ఆ కాలంలోని తత్వవేత్తలు మేధావుల అభిప్రాయాలకు విరుద్ధంగా వెళ్లాలి.DATel 248.2

    క్రీస్తు దినాల్లోనూ సత్యానికి ఏమంత ఆదరణ లేదు. ఈ రోజుల్లో కూడా సత్యానికి మద్దతు కరవయ్యింది. ఆత్మ ఔన్నత్యానికి నడిపే కట్టుకథలు చెప్పడం ద్వారా మొట్టమొదటగా సాతాను వాటిపట్ల అభిరుచిని మానవుడికి కలిగించిన నాటి నుంచి సత్యాన్ని ఎక్కువమంది ఆదరించరు. దేవుని వాక్యం పునాదిగా లేని సూత్రాలు సిద్ధాంతాలు ఈనాడు మనకు దర్శనమివ్వడం లేదా? యూదులు తమ సంప్రదాయాల్ని ఎలా పట్టుకుని వేళాడారో అలాగే ఆ సిద్ధాంతాలు సంప్రదాయాల్ని పట్టుకుని మనుషులు వేళాడున్నారు.DATel 249.1

    యూదు నేతలు ఆధ్యాత్మిక అతిశయంతో నిండి ఉన్నారు. సొంత కనిపించింది. సమాజమందిరంలో అత్యున్నత స్థలాల్ని ఆకాంక్షించారు. నమస్కారాలు పలకరింపుల్ని ఆశించేవారు. మనుషులు తమ హోదాలు బిరుదుల్ని ఉచ్చరించినప్పుడు ఎంతో ఆనందాన్ని తృప్తిని వ్యక్తం చేసేవారు. నిజమైన భక్తి సన్నగిల్లడంతో తమ సంప్రదాయాలు ఆచారాల విషయంలో చాలా పట్టుదలగా ఉండేవారు.DATel 249.2

    వారి అవగాహన స్వార్థ దురభిమానం వల్ల మసకబారినందుచేత వారు క్రీస్తు మాటల్ని ఆయన నిరాడంబర జీవితాన్ని సమన్వయ పర్చలేకపోయారు. నిజమైన గొప్పతనం బాహ్యమైన హంగు ఆర్భాటం లేకుండా ఉండవచ్చునన్న వాస్తవాన్ని వారు అభినందించలేదు. తానే మెస్సీయానని ఈయన చెప్పుతున్న దానితో ఈయన పేదరికం సమన్వయించడం లేదు. తన్ను గురించి తాను చెబుతోందే నిజమైతే తాను ఎందుకు అంత సామాన్యంగా సీదాసాదాగా ఉన్నాడు? అని వారు ప్రశ్నించారు. ఆయుధబలం లేకుండా ఉండడంతో తృప్తి చెందితే తమ జాతి ఏమి కానుంది? అని ప్రశ్నించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న రాజ్యాధికారం, కీర్తి ఇతర జాతుల్ని పాలిత ప్రజలుగా యూదుల పట్టణమైన యెరూషలేముకి తీసుకురాగలగటం ఎలా సాధ్యపడ్డాయి? ఇశ్రాయేలు భూమిని పరిపాలించనున్నదని యాజకులు బోధించలేదా? ఆ ప్రఖ్యాత మత బోధకులు పొరపడడం సాధ్యమా?DATel 249.3

    యూదులు యేసుని విసర్జించడానికి ఆయనలో బాహ్యమైన డంబం అపవిత్రులు. మనుషుల నడుమ ఆయన నిష్కళంక జీవితానికి ఉదాహరణగా నివసించాడు. కళంకం లేని ఆయన జీవితం వారి హృదయాల్లో వెలుగు అది వారి దొంగ భక్తి డొల్లతనాన్ని బయట పెట్టి తమ దుర్మార్గతను హేయస్వభావాన్ని వారికి కనపర్చింది. అలాంటి వెలుగు వారికి ససేమిరా ఇష్టం లేదు.DATel 250.1

    క్రీస్తు పరిసయుల్ని సన్మానించి వారి జ్ఞానాన్ని భక్తిని కొనియాడినట్లయితే వారు ఆయన్ని సంతోషానందాల్తో స్వాగతించేవారు. కాని యేసు పరలోకరాజ్యం గురించి మాట్లాడూ మానవులకు దాన్ని కృపాపాలనగా సూచించినప్పుడు మతంలో ఒక దశను వారికి సమర్పిస్తోన్నాడు. దాన్ని వారు సహించలేదు. వారి సొంత ఆదర్శం వారి బోధన దేవుని సేవ తోసివేసిన వారిపైనే యేసు శ్రద్ధ చూపించడం చూసినప్పుడు వారిలో ఆవేశకావేషాలు రాజ్యమేలాయి. “యూదా గోత్రపు సింహము” (ప్రకటన 5:55) కింద ఇశ్రాయేలు అన్ని జాతులకన్న ఉన్నతంగా ఉంటుందన్న అతిశయం ఉన్నా వారు క్రీస్తు మందలింపును, ఆయన పరిశుద్ధ సన్నిధిలో తమకు కలిగిన నిందను భరించిన దానికన్నా తమ ఆశలు నిరీక్షణలు ఆశాభంగాన్ని వారు ఇంకా మెరుగుగా భరించగలిగి ఉండాల్సింది.DATel 250.2