Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    7—బాలుడుగా

    యేసు బాల్యం, యౌవనం కొండ ప్రాంతంలోని చిన్న గ్రామంలో గడిచింది. ఆయన ఉనికివల్ల గౌరవప్రదంకాని స్థలం లోకమంతటిలోను ఏదీ ఉండదు. ఆయనను అతిథిగా పొందిన రాజభవనాలు ప్రత్యేక అధికత్యను సంతరించుకుని ఉండేవి. కాని ఆయన భాగ్యవంతుల గృహాల్ని, రాజుల ఆస్థానాల్ని, ఘనత వహించిన విద్యా పీఠాల్ని విడిచి పెట్టి మారు మూలలో ఉన్న నజరేతును తన నివాస స్థలంగా ఎంపిక చేసుకున్నాడు.DATel 49.1

    ఆయన చిన్ననాటి సంక్షిప్త జీవితచరిత్ర ప్రాధాన్యంలో అద్భుతమైంది; “యేసు జ్ఞానమునందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.” లూకా 2:52. ఆయనది చురుకైన, సూక్ష్మ గ్రాహ్యత గల మనసు. ఆయన ఆలోచన విధానం వివేకం తన వయసుకు మించినవి. ఆయన ప్రవర్తన సుందరమైంది, సౌమ్యమైంది. ఆయన మానసిక శారీరక శక్తులు బాల్యదశ నియమాలననుసరించి క్రమక్రమంగా వృద్ధి చెందాయి.DATel 49.2

    బాలుడుగా యేసు విలక్షణమైన సౌమ్యమైన ప్రవృత్తిని ప్రదర్శించాడు. ఇతరులకు సహాయం చెయ్యడానికి ఆయన చేతులు సర్వదా సంసిద్ధంగా ఉండేవి. ఆయన ప్రదర్శించింది ఏ పరిస్థితీ భంగపర్చలేని సహనం, తిరుగులేని సత్యసంధత. నియమం విషయంలో ఆయన బండలా నిలిచాడు. అందరి పట్ల స్వార్ధరహితమైన మర్యాదను చూపించాడు.DATel 49.3

    కుమారుని శక్తులు ప్రదర్శితం కావడాన్ని మరియ ఆసక్తిగా పరిశీలించి, ఆయన పై పడ్డ పరిపూర్ణత ముద్రను గమనించింది. చురుకైన గ్రహింపుగల ఆ ప్రవృత్తిని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నించింది. ఈ బిడ్డ అభివృద్ధిలో పరలోక సాధనాలతో సహకరించడానికి పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానాన్ని పొందింది. ఆయన తండ్రి దేవుడే.DATel 49.4

    ఇశ్రాయేలులో నమ్మకంగా ఉన్నవారు ఆదినుంచీ యువత విద్య విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు. శిశువులుగా ఉన్న నాటినుంచి పిల్లలకు తన మంచితనాన్ని ఔన్నత్యాన్ని గూర్చి తన ధర్మశాస్త్రంలోను ఇశ్రాయేలు చరిత్రలోను వెల్లడైన రీతిగా తన దయాళుత్వాన్ని గూర్చి ఔన్నత్యాన్ని గూర్చి బోధించాలని దేవుడు ఆదేశించాడు. పాటలు, ప్రార్థన, లేఖనాల నుంచి పాఠాలు పిల్లల మనసులికి అనుకూలంగా మలిచి పిల్లలకు నేర్పించాల్సి ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రం ఆయన ప్రవర్తనకు నకలు అని, ధర్మశాస్త్ర సూత్రాల్ని తమ హృదయాల్లోకి స్వీకరించినప్పుడు మనసుమిద ఆత్మమీద దేవుని స్వరూపం ముద్రపడుందని తల్లులు తండ్రులు తమ బిడ్డలకు ఉపదేశించాల్సి ఉన్నారు. ఈ ఉపదేశం చాలామట్టుకు నోటి మాట ద్వారా సాగింది. అయితే యువత హెబ్రీ రచనలు చదవడం కూడా నేర్చుకున్నారు. తోళ్లపై రాసిన పాత నిబంధన లేఖనాలు వారి పఠనానికి అందుబాటులో ఉంచేవారు.DATel 50.1

    క్రీస్తు దినాల్లో చిన్న పిల్లలకు మతోపదేశం ఏర్పాటుచేయని పట్టణం లేక నగరం దేవుని శాపంకింద ఉన్నట్లు పరిగణించడం జరిగేది. అయినా అది ఆనవాయితీ చర్యమాత్రమే. లేఖనాల బదులు చాలా మట్టుకు సంప్రదాయాల్ని బోధించడం జరిగేది. “ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమోయని తన్ను వెంబడించు నిమిత్తము” వాస్తవిక విద్య యువతను నడిపిస్తుంది. అ.కా. 17:27. కాని యూదు మత బోధకులు ఆచారాలకు సంబంధించిన విషయాల పైనే దృష్టి పెట్టారు. విద్యార్థికి ఉపయోగం లేని అంశాలు మనసును నింపాయి. ఆ విషయాలు పరలోకంలో ఉన్న దేవుని పాఠశాల గుర్తించదు. దేవుని వాక్యంతో వ్యక్తిగత పరిచయం ద్వారా లభించిన అనుభవానికి ఆ విద్యావ్యవస్థలో స్థానం లేదు. అసంబద్ధమైన బాహ్య అంశాల్లో చిక్కుకుని విద్యార్ధులు దేవునితో సమయం గడపలేకపోయారు. హృదయంతో మాట్లాడే ఆయన స్వరాన్ని వారు వినలేదు. దేవసేవ అన్న అతి ములు ఉన్నత విద్యగా ఏది రబ్బీ బోధన జ్ఞానాన్ని అన్వేషించడంలో జ్ఞానానికి మూలమైన దేవునికి దూరమయ్యారు. దైవసేవ అన్న అతి ముఖ్య విషయాల్ని అలక్ష్యం చేశారు. ధర్మశాస్త్ర సూత్రాల పట్ల గుడ్డివారయ్యారు. ఉన్నత విద్యగా ఏది చెలామణి అవుతున్నదో అదే వారి వాస్తవికాభివృద్ధికి గుదిబండ అయ్యింది. రబ్బీల బోధన కింద యువత మానసిక శక్తులు అణచివేతకు గురి అయ్యాయి. వారి మనసులు స్తబుపడి సంకుచితమయ్యాయి.DATel 50.2

    బాలుడైన యేసు తన విద్యను సమాజమందిర పాఠశాలల్లో అభ్యసించలేదు. ఆయన తల్లే ఆయన మొట్టమొదటి మానవ ఉపాధ్యాయిని. ఆమె నోటి నుంచి ప్రవక్తల గ్రంథాల నుంచి ఆయన పరలోక సంగతులు నేర్చుకున్నాడు. అలనాడు మోషేతో ఇశ్రాయేలును ఉద్దేశించి తాను పలికిన మాటల్నే ఇప్పుడు తన తల్లి ఒడిలో నేర్చుకున్నాడు. బాల్యదశనుంచి యౌవనదశకు చేరినప్పుడు రబ్బీల పాఠశాలలకు వెళ్ళలేదు. అలాంటి మూలాల నుంచి విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన అధ్యాపకుడు దేవుడే.DATel 51.1

    రక్షకుని పరిచర్య కాలంలో “చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెను?” అన్న ప్రశ్న అర్ధం యేసుకు చదవడం రాదని కాదు గాని ఆయన రబ్బీల పాఠశాల విద్యను అభ్యసించలేదని (యోహాను 7:15). మనం సంపాదించగలిగేటట్లు ఆయన జ్ఞానం సంపాదించాడు. లేఖనాల పై ఆయనకున్న అపారజ్ఞానాన్ని బట్టి చిన్నతనంలో ఆయన దైవవాక్యాన్ని ఎంత శ్రద్ధాసక్తులతో పఠించాడో అర్ధమవుతోంది. ఆయన ముందు దైవసృష్టి అనే గొప్ప గ్రంథాలయం తెరిచి ఉంది. సర్వసృష్టిని చేసిన ఆయన భూమిమీద, సముద్రంలో, ఆకాశంలో తన స్వహస్తంతో తానే రాసిన పాఠాల్ని అధ్యయనం చేశాడు. అపవిత్రమైనలోక మార్గాల నుంచి గాక ప్రకృతి నుంచి ఆయన శాస్త్ర విజ్ఞానాన్ని కోకొల్లలుగా సముపార్జించాడు. మొక్కలు, జంతువులు, మనుషుల జీవ శాస్త్రాన్ని ఆయన అధ్యయనం చేశాడు. తన చిన్న వయసు నుంచే ఆయనకు ఒకే ఆశయం ఉంది. ఇతరులకు ఉపకారం చేయడానికే ఆయన నివసించాడు. ఇందుకు ఆయనకు ప్రకృతిలో వనరులు లభించాయి. వృక్ష జీవితాన్ని జంతుజీవితాన్ని అధ్యయనం చేసేటప్పుడు మార్గాలు పద్దతుల్ని గూర్చి కొత్త అభిప్రాయాలు ఆయన మనస్సులోకి వచ్చేవి. దైవ వాక్యాన్ని బోధించడంలో తాను చూసినవాటి నుంచి సాదృశ్యాలు సమకూర్చుకునేవాడు. తన సేవాకాలంలో సత్యాన్ని బోధించడంలో ఆయన ఉపయోగించిన ఉపమానాలు ప్రకృతి ప్రభావాలకు ఆయన మనః ప్రవృత్తి ఎంతగా లోనయ్యిందో, తన దినదిన జీవిత పరిసరాల నుంచి తన ఆధ్యాత్మిక బోధనను ఆయన ఎలా సమకూర్చుకున్నాడో చూపిస్తున్నాయి.DATel 51.2

    ఇలా కార్యాన్ని కారణాన్ని యేసు అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తుండగా దైవవాక్య ప్రాధాన్యం ప్రకృతి కార్యాల ప్రాధాన్యం ఆయనకు బోధపడింది. పరలోక నివాసులు ఆయనకు సహాయకులు. పరిశుద్ధ ఆలోచనలు మాటలు ఆయనవి. యుక్తాయుక్త జ్ఞానోదయం ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మిక కృపలోను ఆధ్యాత్మిక సత్యపరమైన జ్ఞానంలోను నిత్యం పెరిగాడు.DATel 52.1

    ప్రతీ చిన్నారి యేసు వలె జ్ఞానం సంపాదించవచ్చు. వాక్యం ద్వారా పరలోక జనకునితో పరిచయం పెంచుకోడానికి మనం ప్రయత్నిస్తుంటే దేవదూతలు మనకు చేరువవుతారు. మన మనసులు బలం చేకూర్చుకుంటాయి. మన ప్రవర్తన ఉదాత్తం పరిశుద్ధం అవుతుంది. మనం మన రక్షకునిలా రూపుదిద్దుకుంటాం. మనం ప్రకృతిలోని సౌందర్యాన్ని ఔన్నత్యాన్ని వీక్షించే కొద్దీ మన మమతానురాగాలు దేవుని పై నిలుస్తాయి. మనసు భయభక్తులతో నిండినప్పుడు అనంత శక్తుడైన దేవుని కార్యాలతో పరిచయం ద్వారా మన ఆత్మ పరిపుష్టమౌతుంది. ప్రార్ధన ద్వారా దేవునితో సహవాసం మానసిక నైతిక శక్తుల్ని వృద్ధిపర్చుతుంది. ఆధ్యాత్మిక భావాల్ని ప్రోదిచేసినప్పుడు మన ఆధ్యాత్మిక శక్తులు బలో పేతమౌతాయి.DATel 52.2

    యేసు దేవునితో సామరస్యంగా నివసించాడు. బాలుడుగా ఉన్నప్పుడు బాలుడుగా తలంచాడు బాలుడుగా మాట్లాడాడు. కాని తనలోని దైవ స్వరూపానికి పాపపంకిలం అంటలేదు. అయినా ఆయన శోధనకు అతీతుడు కాడు. నజరేతు జనులు దుర్మార్థతకు సామెత అయ్యారు. ఇతరుల పరిగణనలో వారు ఎంత దిగజారిపోయారో అన్నది నతానియేలు అడిగిన ప్రశ్నలో వ్యక్తమౌతోంది. “నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా?” యోహాను 1:46. తన ప్రవర్తన పరీక్షకు నిలబడాల్సిన స్థలంలో ఆయన నిలిచాడు. తన పవిత్రతను కాపాడుకోడానికి ఆయన అనుక్షణం జాగ్రత్తగా ఉండడం అవసరం. బాల్యంలో యౌవనంలో పెద్ద వయసులో మనకు ఆదర్శంగా నిలిచేందుకుగాను మనం ఎదుర్కొనే సంఘర్షణలన్నిటికీ ఆయన లోనయ్యాడు.DATel 52.3

    నజరేతు బాలుణ్ని ,పరాజయం పాలు చెయ్యడానికి సాతాను అవిశ్రాంతంగా కృషిచేశాడు. తన చిన్ననాటి నుంచి ఆయనను పరలోక దూతలు పరిరక్షించారు. అయినా ఆయన జీవితం అంధకారశక్తులతో సాగిన దీర్ఘసంఘర్షణ. పాపం వలన అపవిత్రంకాని పరిశుద్దుడు ఒక్కడు భువిపై నివసించడమన్నది ఆ చీకటి ప్రభువుకి మింగుడు పడలేదు. యేసుని వలలో వేసుకోడానికి అన్నివిధాలా ప్రయత్నించాడు. మన రక్షకుడు ఎదుర్కొన్న భయంకర శోధనల నడుమ నివసించడానికి మానవలోకంలోని ఏ బిడ్డా ఎన్నడూ పిలుపు పొందడం జరగదు.DATel 53.1

    యేసు తల్లిదండ్రులు నిరు పేదలు, కాయకష్టం చేసి బతుకు వెళ్లదీసేవారు. యేసుకి పేదరికం ఆత్మోపేక్ష లేమి అంటే ఏంటో తెలుసు. ఈ అనుభవం ఆయనకు కాపుదలగా పరిణమించింది. తన శ్రామిక జీవితంలో శోధనకు ఆహ్వానం పలికే సోమరి ఘడియలు లేవు. దుష్టస్నేహాలకు తలుపు తెరచే వ్వర్ధ ఘడియలు లేవు. సాధ్యమైనంత మేరకు ఆయన శోధనకు తలుపు మూసి ఉంచేవాడు. లాభం, వినోదం, పొగడ్త, నింద ఇవేవీ తప్పు చెయ్యడానికి అంగీకరించడానికి ఆయన్ని ప్రేరేపించలేకపోయాయి. పాపాన్ని గ్రహించడంలో వివేకం, దాన్ని ప్రతిఘటించడంలో శక్తి ఆయనకు ఉన్నాయి.DATel 53.2

    భూ నివాసులందరిలోను క్రీస్తు ఒక్కడే పాపరహితుడు. అయినా దుర్మార్గులైన నజరేతు ప్రజల నడుమ ఆయన దాదాపు ముప్పయి సంవత్సరాలు నివసించాడు. నిందారహితులుగా నివసించడానికి స్థలం మీద, అదృష్టం మీద, సౌభాగ్యం మీద ఆధారపడేవారికి ఈ వాస్తవం చెంపపెట్టు. శోధన, పేదరికం, ఇడుమలు ఇక్కట్లు సమకూర్చే క్రమశిక్షణ పవిత్రత, పటిష్ఠత సాధనకు అవసరం.DATel 53.3

    క్రీస్తు శ్రమజీవుల గృహాల్లో నివసిస్తూ ఆ కుటుంబ భారాల్ని నమ్మకంగా ఆనందంగా వహించాడు. ఆయన పరలోక సేనాధిపతి. ఆయన ఆజ్ఞను శిరసావహించడానికి దూతలు సంతోషంగా ముందుకు వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆయన ఒక విధేయసేవకుడు. ప్రేమ విధేయతలు గల కుమారుడు. ఒక చేతి పని నేర్చుకుని యోసేపుతో కలిసి వడ్రంగి షాపులో తన సొంత చేతులతో పనిచేశాడు. సామాన్య శ్రామికుడి దుస్తుల్లో ఆ చిన్న పట్టణ వీధుల్లో ఇంటి నుంచి పనికి . పని నుంచి ఇంటికి నడిచేవాడు. తన భారాల తొలగింపుకుగాని, తన శ్రమను తేలిక చేసుకోడానికి గాని ఆయన తన దైవశక్తిని వినియోగించుకోలేదు.DATel 53.4

    బాల్యంలోను యౌవనంలోను యేసు పనిచేసినందువల్ల మనసు, శరీరం వృద్ధి చెందాయి. ఆయన తన శారీరక శక్తుల్ని అజాగ్రత్తగా వినియోగించలేదు. కాని వాటిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు, ప్రతి శాఖలోను ఉత్తమ సేవలందించేందుకు వినియోగించాడు. పనిముట్లను ఉపయోగించడంలో సైతం లోపాలు చోటు చేసుకోడానికి ఆయన ఇష్టపడలేదు. తన ప్రవర్తలోలాగే తన పనిలో కూడా ఆయన సంపూర్ణతను సాధించిన కార్మికుడు. కష్టపడి పనిచెయ్యడం మన విధి అని, పనిని ఖచ్చితంగా నిర్దిష్టంగా చెయ్యాలని, అలాంటి పని గౌరవప్రదమైందని స్వీయ ఆదర్శం ద్వారా ఆయన బోధించాడు. చేతులు ఉపయోగకరంగా ఉండడం ఎలాగో నేర్పించి, యువత జీవిత భారాల్ని వహించడానికి వారికి శిక్షణనిచ్చే శ్రమ, శారీరక బలం చేకూర్చి, ప్రతీ మానసిక శక్తిని వృద్ధిపర్చుతుంది. తమకు ప్రయోజనకరంగా ఉండి ఇతరులకు సహాయపడే ఏదో పనిని అందరూ ఏర్పాటు చేసుకోవాలి. పనిని ఒక వరంగా దేవుడు నియమించాడు. నమ్మకం దాన్ని నిర్వహించే వారే జీవితంలోని మహిమను ఆనందాన్ని కనుగొంటారు. గృహ సంబంధిత విధుల్ని సంతోషంగా నెరవేర్చుతూ తల్లిదండ్రుల భారాల్ని పంచుకునే బిడ్డపై దేవుడు తన ఆమోద ముద్ర సాదరంగా వేస్తాడు. అలాంటి పిల్లలు సమాజంలో ప్రయోజకులైన తమ గృహల్లోనుంచి ప్రయోజకులైన సభ్యులుగా సమాజాన్ని పరిపుష్టం చేస్తారు.DATel 54.1

    శ్లోకంలో తన జీవితకాలమంతా యేసు నమ్మకంగా పనిచేశాడు. ఆయన ఎక్కువ లక్షించాడు, కనుక ఎక్కువ కృషిచేశాడు. తన సేవను ప్రారంభించిన తర్వాత ఆయన ఇలా అన్నాడు, “పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పని చేయలేడు.” యోహాను 9:4 యేసు ఆసుచరులమని చెప్పుకునే అనేకులవలె ఆయన సేవచేయడం, బాధ్యత వహించడం తప్పించుకోలేదు. ఈ క్రమశిక్షణను తప్పించుకుంటారు గనుక అనేకులు బలహీనులుగాను అనమరులుగాను ఉన్నారు. వారికి ఎన్నో సద్గుణాలుండవచ్చు. కాని కష్టాల్ని ఎదురుకోవలసి వచ్చినప్పుడు లేదా ప్రతిబంధకాల్ని అధిగమించాల్సి వచ్చినప్పుడు వారు స్థయిర్యాన్ని కోల్పోయి ఏమి ఉపయోగం లేని వారవుతారు. క్రీస్తు ప్రదర్శించిన నిశ్చయాత్మకత, శక్తి - ధృడ ప్రవర్తన ఆయన, క్రమశిక్షణ ద్వారానే సాధించాడు. మనం కూడా వీటిని అలాగే వృద్ధి పర్చుకోవాలి. ఆయన పొందిన కృప మన నిమిత్తమే.DATel 54.2

    మన రక్షకుడు మానవుల మధ్య నివసించినంత కాలం పేదరికాన్ని పంచుకున్నాడు. వారి చింతలు శ్రమలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు గనుక దీనశ్రామిక ప్రజలకు ఆదరణను ప్రొత్సాహాన్ని ఇవ్వగలిగాడు. తన జీవితం ద్వారా ఆయన బోధించిన బోధనను వాస్తవంగా గ్రహించిన వారు, తరగతుల మధ్య వ్యత్యాసం ఉండాలని, ధనికులు యోగ్యులైన పేదవారి కన్నా అధికులని పరిగణించరు.DATel 55.1

    యేసు తన పనిని ఉత్సాహంతో నేర్పుతో చేసేవాడు. లోక వ్యాపారం ఒత్తిడిని తట్టుకోడానికిగాను బైబిలు మతాన్ని గృహ జీవితంలోకి పనిచేసే కార్యానాలోకి తీసుకువెళ్లి అపై దేవుని మహిమపర్చడంపై దృష్టి కేంద్రీకరించడానికి ఎంతో ఓర్సు ఎంతో ఆధ్యాత్మికత అవసరమౌతాయి. ఇక్కడ క్రీస్తు ఉపకరిస్తాడు. ఎన్నో లోక విచారాల్తో నిండి ఉన్నా ఆయన పరలోక విషయాల్ని ఎన్నడూ విస్మరించలేదు. తరచు కీర్తనలు గీతాలు పాడుకోడం ద్వారా ఆయన హృదయంలోని ఆనందాన్ని వ్యక్తం చేసేవాడు. తరచు నజరేతువాసులు వింటుండగా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించేవాడు. పాటలతో దేవుని స్తుతించి ప్రార్ధించేవాడు. పనిలో సహకార్మికులు అలసిపోయినప్పుడు ఆయన పాటలు పాడి వారిని ఉత్సాహపర్చేవాడు. ఆయన స్తుతిగానం దుష్టదూతల్ని తరిమివేసేది. పరిమళ ధూపంలా అది ఆ స్థలమంతటా వ్యాపించేది. అది వింటున్న వారి మనసులు ఐహిక చెర నుంచి పరలోక గృహానికి చేరుకునేవి.DATel 55.2

    లోకానికి స్వస్తత కృపా ఊటగా యేసు నివసించాడు. నజరేతులో నివసించిన ఆ అజ్ఞాత సంవత్సరాల్లో ఆయన జీవితం దయ కనికరాల ప్రవాహంగా ప్రవహించింది. వృద్ధులు, దుఃఖితులు, కరడుగట్టిన పాపులు, ఆడుకొనే అమాయక బాలలు, చెట్ల తోపుల్లోని చిన్న చిన్న ప్రాణాలు, ఓపికగా బరువులు మోసే ఆ మూగ జీవాలు ఇలా అందరు మనుషులకు అన్ని జీవులకు సంతోషం కూర్చింది. ఎవరి మాటలోని శక్తి లోకాల్ని సృజించిందో ఆ ప్రభువు దెబ్బ తగిలిన పిట్ట బాధను తొలగించడానికి వంగేవాడు. ఆయన దృష్టికి రానిదేది లేదు. పరిచర్య చేయడం విషయంలో ఆయన ఎవరినీ ద్వేషించి తోసిపుచ్చలేదు.DATel 55.3

    ఇలా జ్ఞానంలోను వయసులోను పెరిగి యేసు దేవునిదయను మనుషులదయను పొంది వృద్ధి చెందాడు. అందరికీ సానుభూతి చూపగలడం ద్వారా అందరి సానుభూతిని పొందాడు. ఆయన్ని ఆవరించిన నిరీక్షణ, ధైర్యవాతావరణం ఆయన్ని ప్రతిగృహంలోను దీవెనగా చేసింది. తరచూ సబ్బాతునాడు సమాజ మందిరంలో ఆయన్ని ప్రవక్తల రచనల నుంచి పాఠాలు చదవమని అడగడం జరిగేది. ఆ పరిశుద్ధ వాక్యభాగంలోని సామాన్యమైన మాటల నుంచి కొత్త వెలుగు ప్రకాశించడం జరగడంతో శ్రోతల హృదయాలు ఆనందంతో ఉప్పొంగేవి.DATel 56.1

    యేసు ప్రదర్శనకు దూరంగా ఉండేవాడు. నజరేతులో నివసించిన కాలమంతా తనకున్న స్వస్తత శక్తిని ప్రదర్శించుకోలేదు. ఏ ఉన్నత స్థానాన్ని ఆశించలేదు. ఏ బిరుదులు ప్రకటించుకోలేదు. ఆయన ప్రశాంత, సామాన్య జీవితం, ఆయన బాల్య జీవితాన్ని గూర్చి లేఖనాల మౌనం సయితం మనకో ప్రాముఖ్యమైన పాఠం నేర్పుతున్నాయి. బిడ్డ జీవితం ఎంత ప్రశాంతంగా ఎంత సామాన్యంగా ఉంటే - అనగా కృత్రిమమైన భావోద్వేగాలు నుంచి స్వేచ్ఛగా, ప్రకృతిలో మరింత సామరస్యంగా ఉంటే - అది శారీరక మానసిక శక్తికి ఆధ్యాత్మిక బలానికి అంత దోహదకారిగా ఉంటుంది.DATel 56.2

    మన ఆదర్శం యేసే. ఆయన బహిరంగ సేవాకాలం గురించి ఆసక్తితో Sad Q ప్రస్తావించి ఆయన బాల్య దశను గూర్చిన బోధనను గుర్తించకుండా విడిచి పెట్టేవారు అనేక మంది ఉన్నారు. చెప్పాలంటే, చిన్న పిల్లలకు యువతకు ఆయన ఆదర్శంగా ఉన్నది తన గృహ జీవనంలో అనాలి. సామాన్య సీదాసాదా జీవితంలో మనం దేవునికి ఎంత దగ్గరగా ఉండగలమో బోధించడానికి గాను రక్షకుడు తమ ను తగ్గించుకుని నిరుపేదగా నివసించాడు. జీవితానికి సంబంధించిన సామాన్య విషయాల్లో తన తండ్రిని సంతోషపెట్టడానికి, ఘనపర్చడానికి, మహిమపర్చడానికి, ఆయన నివసించాడు. తమ దినవారీ ఆహారం కోసం పరిశ్రమించే పనివారి దీనవృత్తిని ఘనపర్చడంతో ఆయన పని ప్రారంభమయ్యేది. ప్రజల్ని స్వస్తపర్చుతూ అద్భుతాలు చేస్తున్నప్పుడు దేవుని సేవ చేస్తున్నట్లే వడ్రంగి బల్లవద్ద పనిచేస్తున్నప్పుడూ దేవుని సేవ చేశాడు. తన నిరాడంబర గృహంలో నమ్మకంగా విధేయంగా నివసించడంలో క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించి తన కుమారుణ్ని గురించి పరిశుద్దాత్మ ద్వారా తండ్రి అన్న ఈ మాటల్ని ప్రతీయువకుడు ప్రతీయువతి తనకు అన్వయించుకోవచ్చు. “ఇదిగో నేను ఆదుకొను నాసేవకుడు. నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు.” యెషయా 42:1.DATel 56.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents