Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    48—ఎవరు గొప్పవారు?

    కపెర్నహోముకి తిరిగి వచ్చిన అనంతరం యేసు తాను ప్రజలకు బోధించిన స్థలాలికి వెళ్లలేదు. కాని తన శిష్యులతో కలిసి తమకు తాత్కాలిక గృహంకానున్న ఓ గృహానికి వెళ్లాడు. గలిలయలో తన ఉనికికి ఇంకా మిగిలి ఉన్న కాలంలో జనసమూహానికి బోధించడం మాని తన శిష్యులికి ఉపదేశం ఇవ్వాలని సంకల్పించాడు.DATel 478.1

    గలిలయలో తన ప్రయాణంలో తాను చూసిన ఆ దృశ్యాలికి తన శిష్యుల మనుసుల్ని సిద్ధం చెయ్యాలని క్రీస్తు మళ్లీ ప్రయత్నించాడు. తాను మరణించి తిరిగి లేవడానికి యెరూషలేము వెళ్లాల్సి ఉందని వారికి చెప్పాడు. అప్పుడు ఆయన ఓ విచిత్రమైన గంభీరమైన ప్రకటన చేశాడు. తన శత్రువుల చేతికి తనను అప్పగించనున్నారని వెల్లడించాడు. శిష్యులు ఇప్పుడు సైతం ఆయన మాటల్ని అవగాహన చేసుకోలేదు. దుఃఖవాతావరణం నెలకొన్నప్పటికీ వారి హృదయాల్లో పోటీ స్వభావం చోటుచేసుకుంది. ఆయన రాజ్యంలో ఏది గొప్పదిగా పరిగణన పొందాలన్న దానిపై వారు వాదులాడున్నారు. ఈ వివాదాన్ని క్రీస్తుకు తెలియకుండా దాచాలని అనుకున్నారు. కనుక ఎప్పటిలా ఆయన పక్కన ఉండడానికి ప్రయత్నించలేదు. ఆయన వెనకే నడిచారు. అందుచేత వారు కపెర్నహోములో ప్రవేశించినప్పుడు వారికన్నా ముందు ఆయనే ఉన్నాడు. యేసు వారితలంపుల్ని గ్రహించాడు. వారికి హితవు ఉపదేశం ఇవ్వాలని ఆశించాడు. అయితే ఇందుకోసం ఓ ప్రశాంత ఘడియకోసం కనిపెట్టాడు. వారి మనుసులు తన మాటల్ని స్వీకరించడానికి అనుకూల తరుణం కోసం వేచి ఉన్నాడు.DATel 478.2

    కాసేపటికి వారూ వచ్చారు. దేవాలయ ఆర్ధికాధికారి పేతురు వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించాడు, ” నా బోధకుడు ఈ అర షెకెలు చెల్లింపడా?” ఆ పన్ను పౌరసంబంధమైన పన్ను కాదు. మత సంబంధమైన విరాళం. ఆలయ సేవల నిర్వహణ నిమిత్తం ప్రతీ యూదుడూ ఏడాదికోసారి తప్పక చెల్లించాల్సిన విరాళం ఇది. ఈ విరాళం చెల్లింపు నిరాకరణ ఆలయానికి అపనమ్మకంగా ఉన్నట్లు పరిగణించడం జరిగేది. రబ్బీల దృష్టిలో ఇది ఘోరపాపం. రబ్బీల చట్టాల విషయంలో రక్షకుని వైఖరి, పారంపర్యాచారాలికి మద్దుతు పలికే వారికి ఆయన మందలింపులు, ఆయన ఆలయ సేవల్ని రద్దు చేయ్యడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణ వారికి సాకుగా ఉపకరించాయి. ఇప్పుడు ఆయనపై బురద చల్లడానికి తన శత్రువులికి అవకాశం లభించింది. పన్ను పోగు చేసే వ్యక్తిలో వారికో మంచి మిత్రుడు దొరికాడు.DATel 479.1

    ఆలయం పట్ల క్రీస్తు విశ్వాసాన్ని గూర్చి సుంకరి మాటల్లో పేతురు వ్యంగ్య దూషణను విన్నాడు. ప్రభువుకు గౌరవభంగం కలగకూడదన్న ఉద్దేశ్యంతో తొందరపడి ప్రభువుని సంప్రదించకుండా ఆ పన్ను యేసు చెల్లిస్తాడని జవాబు చెప్పాడు.DATel 479.2

    కాని పేతురు అతడి ప్రశ్నను పాక్షికంగా మాత్రమే అవగాహన చేసుకున్నాడు. పన్ను చెల్లింపు నుంచి మినహాయింపుకి కొన్ని తరగతుల ప్రజలున్నారు. మోషే కాలంలో లేవీయుల్ని గుడార సేవలకు ప్రత్యేకించినప్పుడు ప్రజల నడుమ వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు. ప్రభువిలా అన్నాడు, “తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు.... యెహోవాయే వారికి స్వాస్యము.” ద్వితి 10:9. క్రీస్తు దినాల్లో యాజకులు లేవీయులు ఆలయసేవకులకు ప్రత్యేకించబడ్డవారు గనుక ఆలయ సేవల నిమిత్తం వారు ఏటేటా చందా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రవక్తలికి కూడా ఈ చెల్లింపు మినహాయింపు ఉండేది. యేసు నుంచి పన్ను కోరడం ద్వారా రబ్బీలు క్రీస్తు ప్రవక్త లేక బోధకుడు అన్న విషయాన్ని తోసిపుచ్చి సామాన్యులతో వ్వవహరించినట్లు ఆయనతో వ్యవహరిస్తోన్నారు. పన్ను చెల్లింపు తిరస్కృతి ఆలయానికి అపనమ్మకంగా ఉన్నట్లు నిర్ధారించి ఆయన్ని ప్రవక్తగా విసర్జించడాన్ని సమర్ధిస్తుంది.DATel 479.3

    కొద్ది కాలం క్రితమే పేతురు యేసుని దైవకుమారుడుగా గుర్తించాడు. కాని ఇప్పుడతడు తన ప్రభువు ప్రవర్తనను వివరించడానికి వచ్చిన తరుణాన్ని ఉపయోగించుకోలేదు. యేసు చెల్లిస్తాడంటూ సుంకరికి ఇచ్చిన జవాబు వల్ల పేతురు యాజకులు ప్రధానుల తప్పుడు అభిప్రాయానికి ఆమోదం తెలిపినట్లయ్యింది.DATel 480.1

    పేతురు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు రక్షకుడు ఏంజరిగిందో అన్నదాని విషయమై ఏమి ప్రస్తావించలేదు గాని ఇలా ప్రశ్నించాడు, “సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యెద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా?” పేతురు “అన్యుల యొద్దనే” అని బదులు పలికాడు.” అలాగైతే కుమారులు స్వతంత్రులే” అని యేసు అన్నాడు. ఓ దేశప్రజలు తమ రాజు పోషణ నిమిత్తం పన్నులు చెల్లిస్తుండగా ఆ రాజు పిల్లలు వాటిని చెల్లించాల్సిన అవసరంలేదు. అలాగే దైవ ప్రజలమని చెప్పుకునే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు సేవల్ని సాగించడానికి పన్నులు చెల్లించాల్సి ఉండగా దైవకుమారుడైన యేసు వాటిని చెల్లించబద్దుడు కాదు. యాజకులు లేవీయులు ఆలయంతో తమ సంబంధాన్ని బట్టి వాటి చెల్లంపులకు మినహాయింపు పొందితే ఆలయం ఎవరి తండ్రి గృహమో ఆ ప్రభువు ఆ చెల్లంపుకు మరింత ఎక్కువ మినహాయింపు పొందాలి?DATel 480.2

    ప్రతిఘటన లేకుండా యేసు ఈ పన్ను చెల్లించి ఉంటే వారు చెబుతోన్నది యధార్ధమైందిగా ఆయన అంగీకరించి తున్మూలంగా తాను దేవుణ్నికానని అంగీకరించినట్లు అయ్యేది. ఆ ఆదేశాన్ని అమలు పర్చడం మంచిదని భావించినా అది ఆధారితమైన హక్కును ఆయన తోసిపుచ్చాడు. పన్ను చెల్లంపును ఏర్పాటు చెయ్యడంలో ఆయన తన దేవత్వాన్ని రుజువు చేశాడు. ఆయన దేవునితో ఉన్నవాడని అందుచేత కేవలం ఆ రాజ్యంలో ఓ పౌరుడిలా సుంకం చెల్లించనవసరం లేదని వ్యక్తమయ్యింది.DATel 480.3

    “నీవు సముద్రమునకు పోయి గాలము వేసి, మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన యెడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసికొని నా కొరకు నీ కొరకును వారికిమ్ము” అని ఆయన పేతుర్ని ఆదేశించాడు.DATel 481.1

    తన దేవత్యాన్ని మానవత్వంతో కప్పి ఉంచినప్పటికీ ఈ మహత్కార్యంలో ఆయన తన మహిమను ప్రత్యక్షపర్చుకున్నాడు. దావీదుతో ఈ మాటలన్నవాడు ఆయనేనని రూఢి అయ్యింది, “అడవి మృగములన్నియు వేయి కొండలమిది పశువులన్నియు నావేగదా, కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును. పొలములలోని పశ్వాదులు నావశమై యున్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే.” కీర్తన 50:10-12.DATel 481.2

    పన్ను చెల్లంచడానికి తాను బద్దుణ్ని కానన్న సంగతి యేసు కుండబద్దల కొట్టినట్లు చెప్పినా ఆ విషయమై యూదులతో సంఘర్షణకు దిగలేదు. అది చేసిఉంటేవారు ఆయన మాటల్ని వక్రీకరించి వాటిని ఆయన మీదకే తిప్పి ఉండేవారు. పన్నును అట్టి పెట్టకోడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టకుండేందుకు ఆయన తాను చేయనవసరం లేని పనిని చేశాడు. ఈ పాఠం ఆయన శిష్యులికి ఎంతో ముఖ్యం. ఆలయ సేవల విషయంలో ఖచ్చితమైన మార్పులు త్వరలో చోటుచేసుకోనున్నాయి. స్థిరపడ్డ క్రమాన్ని అనవసరంగా వ్యతిరేకించవద్దని క్రీస్తు వారికి బోధించాడు. సాధ్యమైనంత మేరకు వారు తమ విశ్వాసాన్ని అపార్ధం చేసుకోడానికి చోటుఇవ్వకూడదు. క్రైస్తవులు ఒక్క సత్యసూత్రాన్ని కూడా త్యాగం చెయ్యకుండా నివసిస్తూ సాధ్యమైనంత వరకు సంఘర్షణకు దూరంగా ఉండాలి.DATel 481.3

    పేతురు సముద్రానికి వెళ్లగా క్రీస్తు ఆయన శిష్యులు ఇంటిలో ఉన్నప్పుడు యేసు తక్కిన వారిని తన వద్దకు రమ్మని పిలిచి, “మార్గంలో మీరు ఏ విషయం పై తర్కించుకుంటున్నారు.?” అని ప్రశ్నించాడు. యేసు సముఖం వల్ల ఆయన వేసిన ప్రశ్నవల్ల ఆ విషయం మార్గంలో తాము తర్కిస్తున్నప్పటికన్నా వేరే విధంగా మలుపు తిరిగింది. సిగ్గు ఆత్మ ఖండన వారి నోట మాటలు రాకుండా చేశాయి. తాను తమ నిమిత్తమే మరణించాల్సి ఉన్నానని తమ స్వార్ధాశలు తన స్వార్ధరహిత ప్రేమకు భిన్నంగా ఉన్నాయని యేసు వారితో చెప్పాడు.DATel 481.4

    తాను మరణించాల్సి ఉందని మరణించి తిరిగి లేస్తానని యేసు వారికి చెప్పినప్పుడు తమ విశ్వాసం విషయంలో తాము ఎదుర్కోనున్న పరీక్షను గూర్చిన చర్చలోకి వారిని నడిపించాలని ప్రయత్నించాడు. తమకు తెలపడానికి ఆయన ఉద్దేశిందంతా స్వీకరించడానికి వారు సిద్ధంగా ఉండి ఉంటే వారికి తీవ్ర నిరాశ ఎదురయ్యేది కాదు. తమకు కలిగిన దుఃఖంలోను ఆశాభంగంలోను ఆయన మాటలు వారికి ఎంతో ఆదరణ ఇచ్చేవి. అయితే తనకు ఏం జరుగనుందో ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ, యెరూషలేముకి వెళ్తున్నానన్న మాట ఆయన ఉచ్చరించగానే ఆయన రాజ్యం ప్రారంభం కావడానికి అంతా సిద్ధంగా ఉన్నదన్న ఆశ మళ్లీ వారిలో రగుల్కుంది. ఉన్నత హోదాలు అలంకరించాల్సిన వారు ఎవరు అన్న ప్రశ్నకు ఇది దారి తీసింది. పేతురు సముద్రం నుంచి వచ్చాక రక్షకుడు ప్రశ్నించడాన్ని గురించి చెప్పారు. చివరిగా “పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు?” అని యేసుని అడిగాడు.DATel 482.1

    రక్షకుడు శిష్యుల్ని తన చుట్టూ పోగుచేసుకుని వారితో ఇలా అన్నాడు, “ఎవడైనను మొదటి వాడైయుండగోరిన యెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడనై యుండవలెను.” ఈ మాటల్లో గంభీరత శక్తి ఉన్నాయి. వాటిని గ్రహించలేని స్థితిలో శిష్యులున్నారు. క్రీస్తు పరిశీలించింది శిష్యులు పరిశీలించలేకపోయారు. వారు క్రీస్తు రాజ్య స్వభావాన్ని అవగాహన చేసుకోలేదు. ఈ అజ్ఞానమే వారి వివాదానికి కారణంలా కనిపిస్తోంది. కాని దానికి అసలుకారణం ఇంకా లోతైంది. ఆ రాజ్య స్వభావాన్ని వివరించడం ద్వారా వారి వివాదాన్ని తాత్కాలికంగా పరిష్కరించి ఉండవచ్చు. అయితే అది దాని అసలు కారణాన్ని స్పృశించేది కాదు. పూర్తి జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా ఎవరు గొప్ప అన్న అంశం వచ్చినప్పుడు ఆ సమస్యమళ్లీ ఊపిరిపోసుకునేది. క్రీస్తు ఆరోహణానంతరం సంఘానికి గొప్పు ముప్పు వచ్చేది. పరలోకంలో మహా సంఘర్షణ ప్రారంభానికి ఏ స్వభావం కారణమో, ఏ స్వభావం క్రీస్తుని భూమి మీదకి మరణించడానికి రప్పించిందో ఆ స్వభావమే అత్యున్నత స్థానం కోసం పోరాటానికి కారణం. “వేకువ చుక్క” మహిమ విషయంలో దైవసింహాసం చుట్టూ ఉన్న దూతలందర్నీ మించినవాడు. దేవుని కుమారునితో సన్నిహిత సంబంధం బాంధవ్యాలున్నవాడు అయిన లూసీఫర్ దృశ్యం ఆయన ముందు నిలిచింది. లూసీఫర్ “మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందను” (యెషయా 14:12, 14) అన్నాడు. ఆత్మ ఔనత్యం కోసం యావ పరలోకంలో సంఘర్షణకు దారితీసి దేవదూతల సమూహాల బహిషృతికి కారణమయ్యింది. లూసీఫర్ మహోన్నతునితో సమానుడు కావాలని నిజంగా ఆకాంక్షించి ఉంటే పరలోకంలో తనకు నియుక్తమైన స్థానాన్ని త్వజించేవాడు కాదు. ఎందుకంటే సర్వోన్నతుని స్వభావం స్వార్ధరహిత సేవలో ప్రదర్శితమౌతుంది. లూసీఫర్ దేవుని అధికారాన్ని ఆకాంక్షించాడు. ఆయన ప్రవర్తనను కాదు. అతడు తనకోసం అత్యున్నత స్థానాన్ని కోరుకున్నాడు. అతడి స్వభావం ఎవరిలో పని చేస్తుందో వారందరూ అతడి లాగే వ్యవహరిస్తారు. ఈ రకంగా వేర్పాటు, భేదాభిప్రాయాలు, కలహాలు చోటుచేసుకోడం తథ్యం. బలవంతుడికే ప్రాతినిధ్యం దక్కుతుంది. సాతాను రాజ్యం బలాత్కారంతో సాగే రాజ్యం. ప్రతీ వ్యక్తి ప్రతీ ఇతర వ్యక్తిని తన అభివృద్ధికి నిరోధకుడిగానో లేక తాను పైకెక్కడానికి ఉపకరించే శోపానంగానే పరిగణిస్తాడు.DATel 482.2

    దేవునితో సమానంగా ఉండడం ఆత్రంగా అందిపుచ్చుకోవలసిన ఒక వస్తువుగా లూసీఫర్ పరిగణించగా, మహోన్నతుడైన క్రీస్తు “మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని.... ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్నుతాను తగ్గించుకొనెను.” ఫిలి 2:7, 8. ఇప్పుడు సిలువ ఆయన ముందున్నది. ఆయన శిష్యులు సాతాను రాజ్య సూత్రమైన స్వార్థంతో ఎంతగా నిండి ఉన్నారంటే వారు తమ ప్రభువుకి సానుభూతి చూపలేకపోతున్నారు. లేదా తమనిమిత్తం తానుభరిస్తోన్న అవమానాన్ని గురించి మాట్లాడినప్పుడు వారు దాన్ని అవగాహన చేసుకోలేదు.DATel 483.1

    అతి సున్నితంగా అయినా గంభీర నిశ్చయతతో దుర్మారతను సరిచెయ్యడానికి యేసు ప్రయత్నించాడు. పరలోక రాజ్యంలో ఏ సూత్రం ప్రాధ్యాన్యం వహిస్తోందో, పరలోక న్యాయస్థానం పరిగణించే విధంగా వాస్తవమైన గొప్పతనం అంటే ఏంటో ఆయన చూపించాడు. అతిశయంతో పేరు ప్రఖ్యాతులపై ఆశతో పనిచేసినవారు తాము పొందిన వరాల్ని తిరిగి దేవునికి ఎలా సమర్పించాలని ఆలోచించేకన్నా తమ స్వార్ధం గురించి తమకు ఒనగూడే ఫలాలు గురించి ఆలోచిస్తోన్నారు. పరలోక రాజ్యంలో వారికి తావుండదు. ఎందుకంటే వారు సాతనుతో ఉన్నవారుగా గుర్తింపు పొందుతారు.DATel 483.2

    గౌరవానికి ముందు వినయం ఉంటుంది. మనుషుల ఎదుట ఒక ఉన్నత స్థానాన్ని అధిష్టించడానికి బాప్తిస్మమిచ్చే యోహానులా దేవుని ముందు తక్కువ స్థానాన్ని ఆక్రమించే పనివారినే దేవుడు ఎంపిక చేస్తాడు. చిన్నపిల్లల్ని ఎక్కువగా పోలిన శిష్యుడే దేవుని సేవలో ఎక్కువ సమర్ధంగా పరిచేస్తాడు. తనను తాను ఘనపర్చుకోడానికి కాక ఆత్మల్ని రక్షించడానికి ప్రయత్నించే వారికి పరలోక వాసులు సహకరిస్తారు. దేవుని సహాయం తనకు అత్యవసరమని గుర్తించే వ్యక్తి దాని కోసం విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ అతనికి యేసుని చూపిస్తాడు. ఆ దర్శనం ఆత్మను బలపర్చి ఉన్నతం చేస్తుంది. క్రీస్తుతో సహవాసం నుంచి అతడు బయలు దేరి పాపంలో నశించిపోతోన్న ఆత్మల్ని రక్షించడానికి పూనుకుంటాడు. అతడు తన కర్తవ్యానికి అభిషేకం పొందుతాడు. అనేక మంది విద్యావంతులు మేధావులు విఫలులయ్యే చోట ఇతడు విజయం సాధిస్తాడు.DATel 484.1

    మనుషులు తమ్మునుతాము సమున్నతపర్చుకున్నప్పుడు, దేవుని మహాప్రణాలిక విజయవంతం కావడానికి తామెంతో అవసరమని భావించినప్పుడు వారిని పక్కన పెట్టడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తాడు. దేవుడు వారి మీద ఆధారపడలేదనడానికి అది ఓ నిదర్శనం. వారి తొలగింపు వల్ల పని ఆగిపోదు, మరెక్కువ శక్తితో ఆ పని ముందుకి సాగుతుంది.DATel 484.2

    తన రాజ్య స్వభావాన్ని గురించి శిష్యులికి యేసు ఉపదేశించడం మాత్రమే చాల్లేదు. దాని సూత్రాలికి అనుగుణంగా వారిని నడిపించడానికిగాను వారికి హృదయపరివర్తన అవసరం. చిన్న బిడ్డను పిలిచి ఆ బిడ్డను వారి ముందుంచాడు యేసు. ఆ బిడ్డను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నాడు. ” మీరు మార్పునొంది బిడ్డలవంటివారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు” నిరాడంబరత తన్నుతాను మర్చిపోవడం నిష్కళంక ప్రేమ చిన్నబిడ్డల్లోని ఈ గుణలక్షణాల్ని ఎంతో విలువగలవిగా దేవుడు పరిగణిస్తాడు. నిజమైన గొప్పతనం తాలూకు గుణలక్షణాలు ఇవి.DATel 484.3

    దేవుని రాజ్యం లోక సంబంధమైన గౌరవం ప్రదర్శనలతో కూడింది కాదు. యేసు పాదాల వద్ద ఈ విశిష్టతలన్నీ మరుగున పడ్డాయి. కులాన్ని గురించి లేదా లోకసంబంధమైన ప్రాధాన్యం గురించి ఎలాంటి ఆలోచనా లేకుండా ధనికులు పేదలు పండితులు పామరులు ఏకమవుతారు. ఆయన తన రక్తం చిందించి కొన్న ఆత్మలుగా అందరూ కలుసుకుంటారు. తమను విమోచించి దేవునికి సమర్పించిన ఆ ప్రభువు పై అందరూ ఆధారపడి ఉంటారు.DATel 485.1

    యధార్థ చిత్తం విరిగినలిగిన హృదయం గల ఆత్మ దేవుని దృష్టిలో మిక్కిలి విలువైంది. తమ హోదాను బట్టి గాని, భాగ్యాన్ని బట్టి గాని, ప్రతిభ ప్రాభవాల్ని బట్టిగాని కాక క్రీస్తుతో వారి ఏకత్వాన్ని బట్టి మనుషుల పై దేవుడు తన ఆమోద ముద్రను వేస్తాడు. సాత్వికులు దీనహృదయులు మహిమ ప్రభువుకి ప్రీతిపాతులు. “నీరక్షణ కేడెము నీవు నాకందించుచున్నావు..... నీ సాత్వికము” - మానవ ప్రవర్తనలో భాగంగా - ” నన్ను గొప్ప చేసెను” అన్నాడు దావీదు. కీర్త 18:35;DATel 485.2

    “ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనవాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనును” అని యేసు అన్నాడు. ” యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచ్నూడు, ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము ....ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.” యెషయా 66:1,2.DATel 485.3

    రక్షకుని మాటలు శిష్యుల్లో తమపై తమకు అపనమ్మకం పుట్టించాయి. ఆ సమాధానంలో ఎవర్నీ ఎత్తి చూపలేదు అయితే ఒక సందర్భంలో తన చర్య సరిఅయినదో కాదో అని యోహాను ప్రశ్నించుకున్నాడు. చిన్నబిడ్డ స్వభావంతో ఆ విషయాన్ని యేసు ముందుంచాడు. “బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమి అన్నాడు.”DATel 485.4

    ఈ వ్యక్తిని నిరోధించడంలో వారు తమ ప్రభువు ప్రతిష్ఠను కాపాడున్నామని భావించారు. నిజానికి తాము తమ ప్రతిష్ఠ నిమిత్తం రోషంగా వ్యవహారించామని గ్రహించడం మొదలు పెట్టారు. వారు తమ పొరపాటును గుర్తించి “వారిని ఆటంకపరచకుడి; నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు” అన్న యేసు మందలిలంపును స్వీకరించారు. ఏ రకంగానైనా క్రీస్తుకి అనుకూలంగా వ్యవహరించే వారిని వ్యతిరేకించకూడదు. క్రీస్తు ప్రవర్తననను బట్టి పనిని బట్టి అనేకులు ఆయనకు ఆకర్షితులయ్యారు. వారి మనుసులు ఆయన్ని విశ్వసించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ ఆత్మల్ని నిరుత్సాహాపర్చకుండా శిష్యులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శిష్యులు వారి ఉద్దేశాల్ని చదవలేరు. వ్యక్తిగతంగా యేసు తమ మధ్య ఇకలేనప్పుడు ఆయన పరిచర్య బాధ్యత మీదపడినప్పుడు వారు సంకుచిత స్వభావం ప్రదర్శించక తమ ప్రభవు ప్రదర్శించిన సానుభూతిని తామూ ప్రదర్శించాలి.DATel 485.5

    ఒక వ్యక్తి అన్ని విషయాల్లోను మన అభిప్రాయాల ప్రకారం నడుచుకోడం లేదన్న దాన్ని బట్టి అతడు దేవుని. సేవకు పనికి రాడని భావించడం సమర్ధనీయం కాదు. యేసు మహామహోపాధ్యాయుడు. తీర్పుతీర్చుడానికి గాని ఆజ్ఞాపించడానికి గాని పూనుకోక మనలో ప్రతీ ఒక్కరూ వినయ మనసుతో యేసు పాదాల వద్ద కూర్చుని ఆయన ఉపదేశించేది నేర్చుకోవాలి. దేవుడు సమ్మతిపర్చే ప్రతీ ఆత్మ క్షమాస్పూర్తితో నిండిన క్రీస్తు ప్రేమకు ఓ ప్రసార సాధనమే. దేవుని వెలుగు ప్రసారమయ్యే సాధనాల్లో ఒక సాధనాన్ని నిరుత్సాహపర్చకుండా, తద్వారా లోకానికి, ప్రసరించాలని దేవుడు ఉద్దేశించిన కిరణాల్ని అడ్డుకోకుండా జాగరూకత వహించడం ఎంత అవసరం!DATel 486.1

    క్రీస్తుకి ఆకర్షితుడవుతోన్న ఒక వ్యక్తి పట్ల ఒక శిష్యుడు ప్రదర్శించే కాఠిన్యం లేక ఉదాసీనత - క్రీస్తు పేరట సూచక క్రియలు చేయవద్దని ఒకణ్ని యోహాను నిరోధించినట్లు - ఆ వ్యక్తి పాదాల్ని అపవాది మార్గంలోకి నెట్టి అతడి నాశనానికి పాల్పడవచ్చు. ఒకడు ఇది చెయ్యడం కన్నా అతడి “మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు” అని యేసన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ” నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి వేయుము. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని నరికి వేయుము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె కుంటి వాడనై (నిత్య) జీవములో ప్రవేశిమంచుట మేలు.” మార్కు 9:42-45;DATel 486.2

    మిక్కిలి శక్తిమంతమైన ఈ పదబంధాల వినియోగం దేనికి? ఎందుకనగా “నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారనుడు వచ్చెను” తమ తోటి మానవుల ఆత్మ విషయంలో పరలోక రాజు చూపించిన శ్రద్ధాసక్తులకన్నా తక్కువ శ్రద్ధ ఆయన శిష్యులు చూపిండం తగునా? ప్రతీ ఆత్మకోసం చెల్లించిన మూల్యం వెలకందనిది. అందునుబట్టి ఒక్క ఆత్మను తోసిపుచ్చి తద్వారా రక్షకుడి ప్రేమను ఆయన అనుభవించిన పరాభవాన్ని నరకయాతనను నిరర్ధకం చెయ్యడం ఘోరపాపం.DATel 487.1

    ” అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు. ” మత్త 18:7. సాతాను ప్రేరణ వలన లోకం క్రీస్తు అనుచరుల్ని వ్యతిరేకిస్తుంది. వారి విశ్వాసాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. అయితే క్రీస్తు నామం ధరించి ఈ పని చేసే వానికి శ్రమ. ఆయన సేవకులమని చెప్పుకుంటూ ఆయన ప్రవర్తనకు విరుద్ధంగా నడుచుకునేవారు ప్రభువుని సిగ్గుపర్చుతోన్నారు. వారి వలన వేల ప్రజలు మోసపోయి తప్పుదారిపడుతోన్నారు. ఈDATel 487.2

    పాపానికి దారి తీసి క్రీస్తుకి చెడ్డ పేరు తెచ్చే ఏ అలవాటునైనా ఆచారాన్నయినా మానుకోడం మంచిది, దానికి ఎంతటి త్యాగం అవసరమైనా సరే. దేవున్ని అగౌరవపర్చేది ఆత్మకు ఉపకారం చెయ్యజాలడు. న్యాయ సూత్రాల్ని అతిక్రమించే వ్యక్తికి దేవుని దీవెనలుండవు. అతడి ప్రవర్తనను దిగజార్చి ఇతరుల్ని తప్పుదారి పట్టించడానికి అతడు ప్రేమించిన ఒక్క పాపం చాలు. శరీరాన్ని మరణం నుంచి కాపాడేందుకు పాదాన్ని గాని చెయ్యిని గాని నరికి వేస్తే లేక కన్నుని తీసివేస్తే, ఆత్మకు నాశనాన్ని తెచ్చే పాపాన్ని తీసివేసుకోడానికి మనం మరెంత ఆతురతగా ఉండాలి!DATel 487.3

    బలి అర్పణ సంస్కారవిధిలో ప్రతీ బలిలోను ఉప్పు కలిపేవారు. ధూపార్చన మల్లే క్రీస్తు నీతి మాత్రమే ఈ సేవను దేవునికి అంగీకృతం చేస్తాడని ఇది సూచించింది. ఈ ఆచారాన్ని ప్రస్తావిస్తూ యేసు ఇలా అన్నాడు. “ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వల కలుగుచున్నది.” “మీలో మీరు ఉప్పు సారము గలవారై యుండి యెకరితో ఒకరు సమాధానముగా ఉండుడి.” “పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా ” (రోమా 12:1) తమ్మును తాము సమర్పించుకునే వారందరూ రక్షించే ఈ ఉప్పు సారాన్ని అనగా రక్షకుని నీతిని పొందాల్సి ఉన్నారు. అప్పుడు చెడిపోకుండా ఉప్పు కాపాడేటట్లే మనుషుల్లోని దుర్మార్గతను అదుపుచేస్తూ వారు “లోకమునకు ఉప్పయి” ఉంటారు. మత్త 5:13; కాగా ఉప్పు తన సారాన్ని కోల్పోతే భక్తిని చాటుకుంటూ క్రీస్తు ప్రేమ లేకుండా ఉంటే మంచి చెయ్యడానికి ఉండదు. ఆ జీవితం రక్షించే ప్రభావాన్ని ప్రపంచంపై ప్రసరించలేదు. నా రాజ్యన్ని నిర్మించడంలో మీరు నా ఆత్మను పొందడం మిద మీ శక్తి మీ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది అంటోన్నాడు యేసు. మీరు రక్షణార్ధమైన రక్షణ వాసనగా ఉండాలని ఆకాంక్షిస్తే మీరు నా కృపలో పాలిభాగస్తులు కావాలి. అప్పుడు మీలో పోటీ తత్వం ఉండదు. స్వప్రయోజనాన్ని విచారించకుండా ఇతరులు భాగ్యవంతలవ్వాలని కోరుకునే ప్రేమ మీకు ఉంటుంది.DATel 487.4

    పశ్చాత్తాపపడే పాపి “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొట్టె పిల్ల” (యోహా 1:29) పైనే తన దృష్టిని నిలపాలి. ఆయన్ని వీక్షించడం ద్వారా అతడు మారిపోతాడు. అతడి భయం సంతోషంగా మారుతుంది. అతడి సందేహాలు నిరీక్షణగా మార్తాయి. కృతజ్ఞత వెల్లువెత్తుతుంది. కఠిన హృదయం కనికరంతో నిండుతుంది. ఆత్మలోకి ప్రేమ ప్రవాహంలా పారుతుంది. క్రీస్తు అతడిలో ఉండి నిత్యజీవాన్నిచ్చే ఊటగా ప్రవహిస్తాడు. “వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిననుభవించిన వాడుగాను, ఉన్నవాడు, నశించిన వారిని రక్షించడానికి శ్రమిస్తోన్న వాడు, అవమానానికి అవహేళనకు తిరస్కారానికి గురి అయినవాడు తన కర్తవ్యం పూర్తి అయ్యే వరకు పట్టణం నుంచి పట్టణానికి పలాయితుడు కావలిసివచ్చినవాడు ఆయిన యేసుని మనం చూసినప్పుడు గెత్సెమనే తోటలో రక్తాన్ని చెమటగా ఆయన కార్చడం చూసినప్పుడు సిలువ మీద తీవ్ర బాధతో మరణించడం చూసినప్పుడు మనం ఇదంతా చూసినప్పుడు గుర్తింపు కోసం ఇక ఆకాంక్షించం. యేసుని చూసినప్పుడు మనం మన నిర్లిప్తతను గురించి మన సోమరితనం గురించి మన స్వార్థ ప్రయోజనాలకి పాకులాడడం గురించి సిగ్గుపడ్డాం, ప్రభువుకి నిష్కపట సిలువను మోస్తూ ఆయన్ని వెంబడించడానికి శ్రమలు భరించడానికి లేదా హింసపొందడానికి మనం సంతోషించాలి.DATel 488.1

    “కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమైయున్నాము” రోమా 15:1. క్రీస్తుని విశ్వసించే ఆత్మ తన విశ్వాసం బలహీనంగా ఉండి తన కాళ్లు చిన్నపిల్ల కాళ్లమల్లే వణుకుతున్నప్పటికీ ఏ ఆత్మనూ తక్కువ అంచనా వెయ్యకూడదు. ఇంకొకరికన్నా మనకు ఎక్కువ ఉపాకారం కలిగించింది ఏదైనా ఉంటే - అది విద్య కావచ్చు సంస్కారం కావచ్చు ఉదాత్త ప్రవర్తన కావచ్చు. క్రైస్తవ శిక్షణ కావచ్చు. మతపరమైన అనుభవం కావచ్చు - అదేదైనా మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి మనం రుణపడి ఉన్నాం. వారికి మనం మన శక్తి మేరకు పరిచర్య చేయాల్సి ఉన్నాం. బలం ఉంటే మనం బలహీనుల్ని ఆదుకోవాలి. పరలోకంలోని తండ్రి ముఖాన్ని నిత్యం వీక్షిస్తుండే దూతలు ఆయన చిన్న బిడ్డలికి ఎంతో ఆనందంగా పరిచర్య చేస్తుంటారు. అభ్యంతరకరమైన అనేకులు ప్రవర్తన దోషాలు కలిగి తడబడ్తోన్న ఆత్మల్ని గూర్చి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాము ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ దేవదూతలు ఉంటారు. ఎవరు స్వార్ధంతో మిక్కిలి కఠినమైన పోరాటం సల్పుతున్నారో ఎవరి పరిసరాలు మిక్కిలి నిరాశాజనకంగా ఉంటాయో వారితో దేవదూతలు ఉంటారు. ఈ పరిచర్యలో క్రీస్తు యధార్ధమైన అనుచరులు సహకరిస్తారు.DATel 489.1

    ఈ చిన్న బిడ్డల్లో ఒకడు సాతానుకు లొంగి నా పట్ల ఓ తప్పిదం చేస్తే అతణ్ని సన్మార్గంలో పెట్టడం నా పని. రాజీకి మొదటి ప్రయత్నం అతడు చెయ్యడానికి వేచి ఉండవద్దు. యేసు ఇలా అన్నాడు, ” నాకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొట్టెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబది తొమ్మిది గొట్టెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోక మందున్న మీ తండ్రి చిత్తము కాదు.”DATel 489.2

    సాత్వికం కలిగి ” మిలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు” (గలతీ 6:1) తప్పు చేస్తున్న వాడి వద్దకు వెళ్లి “నీవును అతడును ఒంటిరిగానున్నప్పుడు అతని గద్దించుము.” అతడి తప్పు ఇతరులికి బహిర్గతం చేసి అతణ్ని సిగ్గుపర్చడం లేక క్రీస్తు నామం ధరించిన ఒక వ్యక్తి పాపాన్ని లేదా పొరపాటుని వెల్లడిచెయ్యడం ద్వారా క్రీస్తుకి అపకీర్తి తేవడం గాని చేయవద్దు. తప్పిదంలో ఉన్న వాడితో నిజం చెప్పడం అవసరం. అతడిలో దిద్దుబాటు కలిగేందుకుగాను అతడు తన తప్పును తెలుసుకోడం అవసరం. అయితే అతడికి తీర్చుతీర్చడం లేక అతణ్ని ఖండించడం ఈ పని కాదు. మిమ్మల్ని మీరు సమర్ధించుకోడానికి ప్రయత్నించవద్దు. మీ కృషి అంతా అతడి పునరుద్ధరణకే జరగాలి. ఆత్మకు తగిలిన గాయాలికి చికిత్స చేయడానికి అతి సున్నితమైన స్పర్శ అతికోమలమైన దయారసం అవసరం. కల్వరిబాధలు శ్రమలు అనుభవించిన ప్రభువు నుంచి ప్రవహించే ప్రేమ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తే “మరణము నుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పి” వేస్తారని (యాకో 5:20) గ్రహించి సహోదరుడు సహోదరుడితో దయాకనికరాలతో మెలగేటట్లు నడిపించండి.DATel 489.3

    కాగా ఈ కృషి సైతం నిరర్ధకం కావచ్చు. ‘“అప్పుడు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము” అన్నాడు యేసు. ఒక్కడు వెళ్లినప్పుడు విజయం లభించనప్పుడు బహుశా వారి సంయుక్త ప్రభావం పని చెయ్యవచ్చు. ఆ తప్పిదంతో వారికి ఎలాంటి సంబంధం లేనందువల్ల వారు నిష్పక్షపాతంగా వ్యవహారించడానికి అవకాశముంది. తప్పు చేస్తున్న వ్యక్తికి వీరిచ్చే హితవుకు ఈ విషయం బలం చేకూర్చుతుంది.DATel 490.1

    అతడు వారిని కూడా లెక్క చెయ్యకపోతే, అప్పుడు - అప్పుడు మాత్రమే - ఆ విషయాన్ని సంఘం ముందుకు తేవాలి. తప్పిదస్తుణ్ని పునరుద్ధరించే ప్రయత్నంలో క్రీస్తు ప్రతినిధులుగా సంఘసభ్యులు ఏకమై ప్రార్ధన పూర్వకంగా అతడికి విజ్ఞప్తి చెయ్యాలి. పరిశుద్దాత్మ తన సేవకుల ద్వారా మాట్లాడాడు. తప్పిదస్తుడు తిరిగి దేవుని వద్దకు రావలసిందిగా విజ్ఞాపన చేస్తాడు. ఆత్మావేశంతో మాట్లాడూ అపొస్తలుడు పౌలు ఇలా అంటోన్నాడు, “దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై - దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.” 2కొరి 5:20; ఈ సంయుక్త విజ్ఞప్తిని తోసిపుచ్చేవాడు తమను క్రీస్తుతో బంధించే బాంధ వ్యాన్ని తెంచివేసి తద్వారా సంఘసహవాసాన్ని పొగొట్టుకుంటాడు. ఇక నుంచి “అతనిని నీకు అన్యునిగాను సుకంరిగాను ఎంచుకొనుము” అన్నాడు యేసు. అయినా పూర్వ సహోదరులు అతణ్ని ద్వేషించకూడదు లేదా నిర్లక్ష్యం చెయ్యకూడదు. తన మందలోకి తీసుకురావడానికి క్రీస్తు ఇంకా ప్రయత్నం చేస్తోన్న తప్పిపోయిన గొర్రెగా వారు అతడితో దయగా మెలగాలి.DATel 490.2

    తప్పు చేసినవారి పట్ల వ్యవహరించాల్సిన రీతిని గూర్చి క్రీస్తు ఉపదేశం మోషే ద్వారా దేవుడు ఇశ్రాయలుకిచ్చిన ఈ బోధనలో నిర్దిష్టంగా ఉంది. “నీ హృదయములో నీ సహోదరుని మిద పగపట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక గద్దింపవలెను.” లేవీ 19:17; అంటే తప్పిదంలోను పాపంలోను ఉన్న వారిని పునరుద్ధరించడానికి క్రీస్తు నియమించిన బాధ్యత ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే అతడు ఆ పాపంలో భాగ్యస్వామి అవుతాడు. మనం స్వయంగా చేసిన పాపానికి ఎంత బాధ్యులమో మనం నిలువరించగలిగి ఉన్న చెడుగుకీ అంతే బాధ్యుల మవుతాం.DATel 491.1

    తప్పు చేసిన వాడికే మనం ఆ తప్పును చూపించాలి. దాన్ని మనలో మనం వ్యాఖ్యానించుకుని విమర్శలు వ్యక్తం చేసుకునే అంశం చేసుకోకూడదు. లేక సంఘానికి నివేదించిన తర్వాత కూడా దాన్ని గురించి ఇతరులికి చెప్పకూడదు. క్రైస్తవుల పాపాల్ని గురించిన సమాచారం అవిశ్వాస లోకానికి ఆటంకబండగా ఉంటుంది. అంతేకాదు వీటిని గురించి ఆలోచించడం ద్వారా మనకు హాని తప్ప మేలు కలగదు. ఎందుకంటే మనం దీక్షగా వీక్షించే రూపం మనలో ఏర్పడుంది. ఒక సహోదరుడి పొరపాటు సరిదిద్దడానికి ప్రయత్నించేటప్పుడు తన సహోదరుల విమర్శల నుంచి సాధ్యమైనంతమట్టుకు అతణ్ని కాపాడడానికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. అలాగైనప్పుడు అవిశ్వాసుల విమర్శల నుంచి మరింత ఎక్కువగా కాపాడాడు? మనమే తప్పులు చేస్తుంటాం. మనకు క్రీస్తు కనికరం, క్షమాపణ అవసరం. ఆయన మనపట్ల ఎలా వ్యవహరించాలని మనం కోరుకుంటామో అలాగే మనం ఒకరి పట్ల ఒకరు మసులుకోవాలని ఆయన ఆదేశం.DATel 491.2

    “భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును; భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును.” నారు పరలోక రాయబారులుగా వ్యవహరిస్తోన్నారు. ఈ పరిచర్య సమస్యలు నిత్యత్వానికి సంబంధించిన సమస్యలు.DATel 491.3

    అయినా బరువైన ఈ బాధ్యతను మనం ఒంటరిగా వహించనవసరం లేదు. ఆయన వాక్యాన్ని ఎక్కడ చిత్త శుద్ధితో ఆచరించడం జరుగుతుందో అక్కడ క్రీస్తు నివసిస్తాడు. సంఘ సమావేశాల్లోనే కాదు, ఎక్కడ ఆయన శిష్యులు సమావేశమవుతారో - వారు ఎంత తక్కువమందైనా - అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఇలా అంటోన్నాడు, “మిలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చియైనను భూమిమీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును.”DATel 492.1

    “పరలోకమందున్న నా తండ్రి” అంటూ తన మానవత్వాన్ని బట్టి తమ శ్రమల్లో పాలుపంచుకుని, తమ బాధల్లో సానుభూతి చూపిస్తుండగా , తన దైవత్వం వల్ల తాను అనంత దేవుని సింహాసనంతో అనుసంధానపడి ఉన్నానని యేసు తన శిష్యులికి గుర్తుచేస్తోన్నాడు. అద్భుతమైన భరోసా! నశించిన దాన్ని రక్షించడంలో పరలోక నివాసులు సానుభూతితో మానవులతో కలిసి కృషి చేస్తారు. ఆత్మలను క్రీస్తు వద్దకు ఆకర్షించడంలో మానవులతో కలిసి పనిచెయ్యడంలో పరలోక శక్తి అంతటినీ వినియోగించడం జరుగుతోంది.DATel 492.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents