Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    26—కపెర్నహోములో

    తన ప్రయాణాల మధ్యకాలంలో యేసు కపెర్నహోములో ఉంటుండేవాడు. అందుచేత ఆ పట్టణం “ఆయన సొంత పట్టణం” గా ప్రసిద్ధిగాంచింది. అది గలిలయ తీరాన గెన్నేసంతు మైదానం సరిహద్దుకు దగ్గరగా ఉంది.DATel 259.1

    భూమట్టం కన్నా సరస్సుమట్టం తక్కువగా ఉన్నందువల్ల కోస్తాను అనుకుని ఉన్న మైదానంలో దక్షిణాన ఉన్న చక్కని శీతోష్ణస్థితి అక్కడ ఉంది. క్రీస్తు దినాల్లో ఇక్కడ ఖర్జూరపు చెట్లు, ఒలీవ చెట్లు, పండ్ల చెట్లు, ద్రాక్ష తోటలు, పచ్చని పంటపొలాలు, రంగురంగుల పువ్వులతో నిండిన పూలతోటలు ఉన్నాయి. కొండల నుంచి నిత్యం ప్రవహిస్తోన్న సెలయేళ్ళు వీటిని తడుపుతున్నాయి. సరస్సు తీరాన ఉన్న, సరస్సు చుట్టూ కొంచెం దూరంలో ఉన్న కొండల నడుమ పట్టణాలు గ్రామాలు చుక్కల్లా కనిపిస్తోన్నాయి. సరస్సు చేపల పడవలో నిండి ఉంది. అన్నిచోట్ల ప్రజలు చురుకుగా పనిచేస్తూ సందడిగా ఉన్నారు.DATel 259.2

    కపెర్నహోము రక్షకుని పరిచర్యకు అనుకూలమైన కేంద్రంగా ఉంది. దమస్కు నుంచి యెరూషలేముకు ఈజిప్టుకు మధ్యధరా సముద్రానికి ఉన్న మార్గం పక్క ఉన్నందువల్ల ప్రయాణానికి అది అనువుగా ఉండేది. అనేక దేశాలనుంచి వచ్చిన ప్రజలు ఆ పట్టణం గుండా వెళ్లడమో లేదా తమ రాకపోకల్లో అక్కడ విశ్రాంతి తీసుకోవడమో జరిగేది. యేసు ఇక్కడ అన్ని జాతుల ప్రజల్ని, అన్నివర్గాల వారినీ, ధనికుల్ని, దరిద్రుల్ని కలుసుకోగలిగేవాడు. వారు ఆయన బోధనల్ని ఇతరదేశాల్లోకి అనేక గృహాల్లోకి తీసుకువెళ్లేవారు. ఈ రకంగా ప్రవచనాల పరిశీలన జరగడం, రక్షకుని పై దృష్టి కేంద్రీకృతమవ్వడం ఆయన కర్తవ్యం ప్రపంచం ముందుకి వస్తుంది.DATel 259.3

    యేసుకి వ్యతిరేకంగా సన్ హెడ్రిన్ తీర్మానించినప్పటికీ ప్రజలు ఆయన పరిచర్య అభివృద్ధికి ఆతృతగా ఎదురుచుశారు. దేవదూతలు మనుషుల హృదయాలను స్పందింపజేస్తూ, వారిని రక్షకుని వద్దకు నడిపిస్తూ ఆయన పరిచర్యకు మార్గాన్ని సిద్ధంచేసారు.DATel 260.1

    కపెర్నహోములో క్రీస్తు స్వస్థపరచిన ప్రధాని కుమారుడు ఆయన శక్తికి సాక్షి. కోర్టు అధికారి, అతడి సిబ్బంది ఆయనపై విశ్వాసాన్ని సంతోషంగా వ్యక్తంచేశారు. ఆ బోధకుడు తమ మధ్య ఉన్నట్లు విన్నప్పుడు పట్టణమంతా ఉత్సాహోద్రేకాలు వెల్లివిరిసాయి. జనసమూహాలు ఆయన చుట్టూ ముగారు. సబ్బాతునాడు సమాజమందిరం ప్రజలతో కిటకిలాడింది. స్థలంలేనందువల్ల ఎంతోమంది వెనక్కు వెళ్ళిపోవాల్సివచ్చింది.DATel 260.2

    రక్షకుని బోధ విన్నవారందరు “ఆయన వాక్యము అధికారముతో కూడినదైయుండెను గనుక వారాయనబోధకు ఆశ్చర్యపడిరి.” “ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలెకాక అధికారము గలవానివలె వారికి బోధించెను.” లూకా 4:32; మత్తయి 7:29 శాస్త్రులు, పెద్దల బోధ, చక్కగా లాంఛనంగా కంఠస్తం చేసి వల్లించిన పాఠంలా ఉండేది. వారికి దైవవాక్యం, జీవశక్తి కలదికాదు. వాక్యానికి మారుగా వారు తమసొంత అభిప్రాయాల్ని సంప్రదాయాల్ని బోధించారు. అలవాటుగా యాంత్రికంగా జరిపే ఆరాధనక్రమంలో ధర్మశాస్త్రాన్ని వివరించడానికి ప్రయత్నించేవారు. కాని వారి హృదయాల్నిగాని వారి శ్రోతల హృదయాల్నిగాని దైవావేశం కదిలించలేదు.DATel 260.3

    యూదుల మధ్య కొనసాగుతోన్న వివిధ చర్చనీయాంశాల్ని యేసు ఎత్తుకోలేదు. సత్యాన్ని సమర్పించడమే ఆయన కర్తవ్యం. ఆయన మాటలు పితరులు ప్రవక్తల బోధనలపై గొప్ప వెలుగును ప్రసరించాయి. ప్రజలు లేఖనాల నుంచి కొత్త సంగతులు నేర్చుకున్నారు. ఆయన శ్రోతలు దైవవాక్య భావాన్ని ఇంత లోతుగాను స్పష్టంగాను మునుపు 0ఎన్నడూ గ్రహించలేదు.DATel 260.4

    యేసు ప్రజల్ని కలిసి వారి ఆందోళనల్ని ఎరిగినవానివలె వారి సమస్యల్ని చర్చించి పరిష్కరించేవాడు. సత్యాన్ని సూటిగాను స్పష్టంగాను బోధించడం ద్వారా దానికి సౌందర్యాన్నికూర్చేవాడు. ఆయన భాష ప్రవహిస్తోన్న ఏరులా స్వచ్ఛంగా సున్నితంగా స్పష్టంగా ఉండేది. రబ్బీల కర్కశ ఊకదంపుడు కర్కశ స్వరాలు విన్న ప్రజలకు ఆయన స్వరం మధుర సంగీతంలా ఉంది. అయితే ఆయన బోధ సరళంగా సామాన్యంగా ఉండగా ఆయన అధికారంతో మాట్లాడాడు. ఆయన బోధలోని ఈ లక్షణం ఇతరులందరికన్నా వ్యత్యాసమయ్యింది. రబ్బీల బోధ సందేహాలు సంశయాలతో నిండి లేఖనాలకు వేరే అర్ధం లేదా విరుద్ధ భావం ఉన్నట్లుండేది. వినేవారి సందేహాలు రోజు రోజూ పెరిగేవి. కాని యేసు లేఖన బోధ ఎవరూ ప్రశ్నించలేని అధికారంతో సాగేది. తన ప్రసంగాంశం ఏదైనా దాన్ని ఆయన గొప్పశక్తితో బోధించేవాడు. ఆయన మాటలు ఎవరూ తప్పుపట్టలేనివి.DATel 260.5

    ఆయన మాటల్లో నిజాయితీ ఉట్టి పడేది. ఉద్రేకం, ఉద్వేగం ఏకోశాన లేదు. నెరవేర్చేందుకు నిర్దిష్ట ఉద్దేశం ఉన్నవానిలా ఆయన మాట్లాడేవాడు. నిత్యలోకానికి చెందిన వాస్తవాల్ని ఆయన మనుషుల దృష్టికి తెచ్చాడు. ప్రతి అంశంలోనూ దేవున్ని బయలుపర్చాడు. మనుషుల్ని లౌకిక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంచే లోకాశ బంధాల్ని తెంచివెయ్యడానికి యేసు ప్రయత్నించాడు. ఈ లోక సంబంధమైన విషయాల్ని వాటి వాస్తవ స్థానంలో పెట్టాడు. నిత్య జీవానికి సంబంధించిన ఆసక్తులికి ప్రథమస్థానం ఇచ్చాడు. అయినా లౌకిక విషయాల ప్రాధ్యాన్యాన్ని విస్మరించలేదు. పరలోకం భూలోకం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని దైవసత్యాన్ని గూర్చిన జ్ఞానం మనుషుల్ని తమ దినదిన విధుల్ని నిర్వర్తించడానికి సిద్ధం చేస్తుందని ఆయన బోధించాడు. దేవునితో తన బాంధవ్యాన్ని గుర్తుంచుకుని, అయినా ప్రతీ మానవుడితో తన ఏకత్వాన్ని గ్రహించి, పరలోకం బాగా తెలిసిన వానిలా ఆయన మాట్లాడాడు.DATel 261.1

    ఆయన కృపావర్తమానాలు తన శ్రోతలకు సరిపడే రీతిలో వివిధ రకాలుగా ఉండేది. “అలసిన దానిని మాటల చేత ఊరడిం” చడమెలాగో ఆయనకు తెలుసు (యెషయా 50:4). సత్యసంపద గురించి హృదయరంజకంగా మాట్లాడేందుకుగాను ఆయన పెదవులు కృపాభిషేకం పొందాయి. ప్రజల పూర్వ నిశ్చితాభిప్రాయాలు తొలగించి వారిని ఆకట్టుకునే ఉదాహరణలతో వారిని ఆశ్చర్యపర్చే నేర్పరితనం ఆయనకుంది. వారి ఊహల ద్వారా వారి మనసుల్ని. చేరగలిగేవాడు. ఆయన ఉదాహరణలు దినదిన జీవితానికి సంబంధించినవి. అవి సామాన్యమైనవే అయినా వాటిలో గంభీర భావం వ్యక్తమయ్యేది. ఆకాశపక్షులు పొలాల్లోని పువ్వులు విత్తనాలు కాపులు గొర్రెలు -వీటిని ఉదాహరణలుగా ఉపయోగించి అమర సత్యాల్ని యేసు విశదీకరించాడు. అప్పటి నుంచి ఆయన శ్రోతలు ఈ ప్రకృతి విషయాల్ని చూసినప్పుడల్లా ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకునేవారు. క్రీస్తు ఉపయోగించిన ఉదాహరణలు ఆయన నేర్పిన పాఠాల్ని నిత్యం పునరావృత్తం చేసేవి.DATel 261.2

    క్రీస్తు మనుషుల్ని ఎన్నడూ పొగడలేదు వారి ఊహల్ని ఆలోచనల్ని ఘనపర్చుతూ ఎన్నడూ మాట్లాడలేదు. వారి ఆవిష్కరణల్ని ఎన్నడూ ప్రశంసించలేదు. అయితే దురభిమానులు కాని ఆలోచనపరులు ఆయన బోధనను అంగీకరించి అవి తమ వివేకాన్ని పరీక్షించినట్లు కనుగొన్నారు. అతి సామాన్య భాషలో వ్యక్తమైన ఆధ్యాత్మిక సత్యానికి వారు విస్మయం వ్యక్తంచేశారు. విద్యాధికులు ఆయన మాటలకు ముగ్ధులయ్యారు. అక్షరజ్ఞానం లేనివారు ఆయన మాటలు విని ప్రయోజనం పొందారు. విద్యలేని వారికి కూడా ఆయన వర్తమానం అందించాడు. అన్యజనుల్ని సైతం తమకో వర్తమానం ఉన్నదని భావించేటట్లు చేశాడు.DATel 262.1

    అలసిన వారికి బాధలను భవిస్తోన్న వారికి ఆయన కరుణ కటాక్షాల స్పర్శ స్వస్తత కూర్చింది. శత్రువుల ఆగ్రహావేశాల సంక్షోభంలో సయితం ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనచుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆయన ముఖ సౌదర్యం ఆయన ప్రవర్తన సౌందర్యం అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన చూపులోను స్వరంలోను వ్యక్తమైన ప్రేమ అవిశ్వాసంలో కఠిన హృదయులు కాని వారిని ఆయన వద్దకు ఆకర్షించాయి. ప్రతీ చూపులోను ప్రతీ మాటలోను వ్యక్తమైన సానుభూతి లేకపోతే ఆయన పెద్ద పెద్ద జనసమూహాలను ఆకట్టుకునేవాడు కాదు. బాధలతో ఆయన వద్దకు వచ్చినవారు ఆయన ఆసక్తుల్ని తమ ఆసక్తులతో ఒక నమ్మకమైన మిత్రుడులా జతపర్చాడని భావించారు. ఆయన బోధించే సత్యాల గురించి మరింత తెలుసుకోవాలని ఆశించారు. పరలోకం వారికి దగ్గరయ్యింది. ఆయన సముఖంలో నివసించాలని ఆకాంక్షించారు. ఆ విధంగా ఆయన ప్రేమ తమతో నిత్యం ఉండాలని వాంఛించారు.DATel 262.2

    తన శ్రోతల ముఖాలు మారడం యేసు ఆసక్తిగా గమనించాడు. ఆసక్తిని ఆనందాన్ని వ్యక్తం చేసిన ముఖాలు ఆయనకు సంతృప్తి నిచ్చాయి. సత్యం అనే బాణాలు ఆత్మలోకి చీల్చుకుంటూ స్వార్ధం అనే అడ్డుగోడల్ని బద్దలు గొట్టుకుంటూ పశ్చాత్తాపం పుట్టిస్తూ చివరగా కృతజ్ఞతను పుట్టిస్తూ వెళ్లినప్పుడు రక్షకుడు ఆనందించాడు. వింటున్న జనసమూహాలపై దృష్టి సారించి తాను చూసిన ముఖాల్ని గుర్తుపట్టినప్పుడు ఆయన ముఖం ఆనందంతో వికసించింది. వారిలో తన రాజ్యపౌరుల్ని చూశాడు. తాను సూటిగా పలికిన సత్యం కొందరి ప్రియమైన విగ్రహాల్ని కదిలించినప్పుడు వారి ముఖాల్లో మార్పు చోటుచేసుకోడం గమనించాడు. వారి చూపులు ఉదాసీనంగా అసహ్యంగా ఉన్నాయి. తమకు సత్యం అవసరం లేదని అవి సూచించాయి. మనుషులు శాంతి వర్తమానాన్ని నిరాకరించడం చూసినప్పుడు ఆయనకు తీవ్ర హృదయవేదన కలిగింది.DATel 263.1

    క్రీస్తు తాను స్థాపించడానికి వచ్చిన రాజ్యం గురించి సాతాను చెరలో ఉన్న బందీల్ని విడిపించడమన్న తన కర్తవ్యాన్ని గురించి సమాజమందిరంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడున్నప్పుడు ఓ భయంకరమైన అరుపు వినపడడంతో ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగింది. ఓ పిచ్చివాడు ప్రజల మధ్య నుంచి దూసుకుంటూ ముందుకువచ్చి ఇలా కేకలువేశాడు. “నజరేయుడవగు యేసూ మాతో నీకేమి? మమ్మును నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు.”DATel 263.2

    ఇప్పుడంతా గందరగోళంగా భయంగా ఉంది. ప్రజల దృష్టి క్రీస్తుపై నుంచి మళ్లింది. ఆయన మాటల్ని ఎవరూ వినడంలేదు. ఆ పిచ్చివాణ్ని సమాజమందిరంలోకి నడిపించడం సాతాను వ్యూహం. యేసు “ఊరకుండుము, ఇతనిని వదలిపొమ్మని దానిని గద్దింపగా... దయ్యము వానిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలిపోయెను.”DATel 263.3

    ఈ బాధితుడి మనసును చీకటితో నింపింది సాతానే. అయితే రక్షకుని సముఖంలో ఓ ఆశాకిరణం చీకటిని చీల్చివేసింది. సాతాను అదుపులోనుంచి అతడు విముక్తిని ఆకాంక్షించాడు. కాని ఆ దయ్యం క్రీస్తు శక్తిని ప్రతిఘటించింది. ఆ వ్యక్తి సహాయం కోసం క్రీస్తుకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆ దురాత్మ అతని నోటికి మాటలనందించింది. అతడు భయంతో కేకలు వేశాడు. తనను స్వస్తపర్చగలవాని సన్నిధిలో తానున్నానని ఆ బాధితుడు కొంతమట్టుకు గ్రహించాడు. కాని అతడు ఆ మహాశక్తి గల హస్తం అందుబాటులోకి వచ్చినప్పుడు, మరొకడి చిత్తం మరొకడి మాటలు అతడి ద్వారా వినిపించాయి. సాతాను శక్తికి స్వేచ్ఛకోసం బాధితుడి ఆశకు మధ్య సంఘర్షణ భయంకరమైంది.DATel 264.1

    శోధనారణ్యంలో సాతానును జయించిన ప్రభువు మళ్లీ అతడితో ముఖాముఖి తలపడ్డాడు. తన బాధితుడిపై అదుపు నిలుపుకోడానికి ఆ దయ్యం శాయశక్తుల ప్రయత్నించింది. ఇక్కడ ఓడిపోడం యేసుకు విజయం చేకూర్చడమే. బాధితుడైన ఆ వ్యక్తి యౌవనాన్ని నాశనం చేసిన విరోధితో పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకోడం తధ్యమన్నట్లు కనిపించింది. అయితే రక్షకుడు అధికారంతో మాట్లాడి బాధితుణ్ని విడిపించాడు. దయ్యం పట్టిన వ్యక్తి తనకు లభించిన స్వాతంత్ర్యంతో ఆనందిస్తూ ఆశ్చర్యంగా చూస్తోన్న ప్రజల ముందు నిలబడ్డాడు. ఆ దయ్యం సయితం రక్షకునిది దైవశక్తి అని సాక్ష్యమిచ్చింది.DATel 264.2

    పక్షవాతం గల మనిషి తన స్వస్తత నిమిత్తం దేవున్ని కొనియాడాడు. పిచ్చితనంతో వెర్రిచూపులు చూసిన కళ్లు ఇప్పుడు వివేకంతో వికసించి కృతజ్ఞత కన్నీళ్ళు కార్చాయి. ప్రజలు విస్మయంతో అవాక్కయ్యారు. ఆ స్థితి నుంచి కోలుకున్న తర్వాత వారు ఆశ్చర్యంగా ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు, “ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధి కారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి.” మార్కు 1:27;DATel 264.3

    స్నేహితులకు కంపరం పుట్టించే వాడిగాను తనకు తాను పెనుభారంగాను ఇతణ్ని చేసిన రుగ్మతకు రహస్య కారణం అతడి జీవన విధానంలోనే ఉంది. పాపభోగాలు అతణ్ని ఆకట్టుకుండడంతో జీవితాన్ని గొప్ప వేడుకగా మార్చుకోవాలనుకున్నాడు. లోకానికి పెద్ద ముప్పుగా మారాలని కుటుంబానికి తలవంపులు తేవాలని అతడు కలలో కూడా అనుకోలేదు. ఎవరికీ హాని కలగని జీవితాన్ని ఉల్లాసంగా సందడిగా గడపాలని భావించాడు. అయితే ఒకసారి దిగజారుడు మార్గంలో అడుగుపెట్టడంతో తన పాదాలు వడివడిగా అతణ్ని అధోగతికి చేర్చాయి. అమితత్వం చౌకబారుతనం అతడి స్వభావంలోని ఉదాత్త గుణాల్ని వక్రీకరించాయి. కనుక అతడిపై సాతానుకి తిరుగులేని నియంత్రణ లభించింది.DATel 264.4

    పశ్చాత్తాపం ఎంతో ఆలస్యంగా కలిగింది. తాను పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని తిరిగి సంపాధించుకోడానికి భాగ్యాన్ని భోగాల్ని త్యాగం చేయాల్సి ఉన్న సమయంలో అతడు అపవాది విషపరిష్వంగంలో నిస్సహాయుడుగా మిగిలిపోయాడు. అతడు శత్రుభూభాగంలోకి వెళ్లాడు. సాతాను అతడి మానసిక శక్తులన్నింటినీ స్వాధీన పర్చుకున్నాడు. అనేక ‘ఆకర్షణీయ సమర్పణలతో శోధకుడు అతణ్ని వశపర్చుకున్నాడు. కాని ఆ నిర్భాగ్యుడు ఒక్కసారి తన వశంలో ఉన్నప్పుడు ఆ దురాత్మ తన క్రూరత్వంలో పెచ్చరిల్లిపోయింది. తన సందర్శనల్లో రౌద్రరూపం ధరించింది. దుష్టత్వానికి లొంగిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారి తొలినాళ్ల అద్భుతమైన వినోద జీవితం నిస్పృహ చీకటిలో లేదా పతనమైన ఆత్మ ఉన్మాదంలో అంతమొందుతుంది.DATel 265.1

    అరణ్యంలో క్రీస్తును శోధించిన దురాత్మే, కపెర్నహోము పిచ్చివాణ్ని పట్టిన దురాత్మే అవిశ్వాసులైన యూదుల్ని అదుపు చేసింది. అయితే వారి విషయంలో భక్తిపరుడులా నటించాడు. రక్షకుణ్ని విసర్జించడంలో తమ ఉద్దేశం విషయంలో వారిని మోసగించడానికి ప్రయత్నించాడు. పిచ్చివాడి పరిస్థితి కన్నా వారి పరిస్థితి ఆధ్వానంగా ఉంది. ఎందుకంటే క్రీస్తు తమకు అవసరమని వారు భావించలేదు.DATel 265.2

    మానవుల మధ్య క్రీస్తు సేవాకాలం చీకటి రాజ్య శక్తుల కార్యకలాపాలకు మిక్కిలి అనుకూల సమయం. మానవాళి మీదికి పాపం, బాధ తేవడానికి గాను వారి శరీరాత్మల్ని నియంత్రించడానికి సాతాను అతడి దుష్ట దూతలు యుగాల కొద్దీ ప్రయత్నిస్తూ ఈ బాధలు శ్రమలు దేవుని మూలంగా వస్తున్నాయని ఆయన్ని నిందిస్తోన్నారు. యేసు దేవుని ప్రవర్తన ఎలాంటిదో మనుషులికి ప్రదర్శిస్తోన్నాడు. సాతాను అధికారాన్ని కూలదోసి అతడి బందీలను విడిపిస్తోన్నాడు. పరలోకం నుంచి వచ్చిన నూతన జీవం, ప్రేమ, శక్తి మనుషుల హృదయాల్ని కదిలిస్తుండడంతో దుష్టజన పరిపాలకుడు తన రాజ్య ప్రాబల్యం కోసం పోరాటానికి మేల్కోన్నాడు. సాతాను తన సేనను సమీకరించుకుని క్రీస్తు పరిచర్యను అడుగడుగునా వ్యతిరేకించాడు.DATel 265.3

    నీతికి పాపానికి మధ్య జరుగుతున్న మహా సంఘర్షణ తుది ఘట్టం ఇలాగే ఉంటుంది. శిష్యులకి నూతన జీవం, వెలుగు, శక్తి పైనుంచి వస్తుండగా కిందనుంచి కొత్త జీవం పుట్టుకు వచ్చి సాతాను ప్రతినిధుల్ని బలోపేతం చేస్తోంది. లోకసంబంధమైన ప్రతీ సాధనం తీవ్రరూపం ధరిస్తోంది. యుగాలకొద్దీ సాగుతోన్న సంఘర్షణలో నేర్చుకున్న కుటి లత తో మారువేషాలతో సాతాను కార్యాచరణకు పూనుకున్నాడు. అతడు వెలుగుదూత వేషంలో కనిపిస్తాడు. వేలమందిని “మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యము” ఉంచుతున్నారు. 1తిమో 4:1DATel 266.1

    క్రీస్తు దినాల్లో ఇశ్రాయేలు నాయకులకు బోధకులకు సాతాను పనిని ప్రతిఘటించడానికి శక్తి లేకపోయింది. దురాత్మలను ప్రతిఘటించడానికి తమకున్న ఒకేఒక సాధనాన్ని వారు పట్టించుకోడం లేదు. యేసు సాతానుని దైవవాక్యంతో జయించాడు. ఇశ్రాయేలు నాయకులు దైవవాక్య బోధకులమని చెప్పుకునేవారు గాని వారు తమ సంప్రదాయాల్ని కాపాడుకునేందుకు మనుషులు కల్పించిన ఆచారాన్ని అమలు పర్చేందుకు దైవవాక్యాన్ని పఠించేవారు. దేవుడి వ్వని భావాల్ని తమ వివరణ ద్వారా దానికి అంటగట్టేవారు. దేవుడు స్పష్టంగా చెప్పిన దాన్ని తమ మార్మిక వ్యాఖ్యానం ద్వారా అస్పష్టం అస్తవ్యస్తం చేసేవారు. ప్రాముఖ్యం కాని అంశాలపై వాదోపవాదాలు చేసేవారు. అతి ముఖ్యమైన సత్యాల్ని ఉపేక్షించేవారు. ఇలా అపనమ్మకాన్ని భారీఎత్తున విత్తారు. దేవుని వాక్యం శక్తిని దోచుకున్నారు. అందుచేత దురాత్మలు తమ చిత్రాన్ని చలాయించాయి.DATel 266.2

    చరిత్ర పునరావృత్తమౌతోంది. స్వేచ్ఛగా చదువుకోడానికి బైబిలు అందుబాటులో ఉండటం, దాని బోధనల్ని భక్తితో ఆచరిస్తున్నట్లు చెప్పుకోడం జరుగుతోన్న ఈ దినాల్లో అనేకమంది మత నాయకులు దేవుని వాక్యంగా దానిపై ఉన్న విశ్వాసాన్ని నాశనం చేస్తోన్నారు. వాక్యాన్ని ముక్కముక్కలుగా విభజించడంలో దాని స్పష్టమైన బోధనల్ని పక్కకు నెట్టి తమ సొంత అభిప్రాయాల్ని ఘనపర్చడంలో తలమునకలై ఉన్నారు. వారి చేతుల్లో దైవవాక్యం పునరుజ్జీవ శక్తిని కోల్పోతోంది. అపనమ్మకం పేట్రేగడానికి, దుర్మార్గత వ్యాప్తి చెందడానికి కారణం ఇదే.DATel 266.3

    సాతాను బైబిలుపై విశ్వాసానికి విఘాతం కలిగించి వెలుగు కోసం శక్తి కోసం మనుషుల మనసుల్ని ఇతర మూలాలకు నడిపిస్తాడు. ఇలా ఉపాయంగా అనుమానాలు సందేహాలు పుట్టిస్తాడు. స్పష్టమైన లేఖన బోధను నమ్మకం పుట్టించే దేవుని పరిశుద్ధాత్మశక్తిని విడిచి పెట్టే వారు దయ్యాల నియంత్రణకు ఆహ్వానం పలుకుతున్నవారవుతారు. లేఖనాల్ని విమర్శించడం, లేఖనాల పై ఊహాకల్పన చెయ్యడం, భూతమతం దివ్యజ్ఞాన తత్వం యేసుప్రభువు, సంఘాలని చెప్పుకునే సంఘాల్లో సయితం స్థానం సంపాదించడానికి మార్గం తెరుస్తుంది. భూతమతం, దివ్యజ్ఞానతత్వం పురాతన అన్యమతానికి నవీన రూపాలు.DATel 267.1

    సువార్త ప్రచారం పక్కనే అబద్దాత్మల మాద్యమాలైన ప్రతినిధులు పనిచేస్తున్నారు. కేవలం ఔత్సుకతతో అనేకమంది ఈ మాధ్యమాలతో ఆడుకుంటారు. కాని మానవాతీత శక్తి పనికి నిదర్శనాల్ని చూసి వారు క్రమక్రమంగా ఆకర్శితులై చివరికి తమకన్నా బలమైన ఆ శక్తి నియంత్రణకు లొంగిపోతారు. ఆ మాధ్యమం విచిత్రమైన శక్తి నుంచి వారు తప్పించుకోడం దుర్లభం.DATel 267.2

    ఆత్మ భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుంది. పాపాల నుంచి వారికి కాపుదల ఉండదు. దేవుని వాక్యం ఆయన ఆత్మ విధించే ఆంక్షల్ని ఒక వ్యక్తి ఒక్కసారి నిరాకరిస్తే అతడు ఎంత నీచస్థితికి దిగజారిపోతాడో ఎవరూ ఊహించలేరు. రహస్య పాపం లేదా వ్యసనం కపెర్నహోము పిచ్చివాడిమల్లే అతణ్ని నిస్సహాయ బందీగా ఉంచవచ్చు. అయినా అతడి పరిస్థితి మార్చలేనిది కాదు.DATel 267.3

    సాతాన్ని జయించడానికి క్రీస్తు అనుసరించిన పద్ధతినే అనగా దైవవాక్యశక్తినే మనం ఉపయోగించి జయించాలి. మన సమ్మతిలేకుండా దేవుడు మన మనసుల్ని నియంత్రించడు. కాగా మనం ఆయన చిత్తాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించగోరితే ఆయన వాగ్దానాలు మనపట్ల నెరవేరాయి. “అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” “ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికోనును.” యోహాను 8:32; 7:17. ఈ వాగ్దానాల పై విశ్వాసం ద్వారా తప్పు ఉచ్చుల నుంచి, పాపం నియంత్రణ నుంచి ప్రతీవారు విముక్తి పొందవచ్చు.DATel 267.4

    తమను ఏ అధికారం పరిపాలించాలో ఎన్నుకోడానికి ప్రతివారికి స్వేచ్ఛ ఉంది. క్రీస్తులో విముక్తి పొందలేనంత పాపులు దుష్టులు ఎవ్వరూ లేరు. దయ్యం పట్టినవాడు ప్రార్ధన బదులు సాతాను మాటల్నే పలకగలిగాడు. అయినా అతడి మనసులోని అప్రకటిత విజ్ఞప్తిని దేవుడు విన్నాడు. అవసరంలో ఉన్న ఆత్మచేసే ఏ విజ్ఞప్తిని - మాటలు వివరించలేకపోయినప్పటికీ - ఆయన వినకుండా విడిచి పెట్టడు. దేవునితో నిబంధన బాంధవ్యంలో ప్రవేశించడానికి సమ్మతి వ్యక్తం చేసేవారిని దేవుడు సాతాను అధికారం కిందకు వెళ్లనీయడు లేక తమ సొంత బలహీనతలకు బలికానివ్వడు. “ఈలాగు జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధానపడవలెను. వారు నాలో సమాధానపడవలెను” యెషయా 27:5. ఒకసారి తమ ప్రాబల్యం కింద ఉన్న ఆత్మకోసం చీకటి ఆత్మలు పోరు సలుపుతాయి. అయితే దేవుని దూతలు ఆ ఆత్మ కోసం పోరాడి విజయం సాధిస్తారు. ప్రభువిలా అంటున్నాడు, “బలాడ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్మును ఎవడు తీసికొనగలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా? యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను. నీ పిల్లలను నేనే సంరక్షించెదను” యెష 49:24,25.DATel 268.1

    సమాజమందిరంలోని ప్రజలు ఆశ్చర్యంతో యేసువంక తేరి చూస్తుండగా యేసు కాస్త విరామానికి పేతురు ఇంటికి వెళ్లాడు. ఇక్కడ కూడా ఓ ఆపద ఏర్పడింది. పేతురు అత్త “జ్వరముతో పడి” ఉంది. యేసు ఆ జ్వరాన్ని గద్దించగా బాధితురాలు లేచి ప్రభువుకి ఆయన శిష్యులకి సపర్యలు చేసింది.DATel 268.2

    క్రీస్తు పరిచర్యను గూర్చిన సమాచారం కపెర్నహోము అంతట వ్యాపించింది. రబ్బీల భయంతో ప్రజలు రోగుల స్వస్తత నిమిత్తం సబ్బాతు దినాన రావడానికి సాహసించలేదు. కాని సూర్యాస్తమయం అయ్యీ అవ్వడంతో పెద్ద గందరగోళం ప్రారంభమయ్యింది. ఆ నగర ప్రజలు గృహాల నుంచి షాపుల నుంచి వ్యాపార స్థలాల నుంచి యేసు బసచేస్తున్న సాదాసీదా నివాసం దిశగా వస్తోన్నారు. వ్యాధిగ్రస్తుల్ని పడకలతో మోసుకు వస్తోన్నారు. కొందరు కర్రల బోటుతో నడిచివస్తోన్నారు, లేదా మిత్రుల మీద ఆనుకుని వస్తోన్నారు. వారు కుంటుకుంటూ తూలుతూ పడుతూ రక్షకుని సముఖంలోకి వస్తోన్నారు.DATel 268.3

    గంటగంటకు ప్రజలు వస్తూపోతూ ఉన్నారు. ఎందుకంటే రేపు స్వస్తపర్చే ఆ మహానుభావుడు తమ మధ్య ఉంటాడో ఉండడో ఎవరికీ తెలియదు. కపెర్నహోము అలాంటి దినాన్ని మున్నెన్నడూ చూడలేదు. విజయ ధ్వనులు విముక్తి నినాదాల్తో చెవులు గింగురుమన్నాయి. తాను కలిగించిన ఆనందం ప్రభువు మనసును ఆనందంతో నింపింది. తన వద్దకు వచ్చిన వారి బాధల్ని చూసినప్పుడు ఆయన హృదయం సానుభూతితో నిండింది. వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పునరుద్ధరించే శక్తి తనకున్నందుకు ఆయన సంతోషించాడు.DATel 269.1

    చివరి బాధితుడు స్వస్తత పొందేవరకు యేసు తన పరిచర్యను విరమించలేదు. వచ్చిన జనులందరూ వెళ్లిపోయేసరికి మధ్యరాత్రి అయ్యింది. సీమోను గృహం సద్దుమణిగింది. ఉత్సాహ ఉద్వేగాల్తో నిండిన దినం గతించింది. యేసు విశ్రాంతి తీసుకోడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పట్టణం ఇంకా నిద్రలోనే మునిగి ఉండగా రక్షకుడు “పెందలకడనే లేచి, .... అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను.”DATel 269.2

    ఈ లోకంలో నివసించినప్పుడు యేసు దినాలు ఈ విధంగా గడిచాయి. శిష్యులు తమ తమ గృహాలు సందర్శించడానికి విశ్రాంతి తీసుకోవడానికి యేసు తరచు పంపించేవాడు. వారు ఆయనకి తన సేవనుంచి విరామం కల్పించడానికి ప్రయత్నించేవారు. కాని ఆయన ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటించాడు. ఆయన దినమంతా పనిచేశాడు. అజ్ఞానులకు బోధించాడు, వ్యాధి గ్రస్తుల్ని బాగుచేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, వేలాది మందికి భోజనం పెట్టాడు, సాయంత్రమో ఉదయమో తండ్రితో సంప్రదించడానికి కొండలనడుమ తన గుడారానికి వెళ్లేవాడు. తరచు రాత్రంతా ప్రార్ధనలో గడిపేవాడు. ఉదయం తిరిగి వచ్చి ప్రజలనడుమ తన పరిచర్యను కొనసాగించేవాడు.DATel 269.3

    ఉదయం పెందలకడనే పేతురు అతడి సహచర శిష్యులు వచ్చి కపెర్నహోము ప్రజలు తన్ను వెదకుతూ వస్తున్నారని యేసుతో చెప్పారు. అంతవరకూ వారు క్రీస్తుని సంభావించకపోవడాన్ని గురించి శిష్యులు వారి పట్ల అసంతృప్తితో ఉన్నారు. యెరుషలేము అధికారులు క్రీస్తుని చంపడానికి చూస్తోన్నారు. సొంత పట్టణవాసులే ఆయన ప్రాణాలు తియ్యడానికి ప్రయత్నిస్తోన్నారు. అయితే కపెర్నహోములో ఆయనకు ఆనందోత్సాహాలతో ఆహ్వనం లభించింది. ఇది శిష్యులికి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. వారిలో ఆశలు రగిలించింది. స్వాతంత్ర్యప్రియులైన గలిలయుల్లో కొందరు నూతన రాజ్యాన్ని సమర్ధించే వారుండవచ్చునేమో అన్న ఆశాభావం వారిలో చిగురించింది. ఇలా ఉండగా క్రీస్తు అన్న ఈ మాటలు వారిని ఆశ్యర్యపరిచాయి, “నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్త ప్రకటించవలెను. ఇందునిమిత్తమే నేను పంపబడితిని.”DATel 270.1

    కపెర్నహోములో నెలకొన్న ఉద్రేక ఉత్సాహల్లో ఆయన కర్తవ్య ముఖ్యోద్దేశాన్నే మర్చిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు తనను అద్భుతాలు చేసేవాడుగానో శారీరక వ్యాధులు నయంచేసేవాడుగానో గుర్తించడంతో ఆయన తృప్తి చెందలేదు. మనుషులు తనను తమ రక్షకుడుగా అంగీకరించి తనకు ఆకర్షితులు కావాలని ఆయన ప్రయత్నిస్తోన్నాడు. లోకంలో రాజ్యం స్థాపించడానికి ఆయన రాజుగా వచ్చాడని నమ్మడానికి ప్రజలు తహతహలాడ్తుండగా వారి మనసుల్ని ఐహిక విషయాలపై నుంచి ఆధ్యాత్మిక విషయాల పైకి మరల్చాలని ఆయన అభిలషించాడు. కేవలం లౌకిక విజయం ఆయన సేవకు అంతరాయం కలిగిస్తుంది.DATel 270.2

    ఆసక్తి ఏకోశానా లేని ఆ జనసమూహం ప్రదర్శించిన విస్మయం ఆయన ఆత్మను క్షోభింపచేసింది. ఆయన జీవితంలో స్వప్రయోజనమన్నది లేనే లేదు. హోదాకు సిరిసంపదలకు ప్రతిభకు లోకం అర్పించే నివాళిని దైవకుమారుడు ఎన్నడూ లెక్కచెయ్యలేదు. ఇతరుల నమ్మకాన్ని సంపాదించడానికి లేదా అదరాభిమానాల్ని పొందడానికి మనుషులు అవలంబించే మార్గాల్ని యేసు అవలంబించలేదు. ఆయన జననానికి అనేక శతాబ్దాల పూర్వం ఆయన్ని గూర్చి ఇలా ప్రవచించబడింది, “అతడు కేకలు వేయడు విరువడు తన కంఠ స్వరము వీధిలో వినబడనియ్యడు నలిగిన రెల్లును అతడు దిరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపర్చును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు.” యెషయా 42:2-4.DATel 270.3

    తమ ఆచారవ్యవహారాలు, డంబం ప్రదర్శనతో కూడిన తమ ఆరాధన క్రమం కానుకల పద్దతిని బట్టి పరిసయ్యులు విశిష్టతకు ఔన్నత్యానికి ప్రయత్నించారు. మతాన్ని చర్చనీయాంశం చేసి తమ మతాసక్తిని నిరూపించుకోచూశారు. మత భేదాలుగల వివిధ వర్గాల మధ్య దీర్ఘ వివాదాలు తగవులు ఉండేవి. ధర్మ శాస్త్రంలో ఉద్దండ పండితులు వీధుల్లో గట్టిగా వాదించుకోడం వినడం అసాధారణం కాదు.DATel 271.1

    యేసు జీవన విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయన జీవన సరళిలో గోలతో నిండిన తర్కం లేదు, డంబంతో కూడిన ఆరాధన లేదు, సభచే చప్పట్లు కొట్టించే కార్యాలు లేవు. క్రీస్తు దేవునిలో దాగి ఉన్నాడు. దేవుడు క్రీస్తు ప్రవర్తన ద్వారా ప్రాచుర్యం పొందాడు. దేవుని గూర్చిన ఈ ప్రకటన పైనే మనుషుల మనసుల్ని నిలపాలని దీనికే మనుషులు నివాళులర్పించాలని క్రీస్తు ఆకాంక్షిస్తోన్నాడు.DATel 271.2

    నీతి సూర్యుడు దేదీప్యమానమైన తన మహిమతో లోకాన్ని మిరుమిట్లు గొలపడానికి లోకంపై విరుచుకుపడడానికి ఉద్దేశించలేదు. క్రీస్తును గురించి లేఖనం ఇలా చెబుతోంది, “ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును.” హోషేయ 6:3. భూమిని అలముకున్న చీకటిని పారదోలి లోకాన్ని నవజీవానికి మేలుకొల్పుతూ ఉషఃకాంతి నిశ్శబ్భంగా సున్నితంగా భూమిపై విస్తరిస్తుంది. అలాగే నీతి సూర్యుడు “ఆరోగ్యము కలుగజేయు” “రెక్క”లతో ఉదయించాడు. మలాకీ 4:2.DATel 271.3