Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    17—నీకొదేము

    యూదు జాతిలో నికొదేముది బాధ్యతగల ఉన్నత స్థానం. అతడు విద్యాధికుడు. అసాధారణ ప్రతిభ గలవాడు. జాతీయ సభలో గౌరవ ప్రతిష్టలు గల సభ్యుడు. యేసు బోధలవల్ల ప్రభావితులైన వారిలో ఇతడొకడు. విద్యావంతుడు గౌరవ ప్రతిష్టలున్నవాడు అయినా ఈ పేద నజరేయునికి ఆకర్షితుడయ్యాడు. రక్షకుని నోట వెలువడ్డ పాఠాలు అతణ్ని ఆకట్టుకున్నాయి. ఆ అద్భుత సత్యాల్ని గూర్చి ఇంకా తెలుసుకోవాలని ఆశించాడు.DATel 164.1

    ఆలయాన్ని శుద్ధిచెయ్యడం సందర్భంగా యేసు ప్రదర్శించిన అధికారం యాజకుల్లోను ప్రధానుల్లోను తీవ్ర ద్వేషాన్ని రగుల్కొలిపింది. ఈ అనామకుడి అధికారానికి భయపడ్డారు. పేరూఊరూ లేని ఈ అజ్ఞాత గలతీయుడి తెంపరితనాన్ని సహించేది లేదనుకున్నారు. ఆయన పనికి చరమగీతం పాడాలనుకున్నారు. కాకపోతే ఈ ఉద్దేశానికి అందరూ తల ఊపలేదు. దేవుని ఆత్మవలన పనిచేస్తున్నట్లు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆయన్ని వ్యతిరేఖించడానికి భయపడ్డవారు కొందరున్నారు. ఇశ్రాయేలు నాయకుల పాపాల్ని ఖండించిన ప్రవక్తల్ని ఆ నాయకులు ఎలా హతమార్చారో వారు గుర్తు చేసుకున్నారు. యూదులు అన్యజాతులకు బానిసలవ్వడం దేవుడు పంపిన మందలింపుల్ని తాము మొండిగా తోసిపుచ్చిన ఫలితమేనని వారికి తెలుసు. యేసుకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నడంలో యాజకులు ప్రధానులు తమ తండ్రుల మార్గాల్నే అనుసరిస్తోన్నారని అవి తమ జాతి మీదికి ఎన్నో ఆపదలు తెస్తాయని వారు ఆందోళన చెందారు. ఈ భావాలు గలవారిలో నికోదేము ఒకడు. యేసుపట్ల అనుసరించాల్సిన విధానం గురించి స హెడ్రిన్ సభాసమావేశంలో పరిగణనకు వచ్చినప్పుడు నికొదేము నిదానాన్ని ఔదార్యాన్ని పాటించాల్సిందిగా హితవుపలికాడు. యేసు వాస్తవంగా దైవాధికారం ఉన్నవాడైతే ఆయన చేసే హెచ్చరికల్ని తోసిపుచ్చడం ప్రమాదభరితమని హెచ్చరించాడు. ఈ హితవాక్యాల్ని యాజకులు తోసిపుచ్చలేకపోయారు. కొంతకాలం రక్షకునికి వ్యతిరేకంగా బహిరంగ చర్యలేవీ చేపట్టలేదు.DATel 164.2

    యేసు బోధనలు విన్ననాటి నుంచీ మెస్సీయాను గూర్చిన ప్రవచనాల్ని నీ కొదేము ఆత్రుతగా పఠించడం మొదలు పెట్టాడు. అతడు ఎంత లోతుగా పరిశోధిస్తే రావాల్సినవాడు ఈయనేనన్న విశ్వాసం అంత దృఢమయ్యింది. దేవాలయం అపవిత్రం కావడం గురించి ఇశ్రాయేలులో అనేకులతో పాటు ఇతడు హృదయక్షోభ అనుభవించాడు. అమ్మవారిని కొనేవారిని యేసు తరిమివేసిన దృశ్యాన్ని అతడు చూశాడు. దైవశక్తి అద్భుత ప్రదర్శనను వీక్షించాడు. రక్షకుడు బీదల్ని చేర్చుకోడం వ్యాధిగ్రస్తుల్ని బాగుచెయ్యడం చూశాడు. వారి ఆనందాన్ని చూశాడు. వారి కృతజ్ఞతలు విన్నాడు. నజరేయుడైన యేసు దేవుడు పంపినవాడనడానికి అతని మనసులో ఎలాంటి సందేహంలేదు.DATel 165.1

    యేసుతో సమావేశమవ్వాలని నీకొదేము ఆశించాడు. కాని ఆ పని బహిరంగంగా చెయ్యడానికి తటపటాయించాడు. యూదుల అధికారి పేరుప్రఖ్యాతులు లేని బోధకుడిపట్ల సానుభూతి కనపర్చడం ఎంతో చిన్నతనం. అతడి సందర్శన ఉదంతం సన్ హెడ్రిన్ దృష్టికి వచ్చినట్లయితే అది తనను ఆ సభ ద్వేషానికి ఖండనమండనలకు గురిచేయడం ఖాయం. రహస్య సమావేశానికి తీర్మానించుకున్నాడు. బహిరంగంగా వెళ్తే దాన్ని ఆసరా చేసుకుని ఇతరులు తన ఆదర్శాన్ని అనుసరించవచ్చునేమో అని అలా చేశానన్న సాకు చెప్పవచ్చుననుకున్నాడు. ప్రత్యేక దర్యాప్తు ద్వారా ఒలీవల కొండపై రక్షకుడి విశ్రమ స్థలాన్ని తెలుసుకుని పట్టణమంతా నిద్రలో సర్దుమణిగే వరకు వేచియుండి అప్పుడు ఆయనను కలిశాడు.DATel 165.2

    క్రీస్తు సముఖంలో నీకొదేముకి ఒక రకమైన భయం కలిగింది. దాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రశాంతత హుందాతనం నటించాడు. “బోధకుడా నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికితోడై యుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలు ఎవడును చేయలేడు” అన్నాడు. బోధకుడుగా క్రీస్తు అరుదైన వరాల్ని గురించి ఆయన చేస్తున్న సూచకక్రియల గురించి ప్రస్తావించడం ద్వారా నికొదేము ఆ సమావేశానికి మార్గాన్ని సుగమం చేస్తోన్నాడు. అతని మాటలు విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి విశ్వాసాన్ని ఆహ్వానించడానికి ఉద్దేశించినవి. అయితే వాస్తవంలో అవి అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. యేసుని మెస్సీయగా అంగీకరించకుండా బోధకుడుగా మాత్రమే అంగీకరించాయి.DATel 165.3

    ఈ సంబోధాన్ని గుర్తించే బదులు అతడి హృదయాన్ని పరిశోధిస్తున్నట్లు యేసు అతడి పై దృష్టి సారించాడు. అనంత జ్ఞాని అయిన ప్రభువు అతనిలో సత్యాన్వేషిని చూశాడు. ఆ సందర్శన ఉద్దేశమేంటో గ్రహించాడు. అతనిలో ఏర్పడ్డ నమ్మకాన్ని బలోపేతం చెయ్యాలన్న ఆసక్తితో ఆయన సరాసరి అసలు విషయానికి వచ్చి గాంభీర్యంగా అయినా దయగా ఇలా అన్నాడు, “ఒకడు క్రొత్తగా జన్మించితేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” యోహాను 3:3.DATel 166.1

    ప్రభువుతో చర్చకు ఎదురుచూస్తూ నీకొదేము ఆయనవద్దకు వచ్చాడు. అయితే యేసు సత్యం ప్రాధమిక నియమాన్ని అతడిముందు పెట్టాడు. నీకు కావలసింది ఆధ్యాత్మిక పునర్జీవంగాని సైద్ధాంతిక జ్ఞానం కాదని నీకొదేముతో చెప్పాడు. నీకు అవసరమైంది జిజ్ఞాసను తృప్తి పర్చడం కాదు. నూతన హృదయం. ఆధ్యాత్మిక విషయాల్ని అభినందించకముందు నీవు పై నుంచి నూతన జీవాన్ని పొందాలి. అన్నిటినీ నూతనం చేసే ఈ మార్పు చోటు చేసుకునేంతవరకు నీవు నా అధికారం గురించి నా పరిచర్య గురించి నాతో చర్చించడం వల్ల నీకు రక్షణ సంబంధమైన ఎలాంటి మేలు ఒనగూడదు.DATel 166.2

    పశ్చాత్తాపం గురించి బాప్తిస్మం గురించి స్నానికుడు యోహాను బోధించడం పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చే వానిని సూచించడం నీకొదేము విన్నాడు. యూదుల్లో ఆధ్యాత్మికత కొరవడిందని వారిని మత దురభిమానం లోకాశలు అదుపు చేస్తున్నాయని నీకొదేము భావించాడు. మెస్సీయా రాకతో పరిస్థితులు మెరుగవుతాయని ఆశించాడు. అయినా స్నానికుడి వర్తమానం అతనిలో పాపపశ్చాత్తాపం కలిగించలేదు. అతడు నిష్టగల పరిసయ్యుడు. తన సత్రియల విషయంలో ప్రశంసలందుకున్నాడు. తనకు భద్రత దైవానుగ్రహం ఉన్నాయని నిశ్చింతగా ఉన్నాడు. తన ప్రస్తుత పరిస్థితిలో తాను చూడలేనంత పవిత్ర రాజ్యం ఒకటుందని విన్నప్పుడు దిగ్ర్భాంతి చెందాడు.DATel 166.3

    యేసు ఉపయోగించిన నూతన జన్మ సామ్యం నీకొదేముకి పూర్తిగా తెలియంది కాదు. అన్యమతం నుంచి ఇశ్రాయేలు మతానికి మారిన వారిని అప్పుడే జన్మించిన బిడ్డలతో పోల్చేవారు. కాబట్టి క్రీస్తు మాటల్ని అక్షరసత్యంగా తీసుకోకూడదని అతడు గ్రహించి ఉండవచ్చు. కాని జన్మతః ఇశ్రాయేలీయుడుగా తనకు దేవుని రాజ్యంలో నిశ్చయంగా స్థానం ఉందని నమ్మాడు. తనకు మార్పు అవసరం లేదని భావించాడు. అందుకే రక్షకుడన్న మాటలకి నివ్వెరపోయాడు. ఆ మాటలు తనకు వర్తించడాన్ని గూర్చి మండి పడ్డాడు. పరిసయ్యుడి అహం సత్యాన్వేషి యధార్ధ ఆకాంక్షతో సంఘర్షణ పడుతోంది. ఇశ్రాయేలులో ప్రధానిగా తన హోదాను గౌరవించకుండా క్రీస్తు తనతో అలామాట్లాడడాన్ని గురించి ఆశ్చర్యపడ్డాడు.DATel 167.1

    తాను విన్నమాటలకు ఎంతో ఆశ్చర్యపడి క్రీస్తుకి ఇలా వెటకారంగా సమాధానం ఇచ్చాడు, “ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మించగలడు? తమ మనస్సాక్షిని ఖండించే సత్యం వచ్చినప్పుడు ఇతరులు అనేకులవలె స్వాభావిక వ్యక్తి దైవాత్మ సంబంధిత విషయాల్ని అంగీకరించడన్న సత్యాన్ని నీకొదేము బయలుపర్చాడు. ఆధ్యాత్మిక విషయాల్ని ఆధ్యాత్మికంగానే గ్రహించాలి.DATel 167.2

    అయితే రక్షకుడు తర్కాన్ని తర్కంతో ఎదురుకోలేదు. మర్యాదగా చెయ్యిపైకెత్తి వాస్తవాన్ని ఇలా దృఢంగా పలికాడు, “ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలంగాను జన్మించితేగాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పచున్నాను.” క్రీస్తు ఇక్కడ నీటిమూలమైన బాప్తిస్మం గురించి దేవుని ఆత్మద్వారా హృదయాన్ని నూత నం చేసుకోడం గురించి మాట్లాడుతున్నాడని నీకొదేముకి తెలుసు. స్నానికుడైన యోహాను ఎవరి గురించి ప్రవచించాడో ఆ ప్రభువు సముఖంలో తానున్నానని నీకొదేముకు తెలుసు.DATel 167.3

    యేసు ఇలా కొనసాగించాడు, “శరీర మూలముగా జన్మించినది. శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. ” హృదయం స్వాభావికంగా దురాలోచనలతో నిండి ఉంది. “పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ? ఆలాగున ఎవడును పుట్టనేరడు.” యోబు 14:4. మానవుడి పాప సమస్యకు పరిష్కారం ఏ మానవుడు కనుక్కోలేదు. “శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు.” “అబద్ద సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.” రోమా 8:7, మత్త 15:19. హృదయం పునాదులు పరిశుద్ధమైనప్పుడే దాని ఊటలు స్వచ్ఛంగా ఉంటాయి. స్వీయశక్తి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆచరించి పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నించే వ్యక్తి అసాధ్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. మతపరమైన నియమనిబంధనల్ని ఆచరించడమే, ఓ భక్తి విధానం అనుసరించడమే చాలదు. అది క్షేమంకాదు. క్రైస్తవ జీవితమంటే పాతజీవితంలో మార్పులు చేయడమో లేదా దానికి మెరుగులు దిద్దడమో కాదు. స్వభావమే పూర్తిగా మారాలి. స్వార్ధం, పాపం నశించాలి. సరికొత్త జీవితం ప్రారంభంకావాలి. ఈ పరివర్తన పరిశుద్ధాత్మ క్రియాశీలంగా పని చెయ్యడం ద్వారానే చోటుచేసుకుంటుంది.DATel 167.4

    నీకొదేము ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నాడు. అందుచేత తన భావాన్ని విశదపర్చడానికి యేసు గాలి ఉదాహరణను ఉపయోగించాడు. “గాలి తన కిష్టమైన చోటును విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే యున్నాడు.”DATel 168.1

    గాలి వీచినప్పుడు చెట్ల కొమ్మలు ఆకులు పువ్వులు కదలడం వినిపిస్తుంది కాని గాలి కనిపించదు. అది ఎక్కడనుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. హృదయంలో పరిశుద్దాత్మ పని విషయంలోనూ ఇదే వాస్తవం. గాలి గమనాగమనాల్ని ఎలా వివరించలేమో అలాగే దీన్ని గురించి కూడాను. తనకు కలిగిన హృదయ పరివర్తన విషయంలో ఒక వ్యక్తి అది సంభవించిన సమయం లేక స్థలం లేక దానికి సంబంధించిన వివరాలు ఇదమిత్థంగా చెప్పలేకపోవచ్చు. అంతమాత్రాన ఆ వ్యక్తి మారుమనసు పొందలేదనలేం! గాలి మాదిరిగానే కపిపQచని ఓ సాధనం ద్వారా క్రీస్తు నిత్యం హృదయంలో పనిచేస్తుంటాడు. క్రమక్రమంగా లబ్దిదారుడికి తెలియకుండా అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అవి ఆత్మను క్రీస్తు చెంతకు ఆకర్షిస్తాయి. ఆయన్ని గురించిన ధ్యానం ద్వారా లేఖనపఠనం ద్వారా బోధకుడి మాటలు వినడం ద్వారా వీటిని పొందవచ్చు. ప్రత్యక్ష విజ్ఞప్తి వలన ఆత్మ వచ్చినప్పుడు ఆకస్మికంగా ఆత్మ సంతోషంగా తన్ను తాను యేసుకు అంకితం చేసుకుంటుంది. దీన్ని చాలామంది ఆకస్మిక పరివర్తన అని వ్యవహరిస్తారు. కాని వాస్తవంగా ఇది దేవుని ఆత్మ ఎంతో కాలంగా ఆ వ్యక్తి వెంటపడి పనిచేసినందువల్ల కలిగిన ఫలితం. ఇది దీర్ఘకాలం ఓర్పుతో సాగించిన ప్రక్రియ.DATel 168.2

    గాలి కనిపించకపోయినా దాని ఫలితాలు కనిపిస్తాయి. అనుభవంలోకి వస్తాయి. అలాగే ఓ వ్యక్తి ఆత్మలో పరిశుద్దాత్మ చేసేపని ఆ శక్తిని అనుభవించే వ్యక్తి క్రియల్లో వెల్లడవుతుంది. దేవుని ఆత్మ హృదయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆవ్యక్తి జీవితంలో పరివర్తన కలుగుతుంది. వ్యక్తి పాపపు ఆలోచనలకు పాపక్రియలకు దూరంగా ఉంటాడు. కోపం, అసూయ, వైరం బదులు సమాధానం చోటుచేసుకుంటుంది. దుఃఖానికి బదులు ఆనందం ఉంటుంది. ముఖం పరలోక కాంతి రేఖల్ని ప్రతిబింబిస్తుంది. భారాల్ని తొలగించే హస్తం ఎవరికీ కనిపించదు. పైనుంచి వచ్చే వెలుగు ఎవరికీ కనిపించదు. ఆత్మ తన్ను తాను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆ దివ్య పరిణామం సంభవిస్తుంది. అప్పుడు ఏ మానవ నేత్రానికీ కనిపించని శక్తి దేవుని స్వరూపంలో నూతన వ్యక్తిని సృష్టిస్తుంది.DATel 169.1

    పరిమితులు గల మానవ మనసులు రక్షణ క్రియను అవగాహన చేసుకోడం అసాధ్యం. ఆ మర్మం మానవజ్ఞానానికి మించింది. అయినా మరణం నుంచి జీవంలోకి దాటి వెళ్లే వ్యక్తి అది దైవసత్యమని గుర్తిస్తాడు. వ్యక్తిగత అనుభవం ద్వారా మనం ఇక్కడే రక్షణ ఆరంభాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలు తాం. దాని ఫలితాలు అనంతయుగాల పొడవున కొనసాగుతాయి.DATel 169.2

    యేసు మాట్లాడున్న తరుణంలో ఆ యూదు ప్రధాని మనసులోకి కొన్ని సత్యకిరణాలు ప్రవేశించాయి. మెత్తపర్చి వశపర్చుకునే పరిశుద్ధాత్మ అతని మనసును ప్రభావితం చేశాడు. అయినా నీకొదేము రక్షకుని మాటల్ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు. నూతనజన్మ అవసరాన్ని దాని కార్యాచరణ విధానాన్ని గుర్తించలేదు. ఆశ్చర్యపడుతూ, “ఈ సంగతులేలాగు సాధ్యములు?” అన్నాడు.DATel 169.3

    “నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా?” అన్నాడు యేసు. ప్రజలకు మతం బోధించే బాధ్యతగల వ్యక్తి ఇంత ప్రాముఖ్యమైన సత్యాల్ని గురించి తెలుసుకోకుండా ఉండకూడదు. స్పష్టమైన సత్యాల్ని గూర్చి ఆగ్రహం తెచ్చుకునే బదుల నీకొదేము తన ఆధ్యాత్మిక ఆజ్ఞానం దృష్ట్యా తన్నుతాను తగ్గించుకోవాలన్నది యేసు మాటల పాఠం. అయినా క్రీస్తు గంభీరంగా మర్యాదగా మాట్లాడాడు. ఆయన చూపు మాటతీరు యధార్ధ వాత్సల్యాన్ని వెలిబుచ్చడంతో అతడు తన దీనస్థితిని గుర్తించినా అభ్యంతరపడలేదు నొచ్చుకోలేదు.DATel 170.1

    కాగా లోకంలో తన కర్తవ్యం ఆధ్యాత్మిక రాజ్యస్థాపనేగాని లౌకిక రాజ్యపాలన కాదని యేసు విశదం చేయడంతో నీకొదేము కలవరం చెందాడు. ఇది గమనించి యేసు ఇలా అన్నాడు, “భూ సంబంధమైన సంగతులు నేను మితో చెప్పితే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు నమ్ముదురు?” హృదయంలో కృపచేసే పనిని విశదీకరిస్తూ క్రీస్తు చేసిన బోధను నీకొదేము అవగాహన చేసుకోలేకపోతే, మహిమతో నిండిన తన పరలోక రాజ్య స్వభావాన్ని ఎలా గ్రహించగలుగుతాడు? భూమిపై క్రీస్తు పరిచర్య ఏంటో గ్రహించలేని అతడు పరలోకంలో ఆయన నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని గ్రహించడం సాధ్యం కాదు.DATel 170.2

    యేసు దేవాలయంలో నుంచి బయటికి తరిమివేసిన యూదులు అబ్రహాము పిల్లలుగా చెప్పుకున్నారు. కాని ఆయనలో ప్రదర్శితమైన దైవమహిమను తట్టుకొలేక రక్షకుని సన్నిధిలో నుంచి పారిపోయారు. ఆలయ పరిశుద్ధ సేవలో పాలుపొందడానికి దైవకృపద్వారా తమకు అర్హత కలగలేదని ఈ రకంగా వారు నిరూపించుకున్నారు. పరిశుద్ధులుగా కనిపించడానికి వారు ఉత్సాహం చూపించారే గాని హృదయశుద్ధిని పట్టించుకోలేదు. ధర్మశాస్త్ర నిబంధనల్ని నిష్టగా పాటిస్తూనే ధర్మశాస్త్ర స్పూర్తిని నిత్యం కాలరాచారు. యేసు నీకొదేముకు విశదం చేస్తున్న పరివర్తనే వారికున్న గొప్ప అవసరం. అదే నైతిక నూతన జన్మ. పాపప్రక్షాళన. నవీకరణజ్ఞానం. పరిశుద్ధత.DATel 170.3

    పునరుజ్జీవం విషయంలో ఇశ్రాయేలు గుడ్డితనానికి సాకులేదు. పరిశుద్ధాత్మ ఆవేశంవల్ల యెషయా ఇలా రాశాడు, “మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి మా నీతి క్రియలన్నియు మురికి గుడ్డవలె నాయెను.” ద్రావీదు ఇలా ప్రార్ధించాడు, “దేవా నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” యెహెజ్కేలు ద్వారా ఈ వాగ్దానం వస్తోంది: “నూతన హృదయము మికిచ్చెదను. నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొనువారినిగాను మిమ్మును చేసెదను.” యెష 64:6; కీర్త 51:10; యెహె 36:26, 27.DATel 171.1

    నీకొదేము ఈ లేఖనాల్ని గుడ్డిగా చదివాడు. కాని ఇప్పుడు వాటి భావాన్ని గ్రహించడం మొదలు పెట్టాడు. బాహ్యజీవితానికి సంబంధించి నంతవరకు ధర్మశాస్త్ర విధుల్ని తు.చ తప్పకుండా ఆచరించడం ఎవరికీ పరలోక రాజ్యప్రవేశాన్ని ప్రసాదించలేదని అతడు గ్రహించాడు. మనుషుల దృష్టిలో అతడి జీవితం యధార్ధమైంది గౌరవప్రదమైంది. కాని క్రీస్తు సన్నిధిలో తన హృదయం అపవిత్రమైందని తన జీవితం పాపంతో నిండి ఉందని గుర్తించాడు.DATel 171.2

    నీకొదేము క్రీస్తుకి ఆకర్షితుడవుతున్నాడు. నూతన జన్మను గురించి రక్షకుడు తనకు స్పష్టీకరిస్తున్నప్పుడు ఆ మార్పు తనలో చోటుచేసుకోవాలని కోరుకున్నాడు. అది ఎలా సాధ్యపడుతుంది? అతడి మనసులోని ప్రశ్నకు యేసు సమాధానమిచ్చాడు. “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తైనో ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యుకుమారుడు ఎత్తబడవలెను.”DATel 171.3

    నీకొదేముకి పరిచితమైన విషయం ఇక్కడొకటి ఉంది. ఎత్తబడ్డ సర్పం తాలూకు సంకేతం రక్షకుని కర్తవ్యమేంటో స్పష్టంచేసింది. తాపకరములైన సర్పాలు కరిచినందువల్ల ఇశ్రాయేలు ప్రజలు మరణిస్తున్నప్పుడు ఓ ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఎత్తయిన స్తంభంమీద సమాజంమధ్య నిలబెట్టాల్సిందిగా దేవుడు మోషేని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ సర్పం వంక చూసేవారందరూ జీవిస్తాన్న వార్త శిబిరమంతా ప్రకటితమయ్యింది. కేవలం ఆ సర్సంలో తమకు సహాయం చేసే శక్తి ఏమిలేదని ప్రజలకు తెలుసు. అది క్రీసుకు గుర్తు. తమకు మరణం కలిగిస్తున్న సర్పం తాలూకు రూపం పైకెత్తబడ్డప్పుడు స్వస్తత చేకూర్చిన రీతిగానే “పాపశరీరాకారముతో” వచ్చిన ప్రభువు వారికి విమోచకుడు కావలసిఉన్నాడు. రోమా 8:3. బలులు అర్పించడం ద్వారానే తమకు పాపవిముక్తి కలుగుతుందని అనేక మంది ఇశ్రాయేలీయులు నమ్మారు. ఇత్తడి సర్పానికి ఎలా విలువలేదో బలి అర్పణ సేవకు కూడా అలాగే ఏమి విలువలేదని వారికి నేర్పించడం దేవుని ఉద్దేశం. వారి మనసుల్ని రక్షకునిపై కేంద్రీకరించడమే దాని లక్ష్యం. తమ గాయాల్ని మాన్పుకోడానికి గాని లేదా తమ పాపాల్ని పరిహరించుకోడానికి గాని వారు తమంతట తాము ఏమి చేసుకోలేరు. వారు చేయాల్సిదల్లా దేవుడిచ్చిన వరంపై విశ్వాసం ఉంచడం, పైకి చూసి జీవించడం.DATel 171.4

    పాము కరిచిన వారు పైకి చూడడంలో ఆలస్యం చేసి ఉండవచ్చు. ఆ ఇత్తడి చిహ్నంలోని శక్తిని శంకించి ఉండవచ్చు. అందుకు శాస్త్రీయ వివరణ కోరి ఉండవచ్చు కాని అలాంటి వివరణ ఏమిలేదు. మోషే ద్వారా వచ్చిన దేవుని మాటను వారు నమ్మాలి. పైకి చూడడానికి నిరాకరించడం మరణాన్ని ఎన్నుకోడమే.DATel 172.1

    వివాదం చర్చద్వారా ఆత్మ వికాసం కలగదు. మనం పైకి చూసి జీవించాలి. నీకొదేము ఆ పాఠాన్ని స్వీకరించి దాన్ని మనసులో ఉంచుకున్నాడు. ఓ నూతన కోణంలో లేఖనాల్ని పరిశోధించాడు. ఓ సిద్ధాంతాన్ని చర్చించడానికి కాక ఆత్మకు జీవాన్ని పొందడానికి పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వానికి తన్నుతాను అప్పగించుకునే కొద్దీ పరలోక రాజ్యాన్ని చూడడం మొదలు పెట్టాడు.DATel 172.2

    ఎత్తబడ్డ సర్పమునుంచి నీకొదేము ఏ సత్యాన్ని నేర్చుకున్నాడో దాన్ని నేడు వేల ప్రజలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని అనుగ్రహాన్ని సంపాదించడానికి వారు ధర్మశాస్త్రాచరణ మీద ఆధారపడి ఉంటారు. యేసు వంక చూడమని ఆయన కేవలం తన కృపచేత రక్షిస్తాడని నమ్మమని కోరినప్పుడు “ఈ సంగతులేలాగు సాధ్యము?” అని ప్రశ్నిస్తారు.DATel 172.3

    నీకొదేము వలె పాపులలో ప్రధానుడుగా జీవితంలో ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉండాలి. క్రీస్తు “నామముననే మనము రక్షణ పొందవలెను” అ.కా 4:12. మనం విశ్వాసమూలంగా దేవుని కృపను పొందుతాం. అయితే విశ్వాసమే మన రక్షకుడు కాదు. అది సంపాదించేది ఏమిలేదు. అది క్రీస్తును పట్టుకుని పాపాన్ని పరిష్కరించే ఆయన నీతిని అందుకునే చెయ్యి లాంటిది. దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం పాప పశ్చాత్తాపం పొందలేం కూడా. క్రీస్తును గురించి లేఖనమిలా అంటోంది “ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తముచేత హెచ్చించియున్నాడు. “అ.కా. 5:31, క్షమాపణలాగే పాపపశ్చాత్తాపమూ యేసు ఈవే.DATel 172.4

    మనం రక్షణ ఎలా పొందుతాం? “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో” అలాగే మనుష్యుకుమారుడు ఎత్తబడ్డాడు. మోసపోయి సర్పం కాటుకి గురి అయిన ప్రతీవాడు పైకి చూసి జీవించవచ్చు. “ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల” యోహాను 1:29. సిలువ నుంచి ప్రకాశిస్తున్న వెలుగు దేవుని ప్రేమను వెల్లడి చేస్తోంది. ఆ ప్రేమ మనల్ని ఆయన వద్దకు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్శణను మనం ప్రతిఘటించకుంటే అది మనల్ని సిలువ పాదాల వద్దకు చేర్చుతుంది. రక్షకుని సిలువ వేసిన మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపం చెందుతాం. అప్పుడు దేవుని ఆత్మ విశ్యాసం ద్వారా మనలో నూతన జీవితాన్ని పుట్టిస్తుంది. తలంపులు కోరికలు క్రీస్తు చిత్తానికి లోబడి ఉంటాయి. మనలోని సమస్తాన్ని తన వశం చేసుకోడానికి మనలో పనిచేసే ఆప్రభువు స్వరూపం మన హృదయం మన మనసు నూతనంగా సృష్టిపొందుతాయి. అంతట దైవధర్మశాస్త్రం మన మనసులోను మన హృదయంలోను రాయబడుంది. మనం క్రీస్తుతో కలిసి “నాదేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము” అంటాం కీర్త 40:8,DATel 173.1

    నీకొదేముతో తన సమావేశంలో యేసు రక్షణ ప్రణాళికను తన జీవిత కర్తవ్యాన్ని లోకానికి వెల్లడిచేశాడు. పరలోకాన్ని స్వతంత్రించుకునే వారి మనసుల్లో జరగాల్సిఉన్న పనిని మెట్టు తర్వాత మెట్టు చొప్పున సంపూర్తిగా తన అనంతర చర్చలు వేటిలోనూ ఆయన స్పష్టీకరించలేదు. తన పరిచర్య ఆరంభంలో సన్ హెల్త్న్ సభ్యుడికి సత్యాన్ని విప్పిచెప్పాడు. ఆ సభ్యుడి మనసు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న మనసు. అతడు ప్రజలకు బోధించడానికి నియుక్తుడయిన వాడు. కాగా ఇశ్రాయేలు నేతలు ఆ సత్య కాంతిని స్వాగతించలేదు. నీకొదేము సత్యాన్ని తన హృదయంలో దాచుకున్నాడు. మూడేళ్ల వరకు ఫలాలు కనిపించలేదు.DATel 173.2

    అయితే తాను విత్తనం నాటిన నేల ఎలాంటిదో యేసుకు తెలుసు. పర్వతం వద్ద ఏకాంత స్థలంలో రాత్రిపూట మాట్లాడిన మాటలు వ్యర్ధం కాలేదు. కొంతకాలం నీకొదేము క్రీస్తుని బహిరంగంగా అంగీకరించలేదు. కాని అతడు ఆయన జీవితాన్ని పరిశీలించాడు. ఆయన బోధనల్ని పరిగణించాడు. ఒలీవల కొండపై యేసు తనకు బోధించిన సంగతుల్ని నీకొదేము మననం చేసుకున్నాడు. “అరణ్యంలో మోషే సర్పమును ఏలాగు ఎత్తైనో ఆలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.” ఆ రహస్య సమావేశం నుంచి వచ్చిన వెలుగు కల్వరిసిలువపై వెలుగు విరజిమ్మింది. నీకొదేము యేసులో లోకరక్షకుణ్ని చూశాడు.DATel 174.1

    ప్రభువు ఆరోహణం అనంతరం హింస కారణంగా శిష్యులు పలు ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు నీకొదేము ధైర్యంగా ముందికి వచ్చాడు. క్రీస్తు మరణం తర్వాత నామరూపాలు లేకుండా పోతుందని యూదులు కనిపెట్టిన తొలినాళ్ల సంఘాన్ని పోషించడానికి నీకొదేము తన భాగ్యాన్ని ” వినియోగించాడు. క్రితం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రశ్నిస్తూ వచ్చిన అతడు ఇప్పుడు కష్ట సమయంలో బండలా దృఢంగా నిలిచాడు. శిష్యుల విశ్వాసాన్ని బలో పేతంచేశాడు. సువార్త సేవ కొనసాగింపుకు ఆర్ధికవనరులు సమకూర్చాడు. వెనకటి రోజుల్లో అతణ్ని గౌరవించి ఆదరించినవారు ఇప్పుడు ద్వేషించి హింసించారు. అయినా క్రీస్తు ఆ రాత్రి సమావేశంలో మొదలైన విశ్వాసంలో అతడు తడబడలేదు.DATel 174.2

    ఆ సమావేశ కథనాన్ని నీకొదేము యోహానుకి వినిపించాడు. లక్షలాది ప్రజలకు ఉపదేశం కలిగేందుకు కోసం ఆ కధనాన్ని యోహాను దాఖలు చేశాడు. ఆ రాత్రి కొండపక్క నీడల నడుమ ఆ సామాన్య గలిలయ బోధకుడు ఆ యూదుల అధికారికి బోధించిన సత్యాలు అప్పుడెంత ప్రాముఖ్యమైనవో ఇప్పుడూ అంతే ప్రాముఖ్యమైనవి.DATel 174.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents