Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    38—వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి

    తమ మిషనరీ ప్రయాణం నుంచి తిరగివచ్చిన తర్వాత “అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేసిరి. అప్పుడాయన మారేకాంతముగా అరణ్యప్రదేశమునకు వచ్చి, కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను.”DATel 391.1

    శిష్యులు యేసు వద్దకు వచ్చి అన్ని సంగతులు ఆయనకి చెప్పారు. తమ మంచి అనుభవాల్ని తమ చెడ్డ అనుభవాల్ని తమ కృషి ఫలితాల్ని చూసినప్పుడు తమకు కలిగిన అనందాన్ని తమ వైఫల్యాలు, పొరపాట్లు బలహీనతల్ని గురించిన తమ సంతాపాన్ని ఆయన ముందు పెట్టడానికి ఆయనతో వారికున్న ఆత్మీయత ప్రోత్సహించింది. సువార్తికులుగా తమ మొదటి పనిలో వారు పొరపాట్లు చేశారు. తమ అనుభవాల్ని దాపరికం లేకుండా యేసుకి నివేదించినప్పుడు వారికి ఎక్కువ ఉపదేశం అవసరమని ఆయన గ్రహించాడు. వారు తమ పరిచర్యలో చాలా అలసిపోయారని వారికి విశ్రాంతి అవసరమని ఆయన గుర్తించాడు.DATel 391.2

    అయితే అప్పుడు వారున్న స్థలంలో వారికి అవసరమైన ఏకాంతం లభ్యంకాలేదు. “అనేకులు వచ్చుచుపోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి ఆవకాశము లేకపోయెను.” స్వస్తత పొందాలని, ఆయన మాటలు వినాలని ఆశించి ప్రజలు క్రీస్తు చుట్టూ మూగుతున్నారు. అనేకులు ఆయనకు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే అనేకులకు ఆయన ఆశీర్వాదాల ఊటగా కనిపిస్తోన్నాడు. ఆరోగ్యవరాన్ని పొందడానికి ఆయన వద్దకు వచ్చిన వారిలో ఎక్కువమంది ఆయన్ని రక్షకుడిగా స్వీకరించారు. పరిసయ్యులికి జడిసి అప్పుడు ఆయన్ని స్వీకరించనివారు పరిశుద్దాత్మకుమ్మరింపు సమయంలో మారు మనసు పొంది, ఆగ్రహంతో ఉన్న యాజకులు ప్రధానుల ముందు క్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకుని స్వీకరించారు.DATel 391.3

    క్రీస్తు ఇప్పుడు తన శిష్యులితో కలిసి విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించాడు. వారికి ఉపదేశించాల్సిన విషయం ఆయనకు ఉంది. తమ పరిచర్యలో తమకు ఎదురైన సంఘర్షణ పరీక్షలో వారు అనేక రకాలుగా వ్యతిరేకతను ఎదుర్కున్నారు. క్రితం ప్రతీ విషయంలోను వారు క్రీస్తును సంప్రదించేవారు, కాని కొంత కాలంగా వారు ఒంటి రివారయ్యారు. కొన్ని సార్లు ఏంచెయ్యాలో తోచక ఆందోళన చెందేవారు. తమ పరిచర్యలో వారికి ఎంతో ఉత్సాహం ఉద్రేకం కలిగాయి. ఎందుకంటే వారిని తన ఆత్మ లేకుండా క్రీస్తు పంపలేదు. ఆయనపై విశ్వాసం వలన వారు అనేక అద్భుతాలు చేశారు. అయితే ఇప్పుడు వారు జీవాహారం భుజించాల్సిన అవసరం ఏర్పడింది. విశ్రాంతి తీసుకోడానికి వారు ఓ ప్రశాంత స్థలానికి వెళ్లడం అవసరమయ్యింది. అక్కడ వారు యేసు సహవాసంలో ఉండి భవిష్యత్తులో తమ సేవకు అగత్యమైన ఉపదేశం పొందాల్సి ఉన్నారు.DATel 392.1

    “అప్పుడాయన మారేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను.” తన సేవలో ఉన్నవారందరి పట్ల క్రీస్తు హృదయం దయకనికరాలతో నిండి ఉంది. దేవుడు కోరేది త్యాగం కాదు గాని కృప అని ఆయన తన శిష్యులికి చూపించాడు. ప్రజల నిమిత్తం వారు ఎంతో శ్రమపడి పని చేస్తున్నారు. ఇది శారీరకంగాను మానసికంగాను వారికి అలసట కలిగించింది. విశ్రమించడం వారి విధి.DATel 392.2

    తమ శ్రమవలన కలిగిన విజయాన్ని చూసి శిష్యులు అది తమ శక్తి మూలంగానే అని అతిశయపడే ప్రమాదంలోను, అధ్యాత్మిక అహంకారం ప్రదర్శించి, తద్వారా సాతాను శోధనలకు గురిఅయ్యే ప్రమాదంలోను ఉన్నారు. వారి ముందు మహా కర్తవ్యం ఉంది. కనుక తమ శక్తి తమలోలేదని దేవునిలో ఉన్నదని వారు ప్రపథమంగా నేర్చుకోవాల్సి ఉంది. సీనాయి అరణ్యంలో మోషేలాగ యూదయ కొండల మధ్య దావీదు లాగ లేదా కెరీతు వాగు వద్ద ఏలీయాలాగ, శిష్యులు క్రీస్తుతో సంప్రదింపులికి, ప్రకృతితోను తమ సొంత హృదయాలతోను సమాలోచనలకు ఎడతెరపిలేని తమ కార్యకలాపాలు వదిలి రావడం అవసరమయ్యింది.DATel 392.3

    శిష్యులు మిషనరీ ప్రయాణంలో ఉన్న కాలంలో యేసు ఇతర పట్టణాల్ని గ్రామాల్ని సందర్శిస్తూ దేవుని రాజ్య సువార్త బోధించాడు. దాదాపు ఈ సమయంలోనే ఆయనకి బాప్తిస్మమిచ్చే యోహాను మరణవార్త వచ్చింది. తన చర్యలు ఏ పర్యవసానాలకి దారి తీస్తున్నాయో ఈ సంఘటన విస్పష్టంగా ఆయన ముందుంచింది. ఆయన మార్గాన్ని దట్టమైన నీడలు ముసురుతున్నాయి. యాజకులు రబ్బీలు ఆయన్ని చంపడానికి కనిపెట్టొన్నారు. గూఢచారులు ఆయన్ని వెంబడిస్తోన్నారు. ఆయన్ని మట్టుపెట్టడానికి అన్ని పక్కలా కుట్రలు జరుగుతోన్నాయి. అపొస్తలులు గలియల అంతటా సువార్త బోధిస్తోన్నారన్న వార్త హేరోదుకి అందింది. ఇది యేసుని ఆయన పరిచర్యను అతడి దృష్టికి తెచ్చింది. అంతట అతడు “యోహాను మృతులలో నుండి లేచెను” అన్నాడు. యేసుని చూడాలన్న కోరికను వ్యక్తం చేశాడు. తనను రోమా సింహాసనం నుంచి పడదోసి యూదు జాతిమీద ఉన్న రోమా కాడిని విరగగొట్టడానికి విప్లవం లేవదియ్యడానికి రహస్యప్రయత్నాలు జరుగుతాయేమోనన్న భయం హేరోదుని నిత్యం వేధిస్తుండేది. ప్రజల్లో అసంతృప్తి తిరుగుబాటు స్వభావం హెచ్చు పెరుగుతోంది. గలిలయలో క్రీస్తు బహిరంగ సేవ ఎక్కువ కాలం కొనసాగడం సాధ్యం కాదన్న సూచనలు కనిపిస్తోన్నాయి. ఆయన శ్రమదినాలు దగ్గర పట్తోన్నాయి. కనుక గందరగోళం నుంచి జనసమూహాల్నుంచి దూరంగా వెళ్లి కొంత సమయం ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించాడు.DATel 393.1

    దుఃఖంతో నిండిన హృదయాలతో యోహాను శిష్యులు విరూపితమైన అతని దేహాన్ని సమాధి చెయ్యడానికి మోసుకొనిపోయారు. అంతట వారు “యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి.” యేసు యోహాను వద్దకు వస్తున్న ప్రజల్ని ఆకర్షిస్తోన్నట్లు కనిపించినప్పుడు ఈ శిష్యులు ఆయనపై అసూయపడ్డారు. క్రీస్తు మత్తయి ఇంట్లో సుంకరులతో కూర్చున్నప్పుడు ఈ శిష్యులు పరిసయ్యులతో గొంతు కలిపి ఆయన్ని తప్పుపట్టారు. స్నానికుడైన యోహాన్ని చెరవిముక్తుణ్ని చెయ్యనందుకు ఆయన పరిచర్యను కర్తవ్యాన్ని శంకించారు. కాగా ఇప్పుడు తమ బోధకుడు మరణించగా తమకు కలిగిన దుఃఖంలో ఆదరణ కోసం, తమ భావి పరిచర్యను గురించి మార్గ నిర్దేశం కోసం కనిపెడ్రూ యేసు వద్దకు వచ్చి ఆయనతో ఏకమయ్యారు. రక్షకుడితో సావాసానికి వారికి కూడా కొంత ప్రశాంతత అవసరమయ్యింది.DATel 393.2

    బేత్సయిదా సమీపంలో సరస్సు ఉత్తర కొనలో ఒక ఏకాంత ప్రదేశం ఉంది. ఇప్పుడు వసంతకాలం అవ్వడంతో అది ఎంతో సుందరంగా ఉంది. యేసు ఆయన శిష్యులు విరామంగా సమయం గడపడానికి అది అనువుగా ఉంది. వారు ఇక్కడికి పయనమయ్యారు. పడవలో వెళ్ళారు. ఇక్కడ వారు రద్దీగా ప్రయాణాలు సాగే మార్గాలికి, నగర జీవితానికి ఒత్తిళ్లకు దూరంగా ఉండగలరు. ప్రకృతి దృశ్యాలే గొప్ప విశ్రాంతి చేకూర్చుతాయి. అది వారి ఇంద్రియాలకు హాయినిచ్చే మార్పు. ఇక్కడ శిష్యులు యేసు మాటల్ని ప్రశాంతంగా వినవచ్చు. శాస్త్రులు పరిసయ్యుల అంతరాయాలు, ప్రత్యుత్తరాలు, నిందారోపణలు ఇక్కడుండవు. ఇక్కడ వారు తమ ప్రభువుతో ఉండి ఆయన సాహచర్యాన్ని మనసార ఆనుభవించవచ్చు.DATel 394.1

    క్రీస్తు ఆయన శిష్యులు తీసుకున్న విశ్రాంతి సొంత ఆహ్లాదం కోసం తీసుకున్నది కాదు. విశ్రాంతిగా వారు గడిపిన సమయం వినోదాల్లో గడపలేదు. వారుదేవుని సేవను గురించి చర్చించుకున్నారు. తమ సేవను మరింత సమర్థంగా చేసే పద్ధతులు చర్చించుకున్నారు. శిష్యులు క్రీస్తుతో ఉన్నారు గనుక ఆయన్ని అవగాహన చేసుకున్నారు. వారితో ఆయన ఉపమాన రూపంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన వారి పొరపాట్లు సరిదిద్దాడు. ప్రజల్ని చేరే ఉత్తమ మార్గాల్ని వారికి విశదం చేశాడు. దేవుని ప్రశస్తమైన సత్య సంపదను వారికి మరింత విశదంగా వివరించాడు. దైవశక్తి వారికి బలం చేకూర్చి వారిని నిరీక్షణతోను ధైర్యంతోను నింపింది.DATel 394.2

    యేసు సూచక క్రియలు చేయగలిగి ఉన్నా, సూచక క్రియలు చేసేశక్తిని తన శిష్యులికి ఇచ్చినా, అలసి ఉన్న తన శిష్యులు దూరంగా వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వారిని ఆదేశించాడు. కోత విస్తారంగా ఉంది కాని కోసేవారు తక్కువ మందే అన్నప్పుడు ఆయన తన శిష్యులు అవిశ్రాంతంగా శ్రమ చెయ్యాలని కోరలేదు. కాని “కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని” చెప్పాడు. మత్త 9:38. దేవుడు ప్రతీ వ్యక్తికి తన సామర్థ్యాన్ని బట్టి తన పనిని నియమిస్తాడు (ఎఫె 4:11-13). ఇతరులికి బాధ్యతలు, భారాలు, ఆత్మవేదన లేకుండా చేసి కొందరు మాత్రమే మోయలేని బాధ్యతలు వహించాలని దేవుడు కోరడు.DATel 394.3

    శిష్యులతో క్రీస్తు పలికిన దయగల మాటలే ఈనాడు తన పని వారితోనూ పలుకుతున్నాడు. “సరేకాంతముగా అరణ్యప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి.” అని అలసిపోయిన వారితో అంటోన్నాడు. మనుషులికి ఆధ్యాత్మిక పరిచర్య చేస్తున్నప్పుడు సయితం నిత్యం పని ఒత్తిడి ఉద్రేకాల కింద ఉండడం విజ్ఞత కాదు. ఎందుకంటే , ఇలాగుంటే వ్యక్తిగత శక్తులికి ఎక్కువ పని కలుగుతుంది. క్రీస్తు శిష్యులు తమను తాము ఉపేక్షించుకోవాలి. త్యాగాలు చెయ్యాలి. కాని సాతాను మానవ బలహీనతల్ని ఆసరా చేసుకుని దేవుని సేవను పాడు చెయ్యకుండేందుకు జాగ్రత్తలు తీసుకోడం అవసరం.DATel 395.1

    రబ్బీల అంచనా ప్రకారం మతమంటే ఎడతెరపిలేకుండా పనులు చెయ్యడం. తమది ఉన్నతస్థాయి భక్తి అని చూపించుకోడానికి వారు బాహ్య కార్యచరణ మీద ఆధారపడ్డారు. వారు ఇలా తమ ఆత్మల్ని దేవుని నుంచి వేరు చేసి స్వయం సమృద్ధిగల వ్యక్తులుగా తమను తాము నిర్మించుకున్నారు. ఈ అపాయాలే ఇంకా ఉన్నాయి. క్రియాచరణ పెరిగి దేవునికి చేసే పనిలో మనుషులు సఫలులయ్యే కొద్దీ మానవ ప్రణాళికల్ని మానవ పద్ధతుల్ని నమ్ముకునే ప్రమాదం ఉంది. ప్రార్ధన చెయ్యడం తగ్గుతుంది. విశ్వాసం క్షీణిస్తుంది. శిష్యుల్లాగ మనం దేవుని మీద ఆధారపడడం, మన పనినే మన రక్షకుడుగా భావించడం అనే ప్రమాదం ఉంది. మనం ప్రతి నిత్యం యేసు వంక చూడడం అవసరం. ఆయన శక్తి ద్వారానే కార్యసిద్ధి కలుగుతుందని గుర్తించడం అవసరం. మనం నశించిన వారి రక్షణ కోసం శ్రమించాల్సి ఉండగా, మనం కూడా ప్రార్ధించడానికి, దైవ వాక్యం పఠించడానికి సమయం తీసుకోవాలి. ప్రార్ధన ద్వారా జరిగి, క్రీస్తునీతి వలన పవిత్రత పొందిన పని మాత్రమే దేవునికి సమర్థమైన సేవగా చివరికి నిలుస్తుంది.DATel 395.2

    పనితోను పరిచర్య బాధ్యతతోను యేసు జీవితంలో మరే జీవితం నిండలేదు. అయినా ఆయన ఎంత తరచుగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు! తండ్రితో ఆయన సహవాసం ఎంత నిశ్చలమైంది! తొలినాళ్ల దైవ సంఘ చరిత్రలో ఇలాంటి దాఖలాలు పదే పదే కనిపిస్తాయి. “ఆయన పెందలకడనే లేచి వెళ్లి ప్రార్థన చేయుచుండెను.” “బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుగకును కూడివచ్చుచుండెను. ఆయన ప్రార్ధన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను.” “ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించటయందు రాత్రి గడిపెను.” మార్కు 1:35; లూకా 5:15, 16; 6:12.DATel 395.3

    ఇతరుల మేలుకోసం పూర్తిగా అంకితమైన జీవితంలో, రహదారుల్లో నుంచి, తన్ను వెంబడిస్తున్న ప్రజా సమూహాల్నుంచి తన్నుతాను ఉపసంహరించుకోడం అవసరమని రక్షకుడు భావించాడు. విశ్రాంతికోసం, తండ్రితో తెంపులేని సహవాసం కోసం, నిర్విరామ పరిచర్య నుంచి, మానవానసరాల పరిచయం నుంచి విశ్రాంతి కోసం ఆయన పక్కకు తొలగడం అవసరం. మనలో ఒకడిగా మన అవసరాల్ని బలహీనతల్ని పంచుకున్న వాడిగా ఆయన సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. తన విధుల నిర్వహణకు, కష్టాలు భరించడానికి శక్తితో ముందుకు వెళ్ళడానికి దేవుని శక్తి కోసం రహస్య ప్రార్థన స్థలంలో ప్రార్థించాడు. లోకంలో యేసు శ్రమల్ని, ఆత్మలో చిత్రవధను అనుభవించాడు. తనను కుంగదీస్తోన్న దుఃఖ భారాన్ని తండ్రితో సహవాసం ద్వారా తొలగించుకోగలిగాడు. ఇక్కడ ఆయనకు ఓదార్పు, సంతోషం లభించేవి.DATel 396.1

    మానవాళి మొర అనంత దయామయుడైన తండ్రికి క్రీస్తు ద్వారా చేరింది. తన మానవత్వం పరలోక విద్యుత్తుతో పటిష్టమై దేవత్వంతో అనుసంధానమయ్యే వరకు ఆయన మానవుడుగా దేవుని సింహాసనం ముందు విజ్ఞాపన చేశాడు. లోకానికి జీవాన్నించేందుకుగాను అవిచ్ఛిన్న సహవాసం ద్వారా దేవుని వద్ద నుంచి ఆయన జీవం పొందాడు. అయన అనుభవం మన అనుభవం కావాలి.DATel 396.2

    “సరేకాంతముగా” రండి అంటున్నాడు ప్రభువు. ఆయన మాటలనువింటే మనం బలంగా ప్రయోజనకరంగా ఉంటాం. శిష్యులు యేసు వద్దకు వెళ్లి ఆయనకు అన్ని సంగతులు చెప్పారు. ఆయన వారిని ఉద్రేకరపర్చి ఉపదేశించాడు. నేడు మనం యేసు వద్దకు వెళ్లి మన అవసరాల్ని గురించి చెప్పినట్లయితే ఆయన మనల్ని నిరాశపర్చడు. మనకు సహాయం చెయ్యడానికి ఆయన కుడిచేతి పక్కనే ఉంటాడు. మనం నిరాడంబరంగా ఉండడం అవసరం. రక్షకునిపై మనం నమ్మకం విశ్వాసం ఉంచాలి. “బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి” అన్న పేరుతో ఎవరు పిలువబడున్నారో, “ఆయన భుజము మీద రాజ్యభారముండును.” అని ఎవరి గురించి రాయడం జరిగిందో ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచన కర్త. ఆయన్నుంచి జ్ఞానం కోరుకోవలసిందిగా మనకు ఆహ్వానం వస్తోంది. ఆయన “ఎవనిని గద్దింపక అందరికిని ధారళముగా దయచేయువాడు” యాకోబు 1:5.DATel 396.3

    దేవుని శిక్షణ కింద ఉన్న వారందరు లోకంతో మమేకం కాని జీవితాలు జీవించాలి. లోకం సంప్రదాయాలకు లేక దాని ఆచారనియమాలకు దూరంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించడంలో ప్రతీవారికి వ్యక్తిగతానుభం ఉండాలి. ఆయన హృదయంతో మాట్లాడడం మనం వ్యక్తిగతంగా వినాలి. వినిపించకుండా ప్రతీ ఇతర స్వరం ఆగిపోయినప్పుడు, ఆ నిశ్శబ్దంతో మనం ఆయన ముందు వేచి ఉన్నప్పుడు, ఆత్మలోని నిశ్శబ్దం దేవుని స్వరం మరింత స్పష్టంగా వినిపించడానికి దోహదం చేస్తుంది. “ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి.” అంటున్నాడాయన. కీర్త 46:10. నిజమైన విశ్రాంతి ఇక్కడే లభిస్తుంది. దేవునికి సేవ చేసేవారందరికీ ఇది ప్రయోజనకరమైన సిద్ధబాటు. హడావుడిగా చలించే జన సమూహాల నుంచి జీవిత కార్యకలాపాల ఒత్తిడి నుంచి ఈ విధంగా సేద దీరే ఆత్మ శాంతితో నిండిన వాతావరణాన్ని అనుభవిస్తుంది. జీవితం పరిమళంతో నిండి, మనుషుల హృదయాల్ని ప్రభావితం చేసే దైవశక్తిని వెల్లడిస్తుంది.DATel 397.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents