Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    75—అన్న కయపల ముందు

    కిడ్రోను వాగు తోటలు ఒలీవ తోపులు దాటి సద్దుమణిగిన పట్టణ వీధుల గుండా వారు యేసుని తీసుకువెళ్లారు. అది అర్థరాత్రి. ఆయన వెంబడి వెళ్తున్న మూక కేకలు ప్రశాంత వాతావరణాన్ని పాడుచేస్తున్నాయి. రక్షకుణ్ని బంధించి ఆయన్ని జాగ్రత్తగా కాపాడూ తీసుకు వెళ్తున్నారు. ఆయన బంధకాలతో నడుస్తున్నప్పుడు చాలా బాధకలుగుతున్నది. కాని ఆయన్ని హడావుడిగా మాజీ ప్రధాన యాజకుడి భవనానికి తీసుకువెళ్తున్నారు.DATel 785.1

    అన్న అధికార యాజక కుటుంబానికి అధిపతి. అతడి వయసును బట్టి ప్రజలు అతణ్ని ప్రధాన యాజకుడుగా పరిగణించేవారు. అతడి సూచనలు సలహాలు కోరి వాటిని దేవుని స్వరంగా ప్రజలు అంగీకరంచేవారు. క్రీస్తుని యాజకాధికారానికి బానిసగా చూడడం అతడు మొదటగా చేయాల్సినపని. ఖైదీని పరీక్షించేటప్పుడు అతడు ఉండాలి ఎందుకంటే ఎక్కువ అనుభవంలేని కయప తాము ఏధ్యేయంతో పనిచేస్తున్నారో దాన్ని సాధించడంలో విఫలుడు కావచ్చునన్నది అతడి భయం. వ్యూహాలు పన్నడం కపట నాటకాన్ని ఆడడం జిత్తులు వేసి చిత్తు చెయ్యడంలో అతడి సామర్థ్యాన్ని ఈసారి ఉపయోగించుకోవాలి. ఏది ఏమైనా క్రీస్తు మరణం జరిగితీరాలి.DATel 785.2

    లాంఛనంగా క్రీస్తుకు తీర్పు సన్ హెడ్రిన్ ముందు జరగాలి. కాని అది అన్న ముందు జరపడానికి ఏర్పాటు చేశారు. రోమా ప్రభుత్వ చట్టం కింద సన్ హెడ్రిన్ సభకు మరణదండన విధించే అధికారం లేదు. ఆసభ వారు నేరస్తుణ్ని పరీక్షించి, తీర్పు చెప్పవచ్చు. కాని ఆ తీర్సుని రోమా అధికారులు ధ్రువపర్చాల్సి ఉంది. కనుక రోమీయులు నేరాలు పరిగణించే ఆరోపణల్ని క్రీస్తుపై మోపాల్సిన అవసరం ఉంది. యూదుల దృష్టిలో కూడా ఖండనార్ధమైన ఆరోపణలు ఆయనపై మోపడం అవసరం. యాజకులు అధికారుల్లో క్రీస్తు బోధనను అంగీకరించినవారి సంఖ్య తక్కువగా లేదు. వెలివేత వేటుకి భయపడి వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించలేకపోయారు. “ఒక మనుష్యుని మాట వినకమునుపు, వాడు చేసినది తెలిసికొనక మునుపు, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా?” (యోహా 7:51) అంటూ నీకొదేము అడిగిన ప్రశ్న యాజకులికి జ్ఞాపకముంది. అప్పటి సభ ఈ ప్రశ్నతో వాయిదాపడింది. వారి దురాలోచనలకు అడ్డుకట్ట పడింది. అరిమతయియ యోసేపును నీకొదేమును ఇప్పుడు సభకు పిలవకూడద తీర్మానించుకున్నారు. అయితే న్యాయాన్ని మాట్లాడడానికి భయపడని ఇతరులున్నారు. సన్ హెడ్రిన్ సభ్యులందరూ క్రీస్తుకి వ్యతిరేకంగా నిలిచే రీతిలో విచారణని నిభాయించాలి. యాజకులు ఆరోపించదలస్తున్న నేరాలు రెండున్నాయి. యేసుని దేవదూషకుడిగా నిరూపించగలిగితే యూదులు ఆయన శిక్షార్హుడంటారు. రాజ్యద్రోహి అని నిరూపిస్తే రోమియులు శిక్షార్హుడుగా పరిగణిస్తారు. రెండో నేరాన్ని నిరూపించడానికి అన్న ముందు ప్రయత్నించాడు. తన ఆరోపణకు బలం కూర్చేదేమైన క్రీస్తు చెప్పవచ్చునని ఆయన్ని తన శిష్యులి గురించి, తన సిద్ధాంతాల గురించి అన్న ప్రశ్నించాడు. ఒక నూతన రాజ్యాన్ని స్థాపించడానికి ఒక రహస్య సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిరూపించే ఏదోవాక్యాన్ని ఆయన నుంచి రాబట్టాలని అన్న భావించాడు. అప్పుడు యాజకులు ఆయన్ని సమాజ శాంతిని పాడుచే సేవాడిగా, తిరుగుబాటుదారుడుగా రోమీయులకి అప్పగించవచ్చని తలంచాడు.DATel 785.3

    క్రీస్తు యాజకుడి ఉద్దేశాన్ని తెరచిఉన్న పుస్తకం చదవగలిగినట్లు చదివాడు. తన్ను ప్రశ్నిస్తున్న వాడి మనసులోని మనసును చదవుతున్నట్లు... తనకు తన శిష్యులికి మధ్య ఎలాంటి రహస్య సమబంధాలు లేవని, తన అభిప్రాయాల్ని గోప్యంగా ఉంచడానికి తన అనుచరుల్ని రహస్యంగా చీకటిలో సమావేశ పర్చడం లేదని చెప్పాడు. తన ఉద్దేశాల విషయంలోగాని లేక సిద్దాతాల విషయంలోగాని ఆయనకు ఎలాంటి రహస్యాలు లేవన్నాడు. “నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని”, “యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలో బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు” అన్నాడు.DATel 786.1

    తాను పనిచేసే పద్ధతులికీ తన్ను నిందిస్తున్న వారు పనిచేస్తున్న పద్ధతులకీ మధ్యగల భేదాన్ని రక్షకుడు ఇలా ఎత్తి చూపించాడు. ఆయన్ని ఉచ్చులో బంధించి ఒక రహస్య న్యాయస్థానం ముందు నిలబెట్టి, యధార్ధమార్గాల్లో తాము సాధించలేకపోయిన దాన్ని అక్కడ తప్పుడు సాక్షాయల ద్వారా సాధించాలని వారు కొన్ని మాసాలుగా ఆయన్ని వేటాడున్నారు. ఇప్పుడు వారు తమ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నారు. అల్లరి మూక మధ్యరాత్రిలో బంధించడం, ఆయన్ని దోషిగా తీర్చకముందే లేదా కనీసం ఆయనపై నేరారోపణ చేయకముందే ఆయన్ని అపహసించడం ఆయన పై చెయ్యిచేసుకోడం - ఇది వారి పనితీరు. ఆయన పనితీరు కాదు. వారి చర్య చట్టవిరుద్ధం. నేరస్తుడని తీర్పుపొందేవరకూ ప్రతీ వ్యక్తిని నిరపరాధిగా భావించాలని వారి సొంత చట్టమే ఘోషిస్తోంది. తమ సొంత నియమాల్ని బట్టే యాజకులు నేరస్తులుగా నిలబడ్డారు.DATel 787.1

    తన్ను ప్రశ్నిస్తున్నవాడి వంక చూసి, “నీవు నన్ను అడుగనేల?” ఆయన కదలికల్ని కనిపెట్టడానికి ఆయన ప్రతీ మాటను తమకు నివేదించడానికి గూఢచారుల్ని పంపలేదా? ప్రజలు సమావేశమైన ప్రతీ చోటా వీరు హాజరై ఆయన మాట్లాడిన విషయం గురించి ఆయన చేసిన కార్యాల గురించి యాజకులికి సమాచారం అందించలేదా? “నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగము, ఇదిగో నేను చెప్పినది వీరెరుగదురు” అని అతడికి సమాధానం చెప్పాడు.DATel 787.2

    ఈ సమాధానంతో అన్న ఇక మాట్లాడలేకపోయాడు. తాను దాచి ఉంచాలన్న విషయం గురించి క్రీస్తు ఏమన్నా అంటాడేమోనన్న భయంతో అతడు ఆ సమయంలో ఇక ఆయనతో ఏమి మాట్లాడలేదు. అన్న అవాక్కవ్వడం చూసి అతడి అధికారి ఒకడు కోపంతో ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా?” అని యేసును ముఖం మీద కొట్టాడు.DATel 787.3

    “నేను కానిమాట అడిగిన యెడల ఆ కానిమాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావు” అని యేసు ప్రశాంతంగా జవాబిచ్చాడు. ఆయన ప్రతీకారంతో మండుతున్న మాటలు పలుకలేదు. ఆయన శాంతంగా ఇచ్చిన సమాధానం, రెచ్చగొట్టినా రెచ్చిపోని పాపరహిత, సహనశీల, వినమ్ర హృదయం నుంచి వచ్చింది.DATel 787.4

    తనను దుర్భాషలాడి అవమానపర్చినప్పుడు క్రీస్తు తీవ్రంగా బాధపడ్డాడు. తాను సృజించిన మనుషులు, తాను ఎవరికోసం తన ప్రాణాన్ని త్యాగం చెయ్యబోతున్నాడో ఆ ప్రజలు ఆయన్ని అన్నివిధాల అగౌరవపర్చారు. - ఆయన పొందిన శ్రమ తన పరిశుద్ధత నిష్పత్తిలోను, పాపం పట్ల తన ద్వేషం నిష్పత్తిలోను ఉంది. దయ్యాలరీతిగా ప్రవర్తించిన వ్యక్తులచే తన విచారణ ఆయనకు నిత్య బలిదానంలా ఉంది. సాతాను అదుపులో ఉన్న మనుషుల మధ్య ఉండడం ఆయనకు కంటకంగా ఉంది. ఒక్క క్షణంలో, దైవశక్తి మెరుపువల్ల తన హింసకుల్ని మన్నుకరిపించగలనని ఆయనకు తెలుసు. ఆ విచారణను భరించడం ఇది మరింత కష్టం చేసింది.DATel 788.1

    యూదులు బాహ్య ప్రదర్శనగల మెస్సీయాకోసం ఎదురుచూస్తోన్నారు. తన శక్తిని ఒక్కసారి తళుక్కుమనిపించి మనుషుల ఆలోచనాధోరణిని మార్చి ఆయన తన సర్వౌన్నత్యాన్ని, గుర్తించేటట్లు చెయ్యాలని వారు కనిపెట్టారు. ఇలా ఆయన తన ఔన్నత్యాన్ని సంపాదించుకుని తమ కోర్కెల్ని నిరీక్షణల్ని తృప్తిపర్చాలని వారు ఆశించారు. అందుకే వారు తనను అవమానించి తిరస్కరించినప్పుడు తన దైవత్వాన్ని ప్రదర్శించాలన్న శోధన క్రీస్తుకి బలంగా వచ్చింది. ఒక్కమాటతో, ఒక్క చూపుతో తాను రాజులికన్నా, అధికారులకన్నా, యాజకులకన్నా దేవాలయం కన్నా సర్వోన్నతుణ్నని వారు ఒప్పుకునేటట్లు చేయగలిగేవాడే కాని సాత్వికం గలవానిగా నివసించడానికి తాను ఎన్నుకున్న స్థితిని కాపాడుకోడాన్ని అది కష్టతరం చేసేది.DATel 788.2

    తమ ప్రియతమ సేనాపతికి వ్యతిరేకంగా జరిగే ప్రతీకార్యాన్ని పరలోక దూతలు వీక్షించారు. ఆయన్ని విడిపించాలని ఆకాంక్షించారు. దేవుని కింద దూతలందరూ గొప్ప శక్తి గలవారు. ఒక సందర్భంలో క్రీస్తు ఆజ్ఞమేరకు ఒక్క రాత్రిలో ఒక లక్షా ఎనభై అయిదు వేలమంది అషూరు సైనికుల్ని వారు హతమార్చారు. సిగ్గుకరమైన క్రీస్తు విచారణ దృశ్యాన్ని వీక్షిస్తున్న దేవదూతలు దేవుని శత్రువుల్ని దహించివేయడం ద్వారా తమ ఆగ్రహాన్ని ఎంత సులభంగా ప్రదర్శించగలిగేవారు! కాని ఈ పనిచెయ్యడానికి వారికి ఆదేశం లేదు. తన శత్రువుల్ని నాశనం చెయ్యగల ఆయన వారి క్రూరత్వాన్ని సహించాడు. తన తండ్రిపట్ల తనకున్న ప్రేమ పాపభారాన్ని మొయ్యడానికి జగత్పునాదికి ముందు తాను చేసిన వాగ్దానం తాను రక్షించడానికి వచ్చిన ప్రజల కాఠిన్యాన్ని భరించడానికి దారితీసింది. మనుషుల నిందల్ని ఎగతాళిని మానవుడుగా తన జీవితంలో భరించడం ఆయన పరిచర్యలో భాగం. మానవుల చేతుల్నుంచి హృదయాల్నుంచి క్రీస్తు భరించినదంతా భరించడానికి సమ్మతించడంలోనే మానవజాతికి నిరీక్షణ ఉంది.DATel 788.3

    తన్ను నిందిస్తోన్న వారికి ఉపకరించేది ఏదీ క్రీస్తు చెప్పలేదు. అయినా తాను నేరస్తుడుగా తీర్పుపొందానని అంగీకరించాలి. న్యాయం చేస్తున్నట్లు నటన ఉండాలి. చట్టపరమైన విచారణ తతంగం లాంఛనంగా జరగడం అవసరం. దీన్ని త్వరగా ముగించడానికి అధికారులు కృతనిశ్చయులయ్యారు. యేసుపట్ల ప్రజలకున్న అభిమానం వారికి తెలుసు. కనుక ఆయన్ని బంధించిన విషయం బైటికి పొక్కితే ఆయన విడుదలకి ప్రయత్నాలు జరగవచ్చు. ఇలాగుండగా, ఆయన విచారణ ఆయన మరణం తక్షణమే జరగకపోతే పస్కా గురించి ఆకార్య నిర్వహణకు ఒక వారం వాయిదా పడవచ్చు. ఇది వారి పథకాల వైఫల్యానికి దారితియ్యవచ్చు. యేసుకు మరణశిక్ష విధించడానికి మూక అరుపులు నినాదాలమీద ఎక్కువ అధారపడ్డారు. వారిలో ఎక్కువ మంది యెరూషలేముకు చెందిన రబ్బీలు. ఒక వారం ఆలస్యం గనగ జరిగితే, అప్పుడున్న ఉద్రేకం చల్లబడి ప్రజల నుంచి ప్రతిస్పందన మొదలుకావచ్చు. అప్పుడు ప్రజల్లో ఎక్కువమంది క్రీస్తుకి సుముఖంగా మారిపోవచ్చు. అనేకులు క్రీస్తుకి అనుకూలంగా సాక్ష్యాలిచ్చి ఆయన చేసే అద్భుతాల్ని వెలుగులోకి తేవచ్చు. ఇది సన్ హెడ్రిన్ సభకు వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని రెచ్చగొట్టవచ్చు. వారి చర్యల్ని ప్రజలు ఖండిచడం, క్రీస్తుని విడిచి పెట్టడం జరగవచ్చు. ఆయనకు ప్రజలు కొత్తగా నీరాజనలర్పించవచ్చు. తమ ఉద్దేశం బట్టబయలు కాకముందు యేసుని రోమీయుల చేతులికి అప్పగించాలని యాజకులు అధికారులు నిశ్చయించుకున్నారు.DATel 789.1

    కాని మొట్టమొదటగా ఒక నిందను సృష్టించాలి. వారికి ఇంకా ఏమి దొరకలేదు. యేసుని కయప వద్దకు తీసుకువెళ్లమని అన్న ఆదేశించాడు. కయప సదూకయ్యులికి చెందినవాడు. సదూకయ్యుల్లో కొందరు యేసుకి ఇప్పుడు బద్ద శత్రువులు. అంత బలమైన ప్రవర్తన గలవాడు కాకపోయినా ఇతడు కూడా అన్న లాగే కఠినుడు, హృదయంలేనివాడు, నీతి నియమాలు కొరదడ్డవాడు. యేసుని నాశనం చెయ్యడానికి అన్ని మార్గాల్ని అన్వేషించే వ్యక్తి. అది తెల్లవారుజాము. చీకటిగా ఉంది. ఆయుధాలు ధరించిన గుంపు తమ బందీతో దివిటీలు లాంతరు కాంతితో ప్రధానయాజకుడి భవనానికి బయలు దేరింది. సన్ హెడ్రిన్ సభ్యులు సమావేశమవుతుండగా ఇక్కడ అన్న కయపలు యేసుని మళ్లీ ప్రశ్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు.DATel 789.2

    తీర్పు గదిలో సభ సమావేశమైనప్పుడు, సభాధ్యక్షుడుగా కయప తన పీఠాన్ని అధిష్టించాడు. అతడికి రెండు పక్కలా న్యాయాధిపతులు ఆ తీర్పుపై ఆసక్తి ఉన్నవారు కొలువు తీరారు. సింహాసనానికి దిగువవున్న వేదిక పై రోమా సైనికులు నిలిచి ఉన్నారు. యేసు సింహాసనానికి కింది స్థాయిలో నేలమీద నిలబడి ఉన్నాడు. ఆయనపై అందరి దృష్టి నిలిచింది. అంతటా ఉత్సాహం వెల్లువెత్తుతోంది. అక్కడున్నవారందరిలోను ఆయనే ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాతావరణం పరిశుద్ధ ప్రభావంతో నిండినట్లు కనిపించింద.DATel 790.1

    కయప యేసుని తన ప్రత్యర్థిగా పరిగణించాడు. రక్షకుని బోధల్ని వినడానికి ప్రజలు చూపిస్తున్న ఆతురత, ఆయన బోధనల్ని అంగీకరించడానికి ప్రజల సంసిద్ధత ప్రధాన యాజకుడిలో అసూయ పుటించాయి. కాని అతడిప్పుడు ఆ ఖైదీ వంక చూసినప్పుడు ఆయన ఉదాత్తమైన, గౌరవప్రదమైన వరవడి ప్రధాన యాజకుడి అభిమానాన్ని చూరగొన్నాయి. ఈయన దేవునితో సమానుడన్న నమ్మకం అతడిలో పుటింది. మరుక్షణమే ఆ ఆలోచనను అతడు విసర్జించాడు. వెంటనే తమ ముందు ఒక అద్భుతాన్ని చేయమంటూ ఎగతాళిగా డిమాండు చేస్తూ అతడి స్వరం వినిపించింది. అతడి మాటలు రక్షకుని చెవికి వినిపించనట్టే ఆయన వ్యవహరించాడు. అన్న కయపల ఉద్రేకం విద్వేషంతో నిండిన ప్రవర్తనను ప్రశాంతత, మర్యాదతో కూడిన క్రీస్తు ప్రవర్తనను ప్రజలు పోల్చుకుని చూశారు. కఠిన హృదయులైన ఆ జనసమూహంలో సయితం దేవునిలా ఉన్న ఈయన్ని నేరస్తుడుగా శిక్షిస్తారా? అన్న ప్రశ్న చెలరేగింది.DATel 790.2

    క్రీస్తు పొందుతున్న, మన్ననను గుర్తించి కయప విచారణను వేగిరపర్చాడు. యేసు ప్రత్యర్థులు ఆందోళన చెందారు. ఆయనకు మరణశిక్ష విధించాలని పట్టుపట్టారు. కాని దాన్ని ఎలా సాధించాలో వారికి తెలియలేదు. సన్ హెడ్రిన్ సభలో పరిసయ్యులు సద్దూకయ్యులు అని రెండు వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ద్వేషం సంఘర్షణ ఉండేవి. కలహం వస్తుందన్న భయంతో కొన్ని వివాదాంశాల్ని వారు ఎత్తుకోడానికి భయపడేవారు. వారి దురభిమానాన్ని కొన్ని మాటలతోనే రెచ్చగొట్టి వారి ఆగ్రహాన్ని తన పై నుంచి క్రీస్తు మళ్లించగలిగి ఉండేవాడే. కయపకి ఇది తెలుసు. వారి మధ్య సంఘర్షణను నివారించడానికి అతడు ప్రయత్నించాడు. యాజకుల్ని శాస్త్రుల్ని ఆయన తప్పుపట్టాడని, వారిని వేషధారులు హంతకులు అన్నాడని నిరూపించడానికి చాలా సాక్ష్యం ఉంది. కాని ఈ సాక్ష్యం తీసుకురావడం అసంబద్దం. పరిసయ్యులతో తమ వివాదంలో సదూకయ్యులు అలాంటి పదజాలాన్నే ఉపయోగించారు. పరిసయ్యుల దొంగాటతో విసిగిపోయిన రోమీయులు అలాంటి సాక్ష్యన్ని ఖాతరుచెయ్యరు. యేసు యూదుల సంప్రదాయాల్ని తోసిపుచ్చాడని, వారి ఆచారాల్లో చాలావాటిని గురించి అమర్యాదగా మాట్లాడాడని నిరూపించడానికి చాలా సాక్ష్యం ఉంది. కాని సంప్రదాయాల విషయానికి వచ్చేసరికి పరిసయ్యులు సద్దూకయ్యులు కత్తులు దూసుకునేవారు. కనుక ఈ నిదర్శనం కూడా రోమియులు లెక్కచెయ్యరు. క్రీస్తు సబ్బాతును ఉల్లంఘించాడని ఆయన విరోధులు ఆరోపించలేరు. ఎందుకంటే ఆయన పనిస్వభావం ఎలాంటిదో పరీక్ష తేల్చుతుంది. ఆయన స్వస్తత సూచకక్రియలు వెలుగులోకి వస్తే యాజకులు ఉద్దేశాలు విఫలమౌతాయి.DATel 790.3

    యేసు తిరుగుబాటు లేవదీసి ప్రత్యేక ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తోన్నాడని తప్పుడు సాక్షల్ని లంచమిచ్చి సృష్టించారు. అయితే వారి సాక్ష్యం అస్పష్టంగా పొంతన లేకుండా ఉంది. పరీక్షకింద వారు తమ మాటల్ని తామే తప్పుగా నిరూపించుకున్నారు.DATel 791.1

    తన సేవ తొలినాళ్లలో క్రీస్తు ఇలా అన్నాడు, “ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును.” చిహ్నాలతో కూడిన ప్రవచన భాషలో ఆయన. ఈ విధంగా తన మరణాన్ని పునరుత్థానాన్ని గురించి ప్రవచించాడు. “ఆయన తన శరీరమను దేవాలయమును గూర్చి యీమాట చెప్పెను.” యోహా. 2:19, 21. ఈ మాటల్ని యూదులు అక్షరపరంగా అర్ధంచేసుకున్నారు. అవి యెరూషలేము దేవాలయానికి వర్తించేవనుకున్నారు. క్రీస్తు చెప్పిన విషయాలన్నిటి లోను వారు ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించగలిగింది ఇది తప్ప ఇంకేమి లేదు. ఈ మాటల్ని తప్పుగా ఉటంకించి దెబ్బతియ్యాలని చూశారు. రోమీయులు దేవాలయాన్ని పునర్నిర్మించడంలోను దాన్ని అలంకరించడంలోను నిమగ్నులై ఉన్నారు. ఆలయం విషయంలో వారెంతో అతిశయంగా ఉండేవారు. దాని విషయమైన ఎలాంటి ధిక్కారం వారికి ఆగ్రహం పుట్టించేది. ఇక్కడ రోమియులు యూదులు, పరిసయ్యులు సదూకయ్యులు ఏకమయ్యేవారు. అందరికీ అది పవిత్రాలయం. ఈ అంశంపై వారికి ఇద్దరు సాక్షులు దొరికారు. వారి సాక్ష్యం ఇతరులిచ్చిన సాక్ష్యమంత అస్తవ్యస్తంగా లేదు. యేసుని నిందించడానికి వారు లంచమిచ్చినవారిలో ఒకడు ఇలా అన్నాడు, “వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెను.” ఆయన మాటల్ని ఇలా తప్పుగా ఉటంకించారు. వారు ఆయన మాటల్ని యధార్థంగా ఉటంకించి ఉంటే ఆయన దోషి అని సన్ హెడ్రిలో సయితం వారు తీర్పుపొందేవారుకారు. యూదులు వాదిస్తోన్నట్లు యేసు కేవలం మానవుడే అయిఉంటే, ఆయన అన్నది హేతుబద్ధం కాని ప్రగల్భాలు పలికే స్వభావాన్ని సూచిస్తాదే గాని దేవదూషణగా భావించబడదు. తప్పుడు సాక్షి చెప్పినదాన్ని బట్టి చూసినా మరణదండనకు దగిన నేరంగా రోమీయులు పరిగణించడానికి అందులో ఏమిలేదు.DATel 791.2

    ఆ పరస్పర విరుద్ద సాక్ష్యాల్ని యేసు ఓపికగా వింటున్నాడు. తన్నుతాను సమర్థించుకోడానికి ఆయన ఒక్కమాట కూడా అనలేదు. చివరికి ఆయనపై ఆరోపణలు చేస్తున్నవారు చిక్కుల్లో ఇరుక్కుని, తికమకపడి పిచ్చిపిచ్చిగా మాట్లడారు. విచారణ ముందుకు సాగడంలేదు. యాజకులు నాయకుల కుట్రలు విఫలమయ్యేటట్లు కనిపిస్తోంది. కయప సహనాన్ని కోల్పోతున్నాడు. ఒక్క ఉపాయం మాత్రమే మిగిలింది. అది క్రీస్తునే తన్నుతాను నిందించుకునేటట్లు ఒత్తిడి చెయ్యడం. ప్రధానయాజకుడు తన తీర్పుగద్దె నుంచి లేచాడు. అతడి ముఖం క్రోధంతో నిండింది. తనకు సాధ్యపడితే తన ముందున్న ఖైదీని ఒక్కవేటుతో నేలకు కూల్చాలన్నట్లు అతడి స్వరం అతడి ప్రవర్తన స్పష్టంగా సూచించాయి. “నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమి?” అని ప్రధానయాజకుడు ప్రశ్నించాడు.DATel 792.1

    యేసు మాట్లాడలేదు. “అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొట్టె పిల్లయు, బొచ్చుకత్తిరించావాని యెదుట గొట్టెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు.” యెష. 53:9.DATel 793.1

    చివరగా తన కుడిచేతిని ఆకాశంవైపుకు ఎత్తి, గంభీర ప్రమాణం రూపంలో యేసును సంబోధించి కయప ఇలా అన్నాడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను.”DATel 793.2

    ఈ విజ్ఞప్తికి క్రీస్తు మౌనంగా ఉండలేకపోయాడు. మౌనంగా ఉండడానికి సమయముంది, మాట్లాడడానికి సమయముంది. తన్ను ప్రత్యక్షంగా ప్రశ్నించేవరకూ ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు సమాధానం ఇవ్వడం తన మరణాన్ని ఖాయం చేస్తుందని ఆయనకు తెలుసు. ఆ దేశంలో అత్యున్నతాధికారి మహోన్నతుని నామంలో ఆ విజప్తిని చేశాడు. చట్టాన్ని గౌరవించడంలో క్రీస్తు వెనుదీయలేదు. అదీగాక తండ్రితో తన సంబంధం ప్రశార్థకం అయ్యింది. ఆయన తన ప్రవర్తనను తన కర్తవ్యాన్ని స్పష్టంగా వివరించడం అవసరం. యేసు తన శిష్యులతో ఈ మాటలన్నాడు, “మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.” ఇప్పుడు తన సొంత ఆచరణ ద్వారా ఆపాఠాన్ని మళ్లీ బోధించాడు.DATel 793.3

    యేసు “నీవన్నట్టే” అని సమాధానం చెబుతున్నప్పుడు ప్రతీ చెవీ జాగ్రత్తగా వింటోంది. ప్రతీ కన్ను ఆయన పై దృష్టి నిలిపింది. ఆయన ఇంకా ఇలా అంటున్నప్పుడు ఆయన ముఖంపై పరలోక కాంతి ప్రకాశించింది, “ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్యమున కూర్చుండుటయు ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు మీరుచూతురు”DATel 793.4

    ఒక్కక్షణం క్రీస్తు దైవత్వం ఆయన మానవ రూపంలోనుంచి ప్రకాశించింది. గుచ్చుకుపోతున్నట్లు, రక్షకుడు చూస్తున్న చూపుకి ప్రధాన యాజకుడు ధైర్యం కోల్పోయాడు. ఆ చూపు అతడి రహస్య తలంపుల్ని చదువుతూ మండుతూ అతడి గుండెల్లోకి దూసుకువెళ్తున్నట్లనిపించింది. హింసకు గురి అయిన దైవకుమారుని ప్రచండ వీక్షణాన్ని అతడు ఆ తర్వాత తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు.DATel 793.5

    “ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశమేఘారుడుడై వచ్చుటయు మీరు చూతురు.” అప్పుడు జరుగుతున్న దానికన్నా విరుద్ధమైన దృశ్యాన్ని ఈ మాటల్లో యేసు సమర్పిస్తున్నాడు. జీవానికి మహిమకు ప్రభువైన ఆయన దేవుని కుడిపక్క కూర్చుంటాడు. భూమిపై ఉన్నవారందరికీ ఆయన తీర్పుతీర్చుతాడు. ఆయన తీర్పుపై అపీలు ఉండదు. ప్రతీ రహస్యకార్యం దేవుని సన్నిధి కాంతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతీ వారికీ తమ తమ క్రియల చొప్పుప తీర్పు జరుగుతుంది.DATel 794.1

    క్రీస్తు మాటలు ప్రధాన యాజకుడికి భయం పుట్టించాయి. పునరుత్థానముంటుందని, అప్పుడు తమ తమ క్రియల చొప్పున ప్రతిఫలం అందుకోడానికి అందరూ దేవుని న్యాయపీఠం ముందు నిలబడాల్సి ఉంటుందని క్రీస్తు చెప్పినప్పుడు కయప గుండెల్లో గుబులు పుట్టింది. అతడి మనసులో చివరి తీర్పు దృశ్యమాలిక కదల నారంభించింది. ఎప్పటికీ బయటపడకూడదని తాను భావిస్తున్న రహస్యాలతో సహా మృతులు సమాధుల్లో నుంచి లేస్తున్న భయంకర దృశ్యం కొద్ది క్షణాలు అతడు చూశాడు. తాను దేవుని నిత్య న్యాయ పీఠం ముందు నిలిచి ఉన్నట్లు కొద్ది క్షణాలు భావించాడు. సమస్తం చూసే ఆయన నేత్రం తన ఆత్మను చదివి మృతులతోనే దాగి ఉండాల్సి ఉన్న రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నట్లు తలంచాడు.DATel 794.2

    ఆ దృశ్యం యాజకుడి దృష్టినుంచి దాటి వెళ్ళిపోయింది. క్రీస్తు మాటలు సదూకయ్యుడైన అతణ్ని మేల్కొలిపాయి. కయప పునరుత్థానం, తీర్పు, మరణం అనంతరం జీవితం లేవని నమ్మిన వ్యక్తి. ఇప్పుడు అతడు దురాగ్రహంతో పిచ్చివాడిలా వ్యవహరించాడు. తన ముందు ఖైదీగా నిలిచిన ఈ వ్యక్తి తనకు మిక్కిలి ప్రియమైన సిద్ధాంతాలపై దాడి చేస్తాడా? అది సహించలేని ఘోరంగా తాను భావిస్తున్నట్లు ప్రజలు చూడాలన్న ఉదేశంతో నాటకీయంగా తన వస్త్రం చింపుకుని దేవదూషణ చేస్తున్నందుకు క్రీస్తును వెంటనే శిక్షించాల్సిందిగా డిమాండు చేశాడు. “మనకిక సాక్షులతో పనిఏమి? ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు. నాకేమి తోచుచున్నది?” అన్నాడు. అందరూ ఆయన నేరస్తుడన్నారు.DATel 794.3

    దురావేశంతో కూడిన నమ్మకం కయప ఆరకంగా వ్యవహరించడానికి దారితీసింది. క్రీస్తు మాటలు నమ్మినందుకు తనమీద తనకే కోపం వచ్చింది. సత్యాన్ని తెలుసుకున్న స్పృహతో హృదయాన్ని చింపుకుని క్రీస్తే మెస్సీయా అని అంగీకరించే బదులు దానికి తీవ్ర వ్యతిరేకినన్నట్లు అతడు తన యాజక వస్త్రం చింపుకున్నాడు. ఈ చర్య ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. కయప దాని అర్ధాన్ని గుర్తించలేదు. న్యాయాధిపతుల్ని ప్రభావితం చేసి క్రీస్తుకి మరణశిక్ష విధింపును లక్షించిన ఈ చర్యలో ప్రధాన యాజకుడు తన్నుతాను దోషిగా తీర్పు చెప్పుకున్నాడు. దైవ ధర్మశాస్త్రం ప్రకారం అతడు యాజకత్వానికి అనర్హుడు. తనకు తానే మరణశిక్ష వేసుకున్నాడు.DATel 795.1

    ఒక ప్రధానయాజకుడు తన వస్త్రం చింపుకోకూడదు. దీన్ని లేవీయచట్టం నిషేధించి దాని ఉల్లంగనకు మరణశిక్ష నిర్దేశించింది. ఎట్టి పరిస్థితుల్లోను, ఏ సందర్భంలోను యాజకుడు తన వస్త్రం చింపుకోడం నిషిద్ధం. ఒక మిత్రుడు మరణించటినప్పుడు బట్టలు చింపుకునే ఆచారం యూదూల్లో ఉండేది. అయితే యాజకులు ఈ ఆచరాన్ని పాటించకూడదు. దీని విషయమై క్రీస్తు మోషేకి ఖచ్చితమైన ఆజ్ఞఇచ్చాడు. లేవీ 10:6.DATel 795.2

    యాజకుడు ధరించే ప్రతీదీ సంపూర్ణంగాను నిష్కంళంకంగాను ఉండాలి. అందమైన ఆ పరిశుద్ధ హోదా దుస్తులు, గుర్తులు సూచించే అసలు వ్యక్తి అయిన క్రీస్తుని సూచించాయి. వస్త్రధారణలోను, వైఖరిలోను సంపూర్ణతను మాత్రమే దేవుడు కోరుతున్నాడు. ఆయన పరిశుద్దుడు. ఇహలోక గుడార సేవ ఆయన మహిమకు పరిపూర్ణతకు ప్రతీక కావాలి. పరలోక గుడారంలో జరుగుతున్న పరిశుద్ధ సేవను పరిపూర్ణత మాత్రమే సరియైన రీతిగా సూచించగలుగుతుంది. విరిగినలిగిన స్వభావాన్ని చూపించుకుంటూ మానవుడు తన హృదయాన్ని చింపుకోవచ్చు. దీన్ని దేవుడు గుర్తిస్తాడు. అయితే యాజక వస్త్రాల్ని చింపడం జరగకూడదు. ఈ క్రియ పరలోక విషయాల పోలికను వికృతం చేస్తుంది. పరిశుద్ధ హోదాను చేపట్టి, గుడార సేవలలో నిమగ్మమై ఉన్న ప్రధానయాజకుడు చినిగిన వస్త్రంతో కనిపిస్తే అతడు దేవునితో తన సంబంధాన్ని తెంచుకున్నట్లు అర్ధం. తన వస్త్రాన్ని చింపుకోడం ద్వారా అతడు దైవ ప్రతినిధిగా ఉండడానికి తన్నుతాను అనర్హుణ్ని చేసుకున్నాడు. దేవుడు అతణ్ని తన యాజక ప్రతినిధిగా పనిచెయ్యడానికి ఇక అంగీకరించడు. కయప ప్రదర్శించిన ఈ కార్యాచరణ ధోరణి మానవ ఆవేశకావేషాల్ని, మానవ అసంపూర్ణతను సూచిస్తోంది.DATel 795.3

    తన వస్త్రం చింపుకోడం ద్వారా కయప మానవ సంప్రదాయాల్ని ఆచరించడానికి దైవ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశాడు. దేవదూషణ జరిగినప్పుడు ఆ ఘోరాన్ని వ్యక్తం చేస్తూ యాజకుడు తన వస్త్రం చింపుకోవచ్చునని అది తప్పుకాదని మానవకల్పిత నియమం సూచించింది. ఈ తీరుగా మానవనియమాలు దైవ ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేశాయి.DATel 796.1

    ప్రధాన యాజకుడు చేసిన ప్రతీకార్యాన్ని ప్రజలు గమనిస్తోన్నారు. కయప తన చర్యల్ని భక్తిని సూచించే చర్యలుగా ప్రజలికి చూపించాలని ఉద్దేశించాడు. కాని క్రీస్తుపై ఆరోపించిన నేరానికి అసంతృప్తిని వ్యక్తం చెయ్యడానికి ఉద్దేశించిన ఈ చర్యలో దేవుడు ఎవరి గురించి “నా నామము ఆయనకున్నది” అన్నాడో (నిర్గ. 23:21) ఆయన్నే అతడు దూషిస్తోన్నాడు. అతడు దేవదూషణ చేస్తున్నాడు. దేవుని శిక్షావిధికింద నిలిచి ఉన్న అతడు దేవదూషకుడుగా క్రీస్తుని నేరస్తుడుగా తీర్పు తీర్చాడు.DATel 796.2

    కయప తన వస్త్రాన్ని చింపుకున్నప్పుడు దేవుని పరంగా యూదు జాతి ఒక జాతిగా అప్పటినుంచి ఎలాంటి స్థానాన్ని ఆక్రమించిందో దాన్ని ఆచర్య సూచించింది. ఒకప్పుడు దేవుని ఆదరాన్ని పొందిన ఆ ప్రజలు ఆయన్నుంచి వేరై యెహోవా విసర్జించిన ప్రజలుగా తయారువుతున్నారు. సిలువపై క్రీస్తు “సమాప్తమైనది” అని చెప్పినప్పుడు (యోహా. 19:39), గుడి తెర నడిమధ్యకు చినిగిపోయినప్పుడు, అన్ని గుర్తులకీ నిజరూపం, అన్ని ఛాయారూపాలకూ వాస్తవ రూపం అయిన ప్రభువుని వారు విసర్జించారని పరిశుద్ధ సాక్షి చెప్పాడు. దేవునితో సంబంధం లేకుండా ఇశ్రాయేలు జాతి విడిపోయింది. ఆ మహా ప్రధాన యాజకుణ్ని సూచించే యాజక దుస్తుల్ని అప్పుడు కయప చింపవచ్చునేమోగాని అవి ఇక అతడికి గాని లేక ప్రజలికి గాని అర్థరహితమయ్యాయి. జరిగిన ఘోరానికి భయం వ్యక్తం చేస్తూ ప్రధాన యాజకుడు తనకోసం వస్త్రం చింపుకోవచ్చు.DATel 796.3

    యేసు మరణారుడంటూ సన్ హెడ్రిన్ ప్రకటించింది. అయితే ఒక ఖైదీని రాత్రిపూట విచారించడం యూదు చట్టానికి విరుద్ధం. చట్ట పరమైన శిక్షాస్మృతి ప్రకారం పగటి పూట సభ్యులంతా హాజరైన సభలో తప్ప ఏచర్య చేపట్టకూడదు. దీన్ని పక్కన పెట్టి శిక్షపొందిన నేరస్తుడుగా రక్షకునితో వ్యవహరించారు. ఆయన్ని నీచ, నికృష్ట దుష్టులు హింసించడానికి విడిచిపెట్టారు. ప్రధాన యాజకుడి భవనం చుట్టూ విశాలమైన ఆవరణం ఉంది. అందులో సైనికులు ప్రజలు గుమిగూడారు. ఈ ఆవరణం గుండా యేసుని అతిథి గృహానికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తున్నప్పుడు రెండు పక్కలా ఉన్న ప్రజలు తాను దేవుని కుమారుణ్నని ఆయన చెప్పినందుకు అపహాస్యం చేశారు. “సర్వశక్తుని కుడిపార్శ్యమున కూర్చుండుట” “మేఘారూఢుడై వచ్చుట” అన్నమాటల్ని పదేపదే ఎగతాళి చేశారు. తన విచారణ నిమిత్తం గదిలో వేచి ఉన్నప్పుడు రక్షక భటులు ఆయనకు రక్షణ కల్పించలేదు. సభకు తీసుకువెళ్లకముందు అధికారులు ఆయనతో వ్యవహరించిన తీరును అజ్ఞానులైన సామాన్య ప్రజలు చూశారు. ఇది చూసి వారు కూడా తమ దుష్టస్వభావాన్ని, ప్రదర్శించుకున్నారు. క్రీస్తు సౌమ్యత దివ్యనడవడి వారిని ఉన్నాదుల్ని చేశాయి. ఆయన సాత్వికం, ఆయన నిర్దోషిత్వం, ఉన్నతమైన ఆయన తాలిమి వారిని పైశాచిక ద్వేషంతో నింపాయి. కృప న్యాయాల్ని వారు కాలరాచారు. దైవ కుమారుడితో ప్రవర్తించినంత అమానుష్యంగా నేరస్తుడితో ఎన్నడూ ఎవరూ ప్రవర్తించలేదు.DATel 797.1

    కాని యేసుకి ఇంతకన్నా ఎక్కువ బాధను కలిగించింది ఇంకొకటుంది. ఏ శత్రవు కొట్టగలిగిన దెబ్బకన్నా ఎక్కువ బాధాకరమైన దెబ్బ అది. కయప ముందు విచారణ జరుగుతున్నప్పుడు, తన సొంత శిష్యుల్లో ఒకడు క్రీస్తుని ఎరుగనని బొంకాడు.DATel 797.2

    గెత్సేమనే తోటలో తమ ప్రభువుని విడిచి పెట్టి వెళ్లిపోయిన అనంతరం, ఇద్దరు శిష్యులు క్రీస్తుని తీసుకువెళ్తున్న మూక వెనుక కొంత దూరంలో ఆయన్ని వెంబడించడానికి సాహసించారు. వీరు పేతురు యోహానులు. యాజకులు యోహానుని క్రీస్తు శిష్యుల్లో ప్రధానుడుగా గుర్తించారు. అతణ్ని తీర్పు గదిలోకి రానిచ్చారు. తమ నాయకుడు పొందుతున్న సిగ్గును అవమానాన్ని చూసి ఆయన దేవుని కుమారుడన్న అభిప్రాయాన్ని తిరస్కరిస్తాడన్న ఆశాభావంతో అతణ్ని రానిచ్చారు. యోహాను పేతురు పక్షంగా మాట్లాడాడు. పేతుర్ని కూడా వారు లోనికి రానిచ్చారు.DATel 797.3

    భవనం ఆవరణంలో చలిమంట వేశారు. అది రాత్రిలో చాలా చలిగా ఉండే గడియ. అది తెల్లవారడానికి కొంచెం ముందు. మంటచుట్టు కొందరు పోగయ్యారు. వారితో పేతురు కూర్చున్నాడు. తాను యేసు శిష్యుడిగా గుర్తించబడడం అతడికిష్టం లేదు. గుంపులో కలిసిపోయి నిర్లక్ష్యంగా ఉన్నట్లు వ్యవహరిస్తే యేసుని తీసుకువచ్చిన వారిలో ఒకడని ప్రజలు భావిస్తారని అతడి ఉద్దేశం.DATel 798.1

    అయితే పేతురు ముఖంమీద వెలుగుపడినప్పుడు గుమ్మంవద్ద కాపలా కొస్తున్న స్త్రీ అతణ్ని పరీక్షగా చూసింది. అతడు యోహానుతో వచ్చాడని గ్రహించింది. పేతురు ముఖంలోని నిస్పృహను పసికట్టింది. అతడు శిష్యుల్లో ఒకడై ఉంటాడని ఊహించింది. కయప ఇంట్లో పరిచర్య చేసే స్త్రీలలో ఆమె ఒకతె. “నీవు గలిలయుడగు యేసుతో కూడ ఉంటి విగదా?” అని పేతురుని అడిగింది. పేతురు ఉలిక్కిపడ్డాడు. గలిబిలి చెందాడు. అక్కడున్న వారి దృష్టి ఇతడిమీదే నిలిచింది. ఆమె చెబుతున్నది అర్ధంకానట్లు నటించాడు. కాని ఆమె అతణ్ని విడిచిపెట్టలేదు. పక్కనున్న వారితో ఇతడు యేసుతో ఉన్నవాడని చెప్పింది. పేతురు సమాధానం ఇవ్వక తప్పలేదు. “అమ్మాయీ, నేనతని నెరుగను” అని కోపంగా చెప్పాడు. ఇది మొదటిసారి బొంకడం. దాని వెంటనే కోడికూసింది. ఓ పేతురూ, నీ ప్రభువును గురించి ఎంత త్వరగా సిగ్గుపడ్డావు! ఎంత త్వరలో ఆయన్ని ఎరగనని బొంకావు!.DATel 798.2

    తీర్పు గదిలోకి ప్రవేశించిన వెంటనే తాను యేసు శిష్యుణ్నన్న విషయాన్ని యోహాను దాచలేదు. తన ప్రభువుని దూషిస్తున్న మొరటు ప్రజలతో కలిసి కూర్చోలేదు. యోహానుని వారు ప్రశ్నించలేదు ఎందుకంటే తాను యోహానుని కానని చెప్పుకుని ఆ విధంగా అనుమానానికి తావివ్వలేదు. ఆ మూకనుంచి దూరంగా ఉండడానికి అతడు ఒక మూల చూసుకుని అక్కడ ఉన్నాడు. కాని యేసుకి సాధ్యమైనంత దగ్గరగా ఉన్నాడు. ప్రభువు విచారణలో చెప్పిందంతా విని జరిగిందంతా ఇక్కడనుంచి చూడగలిగాడు.DATel 798.3

    తన యధార్థ స్థితి తెలియాలని పేతురు ఉద్దేశించలేదు. నిర్లక్ష్యంగా ఉన్నట్లు నటించడంలో అతడు శత్రుప్రాంగణంలో అడుగు పెట్టాడు. శోధనకు ఇట్టే ఆహుతి అయిపోయాడు. రక్షకుడి కోసం యుద్ధం చెయ్యడానికి పిలుపు వస్తే అతడు ధైర్యంగా పోరారడే సైనికుడయ్యేవాడు. అవహేళనకు తిస్కారానికి గురి అయినప్పుడు పిరికితనం ప్రదర్శించేవాడు. తమ ప్రభువు నిమిత్తం చురుకుగా పోరాటానికి వెనుదియ్యని అనేకులు ఎగతాళి కారణంగా తమ విశ్వాసాన్ని విడిచిపెట్టుకున్నారు. స్నేహించకూడని వారితో స్నేహం చెయ్యడం వల్ల వారు శోధనను కొని తెచ్చుకుంటారు. తమను శోధించడానికి సాతానుకి ఆహ్వానం పలుకుతారు. ఇతరత్ర పరిస్థితుల్లో తాము అనని మాటలు అనడానికి చేయనిపనులు చెయ్యడానికి అతడు వారిని నడిపిస్తాడు. శ్రమలకుగాని లేక నిందకుగాని జడిసి తన విశ్వాసాన్ని దాచుకునే నేటి క్రీస్తు అనుచరుడు ఆయన్ని ఎరగనని తీర్పు గదిలో పేతురు బొంకినట్లు బొంకుతున్నాడు.DATel 799.1

    పేతురు తన ప్రభువు తీర్పులో ఆసక్తి చూపించకుండా ఉండడానికి ప్రయత్నించాడు. కాని ఆయనను ఎగతాళి చెయ్యడం విన్నప్పుడు ఆయనతో వారు నిర్దయగా వ్యవహరిస్తున్నప్పుడు అతడి హృదయం ఎంతో క్షోభించింది. మరీ ముఖ్యంగా, అలాంటి శ్రమలను అనుభవించి సిగ్గును భరించడం ద్వారా తనకు తన శిష్యులికి అపకీర్తి తేవడం అతడికి ఆగ్రహం పుటించింది. తన యధార్ధ మనోభావాల్ని దాచి పెట్టుకోడానికి క్రీస్తుని హింసించేవారితో కలిసి తుళ్లడానికి ప్రయత్నించాడు. కాని అతడి వాలకం స్వాభవికంగా లేదు. అబద్దాన్ని నిజంలా నటిస్తోన్నాడు. ఏమి పట్టించుకోనట్లు మాట్లాడడానికి ప్రయత్నించినా తన ప్రభువుపట్ల వారు వ్యవహరిస్తోన్న తీరుకు వస్తోన్న కోపాన్ని అదుపులో ఉంచకోలేకపోయాడు.DATel 799.2

    రెండోసారి అతడిమీద గమనం నిలిచింది. తానుక్రీస్తు అనుచరుడని ఆరోపణ జరిగింది. ఇప్పుడు ఒట్టు పెట్టుకుని “ఆ మనుష్యుని నేనెరుగను” అన్నాడు. అతడికి ఇంకొక అవకాశం ఇవ్వబడింది. ఒక గంట గడిచిన తర్వాత ప్రధానయాజకుడి సేవకుల్లో ఒకడు, పేతురు ఎవరి చెవిసేరికాడో అతడి బంధువు పేతుర్ని “నీవు తోటలో అతనితో కూడ ఉండగా నేను చూడలేదా?” “నిజమే, నీవునూ వారిలో ఒకడవు, నీవు గలిలయుడవుగాదా?” అన్నాడు. దీనికి పేతురు మండిపడ్డాడు. క్రీస్తు శిష్యులు స్వచ్ఛతగల భాషకు పేరుపొందారు. తన్ను ప్రశ్నించిన వారిని మోసగించి, తాను పోషిస్తున్న పాత్రను సమర్థించుకోడానికి పేతురు ఇప్పుడు తమ ప్రభువునెరుగనని ఒట్టు పెట్టుకుని బొంకాడు. మళ్లీ కోడి కూసింది. పేతురు దాన్ని విన్నాడు. అప్పుడతడు “నేటి రాత్రి కోకటి రెండు మారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువు” అన్న యేసు మాటలు గుర్తుచేసుకున్నాడు. మార్కు 14:30.DATel 799.3

    నీచమైన ఒట్లు ఇంకా తన పెదవులపై ఉండగానే, కోడి కూత తన చెవుల్లో ఇంకా గింగురుమంటుండగానే, ఆగ్రహించిన న్యాయాధిపతుల్నుంచి యేసు తన ముఖం తిప్పి తన శిష్యుడి పై తన దృష్టిని నిలిపాడు. అదే సమయంలో పేతురు కళ్లు తన ప్రభువు మీద నిలిచాయి. సున్నితమైన, నమ్రతగల ఆ ముఖంలో అతడు దయను, దుఃఖాన్ని చదివాడు. కోపం ఏకాశానాలేదు.DATel 800.1

    బలహీనమైన, బాధపడున్న ఆ ముఖాన్ని, వణుకుతున్న ఆ పెదవుల్ని, దయను క్షమాపణను వెల్లడించే ఆ చూపును వీక్షించినప్పుడు అతడి గుండె చెరువయ్యింది. మనస్సాక్షి మేలుకుంది. జాపకశక్తి చురుకయ్యింది. తన ప్రభువుతో చెరసాలకైనా మరణానికైనా వెళ్తానంటూ కొద్దిగంటల క్రితమే తాను చేసిన వాగ్దానం అతడికి జ్ఞాపకం వచ్చింది. అదే రాత్రి తాను తన రక్షకుణ్ని, ఎరుగునని బొంగుతాడని రక్షకుడు మేడ గదిలో చెప్పినప్పుడు తనకు కలిగిన దుఃఖం పేతురుకి జ్ఞాపకం వచ్చింది. పేతురు అప్పుడే యేసు ఎవరో తనకు తెలియదని ప్రకటించాడు. కాని తన ప్రభువు తనను ఎంత బాగా ఎరుగునో, తన హృదయాన్ని ఎంత నిర్దుష్టంగా చదవగలిగాడో, తన సొంత హృదయంలోని మోసం తనకే ఎలా తెలియకుండా ఉన్నదో ఇప్పుడు పేతురు తీవ్ర సంతాపంతో గుర్తించాడు.DATel 800.2

    జ్ఞాపకాలు పోటెత్తాయి. పొరపాట్లు చేస్తున్న తన శిష్యుల పట్ల రక్షకుని ప్రేమపూర్వక కృప, ఆయన దయాళుత్వం, దీర్ఘశాంతం ఆయన మృదుస్వభావం-ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చేసిన ఈ హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. “సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెనుగాని నీ నమ్మిక తప్పిపోకుండనట్లు నేను నీకొరకు వేడుకొంటిని” లూకా 22:31,32. అతడు తన కృతఘ్నతను గురించి, తన మోసం గురించి, తన అబద్ద సాక్ష్యం గురించి ఆలోచించాడు. మరొక్కసారి తన ప్రభువు వంక చూశాడు. ఆయన్ని, ముఖం మీద కొట్టడానికి లేపిన ఒక అపవిత్ర హస్తాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని ఇక భరించలేక పగిలిన హృదయంతో ఆగృహంలో నుంచి బయటికి వెళ్లిపోయాడు.DATel 800.3

    ఒంటరిగా చీకటిలో నడిచివెళ్లాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, తెలుసుకోవాలని కూడా అతడికి లేదు. చివరికి గెత్సెమనేకి వెళ్లాడు. కొద్ది గంటల క్రితం దృశ్యం అతడి మనసులో స్పష్టంగా నిలిచింది. చెమటగా వచ్చిన రక్తపు చారలతో నిండి, భరించలేని బాధతో వణుకుతున్న ప్రభువు ముఖం అతడి ముందు నిలిచింది. యేసు దుఃఖిస్తూ, హృదయ వేదనతో ఒంటిరిగా ప్రార్ధిస్తున్నప్పుడు ఆయనతో కలిసి ప్రార్ధన చేయాల్సి ఉన్న తాము ఆ క్లిష్ట సమయంలో నిద్రించడం గుర్తుచేసుకుని సంతాపపడ్డాడు . “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి” (మత్త 26:41) అన్న తన గంభీర బాధ్యత గుర్తుకు వచ్చింది. తీర్పు గదిలోని దృశ్యాల్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. రక్షకుడు అనుభవిస్తున్న బాధకు భరిస్తున్న అవమానానికి అదనంగా ప్రభువుపై తాను అపరాధ భారం మోపినందుకు హృదయ వేదనను అనుభవించాడు. యేసు తన హృదయ వేదనను తండ్రికి ఏ స్థలంలో దుఃఖంతో వెలిబుచ్చాడో అదే స్థలంలో పేతురు సాగిలపడి నేను మరణిస్తే బాగుండునంటూ రోదించాడు.DATel 801.1

    యేసు మెలకువగా ఉండి ప్రార్థించమని ఆదేశించగా పేతురు నిద్రించడం అతడి ఘోర పాపానికి దారి తీసింది. ఆ క్లిష్ట సమయంలో శిష్యులందరూ నిద్రించడం ద్వారా ఎంతో పోగొట్టుకున్నారు. వారు తీవ్రమైన పరీక్ష ఎదుర్కోనున్నారని క్రీస్తుకి తెలుసు. ఆ పరీక్షకు వారు సిద్ధంగా ఉండకుండా వారి మానసిక శక్తుల్ని సాతాను మందగిల్లజేస్తాడనీ ఆయను తెలుసు. అందుకే వారికి ఆయన ఆ హెచ్చరిక చేశాడు. తాము తోటలో ఉన్న గంటల్ని వారు ప్రార్ధనలో గడిపి ఉంటే పేతురు తన సొంత శక్తిమీద ఆధారపడి ఉండేవాడు కాదు. తన ప్రభువుని ఎరుగనని బొంకి ఉండేవాడు కాదు. బాధపడున్న క్రీస్తుతో కలిసి శిష్యులు మెలకువగా ఉండి ప్రార్ధన చేసి ఉంటే సిలువపై ఆయన శ్రమల్ని, చూడడానికి వారు సిద్ధపడి ఉండేవారు. కొంత మేరకు వారు ఆయన తీవ్ర వేదన స్వభావాన్ని గ్రహించగలిగేవారు. ఆయన శ్రమల్ని మరణాన్ని పునరుత్థానాన్ని గూర్చిన ప్రవచన వాక్యాల్ని గుర్తుకు తెచ్చుకోగలిగి ఉండేవారు. శ్రమలు దుఃఖంతో నిండిన ఆ చీకటి నడుమ కొన్ని నీరిక్షణ కిరణాలు ఆ చీకటిలో వెలుగును నింపి విశ్వాసాన్ని బలపర్చగలిగేవి.DATel 801.2

    ఆ రోజు మళ్లీ సన్ హెడ్రిన్ సమావేశమయ్యింది. క్రీస్తుని మళ్లీ సభలోకి తీసుకువచ్చారు. తాను దేవుని కుమారుణ్నని ఆయన ప్రకటించాడు. సభ వారు ఆయన మాటల్ని ఆయనపై నేరంగా మోపారు. కాని ఈ హేతువుపై వారు ఆయన్ని దోషిగా తీర్చలేదు. ఎందుకంటే రాత్రి జరిగిన సమావేశంలో అనేకమంది సభ్యులు లేరు. వారు ఆయన మాటల్ని వినలేదు. రోమా న్యాయస్థానం ఆ ఆరోపణలో మరణార్హమైన కారణం లేదని చెబుతుందని వారికి తెలుసు. కాని ఈ మాటల్ని ఆయన తన నోటితో పునరుచ్చరించడం వారు వింటే తమ కార్యం నెరవేరవచ్చని వారు భావించారు. తానే మెస్సీయానని ఆయన చెప్పడాన్ని విద్రోహక రాజకీయ నేరంగా సమర్పించవచ్చునన్నది వారి ఎత్తుగడ.DATel 802.1

    “క్రీస్తువు నీవేనా?” “మాతో చెప్పుము” అని వారన్నారు. కాని క్రీస్తు ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఆయన్ని ప్రశ్నించడం కొనసాగించారు. తుదకు దుఃఖంతో దయనీయంగా, నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.” అని ఆయన అన్నాడు. వారికి ఎలాంటి సాకు లేకుండా చెయ్యడానికి ఆయన ఈ గంభీర హెచ్చరికను జోడించాడు, “ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగును.”DATel 802.2

    “అట్లయితే నీవు దేవుని కుమారుడవా?” ప్రశ్నించారు. వారు ముక్తకంఠంతో. అందుకు ఆయన “మీరన్నట్టు నేనే ఆయనను” అన్నాడు. అంతట వారు “మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటి మాట వింటి మిగదా” అని కేకలు వేశారు.DATel 802.3

    యేసు నేరస్తుడంటూ యూదు అధికారులు తీర్మానించడంతో యేసు మరణించాల్సి ఉన్నాడు. ఇప్పుడు అవసరమయ్యిందల్లా రోమియులు తమ తీర్పుపై ఆమోద ముద్ర వేసి తమకు ఆయన్ని అప్పగించడమే అని వారు చంకలు గుద్దుకున్నారు.DATel 802.4

    తర్వాత హింస ఎగతాళి పర్వం ప్రారంభమయ్యింది. అది అజ్ఞానులైన పామరులు పాల్పడే దానికన్నా భయంకరమయ్యింది. యాజకులు అధికారుల సమక్షంలోను వారి దన్నుతోను జరిగిన హింస పరాభావాలు అవి. దయ కరుణ మానవీయత అన్నవి వారికి లేవు. తమ వాదనలు బలహీనంగా ఉండి అవి విఫలమయితే సిద్ధాంత వ్యతిరేకుల నోళ్ళు ముయ్యించడానికి అన్ని యుగాల్లోనూ ఉపయోగించిన శ్రమ, దౌర్జన్యం, మరణం అనే ఇతర ఆయుధాలు వారికి ఉండనే ఉన్నాయి.DATel 803.1

    న్యాయాధికారులు యేసుపై తీర్పు ప్రకటించినప్పుడు ప్రజల్లో సాతాను సంబంధమైన క్రోధం చెలరేగింది. వారి కేకలు అడవి మృగాల గర్జనల్లా వినిపిస్తున్నాయి. ఆ మూక అతడు నేరస్తుడు అతణ్ని చంపండి అంటూ యేసు వైపుకు తోసుకువస్తున్నారు. రోమా సైనికులు కలుగజేసుకుని ఉండకపోతే కల్వరిసిలువకు మేకులతో కొట్టడానికి యేసు మిగిలి ఉండకపోవును. రోమా సైనికులు కలుగజేసుకుని ఆ మూక దౌర్జన్యాన్ని ఆయుధాలతో అదుపుచేసి ఉండకపోతే ఆయన్ని న్యాయాధికారుల ముందే ముక్కలుగా చీల్చడం జరిగి ఉండేది.DATel 803.2

    ఏ నేరమూ నిరూపణ కాని వ్యక్తి పట్ల జరుగుతున్న క్రూర వర్తనకు అన్యజనులికి కోపం వచ్చింది. యేసుకు శిక్ష విధించడంలో యూదులు రోమా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని, ఒక వ్యక్తికి తన సొంత సాక్ష్యం నాదే మరణ దండన విధించడం యూదు చట్టానికి సయితం విరుద్ధమని రోమా అధికారులు చెప్పారు. ఈ జోక్యం వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. కాని యూదు నాయకులు దయ విషయంలోను సిగ్గు విషయంలోను మృతులు.DATel 803.3

    యాజకులు అధికారులు తమ హోదాకు తగిన మర్యాదను మర్చిపోయి దైవ కుమారుణ్ని దుర్భాషలాడారు. ఆయన తల్లిదండ్రుల విషయం వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన మెస్సీయాను తానేనని ప్రకటించుకోడం అతి ఘోరమైన మరణానికి అర్హమైన నేరం అన్నారు. రక్షకుణ్ని హింసించి అవమానించిన వారు సమాజంలో అతినీచ వర్తనులు. ఆయన ముఖం మిద పాత వస్త్రం కప్పి తన హింసకులు “నిన్ను కొట్టిన వారెవరో ప్రవచింపుము” అంటూ ఆయన ముఖం మీద కొట్టారు. ఆ వస్త్రాన్ని తీసివేసినప్పుడు ఒక దుండగుడు ఆయన ముఖంపై ఉమ్మివేశారు.DATel 803.4

    తన ప్రియతమ సేవాపతి వంక చూసిన ప్రతీ అమర్యాదకరమైన చూపు, ఆడిన ప్రతిమాట, చేసిన ప్రతీ క్రియ దేవదూతలు నమ్మకంగా దాఖలు చేశారు. ప్రశాంతమైన, బలహీనమైన క్రీస్తును ఎగతాళి చేసి, ప్రశాంతమైన బలహీనమైన ఆయన ముఖాన్ని నీచులు దుృష్టులు అయిన ఈ మనుషులు ఒక రోజు చూస్తారు. అది సూర్యకాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించడం వారు చూస్తారు.DATel 804.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents