Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    11—బాప్తిస్మం

    అరణ్య ప్రవక్తను గురించి అతని అద్భుత ప్రకటన గురించిన సమాచారం గలిలయ అంతటా వ్యాపించింది. ఆ వర్తమానం మారుమూలన ఉన్న కొండ ప్రాంతాల ప్రజలకు తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు అందింది. సామాన్యమైన యధార్ధమైన హృదయాల్లో ఆ వర్తమానానికి సానుకూల స్పందన లభించింది. నజరేతులోని యోసేపు వడ్రంగి కొట్టులో ఆ వర్తమానం వినిపించింది. ఒకరు ఆ పిలుపును గుర్తించారు. ఆయన సమయం వచ్చింది. తన అనుదిన కాయకష్టం నుంచి తప్పుకుంటూ తల్లికి వీడ్కోలు పలికి యోర్దాను నది వద్దకు ఏరువాక సాగిన ప్రజలతో కలిసి వెళ్లాడు.DATel 93.1

    యేసు బాప్తిస్మమిచ్చే యోహాను దాయాదులు. తమ జన్మ సంబంధిత విషయాలపరంగా వారికి సన్నిహిత సంబంధం ఉంది. ‘ అయినా వారికి పరస్పర పరిచయం లేదు. యేసు జీవితం గలిలయలోని నజరేతులో గడిచింది. యెహాను యూదయలోని అరణ్యంలో నివసించాడు. ఎంతో వ్యత్యాసమైన పరిసరాల్లో వారు ఒంటరిజీవితాలు జీవించారు. వారు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవటం జరగలేదు. ఇది దైవ సంకల్పితం. వారిరువురూ చెబుతున్న విషయాల పరంగా ఒకరితో ఒకరు సంప్రదించుకుని ప్రబోధిస్తున్నారన్న ఆరోపణ తలెత్తకుండేందుకు ఇది ఇలా జరిగింది.DATel 93.2

    యేసు జననానికి సంబంధించిన ఘటనల గురించి యోహాను విన్నాడు. తన బాల్యంలో యేసు యెరూషలేము సందర్శనాన్ని గురించి, రబ్బీల పాఠశాలల్లో చోటుచేసుకున్న సంగతులను గురించి యోహాను విన్నాడు. ఆయన పాపరహిత జీవితం గురించి విన్నాడు. ఆయనే మెస్సీయా అని కూడా నమ్మాడు. అయితే ఈ విషయమై అతనికి నిర్దిష్టమైన కచ్చితమైన అభిప్రాయం లేదు. యేసు అన్ని సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండటం, తన జీవిత కర్తవ్యం సందర్భంగా ఏ ప్రత్యేక నిదర్శనం చూపించకపోవటం ఆయన వాగ్దాత్త మెస్సీయా ఔనా కాదా అన్న మీమాంసకు తెరలేపింది. ఇలాఉండగా స్నానికుడు విశ్వాసంతో వేచి ఉన్నాడు. దేవుడు సంకల్పించుకున్న సమయంలో అంతా స్పష్టంగా వెల్లడవుతుందని నమ్మాడు. మెస్సీయా తన అతనికి దైవ ప్రత్యక్షతవల్ల తెలిసింది. అతడు ఈ విధంగా ఆయనను ప్రజలకు సమర్పించగలుగుతాడు.DATel 93.3

    యేసు బాప్తిస్మం పొందటానికి వచ్చినపుడు ముందెన్నడూ ఏ మానవుడిలోను కనిపించని పవిత్ర ప్రవర్తనను యోహాను ఆయనలో చూశాడు. ఆయన సన్నిధివల్ల ఏర్పడ్డ వాతావరణం పరిశుద్ధమైంది. భయభక్తులు పుట్టించేది. యోర్దానువద్ద ఆయన చుట్టూ కూడిన జనసమూహంలో యోహాను భయంకర నేర కథనాలు విన్నాడు. ఎన్నో పాపాల భారంతో కుంగిపోతున్న ఆత్మల్ని కలుసుకున్నాడు. కాని అంత పరిశుద్ధమైన ప్రభావాన్ని వెదజల్లుతోన్న ఏమానవుణ్ని అతడు ఎప్పుడూ కలుసుకోలేదు. మెస్సీయాను గురించి యోహానుకు ప్రత్యక్షపర్చబడ్డ దానికి ఇదంతా అనుగుణంగా ఉంది. అయినా యేసు మనవిని మన్నించటానికి అతడు సందేహించాడు. పాపి అయిన తాను ఆపాపరహితుడికి బాప్తిస్మం ఎలా ఇవ్వగలగుతాడు? పశ్చాత్తాపం అవసరంలేని ఆయన దోషినని ఒప్పుకుని ప్రక్షాళనను కోరటాన్ని సూచించే ఆ ఆచారాన్ని అసలు ఎందుకు ఆచరించాలి?DATel 94.1

    బాప్తిస్మమిమ్మని యేసు కోరినప్పుడు యోహాను వెనక్కు తగ్గి “నేను నీచేత బాప్తిస్మము పొందవలసిన వాడనైయుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?” అని ప్రశ్నించాడు. దృఢమైన మృదువైన స్వరంతో “ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగు నెరవేరుట మనకు తగియున్నది.” అని యేసు బదులు పలికాడు. రక్షకుని మాట శిరసావహించి యోహాను ఆయనను యోర్ధానులోకి నడిపించి ఆయన్ని నీటిలో సమాధి చేశాడు. “బాప్తిస్మము పొందిన వెంటనే ” యేసు “నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను.”DATel 94.2

    తన దోషిత్వం ఒప్పుకోలుగా యేసు తననిమిత్తం బాప్తిస్మం తీసుకోలేదు. ఆయన తన్నుతాను పాపులతో సమానుణ్ని చేసుకుని మనం తీసుకోవలసిన చర్య తీసుకుని మనం నిర్వహించవలసిన కార్యాన్ని నిర్వహించాడు. ఆయన శ్రమల జీవితం బాప్తిస్మం అనంతరం ఆయన ఓర్పు సహనం మనకు ఆదర్శం.DATel 95.1

    నీటిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత యేసు నది గట్టున వంగి ప్రార్ధన చేశాడు. ఆయన ముందు ఓ నూతన శకం ఆరంభమయ్యింది. ఇప్పుడాయన ఓ విశాల వేదికపై నిలిచాడు. తన జీవిత రణరంగంలో ప్రవేశిస్తున్నాడు. ఆయన సమాధానాధిపతి అయినప్పటికీ ఆయన రాక కత్తి దుయ్యటం లాంటిది. ఆయన స్థాపించవచ్చిన రాజ్యం యూదులు ఆకాంక్షించిన రాజ్యానికి విరుద్ధమైంది. ఇశ్రాయేలు ఆచార వ్యవహారాలకు వ్వవస్థకు ఎవరు పునాదో ఆయన్ని ఇప్పుడు దాని శత్రువుగాను విధ్వంసకుడుగాను పరిగణించే పరిస్థితి ఏర్పడింది. సీనాయి పై ధర్మశాస్త్రాన్ని ప్రకటించిన ఆయన దోషిగా ఖండనకు గురికావల్సి ఉన్నాడు. సాతాను ప్రాబల్యాన్ని రూపుమాపేందుకు లోకంలోకి వచ్చిన ఆయనను బయెల్డెబూలని నిరసించారు. లోకంలో ఎవరూ ఆయనను అవగాహన చేసుకోలేదు. తన సేవాకాలంలో ఆయన ఒంటరిగానే నడవాల్సి ఉన్నాడు. తన జీవిత కాలమంతటి లో ఆయన తల్లీ సహోదరులూ ఆయన కర్తవ్యాన్ని అవగతం చేసుకోలేదు. తన శిష్యులు సైతం ఆయనను అవగాహన చేసుకోలేదు. దేవునితో ఉన్నప్పుడు ఆయన అనంత కాంతిలో నివసించాడు. కాని లోకంలో ఆయన జీవితం ఒంటిరి జీవితం కానుంది.DATel 95.2

    మానవుడుగా ఆయన మన అతిక్రమభారాన్ని దుఃఖాన్ని భరించాల్సి ఉన్నాడు. పాపరహితుడైన ఆయన పాపం కలిగించే అవమానాన్ని సహించాల్సి ఉన్నాడు. సమాధానప్రియుడు సంఘర్షణతో నివసించాల్సి ఉన్నాడు. సత్యం అబద్దంతో పవిత్రత దుర్మార్థతతో నివసించాల్సి ఉన్నాయి. అక్రమం వల్ల వచ్చిన ప్రతి పాపం, ప్రతీ విభేదం ప్రతీ అపవిత్ర శరీరేచ్చ ఆయన స్వభావానికి చిత్రహింసలా ఉంటాయి.DATel 95.3

    ఆయన ఒంటిరిగా నడవాలి. ఒంటిరిగా భారం మోయాలి. తన మహిమను పక్కనబెట్టి మానవజాతి బలహీనతను భుజాన వేసుకున్న ఆయన మిదే లోక రక్షణ కార్యం ఆనుకుని ఉంది. అది ఆయన చూశాడు. అంతా గ్రహించాడు కూడా. అయినా ఆయన సంకల్పం మారలేదు. స్థిరంగా నిలిచింది. పతనమైన మానవజాతి రక్షణ ఆయనమీదే ఆధారితమై ఉంది. అందుకు ఆయన సర్వశక్తిగల ప్రేమా హస్తాన్ని పట్టుకోటానికి తన చెయ్యి చాపాడు.DATel 95.4

    ప్రార్ధనలో తన యావదాత్మను పానార్పణ చేస్తున్నప్పుడు రక్షకుని చూపు పరలోకం గుండెల్లోకి దూసుకుపొతొన్నట్లు కనిపించింది. పాపం మనుషుల హృదయాల్ని ఎంతగా కఠినపర్చిందో, మనుషులు తన రక్షణకర్తవ్యాన్ని గ్రహించి, రక్షణవరాన్ని అంగీకరించటం ఎంత కష్టమో ఆయనకు బాగా తెలుసు. వారి అవిశ్వాసాన్ని జయించటానికి సాతాను బంధకాల్ని విరగగొట్టి వారి తరపున నాశనకారుడు సాతాన్ని జయించటానికి శక్తి నీయాల్సిందిగా తండ్రితో విజ్ఞాపన చేస్తోన్నాడు. కుమారుని రూపంలో మానవాళిని తండ్రి స్వీకరిస్తాడు అనటానికి సాక్ష్యాన్ని కోరుతున్నాడు.DATel 96.1

    అలాంటి ప్రార్థనను దేవదూతలు మున్నెన్నడూ విని ఉండలేదు. తమ ప్రియతమ సేనాపతికి ఓదార్పును భరోసాను ఇచ్చే వర్తమానాన్ని చేరవెయ్యటానికి దూతలు అతృతగా ఉన్నారు. కాదు; దూతలు కాదు తండ్రి తానే కుమారుడి విజ్ఞప్తికి జవాబివ్వాలనుకున్నాడు. ప్రత్యక్షంగా దైవసింహాసనం నుంచే మహిమాకిరణాలు ప్రసరించాయి. ఆకాశాలు తెరచుకున్నాయి. పావురంలాంటి ఆకారం రక్షకుడి తల మీదికి దిగివచ్చింది. అది వెలుగుతో కూడిన రూపం. దీనుడు సాత్వికుడు అయిన రక్షకుడికి అది సరియైన చిహ్నం .DATel 96.2

    యోర్దాను వద్ద సమావేశమైన ఆ మహాజన సమూహంలో ఉన్నవారిలో యోహాను తప్ప ఆ పారలౌకిక దృశ్యాన్ని గ్రహించినవారు ఎవ్వరూ లేరు. అయినా గంభీరమైన దైవసముఖం ఆ సమావేశంపై ఉంది. ప్రజలు నిశ్శబ్దంగా లేచి క్రీస్తును చూస్తూ ఉండిపోయారు. ఆయన రూపం నిత్యం దేవుని సింహాసనం చుట్టూ ఉండే వెలుగులో ఓలలాడింది. ఆకాశం వేపుకుఎత్తి ఉన్న ఆయన ముఖం మహిమతో ప్రకాశిస్తోంది. అలాంటి మహిమాప్రకాశం ఏమానవుడి ముఖంలోను ఎన్నడూ ఎవరూ చూడలేదు. “ఈయనే నాప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను.” అని ఓ స్వరం ఆకాశంలో నుంచి వినిపించింది.DATel 96.3

    దైవ ధ్రువీకరణను తెలిపే ఈ మాటలు ఆ దృశ్యాన్ని వీక్షించిన వారిలో విశ్వాసం పుట్టించటానికీ, రక్షకుణ్ని తన కర్తవ్యసాధనకు బలోపేతం చెయ్యటానికి ఉద్దేశించబడ్డాయి. అపరాధి అయిన లోకం పాపాలు క్రీస్తు తనపై వేసుకోటం జరిగినా, పడిపోయిన మన స్వభావాన్ని తన్నుతాను తగ్గించుకుని ఆయన స్వీకరించటం జరిగినా పరలోకం నుంచి వచ్చిన స్వరం అయనను నిత్యుడైన దేవుని కుమారుడుగా ప్రకటించింది.DATel 97.1

    యేసు వంగి తన తండ్రి ఆమోదం కోసం కన్నీటితో ప్రార్ధన చెయ్యటం చూసిన యోహాను చలించిపోయాడు. దేవుని మహిమ ఆయన చుట్టూ ప్రకాశిస్తుండగా పరలోకంనుంచి ఓ స్వరం వినిపించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన సంకేతాన్ని యోహాను గుర్తించాడు. తాను బాప్తిస్మమిచ్చిన వ్యక్తి లోకరక్షకుడని గ్రహించాడు. అతని మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. చెయ్యి చాపి వేలెత్తి యేసు వంక చూపిస్తూ ” ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల” అన్నాడు.DATel 97.2

    “దేవుని గొట్టె పిల్ల” అన్నమాటల భావాన్ని వింటున్న వారిలో ఎవ్వరూ ఆ మాటకొస్తే మాట్లాడున్న యోహాను సైతం గ్రహించలేదు. “నా తండ్రీ ... దహన బలికి గొట్టెపిల్ల ఏది? అన్న తన కుమారుడి ప్రశ్నను మోరియా కొండమీద అబ్రహాము విన్నాడు. తండ్రి జవాబు ఇది ” నా కుమారుడా, దేవుడే దహన బలికి గొట్టెపిల్లను చూచుకొనును.” ఆది 22:7, 8. ఇస్సాకు స్థానంలో దేవుడు ఏర్పాటు చేసిన పొట్టేలులో పాపుల కోసం మరణించాల్సి ఉన్న రక్షకుడి చిహ్నాన్ని చూశాడు అబ్రహాము. పరిశుద్దాత్మ ఈ దృశ్యాన్ని తీసుకుని యోహోవా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం ఇచ్చాడు, “అతడు... వధకు తేబడు గొట్టెపిల్ల” లా ” యోహాను మనయందరి దోషమును అతని మీద మోపెను” యెషయా 53:7,6. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ పాఠాన్ని అవగతం చేసుకోలేదు. అన్యజనులు బలుల్ని పరిగణించిన తీరులోనే వారిలో అనేకులు బలి అర్పణల్ని దేవుని శాంతపర్చటానికి సమర్పించే కానుకలుగా పరిగణించారు. కాగా కానుక తమ ప్రేమ నుంచే పుడుతుందని అది వారిని తనతో సమాధానపర్చుతుందని వారికి బోధించాలన్నది దేవుని ఉద్దేశం.DATel 97.3

    “ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేనానందించు చున్నాను” అంటూ యోర్దాను వద్ద యేసును గూర్చి వినిపించిన మాటలు సమస్త మానవాళికి వర్తిస్తాయి. మన ప్రతినిధిగా యేసుతో ఈ మాటలు పలికాడు దేవుడు. మన పాపాలు దౌర్బల్యాలు ఎన్నో అయినా మనల్ని ఆయన తోసిపుడ్డటంలేదు, వ్యర్ధులుగా పరిగణించటంలేదు. “ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.” ఎఫెసీ 1:6; క్రీస్తును పరివేష్టించి ఉన్న మహిమ మనల్ని ప్రేమిస్తున్నానంటూ దేవుడు చేసిన ప్రమాణానికి చిహ్నం. అది ప్రార్థన శక్తిని గురించి మాట్లాడ్తోంది. మానవుల స్వరం దేవునికి ఎలా వినిపిస్తుందో, మన మనవులు దేవుని ఆవరణంలో ఎలా ఆమోదం పొందుతాయో తెలుపుతుంది. పరలోకానికీ భూలోకానికీ మధ్య పాపం వల్ల అగాధం ఏర్పడింది. ముఖాముఖి సంబంధం తెగిపోయింది. అయితే యేసు తన మహిమరాజ్యం ద్వారా ఈ రెంటినీ మళ్ళీ కలిపాడు. ఆయన ప్రేమ మానవుల్ని ఆవరించి, ఉన్నతమైన పరలోకాన్ని అంటుకుంటుంది. మనం శోధనను జయించటానికి సహాయం కోసం ప్రార్ధిస్తే తెరుచుకున్న ఆకాశాలనుంచి మన రక్షకుని శిరముపై పడ్డ వెలుగు మనమిద కూడా పడ్తుంది. యేసుతో మాట్లాడిన స్వరం, విశ్వసించే ప్రతీ ఆత్మతో “ఇతడు నా ప్రియమైన బిడ్డ ఇతడి విషయంలో నేను ఆనందిస్తున్నాను” అని అంటుంది.DATel 97.4

    “ప్రియులారా యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము” 1యోహాను 3:2; అతిఘోరపాపులు ఎంతో అవసరం ఉన్నవారు, తీవ్రహింసకు తృణీకారానికి గురి అయినవారు తండ్రి వద్దకు వచ్చేందుకు మన రక్షకుడు మార్గాన్ని తెరచాడు. యేసు సిద్ధం చెయ్యటానికి వెళ్లిన భవనాల్లో అందరూ నివాసాలు పొందవచ్చు” దావీదు తాళపుచెవి కలిగి యెవడును వేయలేకుండ తీయువాడును ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్దుడు చెప్పు సంగతులేవనగా... ఇదిగో తలుపు నీ యెదుట తీసి యుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు” ప్రకటన 3:7, 8,DATel 98.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents