Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
యుగయుగాల ఆకాంక్ష - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    25—సముద్రం పక్క పిలుపు

    అది గలిలయ సముద్రం. తెల్లవారుతోంది. శిష్యులు రాత్రంతా కష్టపడి వలలు వేసినా ఒక్క చేపకూడా దొరకలేదు. వారింకా సముద్రంలో తమ నావల్లోనే ఉన్నారు. సముద్ర తీరాన కొంత సేపు ప్రశాంతంగా గడపడానికి యేసు వచ్చాడు. ప్రతీ రోజూ ఎడతెరపి లేకుండా తనచుట్టూ మూగుతోన్న ప్రజల నుంచి ఉదయం పెందలాడే కాస్త విశ్రాంతి పొందాలని భావించాడు. అయితే కొద్ది సేపటి లోనే ఆయన చుట్టూ ప్రజలు మూగడం మొదలయ్యింది. వస్తున్న ప్రజలసంఖ్య వేగంగా పెరిగింది. అన్నిపక్కల నుంచి జనం ఒత్తిడి పెరిగింది. అంతలోకి సముద్రంలో నుంచి శిష్యులు ఒడ్డుకి వచ్చారు. తన చూట్టూ మూగిన జనాల ఒత్తిడి ఎక్కువవ్వడంతో యేసు పేతురు పడవలోకి ఎక్కి పడవను తీరం నుంచి కొంచెం వెనక్కి లాగమని చెప్పాడు. ఇక్కడ నుంచి ఆయన తీరాన ఉన్న ప్రజలకు బాగా కనిపించగలడు. ఆయన మాటలు స్పష్టంగా వినిపించగలవు. తీరాన ఉన్న జనసమూహానికి పడవలోనుంచి యేసు బోధించాడు.DATel 251.1

    చూస్తోన్న దేవదూతలకు ఇది ఎంత ముచ్చట గొలిపే దృశ్యం! జాలరి పడవలో కూర్చుని, కెరటాలు పడవని ముందుకి వెనక్కి ఊపుతుండగా సముద్ర ఒడ్డున సమావేశమై వింటోన్న ప్రజాసమూహానికి తమ సేనాధిపతి యేసు రక్షణ శుభవార్తను చాటుతున్న దృశ్యమది! పరలోకంలో ఘనత మహిమ అందుకునే ఆ ప్రభువు ఆరుబయట సామాన్య ప్రజలకు తన రాజ్యం గురించి గొప్పసంగతులు బోధిస్తోన్నాడు. అయినా ఆయన పరిచర్య మెరుగైన తీరైన సన్నివేశం వేరొకటి ఉండేది కాదు. సరస్సు, పర్వతాలు, విశాలమైన పంటపొలాలు, వరదలా విస్తరిస్తోన్న సూర్యరశ్మి - ఇవన్నీ ఆయన బోధనాంశాలకు ఉపకరణాలై వాటిని ప్రజల మనసుల్లో పాదుకొల్పడానికి ఉపకరించాయి. క్రీస్తు బోధించిన ఏ పాఠం నిరుపయోగం కాలేదు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతీ వర్తమానం ఏదో ఆత్మకు నిత్యజీవ వార్తగా పరిణమించింది.DATel 251.2

    తీరాన ఉన్న జనుల సంఖ్య నిమిష నిమిషం పెరుగుతోంది. చేతికర్రలపై ఆని నడుస్తోన్న వృద్దులు కొండల నుంచి వచ్చిన శ్రామికులు, సరస్సులో వేటకు వెళ్లి కష్టించి వచ్చిన జాలరులు, వ్యాపారులు, రబ్బీలు ధనికులు, విద్యావంతులు, వృద్ధులు యువజనులు, తమతమ రోగుల్ని తీసుకుని ఈ పరమ గురువు బోధను వినడానికి తోసుకుంటూ వచ్చారు. ప్రవక్తలు ఇలాంటి సన్నివేశాలను ముందే చూసి ఇలా రాశారు:DATel 252.1

    “జెబూలూను దేశమును, నఫాలి దేశమును, యోర్దానుకును
    ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు
    గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును
    మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు
    ఉదయించెను.”
    DATel 252.2

    గెన్నే సెరతు సరస్సుపక్క యేసు చేసిన తన ప్రసంగంలో, గట్టుపై ఉన్న జనసమూహాలేగాక ఇతరత్రోతలు కూడా ఆయన మనోనేత్రం ముందున్నారు. ముందున్న యుగాల్లోకి చూస్తూ తన నమ్మకమైన సేవకులు ఖైదుల్లోను తీర్పుగదుల్లోను ఉండడం చూశాడు. శోధనలో ఉండడం ఒంటరిగా శ్రమల్లో ఉండడం చూశాడు. సంతోషం సంఘర్షణ ఆందోళనలతో నిండిన ప్రతీ దృశ్యం ఆయన ముందున్నది. తన చుట్టూ మూగినవారితో మాట్లాడిన మాటల్లో ఆయన ఈ ఇతర ఆత్మలతో కూడా మాట్లాడ్తోన్నాడు. అవి శ్రమలనుభవించేటప్పుడు నిరీక్షణ వర్తమానం అందించే మాటలు, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే మాటలు, చీకటిలో పారమార్ధికమైన వెలుగునిచ్చే మాటలు. గలిలయ సముద్రంలోని జాలరి పడవలోనుంచి మాట్లాడ్తోన్న ఆ స్వరం మానవుల హృదయాల్లో శాంతి సమాధానాల్ని గురించి మాట్లాడూ లోకాంతం వరకూ వినిపిస్తూనే ఉంటుంది.DATel 252.3

    మాట్లాడడం ముగిసిన వెంటనే యేసు పేతురు తట్టు తిరిగి, సముద్రంలోకి వెళ్లి, వల విసిరి చేపలు పట్టమన్నాడు. అయితే పేతురుని నిరాశ నిస్పృహలు ముప్పిరిగొన్నాయి. రాత్రంతా కష్టపడినా అతడికి ఒక్క చేపకూడా దొరకలేదు. ఒంటరిగా ఉన్న ఆ సమయంలో చీకటి కొట్టులో మగ్గుతోన్న బాప్తిస్మమిచ్చే యోహాన్ని గూర్చి ఆలోచించాడు. యేసూ ఆయన శిష్యుల భవితన గూర్చి యూదయలో జరిగిన పరిచర్య వైఫల్యాన్ని గూర్చి యాజకులు రబ్బీల విద్వేషాన్ని గూర్చి ఆలోచించాడు. తన వృత్తి కూడా ఏమంత లాభసాటిగా లేదు. ఖాళీ వలలవంక చూస్తూ ఉండగా భవిష్యత్తు అతడికి చీకటితో నిండినట్లు కనిపించింది. “ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమియు దొరకలేదు. అయినను నీమాట చొప్పున వలలు వేతుము” అన్నాడు.DATel 253.1

    సరస్సులోని నిర్మలమైన నీళ్లలో వలలు వేసి చేపలు పట్టడానికి రాత్రి ఒక్కటే అనువైన సమయం. రాత్రంతా శ్రమపడి విఫలయత్నం చేసిన తర్వాత పగలు వలలు వెయ్యడం వ్యర్ధమని తోచింది. అయినా యేసు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక తమ నాయకుడిపట్ల అభిమానం కొద్దీ శిష్యులు వలలు వేశారు. సీమోను అతడి సోదరుడు తమ వలను వేశారు. దాన్ని లాగడానికి ప్రయత్నించగా అందులోని చేపలు విస్తారంగా ఉన్నందున వల చినిగిపోడం మొదలు పెట్టింది. వారు యాకోబునూ యోహానునూ ఓ చెయ్యెయ్యమని పిలవాల్సి వచ్చింది. వలను పడవలోకి లాగినప్పుడు వారి రెండు పడవలూ పూర్తిగా నిండిపోయి అవి మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి.DATel 253.2

    పడవల గురించి చేపలు ఎక్కించడం గురించి పేతురు ఇప్పుడు ఆలోచించడం లేదు. ఇంతకుముందు తాను చూసిన ఏ అద్భుతకార్యం కన్నా ఇది దైవశక్తి ప్రదర్శనగా అతడికి తోచింది. సకల ప్రకృతిని తన అదుపు కింద ఉంచిన దేవుణ్ని యేసులో చూశాడు. దేవుని సముఖం తన అపవిత్రతను కనపరిచింది. తన ప్రభువు పట్ల ప్రేమ తన అపనమ్మకం నిమిత్తం సిగ్గు క్రీస్తు చూపించిన ఆత్మోపేక్ష నిమిత్తం కృతజ్ఞత మరిముఖ్యంగా అవధుల్లేని పరిశుద్ధత సముఖంలో స్వీయ అపవిత్రత స్పృహ అతణ్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మిత్రులు వలలోని చేపల్ని భద్రపరుస్తుండగా పేతురు రక్షకుడి పాదాలపై పడి “ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను” అన్నాడు.DATel 253.3

    దేవునిదూత ముందు దానియేలు ప్రవక్త మరణించిన వాడిలా పడేటట్లు చేసింది. ఈ దివ్య పరిశుద్ధ సముఖమే. అతడిలా అన్నాడు, “నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను.” అలాగే యెషయా దేవుని మహిమను వీక్షించినప్పుడు, “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను; నేను నశించితిని. రాజును సైన్యములకధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని” అని ఆశ్చర్యపడ్డాడు. దాని 10:8; యెష 6: 5. దౌర్బల్యంతోను పాపంతోను నిండిన మానవత్వం దేవత్వపు పరిపూర్ణతతో విభేదించి నిలిచినప్పుడు తాను పూర్తిగా అపవిత్రుణ్ని లోటులున్నవాణ్ణి అని అతడు భావించాడు. దేవుని మహాత్మ్యాన్ని ఘనతను వీక్షించే భాగ్యం కలిగిన వారందరూ ఇలాగే భావించారు.DATel 254.1

    “ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడను” అన్నాడు పేతురు. అయినా యేసు పాదాలు పట్టుకునే ఉన్నాడు. ఆయన్ని విడిచిపెట్టలేనని భావించాడు. రక్షకుడిచ్చిన జవాబు ఇది: “భయపడకుము, ఇప్పటి నుంచి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు.” యెషయా దేవుని పరిశుద్ధ తన సొంత అయోగ్యతను చూసినప్పుడే దేవుడు అతడికి తన పరిశుద్ధతను వర్తమానాన్ని అప్పగించాడు. పేతురు ఆత్మ నిరసనను పాటించి దేవుని శక్తిమీద ఆధారపడ్డప్పుడే క్రీస్తు పరిచర్యకు పిలుపు పొందాడు.DATel 254.2

    ఇప్పటి వరకు శిష్యులెవ్వరూ సంపూర్తిగా క్రీస్తుతో కలిసి జతగా పనిచెయ్యలేదు. ఆయన చేసిన అనేక అద్భుతకార్యాల్ని చూశారు. ఆయన బోధలు విన్నారు. కాని తమ పూర్వ ఉపాధిని వారు పూర్తిగా విడిచి పెట్టలేదు. స్నానికుడైన యోహాన్ని చెరసాలలో వేయడం వారికి తీవ్ర నిరాశ కలిగించింది. యోహాను పరిచర్య పర్యవసానం అలాంటిదైతే మత నాయకులంతా కలిసి తమ ప్రభువును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన విజయావకాశాలు బహుతక్కువగా కనిపించాయి. ఈ పరిస్థితుల్లో కొంత కాలంపాటు చేపలు పట్టుకోడానికి వెళ్లడం వారికి కొంత ఊరట నిస్తుందని భావించారు. అయితే తమ మాజీ జీవిత విధానాన్ని విడిచిపెట్టి తమ ఆసక్తుల్ని తన ఆసక్తులతో సంయుక్తం చేసి పని చెయ్యడానికి వారికి యేసు పిలుపునిచ్చాడు. తీరం చేరుకున్న తర్వాత ఇంకా ముగ్గురు శిష్యుల్ని యేసు ఇలా ఆదేశించాడు, “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరునుగా చేసెదను.” వెంటనే వారు సమస్తం విడిచి పెట్టి ఆయను వెంబడించారు.DATel 254.3

    తమ వలల్ని చేపలుపట్టే వృత్తిని విడిచి పెట్టమని చెప్పకముందు దేవుడు తమ అవసరాల్ని తీర్చుతాడన్న భరోసా యేసు వారికిచ్చాడు. సువార్త పరిచర్యకు పేతురు పడవ వినియోగం గొప్ప లాభాన్ని చేకూర్చింది. “తనకు ప్రార్థన చేయువారందరి యెడల కృపజూపుటకు ఐశ్వర్యవంతుడైయున్న” ప్రభువు ఇలా అన్నాడు, “ఇయ్యుడి అప్పుడు మీ కియ్యబడును; అణచి కుదించి దిగజారునట్లు, నిండుకొలతను మనుష్యులు మిఒడిలో కొలుతురు.” రోమా 10:12; లూకా 6:38. శిష్యుల పరిచర్యకు ఈ పరిమాణంలో ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన సేవలో మనం చేసే ప్రతీ త్యాగానికి “కార్యసాధకమైన తన శక్తి చొప్పున ” మనకు ప్రతిఫలమిస్తాడు . ఎఫెస్సీ 3:20;2:7.DATel 255.1

    క్రీస్తు నుంచి వేరై ఆ రాత్రి సరస్సులో చేపలు పడుతున్నప్పుడు శిష్యులు తీవ్ర అవిశ్వాసానికి లోనయ్యారు. శ్రమపడి అలసిపోయారు గాని ఫలితం శూన్యం. అయితే క్రీస్తు సన్నిధి వారిలో విశ్వాసాన్ని రగిలించింది. వారిలో ఆనందం వెల్లివిరిసింది. వారికి జయం కలిగింది. మన విషయంలోనూ ఇదే జరుగుతుంది. క్రీస్తు నుంచి వేరైతే మనకృషి వ్యర్ధమౌతుంది. అపనమ్మకం సులభంగా ఏర్పడుంది. గొణుగుడు సణుగుడు మొదలవుతుంది. కాని ఆయన దగ్గర ఉండి ఆయన సూచనమేరకు పనిచేస్తే అయన శక్తికి నిదర్శనాల్ని చూసి ఆనందిస్తాం. ఆత్మను నిరుత్సాహపర్చడం సాతాను పని. విశ్వాసాన్ని నిరీక్షణ రేకెత్తించడం క్రీస్తుపని.DATel 255.2

    ఈ అద్భుతం శిష్యులకందించిన పాఠం మనకు కూడా ఓ పాఠమే. ఎవరి మాట సముద్రంలోనుంచి చేపల్ని పోగుచేయగలిగిందో అది మానవహృదయాల్లో స్పందన పుట్టించి తన సేవకులు “మనుష్యులను పట్టు జాలరులు” అయ్యేందుకు వాటిని తన ప్రేమ అనే వలలోకి ఆకర్షిస్తాడు అన్నది ఆ పాఠం.DATel 255.3

    ఆ గలిలయ జాలరులు సామాన్యులు, విద్యలేనివారు. అయితే లోకానికి వెలుగైన క్రీస్తు వారిని ఏ పని నిమిత్తం పిలిచాడో దాన్ని నిర్వహించేందుకు వారిని అర్హుల్ని సమర్ధుల్ని చెయ్యడానికి శక్తిగలవాడు. ప్రభువు విద్యను తృణీకరించలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ అదుపాజ్ఞల కింద ఉండి ఆయన సేవకు అంకితమైతే మానసిక సంస్కృతి మేలుకరంగా ఉంటుంది. అయితే ఆయన ఆ కాలంలోని జ్ఞానుల్ని పిలవలేదు. ఎందుచేతనంటే వారు ఆత్మ విశ్వాసంతో నిండినందువల్ల శ్రమలుకష్టాలు అనుభవిస్తోన్న మానవులపట్ల సానుభూతి చూపి ఆయనతో తోటి పనివారు కాలేకపోయారు. తమ దురభిమానంవల్ల క్రీస్తు వద్ద నేర్చుకోడాన్ని ద్వేషించారు. తన కృపకు అంతరాయంలేని మార్గాలుగా పనిచేసే వారి సహకారం కోసం యేసుప్రభువు వెదకుతున్నాడు. దేవునితో జతపనివారు కావాలని కోరుకునే వారు మొట్టమొదట నేర్చుకోవలసిన పాఠం తమ్ముతాము నమ్ముకోకపోవడం. అప్పుడు క్రీస్తు ప్రవర్తనను సొంతం చేసుకోడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఇది శాస్త్ర విద్యను బోధించే పాఠశాలల్లో లభించేది కాదు. ఇది పరమగురువు యేసు జ్ఞానం ద్వారా మాత్రమే లభించే ఫలం.DATel 255.4

    యేసు చదువులేని జాలరుల్ని ఎంపిక చేసుకోడానికి కారణమేంటంటే వారు ఆనాటి సంప్రదాయాలు ఆచారాలతో కూడిన విద్యను అభ్యసించలేదు. వారు సహాజ సామార్థ్యం గలవారు. వారు నమ్రత, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న మనుషులు. తన సేవనిమిత్తం ప్రభువు తర్బీతు చేయగల వ్యక్తులు. జీవితంలోని సామాన్య వృత్తులలో తమ దినదిన విధుల్ని ఓర్పుతో సహనంతో చేసుకుంటూపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే తమకున్న సామర్థ్యాలు క్రియాత్మకమైతే అవి తమను ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల సరసన నిలబెట్టగలవని వారు గ్రహించారు. నిద్రాణమై ఉన్న శక్తుల్ని మేల్కోల్పడానికి నైపుణ్యంగల హస్తస్పర్శ అవసరమౌతుంది. తన సహచరులుగా అలాంటి వ్యక్తుల్నే క్రీస్తు ఎంపిక చేసుకున్నాడు. తనతో సహవాసం చేసే అవకాశాన్ని వారికి కల్పించాడు. అలాంటి బోధకుడు ప్రపంచంలో మున్నెన్నడూ లేడు. రక్షకుని శిక్షణ నుంచి శిష్యులు బయటికి వచ్చినప్పుడు వారు అజ్ఞానులు సంస్కారం లేనివారు కాదు. మానసికంగాను ప్రవర్తన విషయంలోను వారు ప్రభువులా ఉన్నారు. వారు యేసుతో ఉన్న వ్యక్తులని ప్రజలు గుర్తించారు.DATel 256.1

    కేవలం జ్ఞానాన్ని అందించడమే విద్య ఉన్నతాశయం కాదు. కాని మనసుతో మనసు ఆత్మతో ఆత్మ కలయిక ద్వారా లభించే మహత్తర శక్తిని సమకూర్చడమే దాని ముఖ్యోద్దేశం. జీవం మాత్రమే జీవాన్ని పుట్టించగలుగుతుంది. ఏ దైవ సుతుని జీవితం నుంచి లోకానికి దీవెనకరంగా ఉన్న జీవప్రదాయక శక్తి ప్రవహించిందో ఆ దైవజీవితంతో వారు మూడు సంవత్సరాలు అనుదినం సన్నిహిత సంబంధం కలిగి ఉండడం వారికెంత భాగ్యం! తన సహచరులందరిలోను ప్రియశిష్యుడైన యోహానే ఆ మహత్తర జీవిత ప్రభావానికి తన్నుతాను లోనుచేసుకున్నాడు. అతడిలా అంటున్నాడు, “ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని నాకు తెలియజేయు చున్నాము” “ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపవెంబడి కృపను పొందితిమి.” 1యోహాను 1:2, యోహాను 1:16;DATel 256.2

    తమకు కీర్తి సంపాదించేది అపోస్తులుల్లో ఏమిలేదు. వారి కృషి విజయవంతం కావడానికి దేవుడే కారణం అన్నది తేటతెల్లం. ఈవ్యక్తుల జీవితాలు, వారు దిద్దుకున్న ప్రవర్తనలు, వారి ద్వారా దేవుడు సాధించిన ఘనమైన సేవ, తన నుంచి నేర్చుకునే వారికి, తనకు విధేయులయ్యే వారందరికి ఆయన ఏమిచేస్తాడో అన్నదానికి ఇవి సాక్ష్యం .DATel 257.1

    ఒకడు క్రీస్తును ఎంత గాఢంగా ప్రేమిస్తే అతడు పరులకు అంత ఎక్కువ మేలు చేస్తాడు. స్వార్ధాన్ని పక్కన పెట్టి తన హృదయంలో పరిశుద్ధాత్మ పనిచెయ్యడానికి అవకాశమిచ్చి దేవునికి పూర్తిగా అంకితమైన జీవితం ఎవరు జీవిస్తారో అతడి ప్రయోజకత్వానికి హద్దులుండవు. మనుషులు అవసరమైన క్రమశిక్షణను సణుగకోకుండా లేక మార్గంలో సొమ్మసిల్లి పడిపోకుండా సహనంతో భరిస్తే దేవుడు వారికి గడియ గడియ దినదినం బోధిస్తాడు. వారికి తన కృపను బయలుపర్చడానికి ఆయన వాంఛిస్తున్నాడు. తన ప్రజలు అడ్డంకులు తొలగిస్తే మానవ సాధనాల ద్వారా రక్షణ జలాల్ని సమృద్ధిగా ప్రవహింపజేస్తాడు. సామాన్యంగా బతుకుతున్న వారిని తాము చెయ్యగలిగిన మేలు చెయ్యడానికి ప్రోత్సాహిస్తే వారి ఉత్సాహాన్ని అణగదొక్కకుండా వారిని అదుపుచెయ్యకుండా ఉంటే నేడు క్రీస్తుకు ఒక్క సేవకుడున్న చోట వంద సేవకులుండేవారు.DATel 257.2

    మనుషులు తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటే వారిని తామున్న స్థితిలోనే ఆయన అంగీకరించి తన సేవ నిమిత్తం వారిని తర్బీతు చేస్తాడు. దేవుని ఆత్మలో ప్రవేశించి ఆత్మతాలూకు శక్తులన్నటి నీ ఉత్తేజపర్చుతాడు. దేవునికి సంపూర్తిగా అంకితమైన మనసు పరిశుద్ధాత్మ నడుపుదల కింద చక్కగా వృద్ధిచెంది దేవుని విధుల్ని గ్రహించి నెరవేర్చడానికి బలోపేతమౌతుంది. బలహీనమై వెనకాడే ప్రవర్తన బలం స్థిరతగల ప్రవర్తనగా పరివర్తన చెందుతుంది. ఎడతెగని భక్తి జీవితం క్రీస్తుకి ఆయన శిష్యుడికి మధ్య బాంధవ్యాన్ని స్థాపిస్తుంది. అంతట క్రైస్తవుడు మనసా వాచా కర్మణా క్రీస్తులా ఉంటాడు. క్రీస్తుతో తన అనుబంధం ద్వారా అతడికి స్పష్టమైన విశాలమైన భావాలు ఏర్పడ్డాయి. అతడి పరిశీలన నిశితమౌతుంది. అతడి వివేచన మెరుగుగా సమతూకంగా ఉంటుంది. క్రీస్తు సేవ చెయ్యాలన్న ఆకాంక్షగల వ్యక్తిని నీతి సూర్యుని జీవప్రదమైన శక్తి చైతన్య పర్చుతుంది. అతడు దేవునికి మహిమ కలిగేటట్లు విస్తారంగా ఫలాలు ఫలించడానికి శక్తి పొందుతాడు.DATel 257.3

    లోకం విద్యలేనివారుగా పేర్కొన్న సామాన్య క్రైస్తవుల నుంచి కళలు విజ్ఞాన శాస్త్రాల్లో అత్యున్నత విద్యను సంపాధించిన వ్యక్తులు విలువైన పాఠాలు నేర్చుకుంటున్నారు. అయితే అనామకులైన ఈ శిష్యులు, పాఠశాలలన్నిటిలోను ఉత్తమమైన పాఠశాలలో తమ విద్యనభ్యసించారు. వారు “ఎవడును.... మాటాలాడ” నట్లు మాట్లాడిన ప్రభువు పాదాలవద్ద కూర్చుని నేర్చుకున్నారు.DATel 258.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents